పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

May 13, 2007

అమ్మ


మదర్స్ డే అని ఇవాళ ప్రచారసాధనాలు ఊదరగొట్టేస్తున్నాయి. ఈ రోజు తప్పితే అమ్మ విలువ ఇంకెప్పుడు గుర్తురాదు కాబోలు వీళ్ళకు. ఇదంతా మార్కెటింగ్ మహిమ. సృష్టిలో మానవుడికే కాదు ప్రతి ప్రాణికి అమ్మ వుంది. ఎవరికైనా అమ్మ అమ్మే. ప్రతి అమ్మ తన బిడ్డని ఒక వయసు వచ్చేవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అది ప్రకృతి సహజం కూడా! ఎవరి మన్ననల కోసమో, బిరుదుల కోసమో, మెప్పుల మేకతోళ్ళ కోసమో అమ్మ తన పిల్లలిని లాలించదు పాలించదు. అది తన ధర్మంగా చేస్తుంది. కాకి పిల్ల కాకికి ముద్దయినట్లు బిడ్డ అవిటిదైనా, కురూపి అయినా తల్లికి ముద్దే. ఎన్ని కష్టాలు పడి అయినా బిడ్డ బ్రతకదని తెలిసినా చివరి నిమిషం వరకు బిడ్డ గురించి తపించే తల్లులెందరో. ఏమి ఆశించి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు? అలాంటి అమ్మని ఈ ఒక్క రోజే గుర్తు చేసుకోవటం అంత ఆత్మవంచన ఇంకొకటి వుండదేమో.

అమ్మని ఏ అనాధాశ్రమంలోనో పడేసి ఏడాదికొకసారి ఒక గ్రీటింగ్ ముక్కో, ఓ కేకు ముక్కో పడేస్తే సరిపోతుందనుకునేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇదా మనకు మన చదువులు నేర్పిన సంస్కారం!! ఇదా మనకు మన సంపదలు తెచ్చిన వైభోగం!!!

అమ్మ కోరేది ఈ ఒక్క రోజు ఆర్భాటపు వేడుకలని, బహుమతులిని, ప్రశంసలిని కాదు. రోజూ ఆప్యాయంగా అమ్మా అన్న ఒక పిలుపుని, ముదిమిలో లాలనని పాలనని, నీకు నేనున్నాను నీ జీవితమంతా తోడుంటాను అన్న ఒక భరోసాని . అంతకన్న మననుండి ఆమె ఏ పట్టుపీతాంబరాలని, కాంచన మణిమాణిక్యాదులని ఆశించదు.

అమ్మ గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన రెండు వ్యాక్యాలు....
అమ్మ.....
ఆకలివేళ అక్షయ పాత్ర
ఆపద వేళ ధైర్యం మాత్ర.

ఈ రోజు ఒకావిడ "మదర్స్ డే ని ఘనంగా ఆర్భాటంగా జరుపుకోవాలి" అని నొక్కి వక్కాణిస్తుంది. ఇలా వక్కాణించేవాళ్ళు ఎంతమంది తమ అమ్మలిని అత్తలిని ప్రేమగా చూసుకుంటున్నారంటారు?

Read more...

April 23, 2007

ప్రపంచ పుస్తక దినోత్సవం

ఏప్రిల్ 23 UNESCO ప్రపంచ పుస్తక దినోత్సవం. మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలెంటైన్స్ డే అంటూ రకరకాల రోజులని జరుపుకునే మనకి ఈ పుస్తక దినోత్సవం మాత్రం గుర్తుండదు. మొన్నటికి మొన్న అక్షయ తదియ కి చూడండి ఎంత ప్రచారం చేసామో!! ఈ రోజు ఎక్కడా ఏ ప్రచార సాధనాలలో కూడా ఈ పుస్తక దినోత్సవం గురించి ఒక్క మాట కూడా వినపడలేదు.

ఓ మంచి పుస్తకం చదవటంలో వుండే ఆనందం అనుభవించేవాళ్ళకే తెలుస్తుంది. ఆస్వాదించగలిగితే అది విందు భోజనం కంటే ఎక్కువ తృప్తినిస్తుంది. పుస్తకం ఓ ప్రియసఖి లంటిది. అమ్మలా లాలిస్తుంది, గురువులా హితబోధ చేస్తుంది, తండ్రిలా ఆజ్ఞాపిస్తుంది, స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది. ఒంటరి మనసుకి నేనున్నాను అని స్వాంతననిస్తుంది. బాధపడితే ఓదార్చుతుంది. అలసిన మనసుని సేద తీరుస్తుంది.

నేటి మన జీవన విధానం మనల్ని ఈ పుస్తక పఠనానికి దూరం చేస్తుంది. టి.వి లకి , నెట్లకి అంకతమయిపోయి మన సృజనాత్మకత అడుగంటుతుంది. మన పిల్లలిని కూడ అలాగే తయారుచేస్తున్నాము. శరీరానికి వ్యాయామము ఎంత అవససరమో మనస్సుకి పుస్తక పఠనం కూడా అంతే అవసరం. కనీసం నెలకి ఒక కొత్త పుస్తకం కొని చదువుదాము. పిల్లల చేత చదివిద్దాము. వారి భావనా ప్రపంచ పరిధిని పెంచుదాము.

పుస్తకాలు చదవటం ద్వారా కేవలం మానసిక వికాసమే కాదు, భావ వికాసము, మేధో వికాసం కూడ కలుగుతాయి. పుస్తకాలు చదవటం ద్వారా మానసిక వత్తిడిని తగ్గించుకోవచ్చు. వెనకటి రోజులలో గ్రంధాలయాలకి చాలా ప్రాముఖ్యత వుండేది. సంచార గ్రంధాలయాలు కూడా వుండేవి. నెలకి ఇంతని కడితే వారపత్రికలు, నవలలు ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు. అది చాలామందికి జీవనోపాధిగా కూడా వుండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా సి.డిలు డి.వి.డిలు అద్దెకిచ్చే షాపులే కాని ఇలాంటివి మచ్చుకి కూడ కానరావు. మనిషి జీవితం ఎలా పరిణామం చెందింది తెలుసుకోవటానికి పుస్తకాలని మించిన గొప్ప సాధనాలు వున్నాయా? పుస్తకాల ద్వారానే భాష బ్రతుకుతుంది. ఒక భాష మరుగునపడి పోతే, దానితో పాటు ఆ భాషలోని సాహిత్యం, ఆ సాహిత్యంతో పాటు ఆ జాతి మేధాసంపత్తి పోయినట్టే. మన భాషని కాపాడుకోవటం మన చేతులలొనే వుంది. అందుకే ముందుగా ఈ రోజు ప్రాముఖ్యత గురించి ఒక్క సారి తెలుసుకుందాము.

అన్నట్లు ఈ మధ్య పాత బ్లాగులు చదువుతుంటే మన బ్లాగర్లని కుట్టిన పుస్తకాల పురుగు కనపడింది. ఆ కుట్టేదేదో కొద్దిమందినే కుట్టినట్లుంది!!!! అది కూడా కాస్త అసంపూర్తిగానే. దీనిమీదేననుకుంటా మన రానారే గారు ఆ మద్య నా బ్లాగులో కాస్త ఆవేశపడ్డారు.

మరలా ఆ పురుగేదో ఇంకొకసారి గట్టిగా కుడితే కాని మనవాళ్ళలో చలనం రాదేమో.











.

Read more...

April 17, 2007

ప్రయాణంలో పదనిసలు

రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కోసారి వింతైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మచ్చుకి ఒకటి రెండు.

ఒకసారి నేను విశాఖపట్టణం నుండి ఈస్ట్ కోస్ట్ ఎక్సుప్రెస్ కి హైదరాబాదు వస్తున్నాను. రైలు ఎక్కి అంతా సర్దుకుని కూర్చున్నాక ఒకతను వచ్చి క్షమించాలి ఇది నా సీటండి అన్నాడు. నేను బిత్తరపోయి నా టికెట్ తీసి చూసాను, అదే పెట్టె అదే సీటు నంబరు, నేను సరిగ్గానే కూర్చున్నానే అనుకుంటూ అతని టిక్కెట్ చూపించమన్నాను, అతనిది కూడా అదే పెట్టె అదే నంబరు. ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలా. రైల్వే వాళ్ళు కూడా సినిమహాళ్ళ వాళ్ళ లాగా ఒక సీటే ఇద్దరు ముగ్గురికి రిజర్వు చేస్తున్నారా ఏంటి అనుకున్నాను. ఎక్కడ పొరపాటు జరిగి వుంటుందా అని ఇంకొక సారి అతని టిక్కెట్ నా టిక్కెట్ పరీక్షగా చూసాను. అసలు సంగతి ఏమిటంటే అతనిది ముందురోజుకి రిజర్వేషన్. పాపం ఆ సంగతి చెప్పాక అతను సారీ సారీ అనుకుంటూ దిగిపోయాడు. రైల్వే టైము అర్థరాత్రి 12 గంటల తరువాత మరుసటి రోజుకి మారిపోతుంది. దానితో వచ్చిన తిప్పలు ఇవన్నీ. కొత్తవారికి కొంచం తికమకగానే వుంటుంది. మనకేమో తెల్లావారితే కాని మరుసటి రోజు అయినట్లు లెక్క కాదు కదా.

ఈ మధ్య తిరుపతి వెళ్ళుతున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. నారాయణాద్రి రైలు తెనాలి వెళ్ళేటప్పటికి సరిగా 12:02 నిమిషాలు అయ్యింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు మా పెట్టె లోకి ఎక్కి సీటు నంబర్లు వెతుక్కుంటూ వచ్చారు. ఓ సీటు దగ్గిర ఆగి అక్కడ వాళ్ళని లేపటం మొదలుపెట్టారు. వాళ్ళేమో మంచి నిద్రలో వున్నారు. ఎలాగో చివరికి విసుక్కుంటూ లేచారు. తెనాలిలో ఎక్కిన వాళ్ళు ఇవి మా సీటులండి అని వాళ్ళ సామాను పెట్టేసుకుంటున్నారు. అప్పటికే ఆ సీట్లలో కూర్చున్నవాళ్ళకి ఒక్క నిమిషం ఏమి అర్థం కాలా. అసలే మంచి నిద్రలో లేచారేమో ఒక్కసారిగా తెనాలిలో ఎక్కిన వాళ్ళ మీద పడిపోయారు, మీవేంటండి, మేము హైదరాబాదు నుండి వస్తుంటే, ఏం తమాషాగా వుందా అని. ఇద్దరు కాసేపు వాదులాడుకున్నాక టికెట్స్ తీసి చూసుకున్నారు, ఇద్దరివి ఓకే పెట్టె, ఒకే సీటు నంబర్లు. అంతలోకి టిసి వచ్చాడు, ఏమిటి గొడవ అంటూ. అతను వచ్చి చూసి, తెనాలిలో ఎక్కిన వాళ్ళని మీరు తరువాత స్టేషనులో దిగిపోండి, ఇవి నిన్నటికి రిజర్వేషను చేయించుకున్నవి అని చల్లగా చెప్పాడు. అప్పుడు చూడాలి వాళ్ళ ముఖాలు!!!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP