పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 20, 2008

మొదటి వార్షికోత్సవం

నేను బ్లాగు లోకంలోకి అడుగుపెట్టి ఈ రోజుకి (ఫిబ్రవరి 21) సంవత్సరం. ఈ టపాతో కలిపి మొత్తం 28 టపాలు రాసాను (హమ్... పర్లేదు నెలకు రెండు కన్నా ఎక్కువే రాసాను, not too bad :-). ఈ సంవత్సరకాలంలో నా బ్లాగుని వీక్షించిన వారి సంఖ్య 3231.

నాకు బ్లాగులు రాయటం కన్నా బ్లాగులు చదవటం ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. మధ్యలో ఆరోగ్యం బాగాలేకపోయినా వారానికి రెండు వారాలకి ఒక రోజు అయినా అన్ని బ్లాగులు కాకపోయినా నాకు నచ్చినవి చదివేదాన్ని. ఇప్పుడు కూడా ఒక్కొక రోజు ఇవాళ బ్లాగు రాయాలి అని కూర్చుంటాను, సరే ముందు ఎవరెవరు ఏమి రాసారో చూద్దాం అని కూడలిలోకి వెళతాను, ఇక అంతే కాలం కరిగిపోతుంది, నేనేం రాద్దామనుకున్నానో మర్చిపోతాను.

నేను రాయాలునుకున్నవి చాలా రాయలేకపోయాను. పుస్తకాల పరిచయం మొదలుపెట్టి అది మధ్యలోనే ఆపేసాను. కొన్ని అయితే ముసాయిదాల రూపంలో ఉన్నాయి. అవి ఒకసారి చూసి బ్లాగులో పెడదామనుకుంటా అలానే అయిపోతుంది.

ఈ సంవత్సరంలో బ్లాగుల సంఖ్య కూడా బాగా పెరిగింది. అన్నీ చదవాలన్నా కుదరటం లేదు. ఒక్కొక్కసారి వ్యాఖ్యలు చూసి బ్లాగులు చదవటం అవుతుంది. ఆ మధ్య తెలుగు'వాడిని' గారు నచ్చిన బ్లాగులు మరియు టపాలు పేరుతో కొన్ని మంచి బ్లాగులని, టపాలని చక్కగా పరిచయం చేశారు. సి.బి. రావు గారు (దీప్తిధార) బ్లాగ్వీక్షణం పేరుతో తనకి నచ్చిన టపాలని పరిచయం చేస్తున్నారు. ఈ మధ్య పొద్దు పత్రిక వాళ్ళు కూడా బ్లాగుల సమీక్ష మొదలుపెట్టారు. వీటి ద్వారా మన నుండి తప్పించుకున్న కొన్ని మంచి టపాలని చదవగలుగుతున్నాము. ఈ సంవత్సర కాలంలో మంచి బ్లాగర్లు కొంతమంది రాయటం తగ్గించారు.

ఇక నాకు వ్యాఖ్యలు రాయాలంటే మహా బద్దకం. బద్దకం కన్నా ఎలా రాయాలో తెలియనితనం అంటే నయమేమో!!! కొన్ని మంచి టపాలకి ఒట్టి బాగుంది అని రాస్తే ఏదో కృతకంగా అనిపిస్తుంది. ఎందుకు నచ్చిందో చెప్పేటంత పాండిత్యం లేదు. వ్యాఖ్యలు రాయటం కూడా ఓ కళే. బ్లాగు టపా రాయటం కన్నా వ్యాఖ్యలు రాయటమే ఎక్కువ కష్టం. వ్యాఖ్యలు రాయటంలో రాధిక గారు, కొత్తపాళీ గారు ది బెస్టు. వీరిద్దరు నా దృష్టిలో ఉత్తమ వ్యాఖ్యాతలు. అందరిని ప్రోత్సహిస్తూ రాస్తారు. సరే ఇక బాగోని టపాలకి మీ టపా బాగోలేదు అని రాసే ధైర్యం నాకు లేదు, అందుకే వాటి జోలికి అసలు పోను.

బ్లాగు అంటే పర్సనల్ డైరీ లాంటిది అంటారు కాని పర్సనల్ డైరీలో రాసుకున్నంత స్వేచ్చగా దీనిలో రాయలేం, అందరూ చూస్తారు కదా కొంచం ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయాలి, అందుకే నా దృష్టిలో ఇది పర్సనల్ డైరీ కాదు, మన అభిప్రాయాలు, మనసులోని భావాలు పంచుకోవటానికి ఓ వేదిక అంతే.

బ్లాగు రాయటం వల్ల నాకు కనపడ్డ ముఖ్య ఉపయోగం భాషని మెరుగుపరుచుకోవటం. మనకు తెలుగు చాలా బాగా వచ్చు అనుకుంటాము. మాట్లాడేటప్పుడు అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ రాస్తుంటే కాని తెలియదు మనం ఎన్ని తప్పులు రాసేది. కొన్ని పదాలు రాసేటప్పుడు ఒక్కొకసారి అది ఒప్పా కాదా అని ఎంత అనుమానం వస్తుందో !!! ఇదంతా తెలుగులో రాయటం తగ్గిపోవటం (మర్చిపోవటం) వల్లే కదా! కిరాణా సరుకుల పట్టి రాసుకోవటానికి తప్పితే ఈ రోజులలో తెలుగు రాసే వాళ్ళు ఉన్నారా!! (కిరాణా సరుకుల పట్టి కూడా ఇంగ్లీషులో రాసేవాళ్ళే ఎక్కువ రోజులలో, అది వేరే విషయం ). ఏదో ఈ బ్లాగుల పుణ్యమా అని మరలా చక్కటి తెలుగులో రాసుకునే అవకాశం దొరికింది. అందుకే బ్లాగు సృష్టికర్తలకి, బ్లాగు బ్రహ్మలకి హృదయపూర్వక నమస్సుమాంజలి.

మీ సమాచారం కోసం :- ఈ టపా బ్లాగర్.కామ్ లో తెలుగులో నేరుగా రాసింది. అలా రాయాలంటే ఏమి చేయాలో ఇక్కడ చూడండి.

Read more...

February 15, 2008

వేసవి వేళ


మబ్బు పడితే, ఉరుము ఉరిమితే, మెరుపు మెరిస్తే, వాన పడితే, పెరట్లో మల్లె తీగ మొదటిసారిగా మొగ్గ తొడిగితే... ఎంత ఆనందమో....ఎండాకాలం సెలవులు వస్తున్నాయంటే మా ఈతేరు పిల్లలకి అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉండేది.

పరీక్షల చివరి రోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకు చల్లుకోవటంతో మొదలయ్యేది ఆ ఆనందం. మిగతా రోజులలో ఎంత తిరిగినా ఎంత ఆడినా ఎండాకాలం ఆడే ఆటల తీరే వేరు మరి.

ఎన్నెన్ని ఆటలో.....కోతి కొమ్మచ్చి, ఆసంబాయ్, సబ్జా, ఉప్పాట, కరెంటు పాస్, దాగుడుమూతలాట, స్థంభాలాట, నాలుగు స్థంభాలాట, కుందుళ్ళాట, పిచ్చి బంతి, ముక్కుగిల్లుడు ఆట, పిన్నీసు ఆట, నీడలాట, అచ్చంగిల్లాయిలు, వామన గుంటలు, పాము పటాలు, గవ్వలు, పచ్చీసు, ..ఎన్నెన్నో.

ఇప్పటిలాగా హాలీడే హోంవర్క్సు, ప్రాజెక్టులు, ఎసైనుమెంటులు, సమ్మరు క్యాంపులు, సమ్మరు కోచింగులు, ఎక్స్ట్రా కోచింగులు, IIT క్లాసులు ఏమీ లేని మంచి బంగారు రోజులు అవి. ఆటలు, నిద్ర, ఇదే లోకంగా ఉండేది. ఇళ్ళు, చావిళ్ళు, దొడ్లు, గుడి, బడి, చెరువు, అన్నీ మాకు ఆటస్థలాలే. అప్పట్లో సెలవలికి వేరే ఊరు వెళ్ళటం లాంటివి కూడా చాలా తక్కువ, అసలు మాకు అలా వెళ్ళటం కూడా ఇష్టం ఉండేది కాదు. అందులోనూ మాకు మా చుట్టాలందరూ మా ఊరి చుట్టుపక్కల రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉండే వాళ్ళు, అందువల్ల వెళ్ళినా ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేసేవాళ్ళం.

అప్పట్లో మా చిన్నమ్మమ్మ గారి అమ్మాయి వాళ్ళు సూళ్ళూరుపేట (నెల్లురు జిల్లా) లో ఉండే వాళ్ళు. వాళ్ళు ప్రతి ఎండాకాలం సెలవలకి పిల్లల్తో వచ్చేవాళ్ళు. వాళ్ళు వెళ్ళినా వాళ్ళ పిల్లలు ముగ్గురు మాత్రం సెలవలన్నాళ్ళు ఇంకే ఊరు వెళ్ళకుండా మా ఊరిలోనే ఉండే వాళ్ళు. వాళ్ళతో పాటు వాళ్ళ కుక్క జిమ్మీ కూడ వచ్చేది. అది వాళ్ళని వదిలేది కాదు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే ఉండేది. వాళ్ళతో పాటు పరుగులు పెట్టేది, దాంకునేది, దాని పుణ్యమా అని వాళ్ళని అంటుకోవాలంటే మా అందరికి భయంగా ఉండేది, అందుకే వాళ్ళు ఎప్పుడూ దొంగ అయ్యేవాళ్ళు కాదు..

ఆడపిల్లలం, మగపిల్లలం అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. అసలు ఏ ఆట మొదలుపెట్టలా అనేదే తేలేది కాదు. ఒకళ్ళకి ఒక ఆట నచ్చితే ఇంకొకళ్ళకి ఇంకొకటి. ఈ ఆట అయితే నేను ఆడను అంటూ అలకలు, కోపాలు, నేనెళ్ళిపోతున్నా అయితే అంటూ బెదిరింపులు, వెళ్తూ వెళ్తూ రండిరా మనం ఇంకొక చోట ఆడుకుందాము అంటూ సగం మందిని విడదీసుకుపోవటాలు, భలేగుండేదిలే. ఒక్కొక రోజు మూడు గ్రూపులు కూడా తయరయ్యేవి. ఓ గంటే ఈ కోపాలు, తరువాత మరలా అందరూ తిరిగొచ్చేవాళ్ళు సర్లే మీరు చెప్పిన ఆటే ఆడదాంలే అని. ఆటల్లో దెబ్బలు తగిలినా ఆటలో అరటి పండు అన్నట్లు పట్టించుకునే వాళ్ళం కాదు. మధ్యాహ్నం పూట మాత్రం ఆడపిల్లలం కాసేపు చింతపిక్కలో, గవ్వలో, వామనగుంటలో అడేవాళ్ళం.

ఇక సాయంత్రాలు మా ఊరి చెరువులో ఆడే వాళ్ళం. ఎండాకాలం చెరువులో నీళ్ళు చాలా తక్కువగా ఉండేవి. చెరువునిండా తామరాకులు ఉండేవి. వాటి దుంపలు తీసుకు తినేవాళ్ళం, చాలా రుచిగా ఉంటాయి. తామరాకు కాడలతో గొలుసులు చేసి మెడలో వేసుకునేవాళ్ళం. ఒక్కొకసారి చెరువుని ఎండబెట్టేవాళ్ళు. అప్పుడు ఆలుచిప్పలు ఏరుకునే వాళ్ళం. సాయంత్రం పూట పున్నాగ పూలు ఏరి వాటితో జడలు అల్లి నగలు చేసుకుని అలంకరించుకునేవాళ్ళం. మా బడిలో మోదుగ (ఫ్లేం ఆఫ్ ద ఫారెస్టు) చెట్లు ఉండేవి. వాటి పూలతో కోడిపందాల ఆట ఆడేవాళ్ళం.

ఎవరి మీదన్నా కోపం ఉంటే అది ఆటలలో డొంకతిరుగుడుగా బాగా తీర్చుకునే వాళ్ళం, ముఖ్యంగా ముక్కుగిల్లుడు ఆటలో మన శతృవులు దొంగ అయితే కసితీరా ముక్కు ఊడి వచ్చేటట్లు గిల్లి వచ్చే వాళ్ళం.

ఇక వెన్నెల రాత్రులలో అయితే నీడలాట ఆడేవాళ్ళం. సెలవలు అయిపోతున్నాయంటే ఎంత దిగులుగా బాధగా ఉండేదో!

ఇంతకీ కొస మెరుపు ఏమిటంటే అందరి ఇళ్ళల్లో ఆడేవాళ్ళం కానీ మా ఇంటిలో మాత్రం ఆడేవాళ్ళం కాదు. మా నాయనమ్మ అంటే మా ఊరి పిల్లలందరికి హడలుగా ఉండేది. ఒకవేళ ఖర్మ కాలి ఆడుకోవటానికి వచ్చినా వెంటనే మా నాయనమ్మ ఎవడ్రా అది..వెధవ లం - కొడుకుల్లారా ఇంకెక్కడా మీకు చోటు దొరకలా ఆడుకోను అని తిట్లు మొదలెట్టేది, అందుకే పిల్లలు మా ఇంటికి రావటానికే భయపడేవాళ్ళు.

ఈ వేసవి సెలవుల ఆనందం మా పిల్లలు కూడా అనుభవించాలని ఎండాకాలం వాళ్ళని మా ఊరులోనే ఉంచేస్తాం. ఇప్పటి వాళ్ళు ఆడే ఆటలు వేరు అయినా పిల్లలందరు కలిసి సెలవల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక సెలవలు అయిపోతున్నాయంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో! మరలా ఎప్పుడు ఎండాకాలం సెలవలు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు.

Read more...

February 13, 2008

తల్లిదండ్రులకి పరీక్షాకాలం

ప్రస్తుతం చిన్న పిల్లల తల్లిదండ్రులకి పరీక్షాకాలం. స్కూల్సులో ఎడ్మిషన్స్ మొదలయ్యాయి, దానితో తల్లిదండ్రులకి కష్టకాలం మొదలయ్యింది. ఇంకొద్ది రోజులు పోతే పిల్లల్ని స్కూలులో జాయిన్ చేయటం కన్నా చంద్రమండలం మీదకి వెళ్ళి రావటం తేలికగా ఉంటుందేమో!!!

ఈ రోజులలో పిల్లలు పుట్టక ముందే వాళ్ళని స్కూలులో చేర్చటం గురించి ఆలోచించాల్సి వస్తుంది. కొన్ని స్కూల్సులో మూడు సంవత్సరాల ముందే పేరు నమోదు చేసుకోవాలి, దానికి తోడు రికమండేషన్సు. ఫిబ్రవరి, మార్చి నెలలు తల్లిదండ్రులకి పెద్ద పరీక్షాకాలం. ముందు ఏ స్కూల్లో చేర్చాలా అన్నది ఓ పెద్ద ప్రశ్న. స్కూలు ఎంపిక చేసుకున్నాక ఆ స్కూలుకి వెళ్ళి విచారణ పత్రం ఒకటి నింపి ఇవ్వాలి. ఆ తరువాత వాళ్ళు చెప్పిన రోజు వెళ్ళి గంటలు గంటలు నిలబడి అప్లికేషన్ ఫారం తెచ్చుకోవాలి (వెల కనీసం 500 రూపాయలు మాత్రమే), అది పూర్తి చేసి వాళ్ళు చెప్పిన రోజుకి తిరిగి ఇవ్వాలి. తరువాత ఒక రోజు పిలుపు లేఖ (కాల్ లెటరు) వస్తుంది, పలనా రోజు పలానా సమయానికి ఇంటర్యూ అని, ఇక అప్పటినుండి తల్లిదండ్రులకి అసలు టెన్షన్ మొదలవుతుంది, పిల్లలిని రుద్దటం మొదలవుతుంది. వాళ్ళ పేరు, అమ్మా నాన్నల పేర్లు, అక్కలు అన్నయ్యలు ఉంటే వాళ్ళ పేర్లు, వయసు, రంగులు, నంబర్లు ఇలాంటివన్ని బట్టీ పెట్టించేసి ఇంకేమి అడుగుతారో అని వాళ్ళని వీళ్ళని సమాచారం అడిగి తాము టెన్షను పడి పిల్లలిని పడేసి, ఎక్కడ సీటు రాదో అని దిగులు పెట్టేసుకునే వాళ్ళు ఎంతమందో! ఈ పిల్ల గడుగ్గాయిలేమో ఒట్టప్పుడు వాగుడుకాయల్లా వాగుతూ వుంటారు కాని అవసరమైనప్పుడు నోరు విప్పరయ్య!! అసలు మాట్లాడతారో లేదో తెలియదు.. కొన్ని స్కూల్సులో తల్లిదండ్రులకి కూడా ఇంటర్యూలు ఉంటాయి. వీటికి తల్లిదండ్రుల ప్రిపరేషను ఏ స్థాయిలో ఉంటుందంటే వాళ్ళ ప్రాజెక్టు వైవా లేక థీసిస్ వైవా అప్పుడు కాని తమ ఉద్యోగ ఇంటర్యూలప్పుడు కాని అంతగా ప్రిపేరు అయి ఉండరు, అంత టెన్షనూ పడి ఉండరు.

అన్నట్లు నర్సరీలో, L.K.G.లో చేరబోయే పిల్లలిని ఈ ఇంటర్యూలకి ప్రిపేరు చేయటానికి ప్రత్యేకంగా ట్రైనర్సు కూడా ఉన్నారు, ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే.

మొన్న మా తమ్ముడు వాళ్ళ అబ్బాయికి L.K.G. కి ఇంటర్యూ జరిగింది. అమ్మ, నాన్నల పేర్లు, తన పేరు, రంగుల పేర్లు, నంబర్లు ఇలా చిన్న చిన్నవి ఏవో అడిగారు, అన్నిటికి బాగానే జవాబు చెప్పాడు. చివరికి ఏదైనా ఒక రైము చెప్పమన్నారంట, ఇక అంతే ఏడుపు లంకించుకున్నాడు. టీచరు చాక్లెట్టు ఇవ్వబోయినా తీసుకోకుండా వాళ్ళ అమ్మ ఒడిలో దూరి ఒకటే ఏడుపు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే వాడికి మాటలు ఇంకా అంత బాగా రాలేదు. మాటలు చెప్తాడు కాని వాక్యాలతో ఇబ్బంది పడతాడు. రైము అంటే మరి కొంచం పెద్ద పెద్ద వాక్యాలు ఉంటాయి కదా (వాడి దృష్టిలో) అదీ వాడి బాధ.

కొన్ని స్కూల్సు ఈ మధ్య సీటు ఇవ్వటానికి చాలా చాలా నియమాలు పెడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి:

స్కూలు ఉన్న కాలనీలో ప్లాటు కాని, ఫ్లాటు కాని ఉన్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

స్కూలులో ఇప్పటికే పిల్లల అన్నయ్యలు కానీ, అక్కయ్యలు కానీ చదువుతుంటే వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

తల్లిదండ్రులు ఇద్దరూ కనీసం డిగ్రీ అయినా చదివి ఉండాలి. ఇద్దరూ ఉద్యోగస్తులయితే ఇంకా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఇక సీటు వచ్చాక అసలు కథ మొదలవుతుంది. స్కూలు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కొక్కటి చిట్టాకెక్కుతాయి. మచ్చుకి కొన్ని:
1. మా బస్సులన్నీ ఇప్పటికే ఫుల్లు అందువల్ల మీ పిల్లల ట్రాన్స్పోర్టేషను మీరే చూసుకోవాలి.
2. ఒకవేళ ట్రాన్స్పోర్టేషను ఉంటే దానికి మరలా వేరే డిపాజిట్టు కట్టాలి.
2. పిల్లలికి పుస్తకాలు, యూనిఫారం, షూసు, బెల్టు, టై అన్నీ స్కూలులోనే కొనాలి.
3. పిల్లలికి ఎలాంటి అనారోగమైనా స్కూలు మధ్యలో ఇంటికి పంపించం, కావాలంటే ముందే స్కూలు మానిపించండి. పరీక్షల అప్పుడు అయినా అంతే.
4. మధ్యాహ్నం భోజనం ఉదయం పిల్లలతో పాటే ఇచ్చి పంపాలి, మధ్యలో తెచ్చి ఇవ్వటం కాని, పిల్లల్ని ఇంటికి పంపటం కాని జరగవు (స్కూలు పక్క ఇల్లు అయినా సరే).
5. నర్సరీ, L.K.G., U.K.G.. పిల్లలికి లంచ్ బాక్సులలో అన్నం పెట్టరాదు, ఏదైనా టిఫిను పెట్టి పంపాలి, అది కూడ మేము ఇచ్చిన టైము టేబులు ప్రకారం రోజుకొకటి పంపించాలి. (కొన్ని స్కూల్సు లో అయితే రోజుకొకళ్ళు క్లాసు మొత్తానికి లంచ్ పట్టుకెళ్ళాలి).

ఈ మధ్య కొన్ని స్కూల్సులో పిల్లల ఫొటోతో పాటు మొత్తం కుటుంబం ఫొటో కూడా అడుగుతున్నారు, ఎందుకో మరి!

వీటన్నిటికి తలవంచి తలకు మించిన డొనేషను కట్టి పిల్లలిని స్కూలులో చేర్చేటప్పటికి తల్లిదండ్రులకి తల ప్రాణం తోకకి వస్తుంది. ఇక అంతటితో వాళ్ళ బాధలు తీరుతాయా? అబ్బే ఇక వేరే బాధలు మొదలవుతాయి, అవి మరొకసారి.

Read more...

February 1, 2008

ఏది వరకట్నం!!!!!

సర్వోత్తమ న్యాయస్థానం (సుప్రీం కోర్టు) వారి తాజా తీర్పు ప్రకారం ఇకపై ఆడపిల్లలకి పెళ్ళి అప్పుడు ఇచ్చేదే కట్నం, ఆ తరువాత పిల్లలు పుట్టినప్పుడు కాని, పండగ పబ్బాలప్పుడు కాని, వేరే సందర్భాలలో కాని ఇచ్చే కానుకలు (నగలు, నగదు ఏదైనా) ఏవైనా వరకట్నం క్రిందకి రావు. వాటి గురించి అత్తింటి వారు కోడలిని వేధించినా, హింసించినా, చివరికి చంపినా అది వరకట్న నిషేధ చట్టం క్రింద శిక్షార్హం కాదు.

పెళ్లైన 10, 20 సంవత్సరాల తరువాత కూడా వరకట్న దాహానికి బలవుతున్న వారి కథలు వింటూనే ఉన్నాము, ఇక అవన్నీ ఇప్పుడు వరకట్న వేధింపుల క్రిందకి రావు, మన ఆచారాలు, నియమాలు క్రిందకి వస్తాయి. అయితే గియితే వేరే ఇతర తక్కువ శిక్షార్హమైన నేరాల క్రిందకి వస్తాయి!!!!!

జై భోలో సర్వోత్తమ న్యాయస్థానానికి.....జై

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP