పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 4, 2011

రాజకీయ చదరంగం---పిల్లల పరీక్షలకి ఎసరు

మార్చి 10 హైదరాబాదు దిగ్భంధనం అని TRS ఏ ఎత్తుగడతో పిలుపునిచ్చిందో కాని అదొక మతిలేని చిత్తశుద్ధి లేని ఎత్తుగడ.  ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే ఇంకా  చాలా మార్గాలున్నాయి...పోయి పోయి అభం శుభం తెలియని పిల్లల మీదా తమ ప్రతాపం.  ఉస్మానియాలో పిల్లలకి తెలంగాణా వచ్చేదాకా తరగతులు... పరీక్షలు అక్కర్లేదని ఇక మిగతావాళ్లకి కూడ అక్కర్లేదు అనటానికి వీళ్లెవరు!

తను స్వయానా ఓ అధ్యాపకుడు అయిన కోదండరాం గారి మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో కూడా తెలియటంల.  ఈ దిగ్భంధనం మార్చి 10 న అని ఎప్పుడో నిర్ణయం జరిగిపోయింది అందుకని ఇక దానిని మార్చటం కుదరదు ఇంటరు పరీక్షే వాయిదా వేసుకోండి అని బహు తేలికగా సెలవిచ్చారు ఈ ప్రొఫెసరు గారు.  అంతకు ఒక్క రోజు ముందరే ఇంటరు పరీక్షలకి ఆటంకం లేకుండా మార్చి 10 న జరపతలపెట్టిన దిగ్భంధనాన్ని  గురించి ఆలోచిస్తున్నాం అని ఆయనే సెలవిచ్చారు..మరి ఒక్కరోజులో ఏ రాజకీయ సమీకరణలు మారాయో మరి ఈయన మాటలు కూడా మారిపోయాయి.

ఇంటరు పరీక్షల టైం టేబుల్ రెండు నెలలముందే విడుదల చేసారు.  మరి తెలిసి తెలిసీ ఆ రోజే ఈ నిరసన కార్యక్రమం పెట్టటం వెనుక ఉన్న రాజకీయం చిన్న పిల్లలకి కూడా అర్థం అవుతుంది...నిజంగా వీళ్లకి ఉద్యమం పట్ల కాని అభం శుభం తెలియని చదువుకునే విద్యార్థుల పట్ల కాని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 10 న ఈ కార్యక్రమం పెట్టి ఉండేవాళ్లే కాదు.  ఒకవేళ పెట్టినా పిల్లలు పరీక్షలకి వెళ్ళటానికి ఎలాంటి ఆటంకం కలిగించం పరీక్ష నిర్వహించుకోండి అని అని ఉండుంటే వాళ్ళ ఉద్యమానికి.... ఈ నిరసనకి  గౌరవం దక్కేది..

ఇంటరు విద్యార్థులు ఇంటరు పరీక్షల తరువాత ఎన్ని పోటీ పరీక్షలు వ్రాస్తారో వీళ్లకి తెలుసు..ఒక్క పరీక్ష అటూ ఇటూ అయినా ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో పిల్లలు ఎంత మానసిక ఆందోళనకి గురవుతారో వీళ్లకి తెలియనిదా? అందులోనూ 10 న ఇంటరు ద్వితీయ సంవత్సరం పిల్లలకి పరీక్ష. అది రద్దుచేసి ఇంకొక రోజు పెట్టటమంటే అంత తేలిక కాదు.   ఎంతోమంది పిల్లలు అహోరాత్రులు కష్టపడి తమ జీవితలక్ష్యంగా చదివే IIT పరీక్ష ఏప్రియల్ 10 నే! ఇప్పటికే ఇంటరు పరీక్షలు అయ్యాక మధ్యలో సమయం తక్కువ ఉంది అనుకుంటుంటే మళ్లీ ఇది ఒకటి!

ఇంకొక తెలంగాణా వాది అయితే అసలు ఎప్పుడూ మార్చి మూడవవారంలో మొదలయ్యే పరీక్షలు ఈ సారి తెలంగాణా ఉద్యమాన్ని దెబ్బ తీయటానికే ముందు పెట్టారు అని గగ్గోలు చేస్తున్నాడు! బట్టతలకి మోకాలుకి ముడిపెట్టటంలో వీరిన మించిన వారు లేరు మరి!  అసలు ఆయన పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో! చాలామంది తెలంగాణా వారు  బందులతో గొడవలతో గత విద్యా సంవత్సరం తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాదులో కాలేజీలు సరిగ్గా జరగలేదని ఈ సంవత్సరం తమ పిల్లలని విజయవాడ గుంటూర్లలో చేర్చుకున్నారు! మరి అంత ముందుచూపు వాళ్లకి!

సరే మన చేతకాని ప్రభుత్వం వీళ్లకి భయపడి ఆ రోజు పరీక్ష ఇంకొక రోజుకి మారిస్తే మార్చొచ్చు..కానీ అదే రోజు CBSE, ICSE 10..11 తరగుతుల వాళ్లకి కూడా పరీక్షలు ఉన్నాయి..మరి వాటినేం చేస్తారు! ఎవరు వ్రాసినా వ్రాయకపోయినా వాళ్ళ పరీక్షలు అదే రోజు జరుగుతాయి..వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వెయ్యరు మరి!

ఇంటరు పరీక్ష ఉదయం 8 నుండి 11 గంటల వరకు కాబట్టి  ఇప్పటికయినా పరీక్షలు నిర్వహించటానికి ఎలాంటి ఆటంకం కలిగించం అని ఒక్క మాట చెప్తే చాలా గౌరవంగా ఉంటుంది.

19 వ్యాఖ్యలు:

Indian Minerva March 4, 2011 at 12:57 PM  

ఈ వుద్యమం కూడా ఎప్పుడో దారితప్పిపోయింది. ప్రస్తుతానికి జనాల కష్టనష్టాలతో అంతగా ప్రమేయంలేని నేతలు ఎప్పుడు చెయ్యాలో ఏమిచెయ్యాలో ఎలాచెయ్యాలో నిర్ణయిస్తున్నట్లుంది.

SHANKAR.S March 4, 2011 at 1:31 PM  

"కానీ అదే రోజు CBSE, ICSE 10..11 తరగుతుల వాళ్లకి కూడా పరీక్షలు ఉన్నాయి..మరి వాటినేం చేస్తారు!"
కేంద్రం స్పందించి వాటిని కూడా వాయిదా వేయాలంటారు. అంతెందుకు ఈ ఏడాది హోల్ సేల్ గా దేశంలో పరీక్షలు రద్దు చేసి తెలంగాణా వాదాన్ని బలపరచాలని ఘంట వహించిన మన కోదండరాం గారు కోరినా కోరతారు. ఆయన పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు మరి. పద్నాలుగు నించీ ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణం లో నిర్వహించుకోవాలని అయ్యవారు సెలవిచ్చారు. అంటే నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం ఏర్పడిపోతుందా? పరీక్ష పోస్ట్ పోన్ చేయడం పిల్లలపై ఎంత ప్రభావం చూపుతుందో తెలియని వాళ్ళు గురువులు. దే........వు.........డా

Anonymous,  March 4, 2011 at 2:24 PM  

తెలంగాణ ప్రాంతానికి అనువైన రాష్ట్రపతి పాలనో, ఎమర్జెన్సీనో పెట్టేసే సమయం దగ్గర్లో వుంది. కోదడాన్ని ఎందుకు డిస్మిస్ చేయడంలేదో హైకోర్ట్ సుమోటోగా తీసుకుని ఉస్మానియా విసికి నోటీసులివ్వాలి. అదరిని రాజానామా చేయమంటాడు, తను మాత్రం ఎంగిలికూడు తింటూ గబ్బిలంలా యూనివర్సిటీకి అంటుకున్నాడు.

సిరిసిరిమువ్వ March 4, 2011 at 3:03 PM  

@Indian Minerva, ఉద్యమం దారి తప్పిందంటే వాళ్లు ఊరుకోరే! ఇలా పిల్లల చదువులతో ఆడుకోవటం మాత్రం అన్యాయం!

@Shankar.S, "ఆయన పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు మరి" అవునండి ఈ మద్య ఈయన మరీ మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. ఇవాళ చూడండి ఏమంటున్నాడో! పరీక్షలు 14 నుండి అయితే పిల్లలకి వీలుగా ఉంటుందట! 14 నుండి మొదలయినా అవతల IIT కి 20 రోజులు సమయం ఉంటుందట:).ఈ కాకి లెక్కలేంటో! అంటే రోజూ పరీక్ష పెట్టి పిల్లలని చావగొట్టాలన్నమాట! పిల్లలు కాని, తల్లిదండ్రులు కాని, కాలేజీలు కాని పరీక్షలు వాయిదా వేయమని కోరలేదే మరి ఈయనకెందుకో అంత దురద! పోనీ విద్యార్థులంటే అంత ప్రేమ ఉన్నవాడు పరీక్షల టైమ్ టేబుల్ వచ్చి రెండు నెలలవుతుంది కదా..మరి వాయిదా వేయమని ఇప్పటిదాక ఎందుకు మాట్లాడలేదో! సరిగ్గా రెండు మూడు రోజులల్లో పరీక్షలనగా లొల్లి మొదలుపెడతారు!

మా అబ్బాయి ఇంటరు రెండవ సంవత్సరం చదువుతున్నాడు...టి.వి. లో కోదండరాం వాగుడు విని.. ఏమనుకుంటున్నాడు ఈయన..ఒకరోజులో వ్రాసే పరీక్ష అన్నట్టు మాట్లాడుతున్నాడు..14 న మొదలయితే IIT కి 20 రోజులు ఉంటాయా అసలు అర్థం ఉండే మాట్లాడుతున్నాడా.. ఈయన ప్రొఫెసరా అని నవ్వుతున్నాడు. దాదాపు మన రాష్ట్రంలో పిల్లలంతా ఇదే ఉద్దేశ్యంతో ఉండి ఉంటారు..అయినా వీళ్లు మారరు!

@snkr, ప్రభుత్వం సరయిన సమయంలో సరయిన నిర్ణయాలు తీసుకుని గట్టిగా వ్యవహరించి ఉండి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు!

వాత్సల్య March 4, 2011 at 3:36 PM  

బాగా చెప్పారండీ.

SHANKAR.S March 4, 2011 at 3:42 PM  

@ సిరిసిరి మువ్వ గారు
" సరయిన సమయంలో సరయిన నిర్ణయాలు "
ROFL
ఎంతకాలం నుంచీ వింటున్నామండీ ఈ మాట. మీరు అనేది చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోడం. కానీ ఇక్కడ సరయిన సమయంలో సరయిన నిర్ణయాలు అని చెప్పి చేతులు కాలిపోయాక ఆకుల కోసం విత్తనాలు వేసి ఎదురుచూస్తున్నారు.

సిరిసిరిమువ్వ March 4, 2011 at 3:51 PM  

@Shankar.S గారూ ..అంతే అంటారా!
ఏంటో ఇలా బ్లాగుల్లో వెళ్ళబోసుకోవటమే కాని ఏమీ చేయలేని నిస్సహాయత మనది!

Goutham Navayan March 4, 2011 at 4:54 PM  

తప్పు ఒకరి దైతే
మీరు
తప్పు పడుతున్నది మరొకరిని.
తెలంగాణా ప్రజల ఆకాంక్ష పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న
తీరు ఏమాత్రమైనా ప్రజాస్వామికంగా ఉందా ?

తెలంగాణాకు అనుకూలం అని 2004 , 2009 ఎన్నికలలో ప్రకటించారు.
కామన్ మినిమం ప్రోగ్రాం లో పెట్టారు,
రాష్ట్ర పతి, ప్రధాన మంత్రి చేత పార్లమెంటులో ప్రకటింప జేశారు.
ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం అడిగి
కాంగ్రెస్ పార్టీ మాత్రం తన అభిప్రాయం ప్రకటించకుండా తమాషా చేసింది.

ప్రధాన ప్రతిపక్షం కూడా ప్రత్యెక తెలంగాణాకు సై అంది.
తీర కేంద్రం తెలంగాణాకు అనుకూల ప్రకటన చేయడం తో నై అంటూ ప్లేటు మార్చింది.
రెండుకళ్ళ దగుల్భాజీ సిద్ధాంతాన్ని తలకెత్తుకుంది.
ప్రజా రాజ్యం పార్టీ సామాజిక తెలంగాణా తతంగం గురించి ఇక చెప్పా నవసరం లేదు.

శ్రీ కృష్ణ కమిటీ అన్నారు
సంవత్సరం సమస్యను సాగ దీసారు.
నిర్ణయం తీసుకోకుండా ఇంకా తమాషా చేస్తున్నారు.
తెలంగానా ప్రజలు బందులు చేసారు, రైల్ రోకోలు చేసారు. ఎందఱో ఆత్మా బలిదానాలు చేసారు.
ఇంకా ఎం చేయాలి? ఎంతకాలం చేయాలి.?
ప్రతి సంవత్సరం మార్చ్ 15 తర్వాత నిర్వహించే పరీక్షలను
ఈసారి కావాలని మార్చ్ 7 కు ప్రిపోన్ చేసి ఇంకా రెచ్చగొట్టడం భావ్యమా?
అసలు ప్రజాస్వామ్య బద్దంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఈ ఆందోళనలు
ఆత్మా హత్యలు, అశాంతి మొదలైన వాటికి ఆస్కారం ఉండేదా?

దారి తప్పింది తెలంగాణా ఉద్యమం కాదు.
మన భారత ప్రజాస్వామ్యం
కొత్తగా 14 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు లేని తల తిక్క వాదనలు
తెలంగాణా రాష్ట్రం విషయంలో చేస్తున్న దగుల్భాజీ రాజకీయ నాయకులను
నిలదీయండి.

సిరిసిరిమువ్వ March 4, 2011 at 5:23 PM  
This comment has been removed by the author.
Anonymous,  March 4, 2011 at 5:37 PM  

/తెలంగాణా ప్రజల ఆకాంక్ష పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న
తీరు ఏమాత్రమైనా ప్రజాస్వామికంగా ఉందా ? /
రాష్ట్ర/కేంద్రప్రభుత్వాలు, కాంగ్రెస్, చిదంబరం, సోనియా, ఐకాసలు, కోదండం, తెలబాన్లు, ముక్కోడు అంతా కట్టకట్టుకుని మూసీ పడి చావండి. పని పాటలేని బేకార్‌గాళ్ళకు తప్ప ఎవడికి కావాలి మీ చెత్తరాజకీయాలు, తప్పుడు దేశ/రాష్ట్ర భక్తులు? పిల్లలను నాశనం చేసే హక్కు మీకెవరిచ్చారు?
దీన్ని సమర్థించేవాళ్ళు మనుషులుగా పనికిరారు. ప్రజాస్వామ్యం మనుషులకే వుంటుంది, అడవి మృగాలకు కాదు.

పదనిసలు March 4, 2011 at 5:46 PM  

పిల్లల పరీక్షలు ఆపితే తెలంగాణా వస్తుందా? అడుక్కునే వాళ్ళను కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా పోయి పని చేసుకుని బ్రతకచ్చుగా అంటూ ఉంటాం. సహాయనిరాకరణ పేరుతో, పని చేయకుండా జీతం అడుక్కునే వాళ్లకు, మామూలుగా అడుక్కునే వాళ్లకు పెద్ద తేడ ఏమి లేదు నా దృష్టిలో. సహాయనిరాకరణ గాంధి గారి రోజుల్లో స్వచ్చందంగా చేసింది, ఇప్పుడు చేస్తున్నది ఎలా ఉందో పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. లేదు మేము నిస్వార్ధంగా చేస్తున్నాం అంటే మరి జీతమడగడమెందుకో..!??

సిరిసిరిమువ్వ March 4, 2011 at 5:48 PM  

@Goutham Navyan గారు
"తప్పు ఒకరి దైతే
మీరు
తప్పు పడుతున్నది మరొకరిని"

కాదు
"తప్పు ఒకరి దైతే
మీరు
శిక్ష వేస్తున్నది వేరొకరికి"

మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి..ఇలా పిల్లలతో చెలగాటలాడటం భావ్యమేమో!

మీరు నిరసన తెలపండి..
ఆందోళనలు చెయ్యండి..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వత్తిడి తెచ్చి
మీ ఆకాంక్ష నెరవేర్చుకోండి..
కానీ ఇలా పిల్లల మీద కాదు.

ఇంకొక విషయం
"ప్రతి సంవత్సరం మార్చ్ 15 తర్వాత నిర్వహించే పరీక్షలను
ఈసారి కావాలని మార్చ్ 7 కు ప్రిపోన్ చేసి ఇంకా రెచ్చగొట్టడం భావ్యమా?"

ఎవరండి మీకు చెప్పింది ప్రతి సంవత్సరం మార్చి 15 తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు అని..ఇదిగో ఇలాంటి మొండి తొండి అబద్దపు వాదనలు చేసే పరిస్థితిని ఇక్కడి దాకా తెచ్చారు.

ప్రతి సంవత్సరం మార్చి మొదటి వారంలో నిర్వహించే పరీక్షలను పోయిన సంవత్సరం తెలంగాణ ఉద్యమం మూలాన కాలేజీలు సరిగ్గా జరగలేదన్న సాకుతో మార్చి 3 నుండి జరగవలసిన వాటిని 10 వ తేదీకి వాయిదా వేయించారు.

2007 లో మార్చి 5 నుండి పరీక్షలు జరిగాయి.

2008 లో మార్చి 6 నుండి జరిగాయి.

2009 లో మార్చి 4 నుండి జరిగాయి.

"కావాలని ప్రీపోను చేసారు"..

ఇకనయినా ఇలాంటి అర్థం పర్థం లేని అధారంలేని గుడ్డి వాదనలు చెయ్యకండి.

కోదండరాం ఏం చెప్తే అదే నిజం..కెసిఅర్ ఏం చెప్తే అదే శాసనం అనుకోకండి. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు.

మీకు ఋజువులు కావాలంటే మా అమ్మాయి హాల్ టికెట్లు ఉన్నాయి స్కాన్ తీసి పెడతాను.

చివరిగా ఒక మాట! రాజకీయ పార్టీల అవకాశవాద రాజకీయాల మూలంగా పరీక్షలు వాయిదా వేయటం క్షమార్హం కాని నేరం. పరీక్షలు వాయిదా పడితే రాజకీయ నాయకులకు పోయేదేమీ లేదు నష్టపోయేది విద్యార్థులే!

SHANKAR.S March 4, 2011 at 5:54 PM  

@ Goutham Navyan గారు
ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మిలియన్ మార్చ్, సహాయ నిరాకరణ నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ కు చెందిన వ్యక్తి హై కోర్ట్ లో PIL దాఖలు చేశారు. బందులైనా, ధర్నాలైనా ప్రజలు ఒక్కరోజు భరిస్తారు, రెండు రోజులు భరిస్తారు. శృతి మించిన రోజు సాటి ప్రజలే తిరగబడతారు అనడానికి ఇదే నిదర్శనం.

Goutham Navayan March 5, 2011 at 2:03 PM  

@ సిరిసిరిమువ్వ గారూ
"తప్పు ఒకరి దైతే మీరు శిక్ష వేస్తున్నది వేరొకరికి">>>
10 వ తేది పరీక్షను మరో తేది కి మార్చమనడం శిక్షా ?
ఇవాళ తెలంగాణా ఉద్యమాన్ని ముందుకు నడుపుతున్నది ప్రధానం గా విద్యార్ధులే .
తెలంగాణా కోసం ఆత్మ బలిదానం చేసుకున్నది కూడా ఎక్కువగా విద్యార్ధులే.
ఆ అమర వీరుల ఆశయ సాధనకోసం ఒక్క రోజు పరీక్షను వాయిదా వేసుకునేందుకు
మెజారిటీ తెలంగాణా విద్యార్ధులు ఏమాత్రం వెనకాడరు.

ప్రభుత్వ పంతం కానీ , ఈ ఆవేశ పూరిత వాదనలు కానీ అన్నీ
తెలంగాణా ఉద్యమాన్ని దెబ్బ తీయడానికే.
బందులు చేసుకోండి, రైల్ రోకోలు చేసుకోండి, మిలియన్ మార్చ్ లు నిర్వహించుకోండి
మేం మాత్రం అసెంబ్లీలో ఈ అంశం గురించి చర్చించం, ఇచ్చిన మాటను నెరవేర్చం
నిమ్మకు నీరెత్తినట్టుగా ... నీరో చక్రవర్తి లాగా ... ఫిడేలు వాయించు కుంటూ కూర్చుంటాం అంటున్న
మన దగుల్భాజీ రాజకీయ నాయకుల మీద మీరు ముందు దృష్టి సారించండి.
అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

బంద్ , రైల్ రోకో , మిలియన్ మార్చ్ మొదలైన వాటి నిర్వహణ అంత ఆషా మాషీ వ్యవహారం కాదు.
అసలు సమస్య మీద అసెంబ్లీ, పార్లమెంటు లు నిజాయితీ గా చర్చిస్తే వీటి ఆవశ్య కతే వుండదు కదా.
ఇక మీరు పేర్కొన్న తేదీలు నిజమే అయితే .."ప్రతి సంవత్సరం మార్చ్ 15 తర్వాత నిర్వహించే పరీక్షలను
అన్న నా మాటను ఉపసంహరించుకుంటాను. అది తప్పయితే క్షంతవ్యుణ్ణి.

Goutham Navayan March 5, 2011 at 2:21 PM  

@ SHANKARS గారూ
వరంగల్ కు చెందిన ఒక..... ఒకానొక వ్యక్తి ... కోర్టులో PIL దాఖలు చేస్తే
సాటి ప్రజలు తిరగ బడటానికి సంకేతమా ??
దాంతో తెలంగాణా ఉద్యమం మీద తెలంగాణా ప్రజలే తిరగాబడుతున్నారని
తీర్మానం కూడా చేసేస్తారా?
ఔరా !
నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా వుందో ....
అదే వరంగల్ లో 25 లక్షల మందితో జరిగిన బ్రహ్మాండమైన తెలంగాణా బహిరంగసభ కానీ ,
మొన్నటి 48 గంటల బంద్ కానీ ,
రైల్ రోకో గానీ మీకు ఏమాత్రం స్పష్టం చేయలేదా ???????

కనీసం రేపు మార్చ్ 10 న హైదరాబాద్ లో జరిగే మిలియన్ మార్చ్ ను శ్రద్ధగా గమనించండి .
అప్పుడైనా తెలంగాణా ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా వుందో మీకు అర్ధం అవుతుంది. ...
మీలో కొంతైనా నిజాయితీ, న్యాయాన్యాయ విచక్షణ వుంటేనే సుమా !

Anonymous,  March 5, 2011 at 7:52 PM  

ప్రజల్ని కన్సిస్టెంట్ గా తప్పుడు ప్రచారాల ద్వారా తప్పుదోవ పట్టించడం చాలా సులభం. తెలంగాణలో అదే జఱుగుతోంది. ప్రజలదేముంది ? ఇదిగో పులి అంటే అదిగో తోక ! అందుచేత ప్రజల ఆకాంక్ష అనేదానికి స్వతహాగా విలువలేదు. ఎందుకంటే ప్రజలకు ఏ విషయంలోనూ ఆకాంక్షలంటూ ఏమీ ఉండవు, కుటుంబాన్ని చూసుకోవడం తప్ప ! అలా చెప్పబడేదాని వెనక వాస్తవంగా పనిచేసేది రాజకీయనాయకుల ఆకాంక్షలే.

SHANKAR.S March 5, 2011 at 10:14 PM  

@ Goutham Navayan గారు
"దాంతో తెలంగాణా ఉద్యమం మీద తెలంగాణా ప్రజలే తిరగాబడుతున్నారని
తీర్మానం కూడా చేసేస్తారా?
ఔరా !"
ఈ తొందరపాటుతనమే వద్దన్నది. ఒక్కసారి నేను ఏమన్నానో చూడండి. నేను ఎక్కడైనా "తెలంగాణా ఉద్యమం మీద తెలంగాణా ప్రజలే తిరగాబడుతున్నారని" అన్నట్టు మీకు కనిపిస్తే అప్పుడు మాట్లాడండి. నేను అన్నది
"బందులైనా, ధర్నాలైనా ప్రజలు ఒక్కరోజు భరిస్తారు, రెండు రోజులు భరిస్తారు. శృతి మించిన రోజు సాటి ప్రజలే తిరగబడతారు అనడానికి ఇదే నిదర్శనం."
ఇందులో ఎక్కడయినా తెలంగాణా ఉద్యమం మీద తెలంగాణా ప్రజలు తిరగబడుతున్నారు అని ఉందా? ఇలాంటి ఆవేశం జనాల్లో రేకెత్తించే నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు. ఒక్క వారం రోజులు బందుకు పిలుపు ఇమ్మనండి. జనమే తిరగబడతారు. ఖచ్చితం గా తిరగబడతారు.

Goutham Navayan March 6, 2011 at 4:11 AM  

@ SHANKARS గారూ
>>> సాటి ప్రజలే తిరగబడతారు అనడానికి ఇదే నిదర్శనం. <<<
ఇక్కడ మనం చర్చిస్తున్న సందర్భాన్ని బట్టి ...
సాటి ప్రజలే ...... అంటే తెలంగాణా ప్రజలే అనీ
ఇదే నిదర్శనం ...... అంటే ఒక తెలంగాణా (వరంగల్) వ్యక్తే
(భరించలేక) మిలియన్ మార్చ్, సహాయ నిరాకరణ లకు వ్యతిరేకంగా
హై కోర్ట్ లో పిల్ దాఖలు (తిరగబడటం) చేయడమే (ఇందుకు)...
అని కాక మీ మాటల్ని ఇంకెలా అర్ధం చేసుకోవాలో నాకైతే బోధపడటం లేదు.

బంద్ లూ , సహాయ నిరాకరణల ద్వారా
మన వాళ్ళని మనమే ఇబ్బందికి గురి చేస్తున్నామా
అన్న చర్చ ఎంతో విస్తృతంగా జరిగింది.
ప్రత్యెక తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షని ప్రపంచానికి
తెలియజేయడానికి, పాలకుల కళ్ళు తెరిపించడానికి
ఇంతకంటే మరో మార్గం లేకనే మెజారిటీ జనామోదం తోనే
ఆ చర్యలను చేపట్టడం జరిగింది.

>>> ఇలాంటి ఆవేశం జనాల్లో రేకెత్తించే
నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు. <<<
మీరు తెలంగాణా ప్రజల ప్రగాఢ ఆకాంక్షను, అస్తిత్వ పోరాటాన్ని ఇంత తేలికగా
తీసిపారేయడం బాధాకరం.
పైన చూడండి మీలాంటి పేరే వున్నా యన Snkr ఎలాంటి భాష వాడారో...
>>>కోదండం, తెలబాన్లు, ముక్కోడు అంతా కట్టకట్టుకుని మూసీ పడి చావండి.
పని పాటలేని బేకార్‌గాళ్ళకు తప్ప ఎవడికి కావాలి మీ చెత్తరాజకీయాలు...<<<<<<
.... ఇంకేం చర్చ ఇలా మాట్లాడే వాళ్ళతో.

SHANKAR.S March 6, 2011 at 11:21 AM  

@Goutham Navayan గారు
ఆయన వాడిన బాష అభ్యంతరకరమే కావచ్చు ఆయన భావం లో నాకు ఏమాత్రం తప్పు కనిపించలేదు. పిల్లల భవిష్యత్ నాశనం అయిపోతోందన్న ఆవేదనలో సగటు మనిషిగా మాట్లాడారు.
అయినా అంతకన్నా ఘోరంగా తెలంగాణా నాయకులే మాట్లాడిన మాటలు మీరు చూడలేదా? వినలేదా? లేక వినబడలేదా?. లేక ఆయనెవరో చెప్పినట్టు బూతులు తిట్టడం స్వచ్చమైన తెలంగాణా సంస్కృతీ అని మీరూ నమ్ముతున్నారా?

"మీరు తెలంగాణా ప్రజల ప్రగాఢ ఆకాంక్షను, అస్తిత్వ పోరాటాన్ని ఇంత తేలికగా
తీసిపారేయడం బాధాకరం."

నేను తెలంగాణా ప్రజల ఆకాక్షను తప్పు పట్టటం లేదు. అయితే అందుకు అనుసరిస్తున్న మార్గాన్ని తప్పు పడుతున్నాను. సమైక్య వాదం మాట్లాడే వాళ్ళని శత్రువుల్లా చూడటాన్ని తప్పుబడుతున్నాను. దాడులు చేస్తాం అనడాన్ని తప్పుబడుతున్నాను. "ఇక్కడ నుంచి పొండిరా" అనడాన్ని తప్పు పడుతున్నాను. దేశం లో ఎక్కడైనా ఉండే హక్కు ఈ రాజ్యాంగం నాకిచ్చినప్పుడు who the hell these people are. అభిప్రాయాలతో విభేదిస్తే దాడులు చేస్తారా? ఎవడి వాదం వాడు ఎక్కడైనా వినిపించే స్వేచ్చ ఈ దేశం ఇచ్చినపుడు అడ్డుకోడానికి వీళ్ళెవరు? నిజానికి ప్రస్తుతం తెలంగాణా ఉద్యమం "మాస్ హిస్టీరియా" దశలో ఉంది (తప్పుగా అనుకోకండి వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఇది నిజం). నాకు ఇక్కడి ప్రజలని చూస్తే ఇంటిలో నా వాటా నాకు పంచమంటూ ఇంటిని తగలబెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నట్టు అనిపిస్తోంది.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP