పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
Showing posts with label అభిప్రాయాలు. Show all posts
Showing posts with label అభిప్రాయాలు. Show all posts

September 29, 2014

నలభై వసంతాల చెలిమికి వీడ్కోలు..

తెలుగు వార్తా పత్రికల చరిత్రలో  ఒక అధ్యాయం సృష్టించి....వార్తల ప్రచురణలో కొత్త పుంతలు తొక్కి...ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా..ఎప్పుడు పేపరు చదువుదామా అనేట్లు చేసి ..గత నలభై సంవత్సరాలుగా అశేష ప్రజాదరణని సొంతం చేసుకుని తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రిక గా చరిత్ర సృష్టించిన ఓ ఈనాడు పత్రికా రాజమా నీకిక వీడ్కోలు.

నాకు ఊహ తెలిసేటప్పటికే నువ్వు ఉన్నావు.  నేను పేపరు చదవటం మొదలుపెట్టింది నీతోనే! 1974 లో తెలుగు పాఠకుల లోగిళ్ళల్లోకి ఉషా కిరణాలతో పోటీ పడి నువ్వు రావటం మొదలుపెట్టిన లగాయితూ ప్రవాసంలో ఉన్నప్పుడు తప్ప నిన్ను చూడకుండా ఉన్న రోజు లేదు. e-పేపరు వచ్చినా నిన్ను చేత్తో పట్టుకుని..తడిమి తడిమి చూసుకుంటూ "ఇదీ సంగతి" లో ఈ రోజు శ్రీధర్ ఏ కార్టూన్ వేసాడా అని ముందు చూసి...ఒక్కో పేజీ చదువుకుంటూ ఓ గంట సేపయినా నిన్ను ఆస్వాదించందే రోజు మొదలయ్యేది కాదు.

నీ రాక కోసం..నువ్వు రాగానే నిన్ను చదవటం కోసం ఇంటిల్లిపాదీ పోటీ పడేవాళ్ళం.  తెలుగు పత్రికా లోకంలో మొట్టమొదటి సారిగా జిల్లా సంచికలని..ఆదివారం అనుబంధాలని ప్రవేశ పెట్టిన ఘనత నీదే! ప్రతి జిల్లా నుండి పత్రికా ప్రచురణ మొదలుపెట్టిన ఘనతా నీదే! ఇతర రాష్ట్రాలనుండి ఓ తెలుగు పత్రిక ప్రచురించబడటం కూడా నీతోనే మొదలు అనుకుంటాను! మహిళల కోసం వసుంధర అని ప్రత్యేకంగా ఓ పేజీనే ప్రారంభించావు.  పేపరు క్వాలిటీ కాని, భాష కానీ, వార్తా శీర్షికలు కానీ, ఆదివారం అనుబంధం, జిల్లా ఎడిషన్సు ప్రారంభించటంలో కానీ అన్నిటిల్లో ఓ ట్రెండ్ సెట్టర్ వి నీవు. జర్నలిజం కొత్త పుంతలు తొక్కిందీ నీతోనే! మాలాంటి భాషా ప్రేమికుల్ని వేరే పేపర్ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసిన ఘనతా నీదే!

చదువు, సుఖీభవ, ఛాంపియన్, eనాడు, సిరి, ఈతరం, స్థిరాస్థి..ఇలా వారంలో ఒక్కో రోజు ఒక్కో శీర్షికతో పాఠకులకు విలువైన సమాచారం అందిచటంలో నీకు నీవే సాటి అనిపించుకున్నావు.

ఆకట్టుకునే వార్తా శీర్షికలతో మమ్ముల్ని అలరించావు. కొన్ని శీర్షికలని చూడగానే మాలో ఆవేశం ఎగసిపడేది..రక్తం సల సలా మరిగేది. మరి కొన్ని శీర్షికలని చూడగానే విచక్షణ మేలుకునేది. నిష్పక్షపాతంగా సమకాలీన రాజకీయాలను విశ్లేషిస్తూ నువ్వు వ్రాసిన సంపాదకీయాలతో మా మనుసులని చూరగొన్నావు!

"పుణ్యభూమి", "కబుర్లు", "అక్షింతలు", "రాష్ట్రంలో రాజకీయం"...ఇలాంటి శీర్షికల ద్వారా ఎ.బి.కె ప్రసాదు, చలసాని ప్రసాద రావు, డి.వి. నరసరాజు, గజ్జెల మల్లారెడ్డి, బూదరాజు రాధాకృష్ణ లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయ భాగ్యం కలిగించావు.

తెలుగు భాష విస్తృతి కోసం నువ్వు ప్రచురించిన "తెలుగులో తెలుగెంత", "తెలుగు జాతీయాలు", "మాటల మూటలు", "మాటల వాడుక", "మాటలూ-మార్పులూ"..తెలుగు భాషకి మంచి డిక్షనరీల లాంటివి.  ఆదివారం "బాలవినోదిని" కి ముఖ్యంగా "పదవినోదం" కు పిల్లలతో పాటూ పెద్లలమూ అభిమానులం అయ్యాం!

ఓ ఆంధ్రుడి ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పి..తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్దణకు పుట్టిన ఓ ప్రాంతీయ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో నువ్వు ముఖ్య పాత్ర పోషించావు!
ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి అతి పెద్ద మహిళా ఉద్యమం అయిన సారా ఉద్యమానికి అండదండలుగా నిలిచి ఆ ఉద్యమానికి ఎనలేని ప్రచారం చేసి..మహిళల పక్షాన నిలిచిన నిన్ను ఎన్నటికీ మరువలేము! ఆ ఉద్యమం కోసం ఓ ప్రత్యేక పేజీనే కేటాయించావు.

ఏవీ ఇప్పుడు ఆ సంపాదకీయాలు! ఏవీ ఆ వార్తా శీర్షికలు! బూతద్దం పెట్టి వెతికినా ఈనాడులో  భాషాదోషాలు కనపడవు అనుకునే రోజులు పోయాయి. ముఖ్యంగా జిల్లా ఎడిషన్సు లో భాషా దోషాలు కోకొల్లలు. ఈ మాత్రం వార్తలకి..ఈ మాత్రం భాషకి ఈనాడే చదవాలా అని అనుకునేటట్టు చేస్తున్నావు. వార్తల్లో జీవం కనపడటం లేదు.  ఇదివరకటిలా వార్తలని ఆస్వాదించలేకపోతున్నాం

తెలుగు పత్రికా చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యామయిన ఈనాడు ఇక గత చరిత్రగా మిగిలిపోతుందేమో అని అనుమానం కలుగుతుంది.

పేపరు కుర్రాడితో వేయించుకుంటే నువ్వు రావటం ఆలస్యం అవుతుందని గత 15 సంవత్సరాలుగా డైరెక్టుగా ఈనాడు సంస్థ ద్వారానే నిన్ను పొందుతున్న మేము ఇక ఈ నెల నుండి నీకు సెలవు ప్రకటించేసాం.  ఇది బాధాకరమే కానీ తప్పటం లేదు.

నిన్ను ఇక అసలు చూడను అని చెప్పనులే! ఏదో అప్పుడప్పుడు నెట్టు లో e-పేపరు చూస్తూ ఉంటానులే!

ఇక సెలవు నేస్తం!

Read more...

August 8, 2011

ఆధార్ కార్డు నాకు నచ్చలేదు!

ఎన్నాళ్లనుండో ఎదురు చూస్తున్న ఆధార్ కార్డు మొన్ననే వచ్చింది. ఈ కార్డు రావటానికి మేము ఫోటోలు తీయించుకున్నాక ఖచ్చితంగా మూడు నెలలు పట్టింది.  ఇప్పుడు కూడా మా ఇంట్లో మా నలుగురిలోనూ ఇద్దరివే వచ్చాయి..మిగత ఇద్దరివి..నెట్టులో చూస్తే ఇంకా వివరాలు అందలేదు అని వస్తుంది. సరే ఎప్పటికో అప్పటికి అవి కూడా వస్తాయి కానీ అసలు నాకు ముందు కార్డు రూపురే్ఖలు నచ్చలేదు.

ఆధార్...సామాన్యుని హక్కు

కాప్షన్ బాగుంది కానీ...ఇకపై ఉప్పు కావాలన్నా..పప్పు కావాలన్నా..గాస్ కావాలన్నా..బ్యాంక్ అకౌంటు తెరవాలన్నా...  అన్ని నిత్యావసరాలకి ...దేనికయినా ఆధారం ఇదే...మీరు మీరే అనటానికి ఇకనుండి ఋజు పత్రం (identity proof) ఇదే అంటున్న ఈ కార్డు రూపురేఖలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఏదో కరపత్రం లాగా ఉంది కానీ కార్డు లాగా లేదు.


నందన్ నీలేకని ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాజెక్టు కనుక దీని గురించి నేను కాస్త ఎక్కువే   ఊహించుకున్నా..కానీ కార్డు చూడగానే నాకు చాలా నిరుత్సాహం కలిగింది.

ఇకపై భారత పౌరుల జీవితాలకి ఆధారం ఇదే అని ప్రభుత్వాలు ఎలుగెత్తి చెప్తున్న ఈ కార్డు చాలా పొడవుగా ఉంది...నాణ్యత కూడా అంతంత మాత్రమే. కాస్త మందపాటి గ్లేజ్‍డు పేపరు వాడారు.  కనీసం లామినేషన్ కూడా లేదు.



కింద పేరు.. ఆధార్ నంబరు వరకు మాత్రమే కార్డుగా ఉన్నట్లయితే బాగుండేది...మరి అక్కడ వరకు కత్తిరించి వాడుకోవచ్చేమో తెలియదు. మిగతా వివరాలన్నీ కార్డు మీద అవసరం లేదు కూడాను.

ఏది ఏమయినా జీవితాంతం మనతో ఉండాల్సిన ఈ కార్డు ఇలా ఉండటం నాకు అసలు నచ్చలేదు. ఈ కార్డు డిజైను చేసింది ఎవరో కానీ ఈ మాత్రం ఆలోచించలేదా అనిపించింది. దీనిని డిజైను చేసిన వాళ్లు, దానికి అనుమతి ఇచ్చిన వాళ్లు..దాన్ని అమలులోకి తీసుకొస్తున్న వాళ్లు..ఇంతమందిలో ఏ ఒక్కరూ కార్డు పోర్టబిలిటి గురించి కానీ దాని మన్నిక గురించి కానీ ఆలోచించినట్లు కనిపించటం లేదు.  ATM కార్డు లానో, క్రెడిట్ కార్డులానో...  ఓటరు కార్డులానో ..రేషను కార్డులానో ఇది కూడా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లటానికి అనువుగా నాణ్యంగా ఉంటే బాగుండేది.

ఓ సంతోషకరమైన విషయం ఏమిటంటే ఓటరు కార్డులో లాగా ఇందులో అచ్చు తప్పులు లేవు.  తెలుగు అక్షరాలు తెలుగు అక్షరాలా లాగానే చక్కగా ఉన్నాయి. పేర్ల తారుమారులు..తలల తారుమారులు...లింగాల తారుమారులు లేవు.  ఫోటోలు తీయించుకునేటప్పుడే పేరు... అడ్రస్సు...అన్నీ జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు సరిచూసుకుని అక్కడ డాటా ఎంట్రీ వాళ్ళకి తెలుగు అక్షరాలు ఎలా వ్రాయాలో క్లాసు పీకాం అనుకోండి:)

Read more...

January 27, 2010

అసలు ఆత్మ లేని ఫిర్ మిలే సుర్ మేరా తుమ్హారా!

 మిలే సుర్ మేరా తుమ్హారా ..........తలుచుకోగానే  గుండెలు ఉప్పొంగే గీతం!

రెండు దశాబ్దాల క్రితం 1988 ఆగస్టు 15 న దూరదర్శన్‌లో  వచ్చిన మిలే సుర్ మేరా తుమ్హారా..ఈ గీతం వినని భారతీయుడు.......పరవశించని భారతీయుడు ఉండి ఉండడు.  దేశం మొత్తాన్ని ప్రాంతాలకతీతంగా ఓ ఊపు ఊపిన గీతం.  అప్పట్లో ఆ గీతం వచ్చిన 6 నిమిషాలు అలా కళ్ళప్పగించి చూసేదాన్ని.  భీంసేన్ జోషి స్వరంతో మొదలయ్యి..అలా అలా గాలిలో తేలిపోయి ..చివరిగా పిల్లలు జాతీయ జండా ఆకారంలో నిలబడటంతో పాట అయిపోతుంది...అప్పుడే అయిపోయిందా అన్న ఓ అసంతృప్తితో కిందకి దిగివచ్చేదాన్ని.

దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఎప్పటికీ బారతీయుల గుండెల్లో చిరంజీవి ఆ గీతం!  ప్రసిద్ధ సినీ వ్యక్తులు, క్రీడారంగ ప్రముఖులు, నాట్య ప్రముఖులు, సంగీత ప్రముఖులే కాదు..సామాన్య మానవులకు కూడా పెద్ద పీట వేసి తీసిన గీతం అది.  పీయూష్ పాండే వ్రాసిన ఈ గీతం గురించి ఎంత చెప్పినా తక్కువే!  నాకు ఆ పాటలో ఓ కుర్రవాడు ఏనుగు మీద ఎక్కి లయబద్ధంగా ఊగుతూ పాడే బిట్టు చాలా చాలా ఇష్టం. 14 భాషలల్లో భారతదేశం ఆ మూల నుండి ఈ మూల దాకా ప్రాంతీయత ఉట్టిపడేట్టు చక్కని ప్రదేశాలల్లో తీసిన గీతం అది. 

అందులో తెలుగులో వచ్చే వ్యాక్యాలు
"నా స్వరమూ నీ స్వరమూ సంగమమై
 మన స్వరంగా అవతరించే"

ఈ తెలుగు వాక్యాలకు అప్పటి గీతంలో నటించింది పేరున్న వ్యక్తులు కాదు..కానీ చాలా సహజంగా అందంగా ఉంటారు ఆ జంట!

ఇప్పుడు మరలా గణతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆ గీతాన్ని చేతికొచ్చినట్లు మార్చి వ్రాసి....నోటికొచ్చినట్టు పాడి..దాన్ని ఏ కీలుకా కీలు విరిచేసారు. సినీప్రముఖులతో, జులపాల జుట్టులతో.... ర్యాప్, పాప్‌లతో నింపేసారు..వ్యాక్యాలని ముక్కలుముక్కలుగా విరిచి ఆ పాటని ఎన్ని హింసలు చిత్రవధలు పెట్టొచ్చో అన్నీ పెట్టేసారు. చిత్రీకరణలో నాకెక్కడా సహజత్వం కనిపించలేదు.  దీపికా పడుకొనే వేసుకున్న గౌను చూస్తే.......పాత దాంట్లో వాళ్ల నాన్న ప్రకాష్ పడుకొనే గుర్తొచ్చి తలవంచుకున్నా! లత మువ్వొన్నెల కొంగు ఉన్న చీర భుజాల చుట్టూ కప్పుకుని ఎంత హుందాగా పాడింది!  అలాంటి లతకి దీనిలో చోటు లేదు.  ఉందల్లా చొక్కా విప్పి కండలు చూపించే  సల్మాన్ ఖానుకు, షారుక్, అమీర్, బచ్చన్ కుటుంబ సభ్యులకు.....

ఆరంభం రెహమానుతో బాగానే ఉన్నా ఉన్నకొద్దీ అసహజత్వ పాళ్ళు ఎక్కువయి పోయాయి. అమితాబ్ మాటలు అస్సలు నప్పలేదు.  కొత్తదాంట్లో తెలుగు వ్యాక్యాలను మహేష్ బాబు మీద చిత్రీకరించారు..ఇంకో రెండు లైనులు కూడా కలిపారు..ఏం కలిపినా పాత దాని చార్మ్ దీనిలో లేదు.  దక్షిణాది నుండి మహేషు బాబు, విక్రం, మమ్ముట్టి, శోభన, జేసుదాస్, సూర్యలకి స్థానం కల్పించారు.  మొత్తం మీద వీళ్ల దృష్టిలో మన దేశంలో ప్రముఖ వ్యక్తులంటే సినీ నటులే అన్నట్టుగా ఉంది.  మిగతా రంగాలల్లో ప్రముఖులు పెద్దగా వీళ్ల కళ్లకి ఆనినట్లు లేరు.  ఓ కలాం, ఓ టాటా, ఓ లత, ఆశా, విప్రో ప్రేంజీ, నారాయణమూర్తి, మన బాలసుబ్రమణ్యం....ఇలాంటి వారు ఎవ్వరూ లేరు. 

ఒకందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది..ఈ రకంగా అన్నా పాత దాన్ని మరలా మనకు స్ఫురణకి తెచ్చి దాని గొప్పతనాన్ని మరోమారు మన కళ్లముందు నిలిపారు.

Read more...

December 10, 2009

ఇక మేమూ ప్రవాసాంధ్రులమే!!

ఏంటో ఇన్నాళ్లు తెలంగాణా వచ్చేది కాదులే అని గుండెల మీద చెయ్యేసుకుని కూర్చున్నాం.  తెలంగాణా వచ్చేసినట్టే అని ఓ పక్క తెలంగాణా ప్రజలు ఉత్సవాలు చేసేసుకుంటున్నారు..ఇంకొక పక్కేమో కోస్తా, రాయలసీమ వాళ్లు సమైక్యాంధ్ర అంటూ రోడ్లెక్కుతున్నారు. ఎప్పటికి తేలేనో ఈ విభజనలు....పునర్విభజనలు. అదేంటో నాకయితే ఈ విభజన గొడవలో ఎవరి వాదన విన్నా సమంజసంగానే అనిపిస్తుంది..ఇంతకీ నేనెటు వైపు!! అదే తేల్చుకోలేకుండా ఉన్నాను.

ఇంకొన్నేళ్లల్లో మేము కూడా ప్రవాసాంధ్రులం అయిపోతామన్నమాట.  ఇకపై అన్ని ప్రవాసాంధ్ర సంఘాలలో మేము కూడా సభ్యులమన్నమాట!  మున్ముందు హైదరాబాదు ప్రవాసాంధ్రుల సంఘం అనో, TAH (Telugu Association of Hyderabad) అనో , TAT (Telugu Association of Telangana) అనో ....AAH (Andhra Association of Hyderabad) అనో ..మరోటనో.......సంఘాలు పెడితే అందులో మేము కూడా సభ్యులమే!!.

ఇప్పుడు నా సమస్య ఏంటంటే..ఒకవేళ తెలంగాణా వస్తే గిస్తే....మేము....  అంటే గత 20-30 సంవత్సరాలుగా తెలంగాణాలో ఉన్నవాళ్లం....ఏ రాష్ట్రానికి చెందుతాం......పుట్టి పెరిగిన ఆంధ్రాకా?.....లేక స్థిరపడ్ద తెలంగాణాకా? సరే మేము ఆంధ్రాకే చెందుతామనుకుంటే మరి ఇక్కడే పుట్టి పెరిగిన మా పిల్లలో.....వాళ్ళు తెలంగాణా బిడ్డలా?  హత్తెరికి అయితే మా ఇంట్లో సగం మందిమి ఆంధ్రా.... సగం మందిమి తెలంగాణా అన్నమాట..భలే..భలే...సరే పుట్టిన గడ్డ మీద మమకారంతో అక్కడికే వెళ్లిపోదామా అంటే అక్కడ మా పిల్లలు నాన్ లోకల్ అయిపోతారు..మరి కింకర్తవ్యం??

తెలంగాణా ఇస్తే అటువైపు ప్రత్యేక రాయలసీమ ఇవ్వాలంట...ఇటు వైపు ఉత్తర కోస్తా ఇవ్వాలంట...మరి నట్టనడుమనున్న ఆంధ్రప్రదేశ్‌కి గుండెకాయలాంటి కృష్ణ, గుంటూరు ఏమయిపోవాలంటారు? ఒక్కో జిల్లాని ఒక్కో రాష్ట్రంగా చేస్తే సరి..మళ్లీ మళ్లీ దీక్షలు లేకుండా.....ప్రాణాలు పోకుండా!......ఓ పనయిపోతుంది!!

ఏంటో ఓ కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయేటప్పుడు అందరి అభిప్రాయాలు అడిగి అందరికి అమోదయోగ్యంగా ఆస్తుల విభజన చేసుకుని విడిపోతారు.....మరి  ఇప్పటివరకు ఈ విషయంలో మనలాంటి సామాన్య ప్రజల అభిప్రాయాన్ని ఎవ్వరయినా అడిగారా?

అసలు ప్రత్యేక రాష్ట్రం వస్తే ఎవరికి లాభం.  సామాన్యులకి ఒరిగేదేమన్నా ఉందా?  పెరిగిన ఉప్పులు పప్పుల రేట్లు ఏమయినా తగ్గుతాయా?

 ఈ గొడవలేమో కాని మా పిల్లలు ఊళ్లో చిక్కుకు పోయారు.  నిన్నటి దాక ఇక్కడ గొడవలు, కాలేజీలకి సెలవలని అక్కడున్నారు..సరే ఈ రోజుతో గొడవలు అయి పోయాయి, రేపటినుండి కాలేజిలు మొదలు కదా అని బయలుదేరి రమ్మంటే ఇప్పుడు అక్కడ గొడవలు.

Read more...

January 9, 2009

నిగ్గదీసి అడుగు......

సత్యంలో అంతా అసత్యమేనట.  మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే కష్టాలలో వున్న సాఫ్టువేర్ పరిశ్రమకి మరో దెబ్బ. ఇక్కడ నాకు అర్థం కాని విషయం--ఇలాంటివి బయటపడ్డప్పుడే మన పత్రికల వాళ్లు అంతకుముందు వున్న లోట్లు, లొసుగులు, జరిగిన మోసాలు, ఇత్యాది గురించి పేజీలకి పేజీలు కథనాలు ప్రచురిస్తుంటారు ఎందుకని?(investigative journalism అంటే ఇదే అంటారా!)  ఇవన్నీ ముందే బయటపెడితే  సామాన్య మానవుడు కాస్త జాగ్రత్తపడతాడుగా. అయినా ఇక్కడ సామన్యుడిని పట్టించుకునేది ఎవరంటారా? అదీ నిజమే.

ఆటోవాడు మీటరు వేయను నేను అడిగినంత ఇవ్వాల్సిందే అన్నప్పుడూ, తప్పుడు మీటరుతో ఎక్కువ డబ్బులు తీసుకున్నప్పుడూ, అరటిపళ్ల బండి వాడు డజను కాయలకి 10 కాయలే వేసి నన్ను మోసం చేయాలని చూసినప్పుడూ, పేపరు వాడు సరిగ్గా  పేపరు వేయకుండానే పేపరు బిల్లుకి వచ్చినప్పుడూ, పాలవాడు నిలవ వున్న (ముందు రోజువి) పాల పాకెట్లు వేసినప్పుడూ---చ లోకంలో అంతా మనల్ని మోసం చేయాలని చూసేవాళ్లే అని బాధపడిపోతుంటాను, వాళ్లని ఏదో చేయాలన్ని కసి, ఏమీ చేయలేని ఉక్రోషం, అస్సహాయత-కానీ ఇప్పుడు జరిగిన మోసం చూస్తుంటే ఇవన్నీ అసలు మోసాలే కాదు అనిపిస్తుంది.  వాళ్లు బ్రతకటానికి చేస్తుంటే వీళ్లు బ్రతక నేర్చి చేస్తున్న మోసం.

ఒకటి కాదు రెండు కాదు అక్షరాలా ఏడువేల కోట్ల రూపాయలకి దొంగ లెక్కలు. మరి ఇలాంటి మోసగాళ్లని ఏం చేయాలో! నే చేసింది తప్పే, అంతా నేనే చేసాను అని తప్పు ఒప్పేసుకుంటే సరిపోతుందా? అసలు ఇంత జరుగుతున్నా మూడోకంటికి తెలియకపోవటం ఏమిటి? మనింట్లో జమాఖర్చుల్లో ఓ పది రూపాయలు తేడా వస్తేనే మనకి నిద్ర పట్టదు  మరి అలాంటిది ఇన్ని కోట్లకి దొంగ లెక్కలు వేస్తుంటే అంత పెద్ద కంపెనీలో ఎవరికీ తెలియలేదా? మళ్లీ ఓ ప్రసిద్ధ విదేశీ కంపెనీ దాని లెక్కలు చూసేది.  వాళ్ల లెక్కలు వాళ్లే రాసుకునేప్పుడు దానికి ఇంకో కంపెనీ ఎందుకో? ఏంటో మనలాంటి వాళ్లకి అన్నీ ప్రశ్నలే! ఏది సత్యమో ఏది అసత్యమో అంతా అయోమయమే! అయినా మన ప్రశ్నలకి జవాబిచ్చేదెవరు?

సత్యం వాళ్లకున్న ఆస్తులు అన్నీ అమ్మితే ఈ కష్టాలనుండి బయటపడరంటారా? కానీ అమ్మరు! వాళ్ల కోట్లు వాళ్ల కోట్లలోనే వుండాలిగా మరి!! ఇవాళ సత్యం షేరు ధర ప్రారంభంలో ఆరు రూపాయలకు పడిపోయిందట! నిన్న మొన్నటి దాకా ఎవరైనా కలగన్నారా ఆ షేరు ఆ ధరలో లభిస్తుందని.  అదేంటో జనాలేమో రాజు గారు సత్యాన్ని గట్టెక్కించటానికి తన షేర్లు కూడా అమ్ముకున్నారు అని బాధపడిపోతున్నారు !  అప్పుడు కొనుక్కొన్న వాళ్ల గతి ఇప్పుడేంటి? ఇందులో లాభపడిందెవరు?నష్టపడిందెవరు? ఎంతమంది మదుపుదార్ల గుండెలు పగిలి వుంటాయి? మన ప్రశ్నలకి జవాబిచ్చేదెవరు?

సత్యం CFO వడ్లమాని శ్రీనివాస్ ఆత్మహత్యా ప్రయత్నం చేసారని మీడియా ప్రచారం చేస్తుంది, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇది కూడా  ఇంకో నాటకమా? మన ప్రశ్నలకి జవాబిచ్చేదెవరు?

ఇక్కడ నాకు గాయం సినిమాలో  సిరివెన్నెల పాట ఒకటి గుర్తుకొస్తుంది....

 నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం..మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమై పోనీ
మారదు లోకం..మారదు కాలం..||నిగ్గదీసి||

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం ..||నిగ్గదీసి||

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ..||నిగ్గదీసి ||

Read more...

September 21, 2008

ఆడ బ్లాగుల్లో సోదే ఉంటుందా--రెండవ భాగం

ఇది నా ముందు టపా "ఆడ బ్లాగుల్లో సోదే ఉంటుందా" కి పొడిగింత. ఇంతకు ముందు ఎక్కువమంది కళ్ళపడని మరియు సరికొత్తగా కొంగొత్తగా మన ముందుకి వచ్చిన మరి కొన్ని మహిళా బ్లాగుల్ని కూడా చూద్దామా! ఇవి కూడా వేటికవే విభిన్నమైనవే.

కాస్కో నా వాస్కోడిగామా....అమ్మో ఇదేంటి అనుకుంటున్నాలా, అదే మలి మీలే చూడండి
. ఈ పిల్లకి ర పలకదంట మలి.

అందరిలాగానే మమూలు మనిషిని, కొంచం అల్లరి, కొంచం కోపం, కొంచం అలోచన, ఇంక నాకే తెలియని ఎన్నో కోణాలతో-- అంటూ మన ముందుకు వచ్చిన మరో బ్లాగరి నేను-లక్ష్మి.

ఓనమాలు లలిత గారిని గుర్తుకు తెస్తూ లలిత లలితంగా మొదలైన ఇంకొక బ్లాగు నా స్పందన.

దేవుడికి అరటిపండు ఎందుకు సమర్పిస్తారు? భక్తుడు గొప్పా, భగవంతుడు గొప్పా? ఇలాంటి గొప్ప గొప్ప లాజిక్కులు ఉండే బ్లాగు మీకు ఎక్కడైనా ఎదురయ్యిందా? మనమరాలిని ముందు పెట్టుకుని ఒక అమ్మమ్మ పొడుస్తున్న పొడిస్తే నవ్వులు విడిస్తే నవ్వులు చూడండి
.

2006 నుండి బ్లాగు రాస్తున్నా నేను అనామికను అంటున్న ఝాన్సీ బ్లాగు కూడా ఒకసారి చూడండి
.

మన మహిళా బ్లాగర్లలో చాలామంది రచయిత్రులు, జర్నలిస్టులు కూడా ఉన్నారండోయ్.

మహార్ణవం పేరుతో కథలు కవితలు రాస్తున్న శ్రీవల్లీ రాధిక గారు బ్లాగరుగా కొత్తే కాని వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో, ఈమాట లాంటి అంతర్జాల పత్రికలో వచ్చాయి. ..న కథలు కొన్ని హిందీ, తమిళ్, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి.

ఆంధ్రజ్యోతిలో ఫీచర్సు రాసే అరుణ గారికి కూడా ఒక బ్లాగు ఉంది, మరి ఆ అరుణంని కూడా ఒకసారి చూడండి.

ఏం చేయాలో అర్థం కావటం లేదంటూ ఒక జర్నలిస్టు రాస్తున్న బ్లాగు కొత్తగా మొదలయింది చూడండి.


తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం ఉన్న వారికైనా మంచి కథల రచయితగా చిరపరిచితుడయిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.
--ఆయన కథల్ని,కవితల్నిఅనువదిస్తున్న స్వాతి శ్రీపాద గారి గురించి మీకు తెలుసా! తను ఒకటి కాదు రెండు కాదు మూడు బ్లాగులు రాస్తున్నారు. స్వయంగా రచయిత్రి అయిన స్వాతి గారి కవితలు,కథలు ఈమాట,పొద్దు లాంటి అంతర్జాల పత్రికలలోనూ,విపుల లాంటి కథల పుస్తకాలలోనూ వచ్చాయి. అంతర్జాతీయ వేదికలపై కవితాపఠనం చేసిన అనుభవం కూడా స్వాతి గారికి ఉంది.

ఇంకా నాకు తెలియని మహిళా బ్లాగర్లు ఎవరైనా ఉంటే వారి గురించి కూడ తెలియచేస్తే ఇందులో పొందుపరుస్తాను.

Read more...

September 16, 2008

ఆడ బ్లాగుల్లో సోదే ఉంటుందా?

ఆడ బ్లాగుల్లో సోది ఎక్కువా?? అసలు సోది అంటే???

ఎవరైనా బ్లాగు రాసేది తమ ఆలోచనలు, జ్ఞాపకాలు, అభిరుచులు మొదలైనవి దాచుకోవటానికి, ఇతరులతో పంచుకోవటానికి. మన జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు అంటే అక్కడ మన వ్యక్తిగత జీవితమే ఎక్కువగా ప్రతిభింబిస్తుంది. నిత్య జీవితంలో జరిగే విశేషాలనే కొంతమంది కాస్త హాస్యం కలిపి -జనాలకి నచ్చే విధంగా చెపుతుంటారు. మనసులో మాట సుజాత గారి బ్లాగు కొద్దికాలంలోనే పేరు తెచ్చుకోవటానికి ముఖ్యకారణం ఇదే. అసలు ఓ టపా చదివేటప్పుడు అందులో విషయం గురించే ఆలోచిస్తాం కాని ఆ బ్లాగరు వయస్సు ఎంత? రూపం ఎలా ఉంటుంది అని ఆలోచించి చదువుతామా?

బ్లాగుల్లో వ్యక్తిగత జీవితం గురించిన ఆలోచనలు, అనుభవాలు, జ్ఞాపకాలు--వీటి గురించి చెప్పే బ్లాగులే ఎక్కువ. అసలు వ్యక్తిగత జీవితం గురించి ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో చెప్పని బ్లాగు ఒక్కటి కూడా ఉండదేమో! అవి అందరికి నచ్చాలని కూడా ఏమి లేదు. ఏదైనా చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. ఒకరికి సోది అనిపించింది ఇంకొకరికి ఆసక్తికరంగా ఉండొచ్చు. లోకోభిన్నరుచి కదా. నాకు కవితలు అంతగా తలకెక్కవు, కొంతమందికి అవంటే ప్రాణం, కొంతమందికి టెక్నికల్ బ్లాగులు ఓ పట్టాన కొరుకుడు పడవు, కొంతమంది రాజకీయాలంటే ఆమడ దూరంలో ఉంటారు--ఏదైనా మన అభిరుచులని బట్టి మన ఇష్టాయిష్టాలనిబట్టి మనం ఎలాంటి టపాలని ఇష్టపడతామో ఉంటుంది కాని అది ఆడవాళ్ళు రాసారా మగవాళ్ళు రాసారా, అమ్మాయిలు రాసారా అమ్మమ్మలు రాసారా అన్నదాన్ని బట్టి కాదు. అవి మనకి నచ్చితే చదువుకోవటం లేకపోతే వదిలేయటమే. మనకోసం మన అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ బ్లాగులు రాయరు అన్నది కాస్తంత గుర్తుపెట్టుకుంటే చాలు.

ఈ మద్య తెలుగులో వచ్చిన బ్లాగుల్లో అనతికాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న వాటిల్లో ఆడవారివే ఎక్కువ. ఆ బ్లాగుల్లో ఏం రాస్తున్నారో అవి ఎంత వైవిధ్యంగా ఉంటున్నాయో ఒక్కసారి చూద్దాం.

నిడదవోలు మాలతి గారి తెలుగు తూలిక--సాహిత్యానికి పట్టుగొమ్మ ఈ బ్లాగు. చక్కటి హాస్యంతో మనతో ఎదురుగా నిలబడి చెపుతున్నట్లుండే కబుర్లు, కథలు ఈ బ్లాగరి స్వంతం. అసలు ఈ బ్లాగు లేకపోతే ఆవిడ గురించి మనలో చాలామందికి తెలిసి ఉండేది కాదు.

గేయాలు, పద్యాలు, అనుభవాలు, కవితలు, ఆశీస్సులు, దండకాలు, ఆటలు-ఒక్కటేంటి అన్నిటిని గురించి ఔపాసన పట్టిన ఓ అనుభవజ్ఞురాలు రాస్తున్న మరో ఆణిముత్యం లాంటి బ్లాగు జ్ఞానప్రసూన గారు రాస్తున్న సురుచి--మంచి మంచి రుచులు చూపించే బ్లాగు.

కొత్తపాళీ గారు పెట్టే కథల పోటీ గురించి మీకందరికి తెలిసే ఉంటుంది. అందులో మొదటి రెండు సార్లు బహుమతి కొట్టేసింది ఎవరో మీకు తెలుసా? ఆ ఆ..... మీకు తెలుసని నాకు తెలుసు. తను రాసేది తక్కువే అయినా రమ్యంగా రాస్తారు. కథలు రాయటమే కాదు పుస్తకాల గురించి, సినిమాల గురించి, టి.వి. సీరియల్స్ గురించి చక్కటి సమీక్షలు రాస్తుంటారు. అసలు ఆదివారం సెలవెందుకు? తనని అడగండి ఎందుకో చెపుతారు.

కాళ్ళాగని కాలపు అలలలో మనసు ఊహలు కొట్టుకుపోకుండా, ఈ బ్లాగులో ఊసులుగా పదిలపరచ ప్రయత్నం!! పూర్ణిమ చెప్పే ఈ ఊసుల కోసం ఎదురుచూడని వాళ్లు ఎవరు? టపా టపాకి మంచి పరిణితితో తనదైన శైలిలో వినూత్నంగా సాగుతున్న బ్లాగు ఇది. అందరిని ఆకట్టుకునే పుస్తక సమీక్షలు--- కాదు కాదు విశ్లేషణలు-- ఈ బ్లాగు ప్రత్యేకత.

బుజబుజ రేకుల పిల్లని, బుజ్జా రేకుల పిల్లని, బ్లాగేబ్లాగే పిల్లని అంటూ మీనాక్షి రాసే బ్లాగు ఎంత అల్లరల్లరిగ ఉంటుందంటే తను బ్లాగులోకంలో మరో విహారి అయిపోయింది. ఈ బ్లాగులో ఉండే ప్రాసలు, సెటైర్లు, విరుపులు, యాసలు తనకే ప్రత్యేకం.

నా గురించి..... చెప్పటం సులువు కాదు. అర్థం చేసుకోవటం కష్టం కాదు అంటూ మోహన పేరుతొ విశాల రాసే విశాల ప్రపంచం పేరుకి తగ్గట్లే షాయరీల దగ్గరినిండి వేదాంతం దాకా అన్ని తనలో పొదుపుకుంది. తనగురించి తన మాటలలోనే చదవండి--"ఎలాంటి topic లో అయినా ఇట్టే ఇమిడిపోతాను. Spirituality, Philosophy, Psychology, Mathematics, Physics, Social issues, movies, Arts, Languages, Cricket, ఇంటి పని, వంట పని... ఇలా దేని గురించైనా మాట్లాడేస్తుంటాను".

బ్లాగువనమది అందరిది..ఈ పోస్టులు అందరి కోసములే.....కొన్ని కలలు, కొన్ని ఆశలు, కొంచెం అల్లరి, కొంచెం కోపం, కొంచెం ప్రేమ, కొంచెం బాధ కలిపితే నేను..ఒక మామూలు తెలుగు అమ్మాయిని అంటూ బ్లాగువనం లో పాదుకున్న మరో కొంటె కోణంగి విద్య. అల్లరే కాదు చక్కటి కవితలు అల్లగలదు, అంతే చక్కగా కథలు, సినిమా కబుర్లు చెప్పగలదు. తన భయాలు,బెంచి కష్టాలు, మొదలైన వాటి గురించి చెప్పి మనల్ని హడలగొట్టేయనూ గలదు, కాస్త జాగ్రత్త.

అప్పుడు ఏమి జరిగిందంటే అంటూ కబుర్లు చెప్పే క్రాంతి గురించి తను చెప్పే కబుర్ల గురించి తెలియని వారెవ్వరు! తలనెప్పి నివారణకు మంచి మందు ఈ బ్లాగు చదవటం. మంచి హాస్యంతో అలరాడే బ్లాగులో ఇది ఒకటి.

మనకి తెలియని ఎన్నో ఆరోగ్యసూత్రాలని పరిచయం చేస్తూఅమరవాణి రాస్తున్న బ్లాగు. ఆయుర్వేద అభిమానులే కాదు ప్రతి ఒక్కరు చదవవలిసిన బ్లాగు ఇది.

ఇక రాజకీయాలు, సంగీతం, సాహిత్యం, పురాణాలు, సాంకేతికాలు, హైకూలు...ఇలా వైవిధ్యమయిన విషయాల గురించి ఎంతో అలవోకగా మేధ రాసే నాలో నేను కి ఎంతమంది అభిమానులో!

జాజుల జావళీలతో, అందమైన ప్రేమలేఖలతో , కథలతో మనతో ఊసులాడే ఒక జాబిలి . కవిత్వం అంటే తెలియని వాళ్ళని కూడా తన అభిమానులుగా చేసుకున్న ఓ night queen.

నాలో మెదిలే కన్నీటి అలలూ.. నాలో కరిగే పన్నీటి కలలూ.. నాలో రగిలే ఆలోచనల జ్వాలలూ.. వీటన్నింటి అక్షర రూపమే....కలలో...కన్నీటి అలలో అంటు తన కలలు, కవితలు, జ్ఞాపకాలు మనతో పంచుకోవటానికి వచ్చిన ఓ సరికొత్త బ్లాగు, మీరందరూ చూసే ఉంటారు.

ఈ సంవత్సరం వచ్చిన మరొక వైవిధ్యమైన బ్లాగరు గడ్డిపూల సుజాతగా అందరికి పరిచయమయిన సుజాత . తను మూడు బ్లాగులు రాయటం ఓ విశేషమయితే అవి దేనికదే వైవిధ్యంగా ఉండటం మరొక ప్రత్యేకత. -- గడ్డిపూలు లో రాజకీయాలు, సాహిత్యం, సినిమాలు, క్రీడలు, అణుఒప్పందం, తీవ్రవాదం, ఐ.ఈ.డీ లు(Improvised Explosive Devices), స్త్రీవాదం...... ఒక్కటేమిటి తను విశ్లేషించని విషయం అంటూ ఉండదు.

తన ఇంకొక బ్లాగు శ్రీనివాసం లో ప్రసిద్ధ కీర్తనలు భజనలు భావాలతో సహా ఏర్చి కూర్చి పెడుతున్నారు.

ఇక తన ఇంగ్లీషు బ్లాగు spice and chocolate.

మా అమ్మ నాకే కాక నా బ్లాగుకి కూడా పేరెట్టింది అంటూ మన ముందుకి వచ్చిన తొలి తెలుగు బడిబ్లాగరు గుర్తుందా? తెలుగు మాట్లాడటమే తప్పు అనుకునే ఈ కాలంలో చక్కటి తెలుగులో ఓ తొమ్మిదో తరగతి చదివే అమ్మాయి బ్లాగు రాయటం చాలా ఆనందకరమైన విషయం కదూ!

గుండె గొంతుకలోన కొట్టాడుతుంది గొంతు దాటి అది రానంటోంది అంటూ తన మనసులోని మాటని మనకి వినిపించాలని ఆరాటపడే రమణి గారి బ్లాగు---కందిపచ్చడితో బ్లాగులోకాన్ని ఓ ఊపు ఊపిన బ్లాగు.

ఈ మధ్య బ్లాగు లోకంలో చర్చలు, చలోక్తులు, వాగ్వివాదాలు, సెటైర్లతో సందడి సందడి చేస్తున్న బ్లాగు--అబ్బో ఆ మాత్రం మాకు తెలీదంటారా?? నేను చెప్పేది అదే మరి--- పరిచయం అక్కర్లేని బ్లాగు.

ఈ మధ్య మొదలైన మరో చల్ల చల్లని హాట్ హాట్ బ్లాగు ప్రియ, వైష్ణవి కలిసి రాస్తున్న ప్రియరాగాలు. ఇందులో ప్రియ రాసేవే ఎక్కువ. తను రాముడి మీద రాసిన టపా రేపిన కలకలం అంతా ఇంతా కాదు. తన వాదాన్ని చాలా సాధికారతతో రాసిన టపా ఇది.

కమ్మటి సువాసనల తలపులు మన మనసులలో నింపే జాజి ఈ విరజాజి. కొంత సాహిత్యభిలాషా, కాస్త తెలుగు భాషపై మమకారమూ, మరి కొంత తెలుగు సంస్కృతి పై గౌరవమూ, కొద్దో గొప్పో తెలుగు జాతి పైన అభిమానమూ కలిగిన అచ్చ తెనుగు ఆడపడుచు రాస్తున్న సరికొత్త బ్లాగు.

అప్పుడప్పుడు అలా కనిపించి ఊసులు చెప్పే స్వాతి చక్రవర్తి బ్లాగు కూడా ఈ మధ్య వచ్చిన బ్లాగుల్లో ఒకటి.

ఇక స్త్రీవాద రచనలు చేసే కొండవీటి సత్యవతి, కొండేపూడి నిర్మల, కల్పన రెంటాల కూడా బ్లాగులు రాయటం మొదలుపెట్టి మహిళా బ్లాగులకి ఓ పరిపూర్ణత కల్పించారు.

ఎప్పటినుండో రాస్తున్న రాధిక, జ్యోతి, సౌమ్య, స్వాతికుమారి, పద్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.

కొంగొత్తగా వచ్చిన మరో నాలుగు బ్లాగుల్ని కూడా చూద్దామా!

కాస్కో నా వాస్కోడిగామా....అమ్మో ఇదేంటి అనుకుంటున్నాలా, అదే మలి మీలే చూడండి. ఈ పిల్లకి ర పలకదంట మలి.

మహార్ణవం పేరుతో కథలు కవితలు రాస్తున్న శ్రీవల్లీ రాధిక గారు బ్లాగరుగా కొత్తే కాని వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో, ఈమాట అంతర్జాల పత్రికలో వచ్చాయి. తన కథలు కొన్ని హిందీ, తమిళ్, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి.

అందరిలాగానే మమూలు మనిషిని, కొంచం అల్లరి, కొంచం కోపం, కొంచం అలోచన, ఇంక నాకే తెలియని ఎన్నో కోణాలతో-- అంటూ మన ముందుకు వచ్చిన మరో బ్లాగరి నేను-లక్ష్మి.

ఓనమాలు లలిత గారిని గుర్తుకు తెస్తూ లలిత లలితంగా మొదలైన ఇంకొక బ్లాగు నా స్పందన.

ఇందుగలరందులేరని సందేహం వలదు, ఎందెందు చూసినా మహిళలే కనిపించు. నాకు తెలియని తెలుగు మహిళా బ్లాగర్లు మరి కొందరు ఉండి ఉండవచ్చు, వారందరికి కూడా నా అభినందనలు మరియు ఆశీస్సులు.

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP