పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

September 29, 2014

నలభై వసంతాల చెలిమికి వీడ్కోలు..

తెలుగు వార్తా పత్రికల చరిత్రలో  ఒక అధ్యాయం సృష్టించి....వార్తల ప్రచురణలో కొత్త పుంతలు తొక్కి...ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా..ఎప్పుడు పేపరు చదువుదామా అనేట్లు చేసి ..గత నలభై సంవత్సరాలుగా అశేష ప్రజాదరణని సొంతం చేసుకుని తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రిక గా చరిత్ర సృష్టించిన ఓ ఈనాడు పత్రికా రాజమా నీకిక వీడ్కోలు.

నాకు ఊహ తెలిసేటప్పటికే నువ్వు ఉన్నావు.  నేను పేపరు చదవటం మొదలుపెట్టింది నీతోనే! 1974 లో తెలుగు పాఠకుల లోగిళ్ళల్లోకి ఉషా కిరణాలతో పోటీ పడి నువ్వు రావటం మొదలుపెట్టిన లగాయితూ ప్రవాసంలో ఉన్నప్పుడు తప్ప నిన్ను చూడకుండా ఉన్న రోజు లేదు. e-పేపరు వచ్చినా నిన్ను చేత్తో పట్టుకుని..తడిమి తడిమి చూసుకుంటూ "ఇదీ సంగతి" లో ఈ రోజు శ్రీధర్ ఏ కార్టూన్ వేసాడా అని ముందు చూసి...ఒక్కో పేజీ చదువుకుంటూ ఓ గంట సేపయినా నిన్ను ఆస్వాదించందే రోజు మొదలయ్యేది కాదు.

నీ రాక కోసం..నువ్వు రాగానే నిన్ను చదవటం కోసం ఇంటిల్లిపాదీ పోటీ పడేవాళ్ళం.  తెలుగు పత్రికా లోకంలో మొట్టమొదటి సారిగా జిల్లా సంచికలని..ఆదివారం అనుబంధాలని ప్రవేశ పెట్టిన ఘనత నీదే! ప్రతి జిల్లా నుండి పత్రికా ప్రచురణ మొదలుపెట్టిన ఘనతా నీదే! ఇతర రాష్ట్రాలనుండి ఓ తెలుగు పత్రిక ప్రచురించబడటం కూడా నీతోనే మొదలు అనుకుంటాను! మహిళల కోసం వసుంధర అని ప్రత్యేకంగా ఓ పేజీనే ప్రారంభించావు.  పేపరు క్వాలిటీ కాని, భాష కానీ, వార్తా శీర్షికలు కానీ, ఆదివారం అనుబంధం, జిల్లా ఎడిషన్సు ప్రారంభించటంలో కానీ అన్నిటిల్లో ఓ ట్రెండ్ సెట్టర్ వి నీవు. జర్నలిజం కొత్త పుంతలు తొక్కిందీ నీతోనే! మాలాంటి భాషా ప్రేమికుల్ని వేరే పేపర్ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసిన ఘనతా నీదే!

చదువు, సుఖీభవ, ఛాంపియన్, eనాడు, సిరి, ఈతరం, స్థిరాస్థి..ఇలా వారంలో ఒక్కో రోజు ఒక్కో శీర్షికతో పాఠకులకు విలువైన సమాచారం అందిచటంలో నీకు నీవే సాటి అనిపించుకున్నావు.

ఆకట్టుకునే వార్తా శీర్షికలతో మమ్ముల్ని అలరించావు. కొన్ని శీర్షికలని చూడగానే మాలో ఆవేశం ఎగసిపడేది..రక్తం సల సలా మరిగేది. మరి కొన్ని శీర్షికలని చూడగానే విచక్షణ మేలుకునేది. నిష్పక్షపాతంగా సమకాలీన రాజకీయాలను విశ్లేషిస్తూ నువ్వు వ్రాసిన సంపాదకీయాలతో మా మనుసులని చూరగొన్నావు!

"పుణ్యభూమి", "కబుర్లు", "అక్షింతలు", "రాష్ట్రంలో రాజకీయం"...ఇలాంటి శీర్షికల ద్వారా ఎ.బి.కె ప్రసాదు, చలసాని ప్రసాద రావు, డి.వి. నరసరాజు, గజ్జెల మల్లారెడ్డి, బూదరాజు రాధాకృష్ణ లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయ భాగ్యం కలిగించావు.

తెలుగు భాష విస్తృతి కోసం నువ్వు ప్రచురించిన "తెలుగులో తెలుగెంత", "తెలుగు జాతీయాలు", "మాటల మూటలు", "మాటల వాడుక", "మాటలూ-మార్పులూ"..తెలుగు భాషకి మంచి డిక్షనరీల లాంటివి.  ఆదివారం "బాలవినోదిని" కి ముఖ్యంగా "పదవినోదం" కు పిల్లలతో పాటూ పెద్లలమూ అభిమానులం అయ్యాం!

ఓ ఆంధ్రుడి ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పి..తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్దణకు పుట్టిన ఓ ప్రాంతీయ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో నువ్వు ముఖ్య పాత్ర పోషించావు!
ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి అతి పెద్ద మహిళా ఉద్యమం అయిన సారా ఉద్యమానికి అండదండలుగా నిలిచి ఆ ఉద్యమానికి ఎనలేని ప్రచారం చేసి..మహిళల పక్షాన నిలిచిన నిన్ను ఎన్నటికీ మరువలేము! ఆ ఉద్యమం కోసం ఓ ప్రత్యేక పేజీనే కేటాయించావు.

ఏవీ ఇప్పుడు ఆ సంపాదకీయాలు! ఏవీ ఆ వార్తా శీర్షికలు! బూతద్దం పెట్టి వెతికినా ఈనాడులో  భాషాదోషాలు కనపడవు అనుకునే రోజులు పోయాయి. ముఖ్యంగా జిల్లా ఎడిషన్సు లో భాషా దోషాలు కోకొల్లలు. ఈ మాత్రం వార్తలకి..ఈ మాత్రం భాషకి ఈనాడే చదవాలా అని అనుకునేటట్టు చేస్తున్నావు. వార్తల్లో జీవం కనపడటం లేదు.  ఇదివరకటిలా వార్తలని ఆస్వాదించలేకపోతున్నాం

తెలుగు పత్రికా చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యామయిన ఈనాడు ఇక గత చరిత్రగా మిగిలిపోతుందేమో అని అనుమానం కలుగుతుంది.

పేపరు కుర్రాడితో వేయించుకుంటే నువ్వు రావటం ఆలస్యం అవుతుందని గత 15 సంవత్సరాలుగా డైరెక్టుగా ఈనాడు సంస్థ ద్వారానే నిన్ను పొందుతున్న మేము ఇక ఈ నెల నుండి నీకు సెలవు ప్రకటించేసాం.  ఇది బాధాకరమే కానీ తప్పటం లేదు.

నిన్ను ఇక అసలు చూడను అని చెప్పనులే! ఏదో అప్పుడప్పుడు నెట్టు లో e-పేపరు చూస్తూ ఉంటానులే!

ఇక సెలవు నేస్తం!

Read more...

June 1, 2014

నా రాష్ట్రం రెండు ముక్కలవుతున్న వేళ!



ఈ రోజు నా సమైక్యాంధ్రప్రదేశ్ కి చివరి రోజు! 58 సంవత్సరాల కాపురానికి ఈ రోజుతో చెల్లు చీటీ వ్రాసేస్తున్నారు!  రేపటినుండి ఎవరి ఇల్లు వారిది..ఎవరి కాపురం వారిది!

అసలు విభజనే జరగదు...ఇప్పట్లో జరగదు...లాస్టు బాల్ ఇంకా ఆడలేదు..ఇన్ని జరగదుల మధ్య విభజన జరిగిపోయింది. ఎందుకు?..ఏమిటి?..ఎలా?..ఎప్పుడు?.. ఎక్కడ?  అన్న వాటికి సరైన సమాధానాలు లేకుండానే హడావిడిగా విభజన జరిగిపోయింది.  విభజన వల్ల ఏ ప్రాంతానికి ఎంత లాభమో ప్రశ్నార్థకమే అయినా విభజనని స్వీకరించక తప్పదు కాబట్టి విభజనకి ఆహ్వానం పలుకుదామంటే మనస్సు రావటం లేదు...ఏదో దిగులు!

విభజనతో పాటు మా స్థానికత గురించి కూడా నాకు ఎక్కువ బాధగా ఉంది! మేమెక్కడకి చెందుతాము? గత పాతికేళ్ళుగా మేము తెలంగాణా లోనే ఉంటున్నాము..మా పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు..మరి మేము ఇప్పుడు తెలంగాణా వాళ్ళమా? ఆంధ్రా వాళ్ళమా? తెరాస వాళ్ళ ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడకే చెందుతారన్న సిద్దాంతం ప్రకారం మేము ఆంధ్రా..మా పిల్లలేమో తెలంగాణా అన్నమాట! మా ఇంట్లోనే మరో విభజన! పైగా సెటిలర్సు అంటూ మాకో దరిద్రగొట్టు పేరు! నేను సెటిలర్ అయితే  పక్కనున్న చేవెళ్ళ నుండి హైదరాబాదు వచ్చి స్థిరపడ్డ వాడు కూడా  సెటిలరే!

ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి మాకిష్టమున్నా లేకపోయినా మేము తెలంగాణాలో ఉండాలనుకుంటే మా చిరునామాలు..వీలునామాలూ అన్నిటిల్లో రాష్ట్రం పేరు మార్చుకోవాలి.  AP అల్లా TS అయిపోతుంది! మార్చుకోవటం ఇష్టం లేకపోతే మీ ఆంధ్రా మీరు పోండి అంటారు అంతేగా! ఇది కూడా మా ఆంధ్రా అనుకునే వచ్చాం....ఇలా విభజిస్తారనుకుంటే వచ్చి ఉండేవాళ్ళం కాదేమో!

 తెరాసా వాళ్ళు కోరుకున్న తెలంగాణా వచ్చింది కాబట్టి ఇకనైనా ఆ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే మాటలు ఆపి ఇక్కడ నివసించే ప్రజలందరికీ భద్రతాభావం కలిగించాలి. సొరకాయ అన్నోడు ఆంద్రోడు..ఆనపకాయ అన్నోడు తెలంగాణా వాడు అన్న పనికిమాలిన సిద్దాంతాలు వదిలేయ్యాలి!

అసలు తెరాసా వాళ్ళ మాటలు చూస్తుంటే వాళ్ళకి తెలంగాణా అభివృద్ది కన్నా ఆంధ్రా వాళ్ళ నాశనమే ముఖ్యమైన అజండాగా ఉన్నట్టుంది!

ఆస్తులు..అప్పులేమో జనాభా ప్రాతిపదికన పంపకాలేసారు. విద్యుత్తేమో వినియోగం ప్రకారం పంపకాలేసారు! హైదరాబాదు ఆదాయంలో ఆంధ్రా వాళ్ళకి చిల్లిగవ్వ కూడా భాగం లేదు..కానీ అప్పుల్లో మాత్రం ధారాళంగా వాటా ఇచ్చారు! సరే అయిందేదో అయింది..ఇక మా బ్రతుకులేవో మేము బ్రతుకుతామన్నా అన్నిటికీ మోకాలడ్డే!

1956 కి ముందున్నమా తెలంగాణా మాక్కావాలంటారు..మళ్ళీ భద్రాచలం డివిజన్ మాదే అంటారు.  సరే దాన్నీ వదిలేశారు..ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్రాలో కలపటానికి వీల్లేదంటారు! వాళ్ళా మాట అంటుంది గిరిజనులు..ఆదివాసీల మీద ప్రేమతో కాదు...ముంపు గ్రామాలు తమ వైపు ఉంటే రేపు అడుగడుగునా ఉద్యమాలతో పోలవరానికి ఆటంకం కలిగించవచ్చన్న దు(దూ)రాలోచనతో! సీలేరు పవర్ ప్లాంట్ ఆంధ్రాకి దక్కుతుందన్న ఆక్రోశంతో!

ఇల్లు అలకగానే పండగ కాదు..విభజన జరగగానే అభివృద్ది కాదు.  రెండు రాష్ట్రాలు సంయమనం తో వ్యవహరించినప్పుడే రెండు ప్రాంతాల్లో అభివృద్ది సాధ్యం! ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి కాని ఇలా అభిజాత్యం తో వ్యవహరించే వాళ్ళతో కష్టమే!

ఇంతకీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు! మద్రాసు నుండి విడిపోయిన అక్టోబరు 1 నా! ...తెలంగాణా ప్రాంతంతో కలిసిన నవంబరు 1 నా!!..లేక తెలంగాణాతో బంధం వీడిపోతున్న జూన్ 2 నా!!!

ఆంధ్రాకి రాజధాని లేదు...ఆదాయం లేదు...నిధులు లేవు..ఉన్నదల్లా ప్రజల్లో  ఓ ధృఢ సంకల్పం. తమ మీద తమకు నమ్మకం..కష్టపడే తత్వం.  ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకేమీ లేకపోయినా ఏదైనా సాధించగలమన్న ఓ ఆత్మ విశ్వాసం. ఆ ఆత్మ విశ్వాసమే పెట్టుబడిగా ఆంధ్రప్రదేశ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిచెందాలని..ఆంధ్రాతో పాటు తెలంగాణా కూడా బంగారు తెలంగాణా కావాలని కోరుకుందాం.

రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసుందాం అన్న రాజకీయనాయకులు దానికి అనుగుణంగా వ్యవహరిస్తారని..వ్యవహరించాలని కోరుకుందాం.

                       సర్వే జనా సుఖినోభవంతు! సర్వే రాష్ట్రా సుఖినోభవంతు!

Read more...

August 22, 2013

మాలతీ చందూర్-ఓ విజ్ఞాన సర్వస్వం

గూగుల్ సౌజన్యంతో
అలనాటి తెలుగు పత్రికలతో పరిచయం ఉన్న ప్రతి పాఠకుడికీ/పాఠకురాలికీ మాలతీ చందూర్ పేరు సుపరిచితమే.  ఆంద్రప్రభ లో ప్రమదావనం శీర్షిక తో..స్వాతిమాసపత్రికలో పాతకెరటాలు శీర్షికతో దశాబ్దాల తరబడి సాహితీ ప్రియులను ఆకట్టుకున్నారు.

 ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకి పరిచయం చేసిన అతి కొద్ది మంది రచయిత్రిలలో మాలతి గారు ఒకరు. పాతకెరటాలు శీర్షిక ద్వారా ఎన్నెన్నిప్రపంచ ప్రసిద్ద నవలలని తెలుగులో పరిచయం చేసారో! అవి చదివి అబ్బో ఈవిడ ఎంత పెద్ద చదువులు చదివి ఉంటారో అని అబ్బురపడేవాళ్ళం.  తర్వాత తెలిసింది ఆమె పెద్దగా చదువుకోలేదని.  ఒకటి కాదు రెండు కాదు ఐదు దశాబ్దాల పాటు ఈ శీర్షిక నిర్వహించారు ఆవిడ.  తెలుగు పత్రికలలో ఇంతకాలం ఓ శీర్షిక నిర్వహించిన ఘనత ఆమెకే దక్కుతుంది. నవలా పరిచయం అనే సాహితీ ప్రక్రియకి ఓ గొప్ప గౌరవం కలిగించారు మాలతి గారు.

ఈ పరిచయాలు "పాత కెరటాలు", "నవలా మంజరి" పేర్లతో పుస్తకాలుగా విడుదలయ్యాయి.  తెలుగు పాఠకుల దృష్టి ముఖ్యంగా మహిళల దృష్టి ఆంగ్ల సాహిత్యం మీదకి మళ్ళటానికి ఈ పాతకెరటాలు చాలా దోహదం చేసింది.  ఆంగ్ల నవలలే కాక పలు ఇతర భాషల నవలల్ని కూడా ఆమె పరిచయం చేసారు.  నేను వ్రాసిన పరిచయం చదివి ఊరుకోకుండా అసలు నవలని కూడా చదవాలి అని చెప్పే వారు ఆమె.

ప్రమదావనం లో అయితే అంతర్జాతీయ వార్తల దగ్గరనుండి అంతరిక్షం దాకా దేని గురించి అడిగినా చాలా లోతుగా విశ్లేషించి మరీ చెప్పేవారు.  కుటుంబ సమస్యల నుండి అంతర్జాతీయ సమస్యల వరకు చాలా విస్తృతంగా ప్రశ్నలు ఉండేవి.  ఆవిడ కూడా అంతే విస్తృతంగా సమాధానాలు చెప్పేవారు.  అసలు ఆవిడకి తెలియని విషయం ఉండేది కాదు.  తెలియకపోయినా తెలుసుకుని చెప్పేవాళ్లు.  ఆంద్రప్రభ రాగానే ముందుగా ఆ కాలమే చదివేవాళ్లం.

 ఇది ప్రత్యేకంగా మహిళల కోసమే మొదలుపెట్టిన శీర్షిక అయినా పురుషులు కూడా పోటీపడి ప్రశ్నలు అడిగేవారు.  మాలతి గారు భయపడుతూ భయపడుతూనే ఈ శీర్షిక మొదలుపెట్టారంట.

అప్పట్లో మద్రాసు వెళ్ళే తెలుగు వారు సినిమా నటులతో పాటు మాలతీ చందూర్ గారిని కూడా చూడటానికి ఉవ్విళ్లూరేవారట.. తెలుగు పాఠకలోకంలో అంతగా ప్రసిద్దులు ఆవిడ.

ఆమె పేరులో చందూర్ చూసి నాకు ఆసక్తిగా ఉండేది ఆ పేరు పట్ల.  తరువాత తెలిసింది ఆమె భర్త పేరు నాగేశ్వరరావు చందూరి అని ఆయన ఎన్.ఆర్. చందూర్ గా ప్రసిద్దులని.

సాహిత్యరంగంలోనే కాదు పాకశాస్త్రం లో కూడా ఆమె మంచి నిపుణురాలు.  ఆమె వ్రాసిన వంటలు, పిండి వంటలు పుస్తకం అప్పట్లో ఆడపిల్లలకి ఇచ్చే సారెలో ఒక ముఖ్య వస్తువుగా ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో 1974 లో మొదట ముద్రణ అయిన ఈ పుస్తకం ఇప్పటికి 30 ముద్రణలు పూర్తి చేసుకుంది.

వంటలన్నీ ఖచ్చితమైన కొలతలతో బహు సరళంగా చెప్పటం వలన కొత్తగా వంటలతో ప్రయోగం చేసేవాళ్ళకి చాలా ఉపయోగంగా ఉండేది ఈ పుస్తకం.  ఇందులో వంటకం చేసే పద్దతే కాదు ..ఆ వంటకంలో వాడే ప్రతి పదార్థం గురించి..దాని ఆరోగ్య ఉపయోగాల గురించి వివరంగా చెప్పారు.

తర్వాత కాలంలో స్వాతి వారపత్రికలో "నన్ను అడగండి" కాలం నిర్వహించారు.  వెనకటి పాఠకులకంటే ఇప్పటి పాఠకులు తెలివి మీరిపోయారు కదా, అందుకో మరి ఏ కారణంతో అయినా కానీ ప్రమదావనం ఆకటుకున్నట్లు ఇది ఆకట్టుకోలేదు పాఠకుల్ని. కాస్త విమర్శలు కూడా వచ్చాయి.  ఈ కాలం ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది.

ఆమె వ్రాసిన మొదటి కథ "రవ్వల దుద్దులు"...ఆంధ్రవాణిలో వచ్చిందట. 25 కి పైగా నవలలు, పలు కథలు, వ్యాసాలు వ్రాసారు.  ఆమె వ్రాసిన నవలల్లో శిశిర వసంతం, ఆలోచించు, భూమిపుత్రి, హృదయనేత్రి, కలల వెలుగు, మనసులోని మనసు, ఏమిటీ జీవితాలు ప్రాచుర్యం పొందాయి.

ఆవిడ రచనలు గుజరాతీ, తమిళం, కన్నడ, హిందీ లాంటి ఇతర భారతీయ భాషలలోకి అనువాదం చెయ్యబడ్డాయి.  కొన్ని ప్రసిద్ద తమిళ రచనలని ఆమె తెలుగులోకి అనువదించారు.

ఆ మధ్య రేడియో తరంగ వారు మాలతీచందూర్ గారితో చేసిన ముఖాముఖీ ఈ కింది లింకులో వినవచ్చు.

http://telugu.tharangamedia.com/specail-show-with-malathi-chandur/

తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం మాలతి గారి లాంటి సాహితీవేత్తలకి మరణం ఉండదు.

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP