పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

April 13, 2009

మన ఓటు మనమే వేద్దాం

ఓటు వేయటం మన ప్రాధమిక హక్కు. . . ఓటు వేయటం మన బాధ్యత. .
ఓటు వేయకుండా రౌడీలు, గూండాలు, దుర్మార్గులు అందలం ఎక్కేస్తున్నారు అని వగచే హక్కు మనకి లేదు.
ఓటు వేయకుండా దోపిడీ రాజ్యం అయిపోయింది అని దిగాలు పడే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా అవినీతి వేయి తలలు వేసింది అని ఆక్రోశించే హక్కు మనకు లేదు
ఓటు వేయకుండా లంచగొండితనం పెరిగిపోయింది, మామూళ్లు మామూలు అయిపోయాయి అని ఏడ్చే హక్కు మనకి లేదు.
ఓటు వేయకుండా పైరవీలు లేందే ఏ పనీ అవటం లేదు అని గగ్గోలు పెట్టే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా నీతికి, న్యాయానికి, సమర్థతకి, ప్రతిభకి ఈ దేశంలో స్థానం లేదు అని ఘోషించే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా రోడ్లు చండాలంగా ఉన్నాయి అని ఫిర్యాదు చేసే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా ప్రభుత్వం మాకేం చేయట్లేదు అని నిందించే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా మొత్తం వ్యవస్థ అంతా కుళ్లిపోయింది అని అసహ్యించుకునే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా సమాన హక్కులు కావాలి అని ఎలుగెత్తే హక్కు స్త్రీవాదులకు లేదు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మన ఒక్కళ్లం ఓటు వేయనంత మాత్రాన ఏం మునిగిపోతుంది అనుకోకండి, మన ఒక్క ఓటుతో దేశం బాగుపడుతుందా అని నిర్వేదం చెందకండి. కళ్లు, కాళ్లూ లేని వాళ్లు, ముసలివాళ్లు.....కొండల్లో, ఎడారుల్లో ...ప్రయాణించి..ఓపిగ్గా వరుసలో నిలబడి ఉత్సాహంగా ఓటేస్తుంటే మనం మాత్రం ఎందుకు ఇంట్లో కూర్చోవాలి? మన ఓటు ఓ రౌడీనో గూండానో వేసే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? మన ఓటు మనమే వేద్దాం

మీకు తెలుసా ప్రస్తుత పార్లమెంటు మరియు అసెంబ్లీ సభ్యులలో ఎక్కువ మంది పది శాతం కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్నవారే. మరి మనందరం ఓటేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించండి. సమాజంలో మనం కోరుకుంటున్న మార్పు రావాలంటే ఓటు ద్వారానే అది సాథ్యం. మన రాష్ట్రంలోని ఓటర్లలో, ముఖ్యంగా హైదరాబాదులో, స్త్రీలు, యువతే ఎక్కువ శాతం ఉన్నారు. అందుకే ఎవరు గెలిస్తే నాకేంటిలే అన్న నిర్లిప్తత వీడండి. మీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ మనసు మాట వినండి. మీకు నచ్చిన వారికి ఓటెయ్యండి. మార్పుకి మార్గం వేయండి.

మనం ఓటు వేసే అభ్యర్థి గెలవకపోయినా పర్లేదు, అవతల వాడిని ఎంతమంది వద్దనుకుంటున్నారో తెలియటానికయినా మనం ఓటు వేయాలి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


ఓటు వేయటానికి ఓటరు గుర్తింపు కార్డే అక్కర్లేదు. ఈ కింది వాటిలో ఏ ఒక్కటి ఉన్నా ఓటు వేయవచ్చు.
పాసుపోర్టు.
డ్రైవింగు లైసెన్సు.
రేషన్ కార్డు.
పాన్ కార్డు.
ఫోటోతో ఉన్న ఏదైనా జాతీయ బ్యాంకు పాసు పుస్తకం లేదా పోస్టు ఆఫీసు పాసు పుస్తకం లేదా కిసాను పాసు పుస్తకం (పట్టాదారు పాసు పుస్తకం).
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులయితే ఫోటోతో ఉన్న వారి గుర్తింపు కార్డు.
ఫోటొతో ఉన్న ఎ.టి.ఎం కార్డు.

అసలు నన్నడిగితే ఓటు వేయటానికి ఓటరు గుర్తింపు కార్డు తీసుకెళ్ళకుండా ఉండటమే మంచిది, లేదంటే అందులో మన ఫోటో చూసి ఇది నువ్వు కాదు అని ఓటు వెయ్యనీయకపోయే ప్రమాదం వుంది సుమా:)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఓటు వేయకుండా మనకు ప్రశ్నించే హక్కు లేదు
, విమర్శించే హక్కు లేదు, నిలదీసే హక్కు లేదు, ఫిర్యాదు చేసే హక్కు లేదు.
                                              మంచి మార్పు కోసం ఓటేద్దాం

5 వ్యాఖ్యలు:

మురళి April 14, 2009 at 5:03 PM  

బాగుందండి.. ఉపయుక్తమైన సమాచారం.. ముఖ్యంగా చివరి పాయింట్ :)

సిరిసిరిమువ్వ April 15, 2009 at 10:23 AM  

మురళి గారు, మరి మీరు ఓటేస్తున్నారా?

నేస్తం April 15, 2009 at 11:25 AM  

నేను వేయడం లేదు :( వా...

మురళి April 15, 2009 at 11:56 AM  

ఎప్పుడూ మిస్ అవ్వలేదండి.. ఈ సారి కూడా అవ్వను..

కొత్త పాళీ April 15, 2009 at 7:19 PM  

మంచి విషయం, ఉత్తేజకరం

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP