పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

November 27, 2008

మృత్యుక్రీడ

ఇవాళ పొద్దుట పొద్దుటే తలుపు తీసి వాకిట్లో పేపరు తీసుకోబోతూ మెయిను పేజీ హెడ్డింగు "మృత్యుక్రీడ" అని చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడ్డా, మళ్లీ ఎక్కడో ఉగ్రవాదం పంజా విప్పిందన్నమాట--మరో మారణహోమం, ఆర్తనాదాలు, చావు కేకలు, పేపరు చేతిలోకి తీసుకోవాలంటేనే భయం వేసింది. ఎలాంటి వార్తలు వినాలో, ఎన్ని చావు కబుర్లు వినాలో అని-- వరసపెట్టి మారణహోమాలు. కాస్త ఓ నెల రెండు నెలలు అమ్మయ్య అని కాస్త ఊపిరి తీసుకునేలోపు మళ్లీ మరో దాడి, మరో దారుణం, మరో మారణహోమం. వార్తా చానళ్లకి, పేపర్లకి మరో పండగ రోజు.

పేపరు చదవాలంటే భయం,టి.వి.చూడాలంటే భయం,కాలు తీసి బయట పెట్టాలంటే భయం,గుడికెళ్లాలంటే భయం, బడికెళ్లాలంటే భయం,దుకాణానికి వెళ్లాలంటే భయం,సినిమాకి వెళ్లాలంటే భయం, రైలు ఎక్కాలంటే భయం,బస్సు ఎక్కాలంటే భయం,ఎక్కడికైనా వెళ్లాలంటేనే భయం.. భయం..భయం..బతుకే భయం. నా ప్రాణానికి ఏం అవుతుందో అన్న భయం కాదు, మన కళ్ల ముందు ఎలాంటి దారుణాలు చూడాలో అన్న భయం. ఆఫీసుకి వెళ్లిన భర్త ఇంటికి క్షేమంగా వస్తాడా అన్న ఓ ఇల్లాలి భయం, కాలేజికి వెళ్లిన కూతురు క్షేమంగా ఇల్లు చేరుతుందా అన్న ఓ తండ్రి భయం, సినిమాకి వెళ్లిన కొడుకు ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురుచూసే ఓ తల్లి ఎదురుచూపులలో ఉండే భయం. మన కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఏదైనా చిన్నపాటి అనారోగ్యం కలిగితే ఎంతగా ఆందోళన చెందుతాం..అలాంటిది ఓ కుటుంబంలోని వ్యక్తి హఠాత్తుగా ఓ దారుణ మారణకాండలో బలి అయితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ బాధ ఎవరు తీర్చగలరు?

ఎప్పుడో ఓ కేంద్ర మంత్రి కూతుర్ని అపహరిస్తే ఆఘమేఘాల మీద మన ప్రభుత్వం, మన నాయకులు స్పందించి కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని వదిలిపెట్టిన దాని ఫలితం ఇప్పుడు అమాయకులు అనుభవిస్తున్నారు. ఏదీ ఇప్పుడేది అలాంటి స్పందన కానరాదే. సామాన్యుల ప్రాణాలకి ఇదేనా మన ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత. ఇంతమంది అమాయకులు బలవుతుంటే సూటుల్లో వచ్చి ప్రెస్సు కాన్ఫరెన్సులు పెట్టే మన నాయకులు, ప్రతి దాన్ని ఓ పండగ లాగా ఆనందంగా ప్రత్యక్ష ప్రసారం చేసే మన వార్తా చానళ్లు....ఈ మారణకాండలో బలవుతున్న సామాన్యుల గురించి పట్టదా వీళ్లకి.

ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా మనసులో ఒకలాంటి ఆందోళన...కాదు కాదు భయం...కాదు కాదు అభద్రతాభావం...కాదు కాదు మన నేతల మీద అపనమ్మకం...వీటన్నిటినీ చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయత ...ఈ భావాలన్నిటికి కలిపి ఏదైనా పేరు ఉంటే అది... అదే అలాంటి భావం పొద్దున్నిండి నాలో. ఇదా మన నేతలు కోరుకున్న స్వేచ్చా భారతం? ఇదా గాంధీ కలలు గన్న స్వరాజ్యం? ఎప్పుడైతే ఓ స్త్రీ అర్థరాత్రి ఒంటరిగా క్షేమంగా ఇల్లు చేరుకుంటుందో అప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్లు అని గాంధీ అనేవారట. అర్థరాత్రి కాదు ఏ పూట కా పూట ఆడదే కాదు మగాడు కూడా బిక్కు బిక్కు మంటూ భయం భయంగా ఇల్లు చేరుకుంటున్న నేటి భారతాన్ని చూసి అయన ఏం అనేవారో!

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా మనం కూడా ఆవేశంగా ఈ రాజకీయ నాయకుల్ని ఉరి తీయాలి, తన్ని తరమాలి అని అవేశపడిపోతుంటాం. మన నాయకులేమో నిందితుల్ని పట్టుకుంటాం (పట్టుకున్న నిందితుల్ని వదిలి వేస్తాం), ఉగ్రవాదాన్ని అణచివేస్తాం, చనిపోయిన వారికి మా ప్రగాడ సానుభూతి అంటూ నాలుగు చిలక పలుకులు వల్లెవేస్తారు, ఎప్పుడు చూడండి అవే మాటలు. ఏ మాటంటే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే వాళ్లకి ఇంతకన్నా ఎక్కువ మాటలు ఎలా వస్తాయిలే. రెండు రోజుల తర్వాత మనమూ మర్చిపోతాం, నాయకులూ మర్చిపోతారు, కానీ మర్చిపోంది ఉగ్రవాదులు, మరలా ఎప్పుడు పంజా విసరాలా అని ఆకలిగొన్న పులిలా ఎదురు చూస్తుంటారు. వీటన్నిటికి అంతం ఎప్పుడు?ఎప్పుడు? ఎప్పుడు? అసలు ఇదే ఆరంభమా???

2 వ్యాఖ్యలు:

లక్ష్మి November 28, 2008 at 9:30 AM  

నిజంగానే ఎవ్వరూ ఎందుకు ఏమీ చెయ్యలేకపోతున్నారు? అప్పుడెప్పుడో బార్లో పని చేసే ఆమెనీ ఎవరో కాల్చి చంపితే జనాలు కొవ్వొత్తులు పెట్టీ, నినానాదాలు చేసీ ఆ నేరస్తుడికి శిక్ష పడేలా చేశారు కదా, మరి ఇప్పుడెందుకు మాకిలాంటి చెత్త సన్నాసులు, చవట వెధవలూ నాయకులుగా వద్దు అని ధర్నా చెయ్యలేకపోతున్నారు?

ఊకదంపుడు November 30, 2008 at 2:01 PM  

వార్తా చానళ్లకి, పేపర్లకి మరో పండగ రోజు -బాగా చెప్పారు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP