పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
Showing posts with label బ్లాగులు. Show all posts
Showing posts with label బ్లాగులు. Show all posts

November 10, 2011

కార్తీక మాసం వనభోజనాలు..నేనూ నా వంటలు.. నస రస

సమయం ఉదయం 6:30..అప్పుడే మంచం మీదనుండి లేచిన నా స్వగతం.....

అబ్బో చాలా టైం అయింది..రోజు రోజుకి బద్దకంగా తయారవుతున్నాను.
పిల్లకి కాలేజీ 11 గంటలకేమో కానీ ఉదయం లేవటానికి బద్దకం వచ్చేస్తుంది.
ఇవాళ ఏం కూరలు వండాలో!
అబ్బ..వెధవ వంట..ముందు పేపరు చదివి అప్పుడు వంట సంగతి చూద్దాం.

వంట అంటే గుర్తుకొచ్చింది..ఇవాళ కార్తీక పౌర్ణమి కదా!
ఉపవాసం ఉందామా....ఉందాం..ఉందాం.
రోజంతా ఏం తినకుండా ఉండగలమా?
చూద్దాం..ఎప్పుడు ఆకలయితే అప్పుడు ఉపవాసం లేదనుకుని తినేద్దాం:)

ఉపవాసం అంటే గుర్తొచ్చింది .....
జ్యోతి గారు బ్లాగుల్లో ఇవాళ వనభోజనాలు అన్నట్టున్నారుగా....మర్చేపోయాను!
పోయిన సంవత్సరం కూడా నేను వెళ్లలేదు వనభోజనాలకి.
ఈ జ్యోతి గారు ఒకళ్ళు..చూసి చూసి పౌర్ణమి రోజు....వారం మధ్యలో పెట్టకపోతే ఏ ఆదివారమో పెట్టొచ్చుగా!
కాస్త స్థిమితంగా బోలెడు రకాలు చేసుకెళ్ళొచ్చు.
ఇప్పటికిప్పుడు స్పెషల్సు ఏం చేయాలబ్బా!
పోన్లే ఇంట్లో చేసే కూరలే పట్టు కెళదాం..
ముందుపేపరు చదివి అప్పుడు చూద్దాం ఏం చెయ్యాలో!

బీరకాయలు చాలా  ఉన్నాయి..బీరకాయ శనగపప్పు కూర వండి..బంగాళాదుంప వేపుడు చేస్తే సరి..తేలిగ్గా అయిపోతాయి..రుచికి  రుచిగా కూడా ఉంటాయి.

ఇంటి దగ్గర భోజనాలప్పుడు ఈ బీరకాయ శనగపప్పు కూర ఎక్కువగా చేస్తారు..ములక్కాయ..రాములక్కాయ వేసి వండితే ఎంత బాగుంటుందో! ములక్కాయలు లేనట్టున్నాయే..సర్లే సర్దుకుపోదాం.

అదర్రా..ఇవాళ బ్లాగు వనభోజనాలకి సింపులుగా మా ఇంట్లో చేసిన కూరలతో వచ్చేసా. 

 బీరకాయ శనగపప్పు కూరకి కావలసిన పదార్థాలు...చేసే విధానం తెలుసు కదా..





 ఇక బంగాళ దుంపల వేపుడు ఉందే..నాకు మహా ఇష్టం. కాలేజీకి లంచ్ తీసుకెళ్ళినన్ని రోజులూ..బాక్సులో బంగాళాదుంప వేపుడు.. లేకపోతే కోడి గుడ్డు పొరుటు..మరో పదార్థం పెట్టనిచ్చే దాన్ని కాను.

ఈ బంగాళాదుంప వేపుడు ఇల్లేరమ్మ వాళ్ళ నాన్న వండినట్లు వండితే  మహా రుచిగా ఉంటుంది. అసలు తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి. ఇవాళ నేను అలాగే వండాలే!

ఇల్లేరమ్మ వాళ్ళ నాన్న ఎలా వండుతారా..వార్నీ.మీరు .ఇల్లేరమ్మ కథలు చదవలేదా..సరే వినండి..

బంగాళా దుంపలు ఉడకపెట్టి ముక్కలు చేసుకోండి. ...ఎన్ని దుంపలంటే  మీ ఇష్టం.

చిన్నారి లాగా మీ ఇంట్లో కూడా దుంపలు వలుస్తూ వలుస్తూ మింగేసేవాళ్ళుంటే ఓ నాలుగు ఎక్కువ ఉడకపెట్టుకోండి.

 చిన్నారి ఎవరా..అబ్బా..ఇల్లేరమ్మ చెల్లెలు..మధ్యలో మీకన్నీ ప్రశ్నలే!

ఇప్పుడు నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని పొట్టు వలవండి.

వాటిని పెద్ద ముక్కలుగా చేసుకుని ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి రోట్లో కచ్చా..పచ్చాగా దంచండి.



పొయ్యి మీద బాండీ పెట్టి ఓ నాలుగయిదు పెద్ద గరిటెల నూనె పోయండి.

ఇల్లేరమ్మ వాళ్లమ్మ చెప్పినట్టు నూనె రెండు గరిటెలే పోస్తే సాయంత్రానికి కూడా దుంపలు వేగవు..వాళ్ళ నాన్న పోసినట్టు నూనె కాస్త ఎక్కువే పోయండి...ఎంత నూనె వేస్తే ఈ కూర అంత మజాగా ఉంటుంది...తొరగా అయిపోతుంది (ఈ మాట ఇల్లేరమ్మ వాళ్ళ నాన్న చెప్పాడులే).

నూనె వేడెక్కాక శనగ పప్పు, మినప పప్పు, అవాలు, జీలకర్ర, కరివేపాకుతో  తిరగమోత వేయండి.

తిరగమోత వేగాక దంచి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దవేసి బాగా వేపండి.



ఉల్లిపాయ ముద్ద వేగాక బంగాళాదుంప ముక్కలు వేసి కాస్త ఉప్పు వేసి ముక్కలు బాగా ఎర్రగా అయ్యేవరకు వేపండి.
 
అంతే మజా మజాగా... ఘుమఘుమలాడే బంగాళా దుంపల వేపుడు రెడీ!




మరీ రెండు కూరలేనా అంటారా..నాకు తెలుసు మీరు అలా అంటారని.

ఇవిగో..ఇంకా ఉల్లి మినపట్టు.. మసాలా మినపట్టు..అల్లం పచ్చడి..కొబ్బరి పచ్చడితో..









 వీటితో పాటు ఉలవచారు.. మీగడ....ఆవకాయ..కమ్మటి పెరుగు.

వీటన్నటికన్నా ప్రత్యేకం.. మా అమ్మాయి చేతి గులాబ్ జాములు..ఐసు క్రీమూనూ.

గులాబ్ జాం ఐస్ క్రీముతో తింటే యమహాగా ఉంటుందట..ఓ సారి ప్రయత్నించండి.




అబ్బో చాలా అయ్యాయిగా!

అన్నీ చూసి ఆనందించండి.

ఆకలి నకనకలాడుతుంది..గుడికెళ్లొచ్చి అందరి బ్లాగుల మీద పడాలి..

నేను వచ్చేలోపు అందరూ మంచి మంచి వంటలు చేసి పెట్టండి...

Read more...

September 5, 2011

శ్రావ్స్! ఓ మంచి వ్యాఖ్యాత!



 తెలుగు బ్లాగుల్లో వ్యాఖ్యల ద్వారా ప్రసిద్ధి చెందిన వాళ్లు కొందరున్నారు.  ఇక్కడ నేను అజ్ఞాతల గురించి చెప్పటం లేదు!  అప్పట్లో తెలుగు బ్లాగుల్లో నేస్తమా రాధిక గారి వ్యాఖ్య లేని బ్లాగు ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు..కానీ ఆవిడ కూడా ముందు బ్లాగు ద్వారానే పరిచయం అయ్యారు..తర్వాత వ్యాఖ్యల ద్వారా అందరికీ దగ్గరయ్యారు.

 అసలు బ్లాగు లేకుండా వ్యాఖ్యల ద్వారానే ప్రసిద్ధికెక్కిన వారు మరి కొందరున్నారు.  వాళ్ళల్లో కుమార్ గారు ఒకరు. ఆయనకి ఇప్పటికీ బ్లాగు లేదనుకుంటాను.

ముందు వ్యాఖ్యల ద్వారానే పరిచయం అయ్యి ప్రసిద్ధికెక్కి ఆ తరువాత బ్లాగు మొదలుపెట్టి,  అడప తడపా టపాలు వ్రాస్తూ..కొన్నాళ్లకు మరో బ్లాగు మొదలుపెట్టినా..బ్లాగరుగా కన్నా వ్యాఖ్యాత గానే ఎక్కువ ఖ్యాతి గడించిన ఓ అమ్మాయి గురించి ఈ టపా!

ఈ అమ్మాయి చాలా సాదా సీదా తెలుగు అమ్మాయి!

ఆ అమ్మాయి వ్రాసే వ్యాఖ్యలు చూస్తే కొంతమందికి ముచ్చట అయితే మరి కొంతమందికి భయం..దడ..వణుకు అన్నీ ఏకకాలంలో!

పొద్దుట పొద్దుటే మంచి కాఫీ లాంటి వ్యాఖ్యలు అన్నమాట!

ఏ విషయం మీదయినా సాధికారకంగా మాట్లాడే తనని చూస్తే నాకు మహా ముచ్చటగా ఉంటుంది.

తను చెప్పాలనుకుంది నిర్భీతితో చెప్పగలదు.

నచ్చితే మెచ్చుకోవటం..నచ్చకపోతే ఖండించటం

ఎదుటి వాళ్ళు ఎవరైనా ఒకటే పంధా!

మొహమాటాల మెచ్చుకోళ్ళు...స్కోతర్షలు ఉండవు.

ఊరికే మెచ్చుకోవటం కోసం మెచ్చుకోవటం

ఖండించటం కోసం ఖండించటంలా కాకుండా

అర్థవంతమైన వ్యాఖ్యలు వ్రాసే వాళ్లలో తను ఒకరు!

మొదట్లో ఈ అమ్మాయి వ్యాఖ్యలు నేను అప్పడప్పుడు కొన్ని బ్లాగుల్లో చూసినా అంతగా పట్టించుకోలేదు.  ఓ రోజు నా బ్లాగులోనే ఇదా పరిష్కారం టపాకి నాతో విభేదిస్తూ ఓ వ్యాఖ్య పెట్టింది. కొండొకచో అపార్థమూ చేసుకుంది. అమ్మో ఫైర్ బ్రాండు అనుకున్నా!

ఈ విషయం మీదే చదువరి గారు వ్రాసిన బ్లాగులో కూడా తను వ్యాఖ్య పెట్టింది. ఆ పిల్ల క్యూరియాసిటికి ముచ్చటేసింది.

అప్పుడే తన గురించి మొదటిసారి కొంచం ఆసక్తిగా  గమనించాను. అప్పటినుండి బ్లాగుల్లో తన వ్యాఖ్యలు గమనిస్తుండేదాన్ని. చదువరి, తెలుగోడు..ఇలా కొన్ని బ్లాగుల్లో తన వ్యాఖ్యలు ఎక్కువగా కనపడుతుండేవి. తన బ్లాగుల ద్వారా ..వ్యాఖ్యల ద్వారా ..తను చాలా చిన్న అమ్మాయని ..ఇంకా పెళ్ళి కాలేదని తెలిసి మరింత ఆశ్చర్యపోయా! వయస్సుకి మించిన పరిపక్వత కనిపిస్తుంది తన వ్యాఖ్యల్లో!

తను ఎప్పుడు బ్లాగు మొదలుపెట్టిందో కూడా నేను గమనించలేదు.  నేను మొదటగా చదివిన తన టపా.. ఇందులో తన మల్టీ టాస్కింగ్ మీద తనే చెణుకులు విసురుకుంది. ఓహో టపాలు కూడా బాగానే వ్రాస్తుందే అనుకున్నా!

ఆ టపాలోనే తమరింకొంచెం తరచుగా రాయొచ్చు...అన్నదానికి తన సమాధానం

"నాకు వ్రాయటం కన్నా చదవటం ఇష్టం అందుకని ఇలా సేవ్ చేసిన టైములో ఏ బ్లాగు విడిచిపెట్టకుండా కామెంట్లతో సహా చదివేస్తున్నా :) "

ఇప్పటికీ అదే సూత్రం పాటిస్తున్నట్లుంది..అందుకే అప్పుడొకటి..ఇప్పుడొకటి తప్ప తన బ్లాగులో టపాలు జల జలా రాలవు.  అందులోనూ ఇప్పుడు బజ్జు వచ్చాక మామూలుగా తరుచుగా వ్రాసే జనాలు కూడా బజ్జుల్లో కూర్చుని బ్లాగు టపాలని నిర్లక్ష్యం చేస్తున్నారాయే!

వివాహం విద్యా నాశాయ అన్నట్టు
బజ్జు  బ్లాగు నాశాయా!

కాకపోతే బజ్జు ద్వారానే తనతో కొంచం పరిచయం పెరిగింది.  ఇలాంటి విషయాలల్లో మాత్రం బజ్జుని మెచ్చుకోవాలండోయ్!

వ్రాసిన టపాలు తక్కువే అయినా అన్నీ మంచి విషయం ఉన్న టపాలే.

స్నేహమంటే అని అమాయకంగా ప్రశ్నించినా..
కామెన్వెల్త్ క్రీడల  గురించి వ్రాసినా
నాకు లక్కుందా అంటూ అడిగినా
ఇలా జరిగింది అని చెప్పినా ..
శ్రమైకజీవన సౌందర్యం అంటూ రాంబాబు డైరీ మనకు చదివి వినిపించినా
...

కొంచం హాస్యం రంగరించి తను వ్రాసే టపాలు ఆలోచింపచేసివిగా ఉంటాయి.

మీరు అర్జంటుగా గొప్ప వాళ్ళం అయిపోదామనుకుంటున్నారా..అయితే ఈ టపా తప్పక చదవాల్సిందే..ఆ పై మీరు గొప్పవాళ్ళు కాకపోతే ఆ అమ్మాయినే అడిగేద్దాం..ఆపై కడిగేద్దాం.

తనని ఊరికే ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోని తన తత్వం కూడా నాకు బాగా నచ్చింది. అందులో మన తెలుగు బ్లాగుల్లో ఆడవారిలో ఆ ధైర్యం  ఉన్న వాళ్లు బహు తక్కువ..ఎందుకొచ్చిన తలనెప్పి మనకి అని బ్లాగులు మూసుకున్న వాళ్లూ ఉన్నారు. ఇలా ఫేసు టు ఫేసు జవాబులు చెప్పే ఈ అమ్మాయంటే ఇదిగో ఈ టపా చదివాక మరి కొంత అభిమానం పెరిగింది.  అమ్మో గట్సు ఉన్న పిల్లే అనుకున్నా! ఆ గొడవ పూర్వాపరాలు నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.

తను వ్రాసిన టపాలల్లో నాకు బాగా నచ్చిన టపా..అన్నీ వృత్తులు సమానం కాదా ? ఎందుకు ?. మంచి చర్చ కూడా జరిగింది ఈ టపాలో.

ఇక చివరగా తను వ్రాసిన సింగపూరు గురించిన టపాలల్లో అయితే సింగపూరు గురించి అక్కడి టూరిజం గురించి ఆ దేశం వాళ్ళు  కూడా చెప్పలేనంత బాగా చెప్పింది.

అన్నట్టు ఈ అమ్మాయికి పాటలన్నా..కాఫీ అన్నా మహా ఇష్టం.  పాటల కోసమే ఓ బ్లాగు మొదలుపెట్టింది. 

ఈ రోజు తన పుట్టిన రోజని ఇప్పుడే తెలిసింది నాకు..ఎప్పుడో ఓ రెండు మూడు వారాల క్రితం వ్రాసి ప్రచురించకుండా అట్టి పెట్టిన ఈ టపాని తన జన్మదినం సందర్భంగా ప్రచురిస్తే సమయోచితంగా ఉంటుందని ప్రచురిస్తున్నా.

తను జీవితంలో ఇలానే స్థిర చిత్తంతో పైకెదగాలని ..తన ఆశలు..ఆకాంక్షలు అన్నీ నెరవేరాలని..

అభినందనలతో..ఆశీస్సులతో..

Read more...

February 1, 2010

స్నేహమా---ఇలా మూగవోయావెందుకమ్మా!


ఎందుకో ఈ మధ్య నా ముసాయిదా పత్రాలు తిరగేస్తుంటే ఎప్పుడో 2008 లో రాధిక గారి బ్లాగు గురించి నేను వ్రాసి పెట్టుకున్న ముసాయిదా కనపడింది.  ఇది అప్పుడే నా బ్లాగులో పెట్టవలసింది....కానీ అదే సమయంలో పొద్దులో తన కవితల గురించి మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు అని జాన్ హైడు గారి వ్యాసం వచ్చింది. ఇక అంతటి గొప్ప వ్యాసం వచ్చాక నా పరిచయం ఎందుకులే అని నేను ఇక దీన్ని బ్లాగులో పెట్టలేదు. ఇప్పుడు పెట్టటం సబబే అని తన బ్లాగు గురించి కొత్త బ్లాగర్లకి తెలియాలన్న ఉద్దేశ్యంతో  పెడుతున్నాను.

కారణం ఏమయినప్పటికి..రాధిక వాణి ఇప్పుడంతగా వినపడటం లేదు. ఆవిడ తన బ్లాగులో కవిత వ్రాసి ఆరు నెలలవుతుంది. ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలు పెట్టటం కూడా బాగా తగ్గించేసారు. తన ఇంకొక బ్లాగు సంగతులులో మాత్రం తాజాగా జనవరి 26 న ఓ టపా వ్రాసారు.  అసలు సంగతులు..బ్లాగు తనదే అని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ అనుకుంటాను.

సామాన్యంగా నేను కవితలు చదవను..మొదటిగా నేను కవితలు చదివింది రాధిక గారి బ్లాగులోనే.  తన గురించి వ్రాయలన్న ఉద్దేశ్యంతోనే నేను ఆవిడ కవితలు చదివాను. చదివాక తెలిసింది ఆవిడ కవితలు ఎంత సరళంగా ఉంటాయో! చిన్ని చిన్ని మాటల్లో తను చెప్పాలనుకుంది అందంగా చెప్పటంలో ఆవిడ నేర్పరి. రాధికా..ఇంకొక రెండు కవితలు వ్రాస్తే మీరు సెంచరీ కొడతారనుకుంటాను..ఆ సెంచరీ కోసమన్నా వ్రాయండి!

తన బ్లాగులోని తాజా కవిత "నా ఊరు". ఈ కవిత చదివి సొంత ఊరు గుర్తుకు రాని వాళ్లు ఎంతమంది ఉంటారు?

"నేనెళ్ళిపోయానన్న బాధేమో
ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది

తన అవసరం లేదనుకుందేమో
రచ్చబండ బీటలేసింది

గుడి మెట్టు,చెరువు గట్టు
నాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయి

జామచెట్టుకేసిన ఊయల
కిర్రు చప్పుళ్ళ ఊసేలేదు

ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు

ఇపుడా ఊరు
నా చరిత్రకి
శిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలింది

తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు"
 
***************************************


కవిత్వం రాయడం నాకు చేతకాదు,భాష మీద పెద్దగా పట్టు కూడా లేదు అంటూనే చక్కని కవితలతో, స్నేహపూర్వక వ్యాఖ్యలతో అందరిని అలరిస్తూ తెలుగు బ్లాగు లోకంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని, అభిమానులిని ఏర్పరుచుకుని "తోచిన భావాలకు తెలిసిన భాషలో మాటలు అల్లుకుని ఆనందించే సాధారణ పల్లెటూరు అమ్మాయిని" అంటూ వినమ్రంగా ఒదిగే ఉండే మన పక్కింటి అమ్మాయి, ఓ అసలు సిసలైన తెలుగింటి అమ్మాయి--- రాధిక.  తెలుగు బ్లాగులలో రాధిక వ్యాఖ్య లేని బ్లాగు ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో!!

అక్షర దోషాలుంటే మన్నించండి అంటూ ఆగస్టు 2006 లో తన కవితల ద్వారా బ్లాగ్లోకం లోకి ప్రవేశించిన రాధిక త్వరలోనే అక్షర దోషాలను దిద్దుకోవటమే కాదు తనకంటూ ఒక ప్రత్యేక ఒరవడిని, శైలిని ఏర్పరుచుకున్నారు.

ఓ చల్లని సాయంత్రం తొలకరి జల్లులతో తడిసిన మట్టివాసన పీలుస్తూ, సన్నజాజి చెట్టు దగ్గర పడక కుర్చీలో కూర్చుని, వేడి వేడి పకోడీలు తింటూ, రేడియోలో ఇష్టమైన పాటలు వింటూ, యండమూరి పుస్తకం చదువుతుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో రాధిక కవితలు చదువుతున్నా అంత ఆహ్లాదంగా మనసుని సేద తీర్చేవిగా ఉంటాయి. భావుకత, బేలతనం, అమాయకత్వం, ఎడబాటు, ఎడబాటుతో వచ్చే అవేదన అన్నీ కలగలిపి ఉంటాయి తన కవితలలో. అభివ్యక్తీకరించడంలో ఒక కొత్తదనం ఉంటుంది తన కవితలలో. పంటపొలాలమధ్య పాటలా మా స్నేహం అంటూ ఎక్కువగా స్నేహం గురించి రాసే తను "నేస్తాలు సరదాగా ఇచ్చిన గడ్డిపరకలను కుడా అపురూపం గా దాచుకున్నదానిని" అంటూ స్నేహానికి తను ఇచ్చే విలువని చెప్పకనే చెప్పారు.

2006 ఆగస్టు లో మొదలుపెట్టి  ఇప్పటివరకు సుమారు 98 కవితలు రాసారు. ఈ మధ్య కాలంలో రాశి తగ్గినా వాసి ఏ మాత్రం తగ్గలేదు. తన కవితలకు చిత్రాలు ఓ అదనపు ఆకర్షణ. కవితలకు తగ్గ చక్కని ఫోటోలను జతచేస్తుంటారు.  లలిత లలితమైన పదాలతో తను చెప్పదలుచుకుంది క్లుప్తంగా అర్థవంతంగా చెప్పగలగటంలో నేర్పరి రాధిక. తన కవితలలో తాజాదనంతో పాటు వైవిధ్యానికీ ఏమి తక్కువ లేదు. "అలారం మోతలతో ఉలికిపాటు మెలకువలు" అంటూ ప్రస్తుత జీవనశైలిని ప్రతిబింబించే కవితలు కూడా రాసారు. కొన్ని కవితలలో పల్లెటూరి అమాయకత్వం మనల్ని పలకరిస్తే, మరి కొన్నిటిలో ఏదో పోగోట్టుకున్న అవేదన, నిస్పృహ, ఎడబాటు మన మనసులిని కదిలిస్తాయి. మన అనుభవాలని...మన మనస్సులోని భావాలను చెపుతున్నట్లు ఉంటాయి మరికొన్ని.

కవిత గురించి తన అభిప్రాయం తన మాటలలోనే చూడండి.
"మనసులోని భావాలు
మాటలుగా చెప్పలేని వేళ
అవి కలై … అలలై
అనుభూతుల తుఫానులు చెలరేగి
యెద తీరాన్ని తాకినప్పుడు
మది లోతుల్లో పలికేదే కవిత" 



తన కవితలలో ఎంత వైవిధ్యం ఉంటుందో ఒక్కసారి గమనించండి.

అమెరికాలో ఉన్నా తెలుగుదనాన్ని, చిన్ననాటి నేస్తాలని,సన్నజాజులిని మరిచిపోకుండా తన కవితల ద్వారా స్మరించుకుంటుంటారు.

మారుతున్న మనుషుల గురించి, విలువల గురించి తనదైన శైలిలో వాపోతారు.

మనిషెందుకు మనసు నిండగానే మూగబోతాడు? అంటూ ప్రశిస్తారు.

అరే
...ఇదేమిటి?
ఆకాశంలో కదా మేఘాలున్నాయి
మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?
అంటూ వీడ్కోలుతో మన కళ్ళల్లో కూడా వర్షం కురిపిస్తారు.

ప్రేమ, భావుకతే కాదు పసిపాపల గురించి వారి బోసి నవ్వుల గురించి కూడ అంతే హృద్యంగా వ్రాస్తారు.

జీవితం అనే కవితలో పెళ్ళితో అమ్మాయి ఏం కోల్పోతుందో చెప్పకనే చెపుతారు.

పదహారు ప్రాయం ఎలాఉంటుందో చూడండి అంటారు.

కనికరం లేని కన్నీళ్ళు ఎంత ఆపినా ఆగట్లేదు అంటూ బేల అవుతారు.


కవితలతోపాటు కవితల్లాంటి వచనాలు కూడా రాస్తుంటారు. 

రాధిక కవితల కోసం ఎదురుచూసే పాఠకులు ఎంతమందో!!

రాధిక వ్రాస్తున్న ఇంకొక బ్లాగు సంగతులు.  దీనిలో చాలా తక్కువగా వ్రాస్తుంటారు. 

మా ఊరు-నా బాల్యం లో గోదారమ్మకు గట్టయి మురిసే ఊరేమాది..భూదేవమ్మకు బొట్టయి మెరిసింది" అంటూ తన ఊరి గురించి తన బాల్యం  గురించి ఎన్నో సంగతులు చెప్పారు.

మనిషికి డబ్బు ఎంతవరకు ఆనందాన్నిస్తుంది?ఏ స్తాయి దాటాక డబ్బుకి విలువ తగ్గిపోతుంది? అంటూ అప్పుడప్పుడు మనల్ని ప్రశిస్తూ కూడా ఉంటారు.
  

అన్నట్లు కవితలే కాదు కథలు కూడా వ్రాయగలనని ఒకటి రెండు కథలు కూడా ఈ బ్లాగులో వ్రాసారు.
 

ఇలా చక్కగా వ్రాయగలిగినవాళ్లు వ్రాయకుండా ఉండటం తగని పని. రాధిక గారు మరలా విరివిగా వ్రాయాలని....వ్రాస్తారని ఆశిస్తున్నాను.

Read more...

December 28, 2009

బ్లాగు పుస్తకంలో నెమలీక--అభినందన మందారమాల

"నా అక్షరాలు ప్రజా శక్తులవహించే విజయ ఐరావతాలు కాదు..వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలూ కాదు"

వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలే అందంగా ఉంటారా? తనమానాన తన పని చేసుకొని వెళ్ళే ఆడపిల్లలు అంతకంటే అందంగా ఉంటారు..........

అయినా ఇవంటే నాకు ఇష్టం.. ఎందుకంటే ఇవి 'నా' అక్షరాలు కాబట్టి. ....

ఎవరి అక్షరాలంటే వాళ్లకి ఇష్టమే.....కానీ మన అక్షరాలని ఇష్టపడే పాఠకులు ఎంతమంది ఉంటారు?

నెమలీక అంటే ఇష్టపడని పిల్లలు ఉంటారా?  అలానే నెమలికన్నుని ఇష్టపడని తెలుగు బ్లాగర్లు ఉంటారా?

చడీ చప్పుడు కాకుండా 2009 జనవరిలో బ్లాగు వ్రాయటం మొదలుపెట్టి....ఇంతింతై.......వటుడింతై అన్నట్టు  అలవోకగా ద్విశత టపాలు పూర్తి చేసుకున్న నెమలికన్ను బ్లాగు గురించి నేను చెప్పబోవటం సాహసమే! రాసిలోనే కాదు వాసిలో కూడా మెచ్చదగ్గ తెలుగు బ్లాగుల్లో ఆయనది కూడా ఒకటి.

చిన్నప్పుడు నెమలీకని పుస్తకాలల్లో దాచి పెట్టి దానికి కొబ్బరిమట్టల మధ్య ఉండే నాచు తెచ్చిపెట్టి ఆ ఈక పిల్లలు పెడుతుందని ఎదురుచూసేవాళ్లం..గుర్తుందా...ఇలాంటి ఆనాటి మన బాల్య  జ్ఞాపకాలని ఎన్నిటినో మన కళ్ళముందు సాక్షాత్కరింపచేసి..ఒక్కసారి మనల్ని మన బాల్యంలోకి తీసుకుపోయి మనస్సుని అక్కడే వదిలి వచ్చేటట్లు చేసే రచనలు ఆయన సొంతం.

బ్లాగు ప్రారంభించిన కొద్దికాలంలోనే  ఈనాడులో ఆయన బ్లాగు గురించిన పరిచయం వచ్చింది.  ఆరునెలల్లో వంద టపాలు..  ఏ టపాకి ఆ టపా విన్నూత్నమే.. బ్లాగుల్లో దీన్ని  ఓ రిఫరెన్సు బ్లాగు అనవచ్చేమో.  సాహితీప్రియులకి మంచి విందుభోజనం మురళి గారి బ్లాగు. తెలుగులో వచ్చిన ఏ కథ గురించి అయినా నవల గురించి అయినా ఆయన దగ్గర సమాచారం దొరుకుతుందనుకుంటాను. ఒక్కసారి ఆయన దగ్గర ఉన్న  పుస్తకాలు చూడాలి అని అనుకోని తెలుగు బ్లాగర్లు ఉండరేమో!  ఇప్పటికే చాలామంది బ్లాగర్ల దృష్టి మురళిగారి గ్రంధాలయం మీద పడ్డట్టు.....గ్రంధచౌర్యానికి పథకాలు వేస్తున్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా..మురళి గారూ జాగ్రత్త!

ఓ సినిమా గురించి చెప్పినా....ఓ నవల గురించి చెప్పినా.....ఓ కథ గురించి చెప్పినా.....నాటకాల గురించి చెప్పినా  సాధికారికంగా చెప్పగల మురళి గారు తను స్వయంగా  ఓ మంచి కథకులు.  సరళమైన భాష, వివరణాత్మకమయిన శైలి, సూటిగా చెప్పగల నేర్పు ఆయన సొంతం.  మొన్న మొన్ననే పొద్దులో ఆయన మొదటి కథ  పొడిచింది. అయినా అది మొదటి కథేంటి?....నాకయితే ఆయన బ్లాగు టపాలన్నీ కథలే.

 పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు కదా..ఆలానే మన మురళి గారు కూడా తన మూడో ఏటే రచనా రంగంలోకి అడుగు పెట్టారట.  ఆ చమత్కృతి  ఏంటో ఆయన మాటల్లోనే చదవండి.  పూర్వాశ్రమంలో ఆయన రేడియో రచనలు కూడా చేసారు.  నాటకాల గురించి మాట్లాడేవాళ్లు ఈ రోజుల్లో అరుదుగా కనిపిస్తారు.....బ్లాగుల్లో అది మరింత అరుదు.  నేను తెలుగు బ్లాగుల్లో నాటకాల గురించి మొదటిసారిగా చదివింది మురళి గారి బ్లాగులోనే.  అన్నట్టు 'అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది.. మేఘం వెనుక రాగం ఉంది.....పాట మురళి గారే వ్రాసారంట! .  ఆయన సాహిత్య పిపాస ఎలాంటిదంటే ఒకటి కాదు రెండు కాదు....ఏకంగా 18 ఏళ్లు వెతికి వెతికి మరీ ఓ పుస్తకాన్ని సొంతం చేసుకున్నారట!

ఎప్పటెప్పటివో..పదిపదిహేనేళ్లనాటివి...... వార్తాపత్రికల్లో పడ్డ అలనాటి ఆణిముత్యాల లాంటి కథలు జాగ్రత్తగా దాచిపెట్టి మనకు వినిపిస్తుంటారు.  అలా  ఎన్ని కథలు  పరిచయం చేసారో చూడండి. తిలక్, వివినమూర్తి, భానుమతి, ముళ్ళపూడి, శ్రీరమణ, డా.సోమరాజు సుశీల, కేతు విశ్వనాథ రెడ్డి, బీనాదేవి, వంశీ.. లాంటి రచయతల మంచి మంచి కథల గురించి  ఇక్కడ  చదువుకోవచ్చు.  మురళి గారికి వంశీ అంటే ఓ ప్రత్యేక అభిమానం..వాళ్ల గోదావరి జిల్లా వాడయినందుకేమో....... ఎంత అభిమానం అంటే ఆయనతో ఫోనులో మాట్లాడి ఆ ఉద్వేగాన్ని....ఆ ఆనందాన్ని మనతో ఎంచక్కా పంచుకున్నారో ఇక్కడ.

సాధారణంగా పుస్తక పఠనం మీద ఆసక్తి ఉన్నవాళ్లకి సినిమాల మీద కూడా ఆసక్తి మెండుగానే ఉంటుంది.  మురళి గారి సినిమా అనురక్తికి ఆయన  సినిమాల మీద వ్రాసిన కబుర్లే   నిదర్శనం.  ఆయన  సినిమాల మీద చక్కటి చిక్కటి విశ్లేషణలు చేస్తుంటారు.  నవతరంగంలో  కూడా ఆయన వ్యాసాలు వచ్చాయి.  అసలు ఆయన ముందు నవతరంగంలో వ్యాసాలు వ్రాస్తూ అలా అలా బ్లాగు మొదలుపెట్టారు.  కాకపోతే ఎక్కువగా కొత్త సినిమాల (80ల తరువాత సినిమాలు ) గురించే ఉంటాయి.  అప్పుడప్పుడు ఆపాత మధురాల గురించి కూడా చెప్తే బాగుంటుంది!

ఆయనకి సినిమాలు చూసే  విషయంలో ఎంత గుండె ధైర్యం..సాహసం అంటే సుమనోహరుడి ఉషాపరిణయాన్ని నిర్భయంగా చూసొచ్చి నిర్భీతితో మనకి ఆ సినిమా గురించి చెప్పేంత!  ఇన్సూరెన్సు పాలసీలు, రావాల్సిన, తీర్చాల్సిన బాకీల వివరాలన్నీ ఓ పుస్తకంలో వివరంగా రాసి పెడతారంట లేండి..అదీ ఆయన ధైర్యం.

తను వ్రాసే అమ్మ చెప్పిన కబుర్లు అయితే నాకు మరీ మరీ ఇష్టం.  అవి ఆయనకి వాళ్లమ్మ చెప్పిన కబుర్లే అయినా మనకు మన అమ్మ చెప్తున్నట్లే ఉంటాయి.  "ఒలప్పో బెండకాయి కూరొండీసినావంటే..".   అంటూ వాళ్ల పిన్ని పాడిన జముకుల కథ.....వాళ్ల అమ్మమ్మ బిస్సీ కబుర్లు,...సత్తెమ్మ సత్యభామగా  మారి  చెరువుమీద నడిచే ప్రహసనం.....గోవిందరావు జమిందారు గురించి,  టాంపండు లీలలు.......కొంపముంచిన కుంటె గేదె.....అయ్యప్పనాయుడు..హరిశ్చంద్ర వేషం......అబ్బో వాళ్ల అమ్మగారు ఆయనకి ఎన్నెన్ని కబుర్లు చెప్పారో. ... ఎంత అదృష్టవంతులో మురళి గారు మీరు..

ఇక ఆయన జ్ఞాపకాలలోకి వెళ్ళామంటే ఒక పట్టాన బయటకి రాలేము.  అవి చదువుతున్నప్పుడు నిక్కరేసుకున్న చిన్న మురళి మన కళ్ల ముందు మెదులుతాడు.  మనం కూడా మన చిన్ననాటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతాం.   ఈతపళ్ళు-ముంజెల బండి, పోలిస్వర్గం , తిప్పుడు పొట్లాం, మొగ్గల చీరలు,  మల్లికాసులు,  వాళ్ల సుబ్బమ్మగారి నీళ్ళావకాయ..... ఎన్నెన్ని జ్ఞాపకాలో! 

మురళి గారికి వాళ్ల బామ్మ గారంటే కాస్త కోపం అనుకుంటాను. పాపం పెద్దావిడిని ఎన్ని ఇబ్బందులు పెట్టేవారో .....అంతేనా వాళ్ల తాతయ్య చేత చివాట్లు కూడా పెట్టించేవారు.  ఇంతకీ పెద్దాయ్యాక అయినా తేలు కుడితే ఎలా ఉంటుందో  తెలిసిందా మురళి గారూ?

అందరిని హడలగొట్టే మురళి గారికి వాళ్ల నాన్నగారంటే మాత్రం మహా హడలు సుమండి.  పాపం ఆయన పదమూడో ఎక్కం కష్టాలు  పగవాడికి కూడా వద్దు అనిపిస్తాయి.  కత్తిరించిన జుట్టు మళ్ళీ తన తలమీద అతికించమని వాళ్ల మంగలి సత్యాన్ని   పీడిస్తుంటే ..వాళ్ల నాన్నగారొచ్చి నిద్రగన్నేరు కొమ్మతో వీపుమీద కధాకళి ఆడేసారట....... ఇవన్నీ మన కళ్లముందు జరిగినట్లే వర్ణిస్తారు.  ఈ జ్ఞాపకాల టపాలు చదువుతుంటే నాకు నాయిని మిట్టూరోడి కథలు గుర్తుకొస్తాయి.

మురళి గారి శైలి చదువుతుంటే నాకు అక్కడక్కడ ప్రళయ కావేరి కథలు..మా పసలపూడి కథలు  గుర్తుకొస్తాయి.  కుదిరితే ఓ కప్పు కాఫీ అంటూ కాఫీ కబుర్లు అయినా , తన బ్లాగులోని విషయ చౌర్యం గురించి కాపీ కబుర్లు అయినా..... మరే కబుర్లయినా  కళాత్మకంగా వ్రాయటం ఆయనకే చెల్లు.   చెయ్యి విరిగినట్టుంది అంటూ బ్లాగుల్లో వ్యాఖ్యల పెట్టె  పాత్ర గురించి..అది పనిచేయకపోతే వచ్చే ఇబ్బందుల గురించి  ఎలా చెప్పారో చూడండి.  అదే చేత్తో ఆషాఢమాసం గురించి అల్లరల్లరిగానూ చెప్పగలరు. 

కథలు...నవలలు....నాటికల  గురించే కాదు తన చుట్టూ ఉండే మనుషుల  గురించి కూడా కథ చెప్పినట్టే ఆసక్తికరంగా చెప్తారు.  కష్టం, బాధ్యత, మనసు, స్నేహం..లాంటి వాటి మీద  వ్యక్తిత్వవికాస తరగతులకి పనికొచ్చే మంచి విశ్లేషణాత్మక వ్యాసాలూ వ్రాయగలరు.  ఇన్ని రకాల వైవిధ్య రచనలతో పాటు బ్లాగు పరిచయాలు  కూడా చేసే మురళి గారి బ్లాగు గురించి ఎంత చెప్పినా అది అసంపూర్ణమే!

ఇక చివరిగా మురళి గారి బ్లాగుకే ప్రత్యేకమయిన ఓ విభాగం ఉంది..అదే నాయికల పరిచయం.  మధురవాణి నుంచి కజు వరకు ..... ప్రముఖ నవలల్లోని నాయికల గురించి అద్భుతంగా విశ్లేషిస్తూ పరిచయం చేస్తుంటారు.  పుస్తక పరిచయాలు సర్వసాధారణమే..కానీ బ్లాగుల్లో ఇలా అచ్చంగా నవలా నాయికల పరిచయాలు ఓ వైవిధ్యమే!

గోదావరి అంటే అమిత ఇష్టపడే ఈ గోదారబ్బాయి బ్లాగులో గోదావరి గురించిన ప్రస్తావనలు ఎక్కువగానే ఉంటాయి.   మన నేల, మన నీరు, మన పల్లె, మన కొండా కోనా...ఈ మన అనుకోవటంలో ఉండే ఆనందం..ఆ అనుభూతి ఈ మన బ్లాగు చదవటంలో కూడా ఉంటుంది.

మురళి గారు రెండువందల టపాలు పూర్తిచేసిన సందర్భంగా అభినందనలు తెలుపుతూ.... ఆయన నుండి శతాధిక టపాలు కోరుకుంటూ....

ఆయన ఎన్ని చేతులతో ఎన్ని కీబోర్డులతో వ్రాస్తారో నాకు తెలియదు కాని టపటపా టపాలు రాలిపోతుంటాయి...అందుచేత నేనీ టపా ప్రచురించే సమయానికి ఆయన రెండువందల టపాలు దాటేస్తే తప్పు నాది  కాదు!!

Read more...

November 16, 2009

రెక్కలు--ఓ కవితా ప్రక్రియ

వెనక్కి
తగ్గిన
బాణమే
దూసుకెళ్తుంది

వెనకడుగైనా
విజయానికి తొలిఅడుగే ......

**********************************************************

అంతులేని
అనుభవాలు
మరువలేని
అనుభూతులు

గుప్పెడంత గుండెకు
బోలెడన్ని చప్పుళ్ళు.......

********************************************************

ఎటుచూసినా
తేనె
పూసిన
కత్తులే

ప్రశ్నించేవాడెప్పుడూ
పిచ్చోడే ! ..........

*********************************************************

కోట్లు
కూడబెట్టి
కునుకులేని
బ్రతుకు

బూడిదలో
పన్నీరు ...........

********************************************************

వేలాది
సైన్యం ఓ ప్రక్క
తోడుగా
నేస్తం మరోప్రక్క

సైన్యం వెనుదిరిగినా
స్నేహం నిన్ను వీడదు...

***************************************************************

కొనుక్కున్న
సన్మానాలు
అనవసరపు
ఆర్భాటాలు

ఖాళీ డబ్బాలో
రాళ్ళమోతలు..........

**************************************************************

రెక్కలు..........ఇది ఓ కవితా ప్రక్రియ!

నేనేంటి ఈ కవిత్వం ఏంటి అనుకుంటున్నారా!!

పైన పెట్టినవి మన బ్లాగరు పద్మకళ గారు వ్రాస్తున్న "రెక్కలు" నుండి మచ్చుకి కొన్ని.
నాకు కవితలు అంతగా ఎక్కవు..అసలు చదవను కూడా. ఈ మధ్య పద్మకళగారితో మాట్లాడినప్పుడు వీటి గురించి చెప్పారు....సరే ఓ సారి చూద్దాం అని చదివాను. సరళంగా బాగున్నట్లు అనిపించాయి. వీటి గురించి విశ్లేషించేంత పరిజ్ఞానం నాకు లేదు..పాఠకులు చదివి మీ అభిప్రాయాలు పద్మకళగారి బ్లాగులో చెప్పండి.

మొదటగా వృత్తిరీత్యా టీచరు, ఇప్పుడు జర్నలిస్టు మరియు రేడియో జాకీ, ప్రవృత్తి రీత్యా కవయిత్రి అయిన పద్మకళ గారివి ఒకటి కాదు ఏడు బ్లాగులున్నాయి.

1. సాక్షిలో తను వ్రాసిన వ్యాసాల కోసం.

2. తనకు నచ్చిన ప్రముఖుల మెసేజెస్ కోసం.

3. పిల్లల స్వచ్చమైన నవ్వులు....చల్లని చూపులతో తను తీసిన చిత్రాలతో .

4. మామూలు విషయాలతో తను వ్రాసే బ్లాగు.

5. ప్రముఖ వ్యక్తులు, మార్గదర్శుల గురించి.

6. ఇంగ్లీషు పదాల ఉచ్చారణ వాటి అర్థాలతో.

7. కవితా ప్రక్రియ "రెక్కలు" కోసం.

తీరిక దొరకని ఉద్యోగాలల్లో ఉండి కూడా ఇన్ని బ్లాగులు వ్రాస్తున్నందుకు పద్మకళ గారికి అభినందనలు.

Read more...

November 2, 2009

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం--వనభోజనాల ప్రత్యేకం

"ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారు
ఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారు"

ఎంత గొప్ప అద్భుతమయిన భావన!
కృష్ణశాస్త్రిగారికి తప్ప ఇలాంటి భావనలు ఎవరికీ రావేమో!!

"ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం"..... అంటూ కృష్ణశాస్త్రి గారు ఓ అద్భుతమయిన పాటని మనకి వదిలిపెట్టి వెళ్ళారు.  నిన్న ఆయన పుట్టినరోజు....ఈ రోజు ఆయన పాటకి సార్థకత కలిగే కార్తీక పౌర్ణమి రోజు.

మా ఇంట్లో పూజలు వ్రతాలు అంతగా అలవాటు లేవు.  మాకు తెలిసి మా అమ్మ పూజలు చేసే సందర్భాలు రెండే రెండు . ..ఒకటి వినాయకచవితి....రెండవది కార్తీక పౌర్ణమి..అందుకే ఈ రెండూ అంటే నాకు మక్కువ ఎక్కువ.  మాకు సముద్రతీరం దగ్గర అవటంచేత కార్తీక మాసంలో తప్పుకుండా ఏదో ఒకరోజు సముద్రస్నానికి వెళ్లేవాళ్లం.  మాకు బాపట్ల దగ్గర అయినా అప్పట్లో సూర్యలంక బీచ్ అంత బాగుండేది కాదు..జనసంచారం కూడా చాలా తక్కువగా ఉండేది....అందుకనే ఎప్పుడూ చీరాల ఓడరేవుకే వెళ్ళేవాళ్లం.  పొద్దున్నే చీకటితో లేచి ట్రాక్టర్ల మీద వెళ్ళి స్నానాలు చేసి అక్కడే దగ్గర్లో ఏ జీడిమామిడి తోటలోనో అమ్మవాళ్లు చేసుకొచ్చిన పులిహార...పెరుగన్నం తినేసి వచ్చేవాళ్లం.  వీలయితే కార్తీకమాసంలో  రెండు మూడు సార్లు కూడా సముద్రస్నానికి వెళ్లేవాళ్లం.

ఇక కార్తీక పౌర్ణమి రోజయితే అమ్మ ఉదయన్నే మాకు దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి వత్తులు వెలిగించి వచ్చేది.  అప్పుడప్పుడు నేను కూడా వెళ్ళేదాన్ని. గుళ్ళో అందరూ తలా  ఓ పద్మం ముగ్గు వేసి దానికి పసుపు కుంకుమ వేసి ప్రమిద పెట్టి వత్తులు వెలిగించేవాళ్లు.  ఆ పద్మాలు ధగ ధగ మెరిసిపోతూ ఉండేవి, అవి ఇప్పటికీ నా కళ్లముందు అలా మెదులుతూ ఉంటాయి.  అప్పట్లో ఏంటి అందరూ పద్మాల ముగ్గే వేస్తారు ఆనుకునేదాన్ని!

అమ్మ  ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చీకటి పడుతూ పడుతూ ఉండగానే పూజ చేసి తులసమ్మ దగ్గర పద్మాల ముగ్గు వేసి దీపం పెట్టి వత్తులు వెలిగించేది . ఆ రోజు సాయంత్రం అన్నాలు కూడా అమ్మ....ఆమ్మ వాళ్లతో పాటు పెందలాడే  తినేసేవాళ్లం.  మా ఆమ్మ వాళ్లిల్లు మా ఇంటి ఎదురుగానే.....ఎక్కువగా కార్తీక పౌర్ణమి రోజు అందరం కలిసి వాళ్లింట్లో బావి పక్కనే తులసమ్మ దగ్గర కూర్చుని భోజనాలు చేసేవాళ్లం.

అమ్మవాళ్ళు ఈ రోజు చేసే వంటలలో ప్రధానమయినది నేతి బీరకాయ పచ్చడి.  ఈ రోజుల్లో మా ఊరిలో ఎవరి ఇంట్లో చూసినా ..ఎవరి వాముల మీద (ఇప్పుడు వాములు లేవులేండి), చావిళ్ళ మీద చూసినా నేతి బీరకాయలు విపరీతంగా కనపడతాయి.  మా ఇళ్లల్లో కార్తీకమాసపు వనభోజనాలలో ఈ పచ్చడి లేకుండా భోజనం ఉండదు.  అదేం విచిత్రమో ఈ హైదరాబాదులో నాకు ఇంతవరకు ఎక్కడా నేతి బీరకాయలు కనపడల.  ఇప్పటికీ వీటిని ఇంటి దగ్గరనుండి తెచ్చుకోవటమో తెప్పించుకోవటమో చేస్తాం! మరి ఇవాళ కార్తీకపౌర్ణమి సందర్భంగా మీ అందరికి ఆ పచ్చడి రుచి చూపిస్తాను.  ఇది చెయ్యటం చాలా తేలిక.   నేతి బీరకాయలు  కావాలని మాత్రం అడగకండేం!


ప్రవాసాంధ్రులకి:  నేతి బీరకాయని  సిల్క్  స్క్వాష్ (silk squash),  చైనీస్ ఓక్రా (chineese okra) అని అంటారట....మరి మీ ఇండియన్ స్టోరులో కూడా దొరుకుతుందేమో  ప్రయత్నించండి.

కావలసిన పదార్థాలు
నేతి బీరకాయ................ఒకటి
చింతపండు......చిన్న ఉసిరికాయంత
పచ్చిమిరపకాయలు.........ఆరు
నూనె............రెండు చిన్న చెంచాలు
ఉప్పు.............రుచికి సరిపడా
చిన్నుల్లిపాయ (వెల్లుల్లిపాయ) రెబ్బలు......నాలుగు
జీలకర్ర.......... ఒక చిన్న చెంచా
కొత్తిమీర..........చిన్న కట్ట
కరివేపాకు........రెండు రెబ్బలు

నేతి బీరకాయలకి తోలు బీరకాయ తోలు లాగా కాకుండా చాలా నునుపుగా ఉంటుంది.  వీటికి తోలు తియ్యక్కరలేదు.  కాయని  బాగా శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి.  బాండీలో రెండు చెంచాల  నూనె వేసి అది కాగాక పచ్చిమిరపకాయలు వేసి వేయించి తీసుకోవాలి.  తరువాత బీరకాయ ముక్కలు వేసి వాటిలో నీరు పోయేంతవరకు వేయించుకోవాలి.  వేగాక ఈ ముక్కల్లో కాస్త చింతపండు పెట్టుకోవాలి.  ముక్కలు చల్లారాక ముందుగా పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి.  (రోలు లేనివాళ్లు మిక్సీలో ఒక్కసారి తిప్పండి).  తరువాత నేతి బీరకాయ ముక్కలు వేసి నూరుకోవాలి.  ఈ పచ్చడి మరీ మెత్తగా ఉంటే బాగుండదు.  మిక్సీలో అయితే ఒక్కసారి తిప్పీ తిప్పనట్టు తిప్పితే సరిపోతుంది.  బీరకాయ పచ్చడి లాంటివి మిక్సీలో వేస్తే వాటి రుచే పోతుంది....రోటి పచ్చడి రోటి పచ్చడే..మిక్సీ పచ్చడి మిక్సీ పచ్చడే!! చివరగా కొత్తిమీర, కరివేపాకు, చిన్నుల్లిపాయ, జీలకర్ర వేసి ఒక్కసారి కచ్చాపచ్చాగా  నూరుకుని పచ్చట్లో కలుపుకుంటే నేతిబీరకాయ పచ్చడి సిద్ధం.

అసలు రోటిపచ్చళ్ల రుచి చివరగా వేసే జీలకర్ర, కరివేపాకు, చిన్నుల్లిపాయలతోటే వస్తుంది. చిన్నుల్లిపాయ వాడని వాళ్లు దానిని వాడకున్నా బాగానే ఉంటుంది.

ఈ పచ్చడిలో కావాలనుకుంటే ఇష్టమయినవాళ్లు నువ్వులు వేసుకోవచ్చు.  ముందుగా బాండీలో నూనె లేకుండా రెండు చెంచాల నువ్వులు వేసి కొంచం వేయించి పచ్చిమిరపకాయలతో పాటు నూరుకోవటమే.  పచ్చిమిరపకాయల బదులు ఎండుమిరపకాయలు కూడా వాడవచ్చు. ఇష్టమయినవాళ్ళు చివరగా ఎండుమిరపకాయలు, మినపపప్పు, శనగపప్పు, ఆవాలతో తిరగమోత పెట్టుకోవచ్చు.

వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యితో పాటు ఈ పచ్చడి వేసుకు తింటే అధరహో! అన్నంలోకే కాదు చపాతీలలోకి కూడా బాగుంటుంది.

మరి వంటలు సిద్ధం, మితృలంతా బంతిలో కూర్చుంటే ఇక వడ్డిస్తాం.


Read more...

January 5, 2009

తెలుగులో మహిళా బ్లాగుల ప్రస్థానం


మనసు భావాలని పంచుకోవటానికి బ్లాగు ఓ చక్కని వేదిక, ఇది మహిళల విషయంలో మరింత నిజం కూడా. ఇప్పుడు తెలుగు బ్లాగుల్లో మహిళల బ్లాగులు ఓ విశిష్ట స్థానాన్ని ఆక్రమించుకున్నాయి.  కథలు, కవితలు, సమీక్షలు, పుస్తకాలు, సినిమాలు, పాటలు, గేయాలు, రాజకీయాలు, అంతరంగాలు, స్వగతాలు, చలోక్తులు, విశ్లేషణలు, విమర్శలు, ముగ్గులు, వంటలు, కొండకచో ముఖాముఖీలు----ఒక్కటేమిటి..... పొడుపు కథలనుండి......అన్నమయ్య పదాల వరకు బ్లాగుల్లో మహిళలు స్పృశించని అంశం లేదు, అందరి గురించి అన్నిటి గురించి వ్రాసేస్తున్నారు.

తెలుగులో మహిళా బ్లాగులు 2005 లో మొదలయ్యాయి.  మొదటగా వచ్చింది ఇందు భార్గవి ది అని చెప్పవచ్చు.  ఈమెను ఆది బ్లాగరిత అనవచ్చేమో.  ఇందు భార్గవి ఇంగ్లీషులో 2004లోనే మొదలుపెట్టినా తెలుగులో 2005 ఏప్రియల్‌లో వ్రాయటం మొదలుపెట్టారు.  తను తెలుగులో వ్రాసింది చాలా తక్కువే, ఇప్పుడు పూర్తిగా ఇంగ్లీషులోనే వ్రాస్తున్నట్లున్నారు.  తరువాత అభిసారిక . అభిసారిక కూడా మధ్యలో చాలా రోజులు కనపడలేదు, మరల తాజాగా 2008 నవంబరు నుండి వ్రాయటం మొదలుపెట్టారు.  ఈమె పాత టపాలయితే ఏవీ ఇప్పుడు లేవు. తరువాత శైలజ అంగర స్వాతికుమారిసౌమ్య, రాధిక, లలిత, అమూల్య  లాంటి వాళ్లు మొదలుపెట్టారు. వీరిని తొలితరం తెలుగు మహిళా బ్లాగర్లగా చెప్పుకోవచ్చు. వీరిలో ప్రస్తుతం సౌమ్య, రాధిక మాత్రమే తరుచుగా వ్రాస్తున్నారు. శైలజ అంగర మొదలుపెట్టటం ఐదు బ్లాగులు మొదలుపెట్టినా ఎక్కువగా వ్రాయటం లేదు.  లలిత గారయితే తన బ్లాగుని పూర్తిగా మూసివేసారు.  తను ప్రస్తుతం తెలుగు పిల్లల కోసం ఓ వెబ్ సైటుని నడుపుతున్నారు.  అమూల్య కూడా ప్రస్తుతం వ్రాయటం లేదు.  స్వాతికుమారి గారు తన బ్లాగుకి కొద్ది రోజులు విరామమిచ్చినట్లున్నారు. 

2007 వరకు కాస్త నత్త నడక నడిచిన మహిళా బ్లాగులు 2007....2008 వచ్చేటప్పటికి పరుగు అందుకున్నాయి.  విభిన్న రంగాల నుండి వచ్చిన వారు--గృహిణులు, రచయిత్రులు, కవయిత్రులు, ఉద్యోగినులు, స్త్రీవాదులు, ఎందరెందరో బ్లాగులు మొదలుపెట్టారు.

నిడదవోలు మాలతి, స్వాతి శ్రీపాద, శ్రీవల్లీ రాధిక, రమ్య లాంటి రచయిత్రులు, సత్యవతి, కల్పన రెంటాల, కొండేపూడి  నిర్మల లాంటి స్త్రీవాదులు బ్లాగులు మొదలుపెట్టిన వారిలో ఉన్నారు.

అందరిలోకి చెప్పుకోవలసింది ఒంటిచేత్తో అవలీలగా ఏడు బ్లాగులు వ్రాస్తున్న జ్యోతి గారినే.  ఒక సామాన్య గృహిణి అసామాన్య బ్లాగరుగా మారి  సాధించిన విజయం ఇది.  తనని స్ఫూర్తిగా తీసుకుని బ్లాగులు మొదలుపెట్టిన వారు ఎందరో. తన ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే బ్లాగులు వ్రాయమని ప్రోత్సహించటమే కాదు, దానికి కావలసిన సాంకేతిక సహాయం కూడా అందిస్తుంటారు. ఎక్కడో పల్లెటూరు నుండి  తమ భావాలని పంచుకుంటున్న మహిళా బ్లాగర్లు కూడా వున్నారు

కొన్ని మహిళా బ్లాగుల గురించిన పరిచయం కింది టపాలలో చూడవచ్చు.
http://vareesh.blogspot.com/2008/09/blog-post_10.html
http://vareesh.blogspot.com/2008/09/blog-post_21.html

తెలుగులో తొలి మహిళా బ్లాగుల గురించి వివరాలు అందించిన తాడేపల్లి గారికి, సి.బి.రావు గారికి ధన్యవాదాలు.

Read more...

October 16, 2008

బ్లాగు ప్రయాణంలో నేను-సిరిసిరిమువ్వ



మీరు బ్లాగులోకం లోకి ఎలా ప్రవేశించారు అంటే సహజంగా సమాధానాలు ఇలా ఉంటాయి.....
మిత్రుల ద్వారా బ్లాగుల గురించి, కూడలి గురించి, లేఖిని గురించి తెలిసింది, అబ్బ ఎంచక్కా తెలుగులో ఎంత బాగా రాస్తున్నారో అని చదవటం మొదలెట్టి, మెల్లగా నేను కూడా బ్లాగటం మొదలెట్టా అనో, లేకపోతే అంతర్జాలంలో అనుకోకుండా ఒక రోజు తెలుగు బ్లాగులు కనపడ్డాయి, వాటిని చదవటం మొదలెట్టా, అవి చదివాక నాకు కూడా ఉత్సాహం వచ్చేసి తెలుగు మీద ప్రేమ పెల్లుబికి బ్లాగటం మొదలెట్టా, లేక ఈనాడులో బ్లాగుల గురించి వచ్చిన వ్యాసం చదివి ఉత్తేజం చెంది నేను కూడా బ్లాగు తెరిచా--ఇంచుమించి కాస్త అటూ ఇటూగా అన్ని సమాధానాలు ఇలాగే ఉంటాయి.

నేను మాత్రం బ్లాగుల మీద కాస్తంత అయిష్టతొ ఇంకాస్తంత ద్వేషంతో ఈ బ్లాగు బండి ఎక్కా! నిజం.. నేను బ్లాగు మొదలుపెట్టేటప్పటికి నాకు బ్లాగుల మీద ఉన్నది అయిష్టతే. అప్పటివరకు నేను ఒక్క బ్లాగు కూడా చదవలేదు, అసలు ఈ బ్లాగు ప్రపంచం గురించి ఆలోచించాలన్నా నాకు ఇష్టంగా ఉండేది కాదు. బ్లాగు రాయటం అంటే పనీపాటా లేనివాళ్ళు చేసే పని అన్న అభిప్రాయం ఉండేది. అసలు మన గురించి మనకు తోచింది మనమే రాసుకుని అది లోకం అంతా తెలిసేట్లు అంతర్జాలంలో పెట్టటం ఏంటి అనుకునేదాన్ని.

మా వారు, అదే చదువరిగా మీ అందరికి పరిచయం అయిన శిరీష్ కుమార్ గారు, 2005 నుండి బ్లాగులు రాస్తుండేవారు. బ్లాగులు రాయటానికి ముందునుండే వికీపిడియాలో చాలా విస్తృతంగా రాస్తుండేవారు. ఎంత విస్తృతంగా అంటే ఇంట్లో ఉన్నంత సేపు పగలూ రాత్రీ అదే పని. శని ఆదివారాలు అయితే పూర్తిగా దానికే అంకితం. నాకు అది చాలా విసుగ్గా ఉండేది. అప్పుడప్పుడు నువ్వు కూడా వికీపిడియాలో రాయవచ్చుగా అంటుండేవాళ్ళు. అసలు కంప్యూటర్ అంటేనే గిట్టని వాళ్ళకి ఇలాంటివి ఎలా ఎక్కుతాయి చెప్పండి. తను రాసే బ్లాగులు కూడా నేనసలు చూసేదాన్ని కాను. తను కూడా నా అనాసక్తిని గమనించి బ్లాగుల గురించి ఏం చెప్పేవారు కాదు.

2007 జనవరిలో నా ఆరోగ్యరీత్యా నేను ఉద్యోగం మానేసాను. అప్పుడు కాస్త కాలక్షేపంగా ఉంటుంది నువ్వు కూడా బ్లాగు మొదలుపెట్టు, ఏదో ఒకటి రాయి అంటుండేవారు. అసలు చెప్పటానికి మన దగ్గర విషయమేమన్నా ఉంటే కదా రాసేది అని నేనంత ఆసక్తి చూపించలేదు. దాదాపు అదే టైములో అనుకుంటా చదువరి, త్రివిక్రం గారు కలిసి పొద్దు అంతర్జాల పత్రిక మొదలుపెట్టారు. దాంట్లో జ్యోతి గారు సరదా శీర్షికలో వ్యాసాలు రాసేవారు. ఓ సారి జ్యోతి గారు రాసిన ఓ వ్యాసం చూపించి తన గురించి చెప్పి తను బ్లాగులు కూడా రాస్తారు అని చెప్పారు. అప్పుడు కూడా నాకు అంత ఆసక్తి అనిపించలేదు, ఆ వ్యాసం కూడా చదవలేదు. దానికి ముఖ్య కారణం నాకు ఏదైనా అంతర్జాలంలో చదవటం అంత ఆసక్తిగా ఉండేది కాదు. ఓ పుస్తకం పట్టుకుని హాయిగా పడుకుని పక్కన ఏ బఠాణీలో,మరమరాలో,కారప్పూసో పెట్టుకుని తింటూ చదువుకోవటంలో ఉండే ఆనందం కంప్యూటర్ ముందు కూర్చుని చదివితే ఉంటుందా!!ఇప్పటికీ నా ప్రాధాన్యత చేతిలో పుస్తకానికే.

సరే నీకు రాయాలనిపించినప్పుడే రాయి అని తనే నాకు ఒక బ్లాగు క్రియేట్ చేసారు. క్రియేట్ చేయటం వరకే తన పని, బ్లాగు పేరు కాని, బ్లాగు అడ్రస్సు కాని అన్నీ నేను పెట్టుకున్నవే. కాస్తంత అయిష్టత తోటే బ్లాగు మొదలుపెట్టా. మొదటి టపా ఫిబ్రవరి 22, 2007 నాడు రాసా. మొదటి టపా రాసేముందు మొదటిసారిగా కొంతమంది బ్లాగులు చదివా, చదవగానే బాగున్నాయే అనుకున్నా...ముఖ్యంగా విహారి గారి టపాలు నాకు చాలా నచ్చాయి, అలాగే పప్పు నాగరాజు గారివి, చరసాల ప్రసాదు గారివి కూడా. చరసాల గారి టపాలు బాగా వాడిగా వేడిగా ఉండేవి. ఒకరు హాస్యం, ఇంకొకరు సరసం, మరొకరు గరంగరం; ఎంత వైవిధ్యం అనుకున్నా!

నా టపా నేనెవరినో చెప్పకుండా రాసా. నేనెవరినో చెప్పాల్సిన అవసరం కూడా నాకు కనిపించలేదు. అసలు ఎందుకు చెప్పాలి! మనం రాసేవి నచ్చితే చదువుతారు లేకపోతే లేదు అన్న భావన నాది. నాకంటూ ఓ చిన్నపాటి గుర్తింపు వచ్చాకే నేనెవరినో చాలామందికి తెలిసింది. నేను మొదటి టపా రాసిన విషయం చదువరి గారికి కూడా తెలియదు. బ్లాగుకి పేరేం పెట్టానో, ఏ పేరుతో రాసానో ఏమీ తనకి చెప్పలేదు. నేను ఒక టపా రాసాను నా బ్లాగు ఏ పేరుతో ఉందో కనుక్కో అన్నా, అంతే రెండే రెండు నిమిషాలలో గూగిలించి చెప్పేసారు. అలా నా బ్లాగు ప్రస్థానం మొదలయ్యింది.

ఇక ఈ బ్లాగు బండి ఎక్కాక ఓ కొత్త లోకంలోకి వచ్చినట్లు అనిపించింది. గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యారు. నాకు తెలియని ఎన్నో విషయాలు, పుస్తకాలు, వ్యక్తుల గురించి తెలిసింది. అసలు పట్టుమని నాలుగు అక్షరాలు రాయటమే గగనం అయిపోయిన నేటి కాలంలో బ్లాగు పుణ్యమా అని నాకు భాష మీద పట్టు పెరిగింది. కొత్త కొత్త (నాకు) తెలుగు పదాల అందాలు, వాటి వాడుక గురించి తెలిసింది. బ్లాగులో నాకు నచ్చిన మరొక విషయం ఏమిటంటే "ఇక్కడ మనకు నచ్చింది స్వేచ్చగా రాసుకోవచ్చు. ఎలాంటి నియమాలు, నిష్ఠలు, ముందస్తు ఒప్పందాలు, చావు గీతలు, లక్ష్మణ రేఖలు ఉండవు. మనం తప్పులు రాసినా ముద్దుగా చెప్పేవాళ్ళే కాని విసిరిగొట్టటాలు, గోడ కుర్చీలు, ఇంపొజిషన్సు ఉండవు".

నాకు బ్లాగులు రాయటం కన్నా చదవటం ఎక్కువ ఇష్టం, అలా ఆని అదేం వ్యసనంగా మారలేదు. ఒక్కోసారి రోజుల తరబడి బ్లాగులవంక కన్నెత్తి కూడా చూడను. మధ్యమధ్యలో బ్లాగుల నుండి సుదీర్ఘ విశ్రాంతి తీసుకుంటుంటాను. రాయటం కోసం రాయను రాయాలనిపించినప్పుడు రాస్తాను. అసలు బ్లాగు అంటే పర్సనల్ డయరీ అన్న అర్థాన్ని మార్చాలేమో. "డయరీ అంటే మన వ్యక్తిగతం గురించి గుప్తంగా ఉంచేది, కాని బ్లాగు అనేది ఓ తెరిచిన నోటు పుస్తకం లాంటిది. ఆ పుస్తకాన్ని ఎవరైనా చదవవచ్చు, తప్పులు దిద్దవచ్చు, సలహాలు ఇవ్వవచ్చు, సంప్రదింపులు చేయవచ్చు".

విభిన్న వ్యక్తులు, విభిన్న రకాల బ్లాగులు---అంతరంగాలు, స్వగతాలు, మార్గదర్శకాలు, విశ్లేషణలు, కబుర్లు, కవితలు, రుచులు, అభిరుచులు, అర్థవంతమైన చర్చలు, వాదోపవాదాలు, పొగడ్తలు, తెగడ్తలు, అలకలు, నిరసనలు, తరాల అంతరాలు, విరమణలు....అన్నిటి కలబోత ఈ బ్లాగు ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతి మజిలీ ఓ మధురానుభూతే. ప్రయాణం నచ్చలేదా మధ్యలో దిగిపోవచ్చు. ఈ బ్లాగు బండిలోకి కొత్త కొత్త వ్యక్తులు ఎక్కుతూ ఉంటారు, కొంతమంది మద్యలోనే దిగిపోతూ ఉంటారు, కొంతమంది ఎక్కి దిగుతూ ఉంటారు, మరి కొంతమంది దిగి ఎక్కుతూ ఉంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా ఈ బ్లాగు బండి ప్రయాణం ఎత్తులు, పల్లాలు, మలుపుల మద్య నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. దానికి హద్దులు, అదుపులూ ఉండవు-ఉన్నదల్లా ఒక్కటే-తెలుగు భాష మీద ప్రేమ, మమకారం. అప్పుడప్పుడూ బండి పట్టాలు తప్పుతున్నట్లు అనిపించినా వెంటనే మరమత్తులు చేసి పట్టాల మీద సరిగ్గా నిలబెట్టే సహృదయులున్నంతవరకు ఈ ప్రయాణం రసరమ్యభరితంగా సాగిపోతూనే ఉంటుంది.

ఈ లోకంలో మనం చెప్పేది నోరెత్తకుండా వినేది మన బ్లాగే:).
అయ్యో మనసులోని మాటని పంచుకోవటానికి ఎవరూ లేరే అన్న బెంగ ఇక లేదు, ఒక్క నిమిషంలో మన మాటని వందలమంది మనస్సులలోకి చేరుస్తుంది. అంతే కాదు తను విన్నవి జాగ్రత్తగా దాచిపెట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి మనకు వినిపిస్తుంది. "అది మాట్లాడకు ఇది మాట్లాడకు అంటూ ఆంక్షలు పెట్టదు, ఏంటా మాటలు అంటూ సాధించదు, ఇలానే మాట్లాడు అంటూ ఆజ్ఞాపించదు. మన మనసెరిగిన నేస్తం మన బ్లాగు".

బ్లాగులు చదవండి-బ్లాగులు చదివించండి
బ్లాగులు రాయండి-బ్లాగులు రాయించండి
తెలుగు భాషని పునరుత్తేజితం చేయండి
ఎవరు రాసారన్నది కాక ఏం రాసారన్నది చూడండి.

జై తెలుగు బ్లాగులు..జై జై తెలుగు బ్లాగులు...జై జై జై తెలుగు బ్లాగులు....జైహింద్.

Read more...

September 21, 2008

ఆడ బ్లాగుల్లో సోదే ఉంటుందా--రెండవ భాగం

ఇది నా ముందు టపా "ఆడ బ్లాగుల్లో సోదే ఉంటుందా" కి పొడిగింత. ఇంతకు ముందు ఎక్కువమంది కళ్ళపడని మరియు సరికొత్తగా కొంగొత్తగా మన ముందుకి వచ్చిన మరి కొన్ని మహిళా బ్లాగుల్ని కూడా చూద్దామా! ఇవి కూడా వేటికవే విభిన్నమైనవే.

కాస్కో నా వాస్కోడిగామా....అమ్మో ఇదేంటి అనుకుంటున్నాలా, అదే మలి మీలే చూడండి
. ఈ పిల్లకి ర పలకదంట మలి.

అందరిలాగానే మమూలు మనిషిని, కొంచం అల్లరి, కొంచం కోపం, కొంచం అలోచన, ఇంక నాకే తెలియని ఎన్నో కోణాలతో-- అంటూ మన ముందుకు వచ్చిన మరో బ్లాగరి నేను-లక్ష్మి.

ఓనమాలు లలిత గారిని గుర్తుకు తెస్తూ లలిత లలితంగా మొదలైన ఇంకొక బ్లాగు నా స్పందన.

దేవుడికి అరటిపండు ఎందుకు సమర్పిస్తారు? భక్తుడు గొప్పా, భగవంతుడు గొప్పా? ఇలాంటి గొప్ప గొప్ప లాజిక్కులు ఉండే బ్లాగు మీకు ఎక్కడైనా ఎదురయ్యిందా? మనమరాలిని ముందు పెట్టుకుని ఒక అమ్మమ్మ పొడుస్తున్న పొడిస్తే నవ్వులు విడిస్తే నవ్వులు చూడండి
.

2006 నుండి బ్లాగు రాస్తున్నా నేను అనామికను అంటున్న ఝాన్సీ బ్లాగు కూడా ఒకసారి చూడండి
.

మన మహిళా బ్లాగర్లలో చాలామంది రచయిత్రులు, జర్నలిస్టులు కూడా ఉన్నారండోయ్.

మహార్ణవం పేరుతో కథలు కవితలు రాస్తున్న శ్రీవల్లీ రాధిక గారు బ్లాగరుగా కొత్తే కాని వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో, ఈమాట లాంటి అంతర్జాల పత్రికలో వచ్చాయి. ..న కథలు కొన్ని హిందీ, తమిళ్, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి.

ఆంధ్రజ్యోతిలో ఫీచర్సు రాసే అరుణ గారికి కూడా ఒక బ్లాగు ఉంది, మరి ఆ అరుణంని కూడా ఒకసారి చూడండి.

ఏం చేయాలో అర్థం కావటం లేదంటూ ఒక జర్నలిస్టు రాస్తున్న బ్లాగు కొత్తగా మొదలయింది చూడండి.


తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం ఉన్న వారికైనా మంచి కథల రచయితగా చిరపరిచితుడయిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.
--ఆయన కథల్ని,కవితల్నిఅనువదిస్తున్న స్వాతి శ్రీపాద గారి గురించి మీకు తెలుసా! తను ఒకటి కాదు రెండు కాదు మూడు బ్లాగులు రాస్తున్నారు. స్వయంగా రచయిత్రి అయిన స్వాతి గారి కవితలు,కథలు ఈమాట,పొద్దు లాంటి అంతర్జాల పత్రికలలోనూ,విపుల లాంటి కథల పుస్తకాలలోనూ వచ్చాయి. అంతర్జాతీయ వేదికలపై కవితాపఠనం చేసిన అనుభవం కూడా స్వాతి గారికి ఉంది.

ఇంకా నాకు తెలియని మహిళా బ్లాగర్లు ఎవరైనా ఉంటే వారి గురించి కూడ తెలియచేస్తే ఇందులో పొందుపరుస్తాను.

Read more...

September 16, 2008

ఆడ బ్లాగుల్లో సోదే ఉంటుందా?

ఆడ బ్లాగుల్లో సోది ఎక్కువా?? అసలు సోది అంటే???

ఎవరైనా బ్లాగు రాసేది తమ ఆలోచనలు, జ్ఞాపకాలు, అభిరుచులు మొదలైనవి దాచుకోవటానికి, ఇతరులతో పంచుకోవటానికి. మన జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు అంటే అక్కడ మన వ్యక్తిగత జీవితమే ఎక్కువగా ప్రతిభింబిస్తుంది. నిత్య జీవితంలో జరిగే విశేషాలనే కొంతమంది కాస్త హాస్యం కలిపి -జనాలకి నచ్చే విధంగా చెపుతుంటారు. మనసులో మాట సుజాత గారి బ్లాగు కొద్దికాలంలోనే పేరు తెచ్చుకోవటానికి ముఖ్యకారణం ఇదే. అసలు ఓ టపా చదివేటప్పుడు అందులో విషయం గురించే ఆలోచిస్తాం కాని ఆ బ్లాగరు వయస్సు ఎంత? రూపం ఎలా ఉంటుంది అని ఆలోచించి చదువుతామా?

బ్లాగుల్లో వ్యక్తిగత జీవితం గురించిన ఆలోచనలు, అనుభవాలు, జ్ఞాపకాలు--వీటి గురించి చెప్పే బ్లాగులే ఎక్కువ. అసలు వ్యక్తిగత జీవితం గురించి ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో చెప్పని బ్లాగు ఒక్కటి కూడా ఉండదేమో! అవి అందరికి నచ్చాలని కూడా ఏమి లేదు. ఏదైనా చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. ఒకరికి సోది అనిపించింది ఇంకొకరికి ఆసక్తికరంగా ఉండొచ్చు. లోకోభిన్నరుచి కదా. నాకు కవితలు అంతగా తలకెక్కవు, కొంతమందికి అవంటే ప్రాణం, కొంతమందికి టెక్నికల్ బ్లాగులు ఓ పట్టాన కొరుకుడు పడవు, కొంతమంది రాజకీయాలంటే ఆమడ దూరంలో ఉంటారు--ఏదైనా మన అభిరుచులని బట్టి మన ఇష్టాయిష్టాలనిబట్టి మనం ఎలాంటి టపాలని ఇష్టపడతామో ఉంటుంది కాని అది ఆడవాళ్ళు రాసారా మగవాళ్ళు రాసారా, అమ్మాయిలు రాసారా అమ్మమ్మలు రాసారా అన్నదాన్ని బట్టి కాదు. అవి మనకి నచ్చితే చదువుకోవటం లేకపోతే వదిలేయటమే. మనకోసం మన అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ బ్లాగులు రాయరు అన్నది కాస్తంత గుర్తుపెట్టుకుంటే చాలు.

ఈ మద్య తెలుగులో వచ్చిన బ్లాగుల్లో అనతికాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న వాటిల్లో ఆడవారివే ఎక్కువ. ఆ బ్లాగుల్లో ఏం రాస్తున్నారో అవి ఎంత వైవిధ్యంగా ఉంటున్నాయో ఒక్కసారి చూద్దాం.

నిడదవోలు మాలతి గారి తెలుగు తూలిక--సాహిత్యానికి పట్టుగొమ్మ ఈ బ్లాగు. చక్కటి హాస్యంతో మనతో ఎదురుగా నిలబడి చెపుతున్నట్లుండే కబుర్లు, కథలు ఈ బ్లాగరి స్వంతం. అసలు ఈ బ్లాగు లేకపోతే ఆవిడ గురించి మనలో చాలామందికి తెలిసి ఉండేది కాదు.

గేయాలు, పద్యాలు, అనుభవాలు, కవితలు, ఆశీస్సులు, దండకాలు, ఆటలు-ఒక్కటేంటి అన్నిటిని గురించి ఔపాసన పట్టిన ఓ అనుభవజ్ఞురాలు రాస్తున్న మరో ఆణిముత్యం లాంటి బ్లాగు జ్ఞానప్రసూన గారు రాస్తున్న సురుచి--మంచి మంచి రుచులు చూపించే బ్లాగు.

కొత్తపాళీ గారు పెట్టే కథల పోటీ గురించి మీకందరికి తెలిసే ఉంటుంది. అందులో మొదటి రెండు సార్లు బహుమతి కొట్టేసింది ఎవరో మీకు తెలుసా? ఆ ఆ..... మీకు తెలుసని నాకు తెలుసు. తను రాసేది తక్కువే అయినా రమ్యంగా రాస్తారు. కథలు రాయటమే కాదు పుస్తకాల గురించి, సినిమాల గురించి, టి.వి. సీరియల్స్ గురించి చక్కటి సమీక్షలు రాస్తుంటారు. అసలు ఆదివారం సెలవెందుకు? తనని అడగండి ఎందుకో చెపుతారు.

కాళ్ళాగని కాలపు అలలలో మనసు ఊహలు కొట్టుకుపోకుండా, ఈ బ్లాగులో ఊసులుగా పదిలపరచ ప్రయత్నం!! పూర్ణిమ చెప్పే ఈ ఊసుల కోసం ఎదురుచూడని వాళ్లు ఎవరు? టపా టపాకి మంచి పరిణితితో తనదైన శైలిలో వినూత్నంగా సాగుతున్న బ్లాగు ఇది. అందరిని ఆకట్టుకునే పుస్తక సమీక్షలు--- కాదు కాదు విశ్లేషణలు-- ఈ బ్లాగు ప్రత్యేకత.

బుజబుజ రేకుల పిల్లని, బుజ్జా రేకుల పిల్లని, బ్లాగేబ్లాగే పిల్లని అంటూ మీనాక్షి రాసే బ్లాగు ఎంత అల్లరల్లరిగ ఉంటుందంటే తను బ్లాగులోకంలో మరో విహారి అయిపోయింది. ఈ బ్లాగులో ఉండే ప్రాసలు, సెటైర్లు, విరుపులు, యాసలు తనకే ప్రత్యేకం.

నా గురించి..... చెప్పటం సులువు కాదు. అర్థం చేసుకోవటం కష్టం కాదు అంటూ మోహన పేరుతొ విశాల రాసే విశాల ప్రపంచం పేరుకి తగ్గట్లే షాయరీల దగ్గరినిండి వేదాంతం దాకా అన్ని తనలో పొదుపుకుంది. తనగురించి తన మాటలలోనే చదవండి--"ఎలాంటి topic లో అయినా ఇట్టే ఇమిడిపోతాను. Spirituality, Philosophy, Psychology, Mathematics, Physics, Social issues, movies, Arts, Languages, Cricket, ఇంటి పని, వంట పని... ఇలా దేని గురించైనా మాట్లాడేస్తుంటాను".

బ్లాగువనమది అందరిది..ఈ పోస్టులు అందరి కోసములే.....కొన్ని కలలు, కొన్ని ఆశలు, కొంచెం అల్లరి, కొంచెం కోపం, కొంచెం ప్రేమ, కొంచెం బాధ కలిపితే నేను..ఒక మామూలు తెలుగు అమ్మాయిని అంటూ బ్లాగువనం లో పాదుకున్న మరో కొంటె కోణంగి విద్య. అల్లరే కాదు చక్కటి కవితలు అల్లగలదు, అంతే చక్కగా కథలు, సినిమా కబుర్లు చెప్పగలదు. తన భయాలు,బెంచి కష్టాలు, మొదలైన వాటి గురించి చెప్పి మనల్ని హడలగొట్టేయనూ గలదు, కాస్త జాగ్రత్త.

అప్పుడు ఏమి జరిగిందంటే అంటూ కబుర్లు చెప్పే క్రాంతి గురించి తను చెప్పే కబుర్ల గురించి తెలియని వారెవ్వరు! తలనెప్పి నివారణకు మంచి మందు ఈ బ్లాగు చదవటం. మంచి హాస్యంతో అలరాడే బ్లాగులో ఇది ఒకటి.

మనకి తెలియని ఎన్నో ఆరోగ్యసూత్రాలని పరిచయం చేస్తూఅమరవాణి రాస్తున్న బ్లాగు. ఆయుర్వేద అభిమానులే కాదు ప్రతి ఒక్కరు చదవవలిసిన బ్లాగు ఇది.

ఇక రాజకీయాలు, సంగీతం, సాహిత్యం, పురాణాలు, సాంకేతికాలు, హైకూలు...ఇలా వైవిధ్యమయిన విషయాల గురించి ఎంతో అలవోకగా మేధ రాసే నాలో నేను కి ఎంతమంది అభిమానులో!

జాజుల జావళీలతో, అందమైన ప్రేమలేఖలతో , కథలతో మనతో ఊసులాడే ఒక జాబిలి . కవిత్వం అంటే తెలియని వాళ్ళని కూడా తన అభిమానులుగా చేసుకున్న ఓ night queen.

నాలో మెదిలే కన్నీటి అలలూ.. నాలో కరిగే పన్నీటి కలలూ.. నాలో రగిలే ఆలోచనల జ్వాలలూ.. వీటన్నింటి అక్షర రూపమే....కలలో...కన్నీటి అలలో అంటు తన కలలు, కవితలు, జ్ఞాపకాలు మనతో పంచుకోవటానికి వచ్చిన ఓ సరికొత్త బ్లాగు, మీరందరూ చూసే ఉంటారు.

ఈ సంవత్సరం వచ్చిన మరొక వైవిధ్యమైన బ్లాగరు గడ్డిపూల సుజాతగా అందరికి పరిచయమయిన సుజాత . తను మూడు బ్లాగులు రాయటం ఓ విశేషమయితే అవి దేనికదే వైవిధ్యంగా ఉండటం మరొక ప్రత్యేకత. -- గడ్డిపూలు లో రాజకీయాలు, సాహిత్యం, సినిమాలు, క్రీడలు, అణుఒప్పందం, తీవ్రవాదం, ఐ.ఈ.డీ లు(Improvised Explosive Devices), స్త్రీవాదం...... ఒక్కటేమిటి తను విశ్లేషించని విషయం అంటూ ఉండదు.

తన ఇంకొక బ్లాగు శ్రీనివాసం లో ప్రసిద్ధ కీర్తనలు భజనలు భావాలతో సహా ఏర్చి కూర్చి పెడుతున్నారు.

ఇక తన ఇంగ్లీషు బ్లాగు spice and chocolate.

మా అమ్మ నాకే కాక నా బ్లాగుకి కూడా పేరెట్టింది అంటూ మన ముందుకి వచ్చిన తొలి తెలుగు బడిబ్లాగరు గుర్తుందా? తెలుగు మాట్లాడటమే తప్పు అనుకునే ఈ కాలంలో చక్కటి తెలుగులో ఓ తొమ్మిదో తరగతి చదివే అమ్మాయి బ్లాగు రాయటం చాలా ఆనందకరమైన విషయం కదూ!

గుండె గొంతుకలోన కొట్టాడుతుంది గొంతు దాటి అది రానంటోంది అంటూ తన మనసులోని మాటని మనకి వినిపించాలని ఆరాటపడే రమణి గారి బ్లాగు---కందిపచ్చడితో బ్లాగులోకాన్ని ఓ ఊపు ఊపిన బ్లాగు.

ఈ మధ్య బ్లాగు లోకంలో చర్చలు, చలోక్తులు, వాగ్వివాదాలు, సెటైర్లతో సందడి సందడి చేస్తున్న బ్లాగు--అబ్బో ఆ మాత్రం మాకు తెలీదంటారా?? నేను చెప్పేది అదే మరి--- పరిచయం అక్కర్లేని బ్లాగు.

ఈ మధ్య మొదలైన మరో చల్ల చల్లని హాట్ హాట్ బ్లాగు ప్రియ, వైష్ణవి కలిసి రాస్తున్న ప్రియరాగాలు. ఇందులో ప్రియ రాసేవే ఎక్కువ. తను రాముడి మీద రాసిన టపా రేపిన కలకలం అంతా ఇంతా కాదు. తన వాదాన్ని చాలా సాధికారతతో రాసిన టపా ఇది.

కమ్మటి సువాసనల తలపులు మన మనసులలో నింపే జాజి ఈ విరజాజి. కొంత సాహిత్యభిలాషా, కాస్త తెలుగు భాషపై మమకారమూ, మరి కొంత తెలుగు సంస్కృతి పై గౌరవమూ, కొద్దో గొప్పో తెలుగు జాతి పైన అభిమానమూ కలిగిన అచ్చ తెనుగు ఆడపడుచు రాస్తున్న సరికొత్త బ్లాగు.

అప్పుడప్పుడు అలా కనిపించి ఊసులు చెప్పే స్వాతి చక్రవర్తి బ్లాగు కూడా ఈ మధ్య వచ్చిన బ్లాగుల్లో ఒకటి.

ఇక స్త్రీవాద రచనలు చేసే కొండవీటి సత్యవతి, కొండేపూడి నిర్మల, కల్పన రెంటాల కూడా బ్లాగులు రాయటం మొదలుపెట్టి మహిళా బ్లాగులకి ఓ పరిపూర్ణత కల్పించారు.

ఎప్పటినుండో రాస్తున్న రాధిక, జ్యోతి, సౌమ్య, స్వాతికుమారి, పద్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.

కొంగొత్తగా వచ్చిన మరో నాలుగు బ్లాగుల్ని కూడా చూద్దామా!

కాస్కో నా వాస్కోడిగామా....అమ్మో ఇదేంటి అనుకుంటున్నాలా, అదే మలి మీలే చూడండి. ఈ పిల్లకి ర పలకదంట మలి.

మహార్ణవం పేరుతో కథలు కవితలు రాస్తున్న శ్రీవల్లీ రాధిక గారు బ్లాగరుగా కొత్తే కాని వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో, ఈమాట అంతర్జాల పత్రికలో వచ్చాయి. తన కథలు కొన్ని హిందీ, తమిళ్, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి.

అందరిలాగానే మమూలు మనిషిని, కొంచం అల్లరి, కొంచం కోపం, కొంచం అలోచన, ఇంక నాకే తెలియని ఎన్నో కోణాలతో-- అంటూ మన ముందుకు వచ్చిన మరో బ్లాగరి నేను-లక్ష్మి.

ఓనమాలు లలిత గారిని గుర్తుకు తెస్తూ లలిత లలితంగా మొదలైన ఇంకొక బ్లాగు నా స్పందన.

ఇందుగలరందులేరని సందేహం వలదు, ఎందెందు చూసినా మహిళలే కనిపించు. నాకు తెలియని తెలుగు మహిళా బ్లాగర్లు మరి కొందరు ఉండి ఉండవచ్చు, వారందరికి కూడా నా అభినందనలు మరియు ఆశీస్సులు.

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP