పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
Showing posts with label తెలంగాణా. Show all posts
Showing posts with label తెలంగాణా. Show all posts

June 1, 2014

నా రాష్ట్రం రెండు ముక్కలవుతున్న వేళ!



ఈ రోజు నా సమైక్యాంధ్రప్రదేశ్ కి చివరి రోజు! 58 సంవత్సరాల కాపురానికి ఈ రోజుతో చెల్లు చీటీ వ్రాసేస్తున్నారు!  రేపటినుండి ఎవరి ఇల్లు వారిది..ఎవరి కాపురం వారిది!

అసలు విభజనే జరగదు...ఇప్పట్లో జరగదు...లాస్టు బాల్ ఇంకా ఆడలేదు..ఇన్ని జరగదుల మధ్య విభజన జరిగిపోయింది. ఎందుకు?..ఏమిటి?..ఎలా?..ఎప్పుడు?.. ఎక్కడ?  అన్న వాటికి సరైన సమాధానాలు లేకుండానే హడావిడిగా విభజన జరిగిపోయింది.  విభజన వల్ల ఏ ప్రాంతానికి ఎంత లాభమో ప్రశ్నార్థకమే అయినా విభజనని స్వీకరించక తప్పదు కాబట్టి విభజనకి ఆహ్వానం పలుకుదామంటే మనస్సు రావటం లేదు...ఏదో దిగులు!

విభజనతో పాటు మా స్థానికత గురించి కూడా నాకు ఎక్కువ బాధగా ఉంది! మేమెక్కడకి చెందుతాము? గత పాతికేళ్ళుగా మేము తెలంగాణా లోనే ఉంటున్నాము..మా పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు..మరి మేము ఇప్పుడు తెలంగాణా వాళ్ళమా? ఆంధ్రా వాళ్ళమా? తెరాస వాళ్ళ ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడకే చెందుతారన్న సిద్దాంతం ప్రకారం మేము ఆంధ్రా..మా పిల్లలేమో తెలంగాణా అన్నమాట! మా ఇంట్లోనే మరో విభజన! పైగా సెటిలర్సు అంటూ మాకో దరిద్రగొట్టు పేరు! నేను సెటిలర్ అయితే  పక్కనున్న చేవెళ్ళ నుండి హైదరాబాదు వచ్చి స్థిరపడ్డ వాడు కూడా  సెటిలరే!

ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి మాకిష్టమున్నా లేకపోయినా మేము తెలంగాణాలో ఉండాలనుకుంటే మా చిరునామాలు..వీలునామాలూ అన్నిటిల్లో రాష్ట్రం పేరు మార్చుకోవాలి.  AP అల్లా TS అయిపోతుంది! మార్చుకోవటం ఇష్టం లేకపోతే మీ ఆంధ్రా మీరు పోండి అంటారు అంతేగా! ఇది కూడా మా ఆంధ్రా అనుకునే వచ్చాం....ఇలా విభజిస్తారనుకుంటే వచ్చి ఉండేవాళ్ళం కాదేమో!

 తెరాసా వాళ్ళు కోరుకున్న తెలంగాణా వచ్చింది కాబట్టి ఇకనైనా ఆ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే మాటలు ఆపి ఇక్కడ నివసించే ప్రజలందరికీ భద్రతాభావం కలిగించాలి. సొరకాయ అన్నోడు ఆంద్రోడు..ఆనపకాయ అన్నోడు తెలంగాణా వాడు అన్న పనికిమాలిన సిద్దాంతాలు వదిలేయ్యాలి!

అసలు తెరాసా వాళ్ళ మాటలు చూస్తుంటే వాళ్ళకి తెలంగాణా అభివృద్ది కన్నా ఆంధ్రా వాళ్ళ నాశనమే ముఖ్యమైన అజండాగా ఉన్నట్టుంది!

ఆస్తులు..అప్పులేమో జనాభా ప్రాతిపదికన పంపకాలేసారు. విద్యుత్తేమో వినియోగం ప్రకారం పంపకాలేసారు! హైదరాబాదు ఆదాయంలో ఆంధ్రా వాళ్ళకి చిల్లిగవ్వ కూడా భాగం లేదు..కానీ అప్పుల్లో మాత్రం ధారాళంగా వాటా ఇచ్చారు! సరే అయిందేదో అయింది..ఇక మా బ్రతుకులేవో మేము బ్రతుకుతామన్నా అన్నిటికీ మోకాలడ్డే!

1956 కి ముందున్నమా తెలంగాణా మాక్కావాలంటారు..మళ్ళీ భద్రాచలం డివిజన్ మాదే అంటారు.  సరే దాన్నీ వదిలేశారు..ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్రాలో కలపటానికి వీల్లేదంటారు! వాళ్ళా మాట అంటుంది గిరిజనులు..ఆదివాసీల మీద ప్రేమతో కాదు...ముంపు గ్రామాలు తమ వైపు ఉంటే రేపు అడుగడుగునా ఉద్యమాలతో పోలవరానికి ఆటంకం కలిగించవచ్చన్న దు(దూ)రాలోచనతో! సీలేరు పవర్ ప్లాంట్ ఆంధ్రాకి దక్కుతుందన్న ఆక్రోశంతో!

ఇల్లు అలకగానే పండగ కాదు..విభజన జరగగానే అభివృద్ది కాదు.  రెండు రాష్ట్రాలు సంయమనం తో వ్యవహరించినప్పుడే రెండు ప్రాంతాల్లో అభివృద్ది సాధ్యం! ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి కాని ఇలా అభిజాత్యం తో వ్యవహరించే వాళ్ళతో కష్టమే!

ఇంతకీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు! మద్రాసు నుండి విడిపోయిన అక్టోబరు 1 నా! ...తెలంగాణా ప్రాంతంతో కలిసిన నవంబరు 1 నా!!..లేక తెలంగాణాతో బంధం వీడిపోతున్న జూన్ 2 నా!!!

ఆంధ్రాకి రాజధాని లేదు...ఆదాయం లేదు...నిధులు లేవు..ఉన్నదల్లా ప్రజల్లో  ఓ ధృఢ సంకల్పం. తమ మీద తమకు నమ్మకం..కష్టపడే తత్వం.  ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకేమీ లేకపోయినా ఏదైనా సాధించగలమన్న ఓ ఆత్మ విశ్వాసం. ఆ ఆత్మ విశ్వాసమే పెట్టుబడిగా ఆంధ్రప్రదేశ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిచెందాలని..ఆంధ్రాతో పాటు తెలంగాణా కూడా బంగారు తెలంగాణా కావాలని కోరుకుందాం.

రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసుందాం అన్న రాజకీయనాయకులు దానికి అనుగుణంగా వ్యవహరిస్తారని..వ్యవహరించాలని కోరుకుందాం.

                       సర్వే జనా సుఖినోభవంతు! సర్వే రాష్ట్రా సుఖినోభవంతు!

Read more...

March 10, 2011

నేలకొరిగిన తెలుగు వైతాళికులు!

అప్పుడెప్పుడో బాబరు రామ మందిరాన్ని కూల్చాడని
ఇప్పటికీ మన గుండెలు మండుతుంటాయి!
మొన్నెప్పుడో ఎక్కడో ఆఫ్ఘనిస్తానులో
తాలిబన్లు బుద్దుడి విగ్రహాలను కూల్చేస్తుంటే
ఇక్కడ మనం విలవిలలాడిపోయాం!

ఈ రోజు మన కళ్ల ముందే
హుస్సేను సాగరు సాక్షిగా
బ్రహ్మనాయుడి పౌరుషం...పటాపంచలు చేస్తుంటే
కృష్ణరాయల కీర్తి........నీటిపాలు చేస్తుంటే
తిక్కయ్య కలాన్ని........అడ్డంగా విరిచేస్తుంటే
త్యాగయ్య గొంతుని....నిర్దాక్షిణ్యంగా నులిపేస్తుంటే
తిమ్మరుసు ధీయుక్తిని....ఎందుకూ కొరకాకుండా చేస్తుంటే
పోతన..వేమన ..ఎర్రాప్రగడల... చేతులు విరిచేస్తుంటే
శ్రీశ్రీ.......జాషువాల....నాలుకలు తెగ్గోస్తుంటే
త్రిపురనేని...కందుకూరి.....సురవరంల...... తలలు పగలగొడుతుంటే
పింగళి వెంకయ్య తలదించుకునేట్టు...మన జండాని అవమానిస్తుంటే
నిలువు గుడ్లేసుకుని.....గుడ్లలో నీరు కుక్కుకుని
నిస్సహాయంగా చూస్తూ కూర్చున్నాం
రుద్రమ్మా..మల్లమ్మా..ఝాన్సమ్మా
ఎక్కడున్నారమ్మా....మీరన్నా క్షేమమేనా!


తెలుగు వైతాళికుల విగ్రహాలని
తెలుగు వారే  ధ్వంసం చేస్తుంటే
ఏడుపో... బాధో.....కసో
ఏమీ చేయలేని అస్సహాయతో..
ఏమీ అర్థం కాని ఓ ఆవేదన!

Read more...

March 4, 2011

రాజకీయ చదరంగం---పిల్లల పరీక్షలకి ఎసరు

మార్చి 10 హైదరాబాదు దిగ్భంధనం అని TRS ఏ ఎత్తుగడతో పిలుపునిచ్చిందో కాని అదొక మతిలేని చిత్తశుద్ధి లేని ఎత్తుగడ.  ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే ఇంకా  చాలా మార్గాలున్నాయి...పోయి పోయి అభం శుభం తెలియని పిల్లల మీదా తమ ప్రతాపం.  ఉస్మానియాలో పిల్లలకి తెలంగాణా వచ్చేదాకా తరగతులు... పరీక్షలు అక్కర్లేదని ఇక మిగతావాళ్లకి కూడ అక్కర్లేదు అనటానికి వీళ్లెవరు!

తను స్వయానా ఓ అధ్యాపకుడు అయిన కోదండరాం గారి మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో కూడా తెలియటంల.  ఈ దిగ్భంధనం మార్చి 10 న అని ఎప్పుడో నిర్ణయం జరిగిపోయింది అందుకని ఇక దానిని మార్చటం కుదరదు ఇంటరు పరీక్షే వాయిదా వేసుకోండి అని బహు తేలికగా సెలవిచ్చారు ఈ ప్రొఫెసరు గారు.  అంతకు ఒక్క రోజు ముందరే ఇంటరు పరీక్షలకి ఆటంకం లేకుండా మార్చి 10 న జరపతలపెట్టిన దిగ్భంధనాన్ని  గురించి ఆలోచిస్తున్నాం అని ఆయనే సెలవిచ్చారు..మరి ఒక్కరోజులో ఏ రాజకీయ సమీకరణలు మారాయో మరి ఈయన మాటలు కూడా మారిపోయాయి.

ఇంటరు పరీక్షల టైం టేబుల్ రెండు నెలలముందే విడుదల చేసారు.  మరి తెలిసి తెలిసీ ఆ రోజే ఈ నిరసన కార్యక్రమం పెట్టటం వెనుక ఉన్న రాజకీయం చిన్న పిల్లలకి కూడా అర్థం అవుతుంది...నిజంగా వీళ్లకి ఉద్యమం పట్ల కాని అభం శుభం తెలియని చదువుకునే విద్యార్థుల పట్ల కాని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 10 న ఈ కార్యక్రమం పెట్టి ఉండేవాళ్లే కాదు.  ఒకవేళ పెట్టినా పిల్లలు పరీక్షలకి వెళ్ళటానికి ఎలాంటి ఆటంకం కలిగించం పరీక్ష నిర్వహించుకోండి అని అని ఉండుంటే వాళ్ళ ఉద్యమానికి.... ఈ నిరసనకి  గౌరవం దక్కేది..

ఇంటరు విద్యార్థులు ఇంటరు పరీక్షల తరువాత ఎన్ని పోటీ పరీక్షలు వ్రాస్తారో వీళ్లకి తెలుసు..ఒక్క పరీక్ష అటూ ఇటూ అయినా ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో పిల్లలు ఎంత మానసిక ఆందోళనకి గురవుతారో వీళ్లకి తెలియనిదా? అందులోనూ 10 న ఇంటరు ద్వితీయ సంవత్సరం పిల్లలకి పరీక్ష. అది రద్దుచేసి ఇంకొక రోజు పెట్టటమంటే అంత తేలిక కాదు.   ఎంతోమంది పిల్లలు అహోరాత్రులు కష్టపడి తమ జీవితలక్ష్యంగా చదివే IIT పరీక్ష ఏప్రియల్ 10 నే! ఇప్పటికే ఇంటరు పరీక్షలు అయ్యాక మధ్యలో సమయం తక్కువ ఉంది అనుకుంటుంటే మళ్లీ ఇది ఒకటి!

ఇంకొక తెలంగాణా వాది అయితే అసలు ఎప్పుడూ మార్చి మూడవవారంలో మొదలయ్యే పరీక్షలు ఈ సారి తెలంగాణా ఉద్యమాన్ని దెబ్బ తీయటానికే ముందు పెట్టారు అని గగ్గోలు చేస్తున్నాడు! బట్టతలకి మోకాలుకి ముడిపెట్టటంలో వీరిన మించిన వారు లేరు మరి!  అసలు ఆయన పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో! చాలామంది తెలంగాణా వారు  బందులతో గొడవలతో గత విద్యా సంవత్సరం తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాదులో కాలేజీలు సరిగ్గా జరగలేదని ఈ సంవత్సరం తమ పిల్లలని విజయవాడ గుంటూర్లలో చేర్చుకున్నారు! మరి అంత ముందుచూపు వాళ్లకి!

సరే మన చేతకాని ప్రభుత్వం వీళ్లకి భయపడి ఆ రోజు పరీక్ష ఇంకొక రోజుకి మారిస్తే మార్చొచ్చు..కానీ అదే రోజు CBSE, ICSE 10..11 తరగుతుల వాళ్లకి కూడా పరీక్షలు ఉన్నాయి..మరి వాటినేం చేస్తారు! ఎవరు వ్రాసినా వ్రాయకపోయినా వాళ్ళ పరీక్షలు అదే రోజు జరుగుతాయి..వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వెయ్యరు మరి!

ఇంటరు పరీక్ష ఉదయం 8 నుండి 11 గంటల వరకు కాబట్టి  ఇప్పటికయినా పరీక్షలు నిర్వహించటానికి ఎలాంటి ఆటంకం కలిగించం అని ఒక్క మాట చెప్తే చాలా గౌరవంగా ఉంటుంది.

Read more...

January 21, 2010

ఇక చాలు ఆపండి.......


గత రెండునెలలుగా రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణాప్రాంతంలో జరుగుతున్న బందులపర్వం చూస్తూనే ఉన్నాం.  ఈ రెండునెలల్లో పట్టుమని పదిరోజులన్నా కాలేజిలు జరగలేదు.  విద్యాసంవత్సరం  ఆఖరులో ఈ బందుల వల్ల విద్యార్థులు ఎంతగా నష్టపో్తున్నారో! ముఖ్యంగా ఇంటరు విద్యార్థులు..వాళ్లకి ఈ రెండు..మూడునెలల కాలం చాలా విలువయినది..తిరిగి రానిదీనూ...మరీ ముఖ్యంగా తెలంగాణా ప్రాంత విద్యార్థులే ఎక్కువగా నష్టపోతున్నారు.  తెలంగాణా కన్నా మాకు ఏది ఎక్కువ కాదంటారా? మీకు ఎక్కువ కాకపోవచ్చు...కానీ రెండుసంవత్సరాలు ఆహోరాత్రులు కష్టపడి చదివే పిల్లలకి..వాళ్ల తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ బాధేమిటో! కనీసం జూనియరు కళాశాలలకన్నా ఈ బందులనుండి విముక్తి ప్రసాదించండి. తెలంగాణా ఉద్యమకారులకి నాదో చిన్న ప్రశ్న...అసలు బందే మీకున్న ఆయుధమా........వేరే ప్రత్యాయమార్గాలు లేవా!

ఈ రోజు తెలంగాణా JAC కన్వీనరు కోదండరాం గారు ఇంటరు బోర్డుకి వెళ్ళి పరీక్షలు వాయిదా వేయమని కోరుతున్నారు! చేసిందంతా చేసి ఇప్పుడు వాయిదాకోరటమేమిటండి..అది జరిగే పని కాదని మీకు బాగా తెలుసు.  బందుల పేరుతో విద్యార్థుల జీవితాల్ని ఇలా ఆడించే అధికారం మీకెవరిచ్చారు..ముందు అది చెప్పండి.  ఒక రోజు...... రెండు రోజులు కాదు...వరుసగా రెండు నెలలనుండీ బందులే.  కాలేజి పూర్తి సమయం జరిగిన రోజున అమ్మయ్య ఈ రోజు కాలేజి జరిగింది అని అనుకోవాల్సి వస్తుంది.  ఈ రెండు నెలల్లో అలా అనుకున్న రోజులు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.  ఏ రోజు ఎవరు బందు చేస్తారో తెలియదు..ఎందుకు బందు చేస్తారో తెలియదు..కాలేజికెళ్ళి  బందని పిల్లలు వెనక్కి తిరిగి రావటమే ఎక్కువగా ఉంటుంది..రోజూ వెళ్లటం రావటం..ఈ తిప్పలన్నీ ఎందుకు అని అసలు వాళ్లని కాలేజీలకి పంపని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ వరుస బందుల వల్ల పిల్లల్లో చదువుపట్ల ఒక రకమయిన నిర్లిప్తత ప్రవేశించింది కూడాను!

సంక్రాంతి సెలవులు కూడా అయిపోయాయి ఇక కాస్త కాలేజి క్రమబద్ధంగా జరుగుతుంది అనుకునేటప్పటికి మరలా నిన్నా ఈ రోజు బందు. ఈ సమయంలో రెండు రోజుల బందు అవసరమా!  ఇక ఈ  అధికారక బందులతో పాటు అనధికార బందులు ఎన్నో.  నవంబరు 28న మొదలయిన ఈ బందుల పర్వం నిరాటంకంగా సాగు...........తూనే ఉంది.  చంద్రశేఖరరావు నవంబరు 29 న నిరాహార దీక్ష మొదలుపెడతారు అనగా ముందు రోజే అంటే నవంబరు 28న ఆ దీక్షకి మద్దుతుగా అని ఈ బందులు మొదలయ్యాయి.  ఇక అప్పటినుండి ఒక రోజు తెలంగాణా JAC బందు..ఇంకొక రోజు రాజకీయ JAC బందు..మరో రోజు స్టూడెంటు JAC బందు..మరో రోజు మహిళా JAC బందు....ఇంకో రోజు SIF, మరు రోజు ABVP....ఎన్ని రకాల పేరులతో బందులు చెయ్యవచ్చో వీళ్ళదగ్గర నేర్చుకోవచ్చు..ఇకముందు వీళ్ళనెవరూ ఈ విషయంలో అధిగమించలేరు కూడా!

అసలు బందులు చేయటానికి వీళ్ళెంతగా అలవాటు పడిపోయారంటే ....బందు  లేని రోజున వీళ్లకి నిద్రాహారాలు సహించవనుకుంటాను...మరుసటి రోజు ఏదో ఒక కారణం చెప్పి మరలా బందు షురూ...జనవరి 5 న తెలంగాణాపై డిల్లీలొ చర్చ జరిగిందా..దాని ముందు రోజు ఆ చర్చలకు మద్దతుగా ఇక్కడ బందు..ఇక జనవరి 5 నేమో..డిల్లీలో ఇంకా చర్చలు మొదలే అవ్వలేదు..ఇక్కడ ఉదయం పదిగంటలకల్లా కాలేజీలకు వచ్చేసి..బందు అని పిల్లలని వెళ్లగొట్టటం..ఏంటి ఈ బందులు..ఇవా బందులు?..చీ... రోతగా ఉందండి......ఇంకెన్నాళ్లు విద్యార్థుల భవిష్యత్తుని కాలరాచే ఈ బందులు.. నిజంగా మీరు ఆలోచన ఉన్నవాళ్లే అయితే..మీకు విద్యార్థుల పట్ల నిజమైన నిబద్దతతే ఉంటే..మీ రాజకీయ వైకుంఠపాళిలో విద్యార్థులని బలిచేయకండి...ఇక బందులు చాలు........ఆపండి.

కోదండరాం గారు మీరు స్వయానా ఆచార్యులు.......మీకు తెలుసు విద్యార్థులకి ఈ సమయం ఎంత ముఖ్యమో....దయచేసి వాళ్లకి బందులనుండి విముక్తి ప్రసాదించండి.  మీరు ఇంటరు పరీక్షలు వాయిదా వెయ్యాలని కోరుతున్నారు..అవి వాయిదా వెయ్యటానికి కుదరదని మీకు బాగా తెలుసు...తెలిసీ అడగటం మీ రాజకీయంలో భాగమేమో మరి..తద్వారా మరో నాలుగు రోజులు బందు చెయ్యొచ్చన్న దురాలోచన కూడా అందులో ఇమిడి ఉందేమో!

ఇంటరు విద్యార్థులు ఒక్క ఇంటరు పరీక్షలే వ్రాయరు..రకరకాల పోటీ పరీక్షలకెళ్తారు.  అవన్నీ ఏప్రియలు మొదటివారం తరువాత మొదలువుతాయి. IIT:...ఏప్రియల్ 11;   AIEEE:...ఏప్రియలు 25;     VIT:...ఏప్రియల్ 17...ఇవీ ప్రముఖ సంస్థలు నిర్వహించే పరీక్షా తేదీలు.  ఇవి కాక KCET, BITS, GITAM వారి GAT......ఇలా దేశం మొత్తం జరిగే వివిధ రకరకాల పోటీ పరీక్షలు ఏప్రియలు, మే నెలల్లో జరుగుతాయి.  వాటి తేదీలు కూడా ఎప్పుడో నిర్ణయించబడ్డాయి.  వీటిల్లో కొన్ని ఆన్లైను పరీక్షలు.....ఒకసారి విద్యార్థి పరీక్ష తేది నిర్ణయించుకున్నాక మార్చుకునే అవకాశం ఉండదు.  మనం ఇంటరు పరీక్షలు నిర్వహించినా నిర్వహించకపోయినా..ఆరు నూరయినా  ఈ పరీక్షలల్లో ఏ ఒక్కటీ ఆగదు..వెనక్కి జరగదు.  అంటే మార్చి చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటరు పరీక్షలు అయిపోవాలి.  ఇప్పుడు ఇంటరు పరీక్షలు వాయిదా వేయటం ద్వారా పిల్లల మీద మరింత వత్తిడి పెంచటం తప్పితే ఉపయోగం ఉండదు.  ప్రస్తుతం మీరు విద్యార్థులకి చెయ్యకలిగిన ఉపకారం ఏదయినా ఉంది అంటే అది ఇకనుండయినా ఈ బందుల దుష్టసాంప్రదాయం నుండి కాలేజీలకి మినహాయింపు ఇవ్వటం. JAC కన్వీనరుగా మీకు మా తల్లిదండ్రుల విజ్ఞపి ఇది.

కోదండరాం గారు ఇది విద్యార్థుల..మాలాంటి తల్లిదండ్రుల ఆవేదన మాత్రమే...ఇది అనేకానేక బందు బాధల్లో ఒక పార్శ్వం మాత్రమే!  మీ బందుల వల్ల రోజు గడవటం దుర్భరమవుతున్న సామాన్య జనాలు కూడా ఉన్నారు..ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇకనుండి మీ ఉద్యమాన్ని బందురహితంగా సాగిస్తారని..సాగించాలని ఆశిస్తున్నాం....

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP