పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

October 31, 2008

తెలుగుకి ప్రాచీన హోదా

నవంబరు ఒకటి రాష్ట్రావతరణ సందర్భంగా తెలుగు మరియు కన్నడ ప్రజలకి కేంద్రం ఓ బహుమతి ప్రకటించింది. ఎట్టకేలకి తెలుగు మరియు కన్నడ భాషలకి ప్రాచీన హోదా ఇచ్చారు. ఓ భాషకి ప్రాచీన హోదా కలిగించటం మూలాన ఒనగూరే ప్రయోజనం ఏమిటొ నాకయితే తెలియదు, మరి ఈ ప్రాచీన హోదా తెలుగు భాషాభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూద్దాం.

Read more...

October 16, 2008

బ్లాగు ప్రయాణంలో నేను-సిరిసిరిమువ్వ



మీరు బ్లాగులోకం లోకి ఎలా ప్రవేశించారు అంటే సహజంగా సమాధానాలు ఇలా ఉంటాయి.....
మిత్రుల ద్వారా బ్లాగుల గురించి, కూడలి గురించి, లేఖిని గురించి తెలిసింది, అబ్బ ఎంచక్కా తెలుగులో ఎంత బాగా రాస్తున్నారో అని చదవటం మొదలెట్టి, మెల్లగా నేను కూడా బ్లాగటం మొదలెట్టా అనో, లేకపోతే అంతర్జాలంలో అనుకోకుండా ఒక రోజు తెలుగు బ్లాగులు కనపడ్డాయి, వాటిని చదవటం మొదలెట్టా, అవి చదివాక నాకు కూడా ఉత్సాహం వచ్చేసి తెలుగు మీద ప్రేమ పెల్లుబికి బ్లాగటం మొదలెట్టా, లేక ఈనాడులో బ్లాగుల గురించి వచ్చిన వ్యాసం చదివి ఉత్తేజం చెంది నేను కూడా బ్లాగు తెరిచా--ఇంచుమించి కాస్త అటూ ఇటూగా అన్ని సమాధానాలు ఇలాగే ఉంటాయి.

నేను మాత్రం బ్లాగుల మీద కాస్తంత అయిష్టతొ ఇంకాస్తంత ద్వేషంతో ఈ బ్లాగు బండి ఎక్కా! నిజం.. నేను బ్లాగు మొదలుపెట్టేటప్పటికి నాకు బ్లాగుల మీద ఉన్నది అయిష్టతే. అప్పటివరకు నేను ఒక్క బ్లాగు కూడా చదవలేదు, అసలు ఈ బ్లాగు ప్రపంచం గురించి ఆలోచించాలన్నా నాకు ఇష్టంగా ఉండేది కాదు. బ్లాగు రాయటం అంటే పనీపాటా లేనివాళ్ళు చేసే పని అన్న అభిప్రాయం ఉండేది. అసలు మన గురించి మనకు తోచింది మనమే రాసుకుని అది లోకం అంతా తెలిసేట్లు అంతర్జాలంలో పెట్టటం ఏంటి అనుకునేదాన్ని.

మా వారు, అదే చదువరిగా మీ అందరికి పరిచయం అయిన శిరీష్ కుమార్ గారు, 2005 నుండి బ్లాగులు రాస్తుండేవారు. బ్లాగులు రాయటానికి ముందునుండే వికీపిడియాలో చాలా విస్తృతంగా రాస్తుండేవారు. ఎంత విస్తృతంగా అంటే ఇంట్లో ఉన్నంత సేపు పగలూ రాత్రీ అదే పని. శని ఆదివారాలు అయితే పూర్తిగా దానికే అంకితం. నాకు అది చాలా విసుగ్గా ఉండేది. అప్పుడప్పుడు నువ్వు కూడా వికీపిడియాలో రాయవచ్చుగా అంటుండేవాళ్ళు. అసలు కంప్యూటర్ అంటేనే గిట్టని వాళ్ళకి ఇలాంటివి ఎలా ఎక్కుతాయి చెప్పండి. తను రాసే బ్లాగులు కూడా నేనసలు చూసేదాన్ని కాను. తను కూడా నా అనాసక్తిని గమనించి బ్లాగుల గురించి ఏం చెప్పేవారు కాదు.

2007 జనవరిలో నా ఆరోగ్యరీత్యా నేను ఉద్యోగం మానేసాను. అప్పుడు కాస్త కాలక్షేపంగా ఉంటుంది నువ్వు కూడా బ్లాగు మొదలుపెట్టు, ఏదో ఒకటి రాయి అంటుండేవారు. అసలు చెప్పటానికి మన దగ్గర విషయమేమన్నా ఉంటే కదా రాసేది అని నేనంత ఆసక్తి చూపించలేదు. దాదాపు అదే టైములో అనుకుంటా చదువరి, త్రివిక్రం గారు కలిసి పొద్దు అంతర్జాల పత్రిక మొదలుపెట్టారు. దాంట్లో జ్యోతి గారు సరదా శీర్షికలో వ్యాసాలు రాసేవారు. ఓ సారి జ్యోతి గారు రాసిన ఓ వ్యాసం చూపించి తన గురించి చెప్పి తను బ్లాగులు కూడా రాస్తారు అని చెప్పారు. అప్పుడు కూడా నాకు అంత ఆసక్తి అనిపించలేదు, ఆ వ్యాసం కూడా చదవలేదు. దానికి ముఖ్య కారణం నాకు ఏదైనా అంతర్జాలంలో చదవటం అంత ఆసక్తిగా ఉండేది కాదు. ఓ పుస్తకం పట్టుకుని హాయిగా పడుకుని పక్కన ఏ బఠాణీలో,మరమరాలో,కారప్పూసో పెట్టుకుని తింటూ చదువుకోవటంలో ఉండే ఆనందం కంప్యూటర్ ముందు కూర్చుని చదివితే ఉంటుందా!!ఇప్పటికీ నా ప్రాధాన్యత చేతిలో పుస్తకానికే.

సరే నీకు రాయాలనిపించినప్పుడే రాయి అని తనే నాకు ఒక బ్లాగు క్రియేట్ చేసారు. క్రియేట్ చేయటం వరకే తన పని, బ్లాగు పేరు కాని, బ్లాగు అడ్రస్సు కాని అన్నీ నేను పెట్టుకున్నవే. కాస్తంత అయిష్టత తోటే బ్లాగు మొదలుపెట్టా. మొదటి టపా ఫిబ్రవరి 22, 2007 నాడు రాసా. మొదటి టపా రాసేముందు మొదటిసారిగా కొంతమంది బ్లాగులు చదివా, చదవగానే బాగున్నాయే అనుకున్నా...ముఖ్యంగా విహారి గారి టపాలు నాకు చాలా నచ్చాయి, అలాగే పప్పు నాగరాజు గారివి, చరసాల ప్రసాదు గారివి కూడా. చరసాల గారి టపాలు బాగా వాడిగా వేడిగా ఉండేవి. ఒకరు హాస్యం, ఇంకొకరు సరసం, మరొకరు గరంగరం; ఎంత వైవిధ్యం అనుకున్నా!

నా టపా నేనెవరినో చెప్పకుండా రాసా. నేనెవరినో చెప్పాల్సిన అవసరం కూడా నాకు కనిపించలేదు. అసలు ఎందుకు చెప్పాలి! మనం రాసేవి నచ్చితే చదువుతారు లేకపోతే లేదు అన్న భావన నాది. నాకంటూ ఓ చిన్నపాటి గుర్తింపు వచ్చాకే నేనెవరినో చాలామందికి తెలిసింది. నేను మొదటి టపా రాసిన విషయం చదువరి గారికి కూడా తెలియదు. బ్లాగుకి పేరేం పెట్టానో, ఏ పేరుతో రాసానో ఏమీ తనకి చెప్పలేదు. నేను ఒక టపా రాసాను నా బ్లాగు ఏ పేరుతో ఉందో కనుక్కో అన్నా, అంతే రెండే రెండు నిమిషాలలో గూగిలించి చెప్పేసారు. అలా నా బ్లాగు ప్రస్థానం మొదలయ్యింది.

ఇక ఈ బ్లాగు బండి ఎక్కాక ఓ కొత్త లోకంలోకి వచ్చినట్లు అనిపించింది. గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యారు. నాకు తెలియని ఎన్నో విషయాలు, పుస్తకాలు, వ్యక్తుల గురించి తెలిసింది. అసలు పట్టుమని నాలుగు అక్షరాలు రాయటమే గగనం అయిపోయిన నేటి కాలంలో బ్లాగు పుణ్యమా అని నాకు భాష మీద పట్టు పెరిగింది. కొత్త కొత్త (నాకు) తెలుగు పదాల అందాలు, వాటి వాడుక గురించి తెలిసింది. బ్లాగులో నాకు నచ్చిన మరొక విషయం ఏమిటంటే "ఇక్కడ మనకు నచ్చింది స్వేచ్చగా రాసుకోవచ్చు. ఎలాంటి నియమాలు, నిష్ఠలు, ముందస్తు ఒప్పందాలు, చావు గీతలు, లక్ష్మణ రేఖలు ఉండవు. మనం తప్పులు రాసినా ముద్దుగా చెప్పేవాళ్ళే కాని విసిరిగొట్టటాలు, గోడ కుర్చీలు, ఇంపొజిషన్సు ఉండవు".

నాకు బ్లాగులు రాయటం కన్నా చదవటం ఎక్కువ ఇష్టం, అలా ఆని అదేం వ్యసనంగా మారలేదు. ఒక్కోసారి రోజుల తరబడి బ్లాగులవంక కన్నెత్తి కూడా చూడను. మధ్యమధ్యలో బ్లాగుల నుండి సుదీర్ఘ విశ్రాంతి తీసుకుంటుంటాను. రాయటం కోసం రాయను రాయాలనిపించినప్పుడు రాస్తాను. అసలు బ్లాగు అంటే పర్సనల్ డయరీ అన్న అర్థాన్ని మార్చాలేమో. "డయరీ అంటే మన వ్యక్తిగతం గురించి గుప్తంగా ఉంచేది, కాని బ్లాగు అనేది ఓ తెరిచిన నోటు పుస్తకం లాంటిది. ఆ పుస్తకాన్ని ఎవరైనా చదవవచ్చు, తప్పులు దిద్దవచ్చు, సలహాలు ఇవ్వవచ్చు, సంప్రదింపులు చేయవచ్చు".

విభిన్న వ్యక్తులు, విభిన్న రకాల బ్లాగులు---అంతరంగాలు, స్వగతాలు, మార్గదర్శకాలు, విశ్లేషణలు, కబుర్లు, కవితలు, రుచులు, అభిరుచులు, అర్థవంతమైన చర్చలు, వాదోపవాదాలు, పొగడ్తలు, తెగడ్తలు, అలకలు, నిరసనలు, తరాల అంతరాలు, విరమణలు....అన్నిటి కలబోత ఈ బ్లాగు ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతి మజిలీ ఓ మధురానుభూతే. ప్రయాణం నచ్చలేదా మధ్యలో దిగిపోవచ్చు. ఈ బ్లాగు బండిలోకి కొత్త కొత్త వ్యక్తులు ఎక్కుతూ ఉంటారు, కొంతమంది మద్యలోనే దిగిపోతూ ఉంటారు, కొంతమంది ఎక్కి దిగుతూ ఉంటారు, మరి కొంతమంది దిగి ఎక్కుతూ ఉంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా ఈ బ్లాగు బండి ప్రయాణం ఎత్తులు, పల్లాలు, మలుపుల మద్య నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. దానికి హద్దులు, అదుపులూ ఉండవు-ఉన్నదల్లా ఒక్కటే-తెలుగు భాష మీద ప్రేమ, మమకారం. అప్పుడప్పుడూ బండి పట్టాలు తప్పుతున్నట్లు అనిపించినా వెంటనే మరమత్తులు చేసి పట్టాల మీద సరిగ్గా నిలబెట్టే సహృదయులున్నంతవరకు ఈ ప్రయాణం రసరమ్యభరితంగా సాగిపోతూనే ఉంటుంది.

ఈ లోకంలో మనం చెప్పేది నోరెత్తకుండా వినేది మన బ్లాగే:).
అయ్యో మనసులోని మాటని పంచుకోవటానికి ఎవరూ లేరే అన్న బెంగ ఇక లేదు, ఒక్క నిమిషంలో మన మాటని వందలమంది మనస్సులలోకి చేరుస్తుంది. అంతే కాదు తను విన్నవి జాగ్రత్తగా దాచిపెట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి మనకు వినిపిస్తుంది. "అది మాట్లాడకు ఇది మాట్లాడకు అంటూ ఆంక్షలు పెట్టదు, ఏంటా మాటలు అంటూ సాధించదు, ఇలానే మాట్లాడు అంటూ ఆజ్ఞాపించదు. మన మనసెరిగిన నేస్తం మన బ్లాగు".

బ్లాగులు చదవండి-బ్లాగులు చదివించండి
బ్లాగులు రాయండి-బ్లాగులు రాయించండి
తెలుగు భాషని పునరుత్తేజితం చేయండి
ఎవరు రాసారన్నది కాక ఏం రాసారన్నది చూడండి.

జై తెలుగు బ్లాగులు..జై జై తెలుగు బ్లాగులు...జై జై జై తెలుగు బ్లాగులు....జైహింద్.

Read more...

October 14, 2008

తెలుగు-ఇంగ్లీషు విశాలాంధ్ర-క్రాస్‌వర్డ్

మా ఇంట్లో ఇంగ్లీషు పుస్తకాలు చదవటం చాలా తక్కువ. ఎవరైనా ఈ పుస్తకం చాలా బాగుంది చదువు అని చెపితేనో, ఇస్తేనో, చదవటమే కాని స్వతాహాగా ఇంగ్లీషు పుస్తకాల మీద అంత ఆసక్తి లేదు, వాటిని అంతగా కొనం కూడా. అందుకు మొదటి కారణం ఆ పుస్తకాలలో రాసేది మనకి సగం కూడా అర్థం కాదు, ఇక రెండోది మాతృభాషలో చదువుతుంటే ఉండే ఆనందం కాని ఆ పాత్రలతో మమేకం అవటం కాని వేరే భాషలో (ఇంగ్లీషులో) చదువుతుంటే ఉండదన్న ఓ భావన. నా వరకు నేనైతే ఇంగ్లీషు పుస్తకాలు ఎంత గొప్పవయినా వాటి తెలుగు అనువాదాలు చదవటానికే ఎక్కువ ఇష్టపడతాను. ఒక యోగి ఆత్మకథ, అమ్మ, ఏడు తరాలు, ఒక దళారి పశ్చాత్తాపం లాంటివన్ని నేను తెలుగులోనే చదివాను. మా పిల్లలకి కూడా వాళ్ళు ఏదైనా పుస్తకం అడిగితే ముందు దాని తెలుగు అనువాదం దొరుకుతుందేమో చూస్తాం. నండూరి రామమోహనరావు అనువాదం చేసిన మార్క్‌ట్వేన్ పుస్తకాలు, స్టీవేన్సన్ కాంచనద్వీపం అలా కొన్నవే. ఒక్కొకసారి అసలు పుస్తకాల కంటే ఈ అనువాద పుస్తకాలు చదవటమే బాగుంటుంది. R.K. నారాయణ్ రాసిన Swami and his friends కి వాసిరెడ్డి సీతాదేవి చేసిన అనువాదం స్వామి-మిత్రులు (నేషనల్ బుక్ ట్రస్టు వాళ్ళ ప్రచురణ) చదువుతుంటే ఎంత బాగుంటుందో. సొదుం రామ్మోహన్ కూడా మంచి అనువాదాలు చేస్తుంటారు.

నేషనల్ బుక్ ట్రస్టు వాళ్ళు, చిల్డ్రన్సు బుక్ ట్రస్టు వాళ్ళు, హైదరాబాద్ బుక్ ట్రస్టు వాళ్ళు, పీకాక్ క్లాసిక్సు వాళ్ళు, మంచి మంచి పుస్తకాలకి తెలుగు అనువాదాలు ప్రచురిస్తూ ఉంటారు.

చదువుకునే రోజులలో జెఫ్రీ ఆర్చర్, సిడ్నీ షెల్డాన్, షేక్‌స్పియరు లాంటి వాళ్ళ పుస్తకాలు ఏవో ఒకటి రెండు చదివి వుంటాను. ఇప్పుడు మాత్రం మా పిల్లల ద్వారా నేను కూడా అప్పుడప్పుడు ఇంగ్లీషు పుస్తకాలు చదువుతున్నా. హారీ పాటరు పుస్తకాలన్నీ నా చేత మా పిల్లలు చదివించినవే.

హైదరాబాదులో సంవత్సరం సంవత్సరం జరిగే పుస్తక ప్రదర్శనలో తప్పితే మామూలుగా పుస్తకాలు కొనాలంటే మేము వెళ్లేది విశాలాంధ్ర పుస్తకాల కొట్టుకే. అలాంటిది మొన్న ఆదివారం దారి తప్పి దారి లేక ఓ గంట కాలక్షేపం కోసం బంజారాహిల్సులోని క్రాస్‌వర్డ్ పుస్తకాల కొట్టుకి వెళ్ళాం. పిల్లలతో వెళ్ళాం కదా గంటలో ఓ 1800 రూపాయల పుస్తకాలు కొన్నాం. ఇంకాసేపు ఉంటే మా పిల్లలు క్రెడిట్టు కార్డు మీద ఇంకెంత భారం వేస్తారో ఇక చాలు అని త్వర త్వరగా బయటపడ్డాం.

మేము కొన్నవి:
1. Emma, Pride and Prejudice by Jane Austin.
2. Chowringhee by Sankar.
3. The lost child and other stories by Mulk Raj Anand.
4. Grandmother's Tale by R.K. Narayan.
5. The Bachelor of Arts by R.K. Narayan.
6. Blur Mars by Kim Robinson.
7. David Copperfield by Charles Dickens.
8. The Fountainhead by Ayn Rand.

ఇందులో మొదటి ఐదూ నా ఎంపిక. ఇక ఈ మధ్య బ్లాగుల్లో ఎక్కడ పడ్డా ఫౌంటెనుహెడ్డు గురించి గొప్పగా రాస్తున్నారని మా వారు, ఇష్టమైన పుస్తకం ఏదని ఎవరిని అడిగినా ఫౌంటెనుహెడ్డు అనే చెపుతున్నారు అసలు దానిలో ఏముందో చూద్దాం అని మా అమ్మాయి కలిసి ఆ పుస్తకాన్ని ఎంపిక చేసారు. ఇక మిగతా రెండూ మా పిల్లల ఎంపిక. మరి ఇందులో ఏది ఎలా ఉంటుందో వీటిని చదివిన చదువరులే చెప్పాలి.

ఇక క్రాస్‌వర్డ్, వాల్‌డెన్ లాంటి పుస్తకాల కొట్టులతో నచ్చని విషయం ఏమిటంటే అక్కడ చూద్దామన్నా ఒక్క తెలుగు పుస్తకం కూడా కనపడకపోవటం. ఇంగ్లీషు కొట్లలో తెలుగు పుస్తకాలు ఎలా దొరుకుతాయి అంటారా! మరి తెలుగు కొట్లలో ఇంగ్లీషు పుస్తకాలు దొరకటంలే....

Read more...

October 8, 2008

దుత్తెవరు మరి!!!!!

దీనికి ముందు ఇది చదివి అప్పుడు ఇది చదవండి.

.................అలా మా నాన్నతో పాటు నేను కూడా డాక్టరు గారింటికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో పాటు పాఠాలు చెప్పించుకోవటం ఒక డ్యూటీ లాగా అయిపోయింది. ఈ పాఠాలు రోజూ ఉండేవి కావు, వారానికి రెండు మూడు రోజులు ఉండేవి. వెళ్ళిన ప్రతిసారి నాకు ఉక్రోషం తన్నుకొచ్చేది, అయినా ఏం చేయలేం కదా, దేనికైనా కాలం కలిసి రావాలి! కాలం అలా జరిగిపోతుండగా కాలం కలిసొచ్చి ఒక రోజు ఒక మహత్తర అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఎట్టిదనగా..........

ఇక్కడ ఇంకో పిట్టకథ............
మాకు జువాలజీకి వచ్చే పంతులు గారికి కాస్తంత నత్తి, ఆ నత్తికి తోడు ఇంకాస్తంత చాదస్తం, వెరసి ఆయన క్లాసులో అసలు పాఠం కన్నా ఊకదంపుడు ఎక్కువగా ఉండేది. ఆర్థ్రోపొడాలో బొద్దింక గురించి పాఠం మొదలుపెట్టి మధ్యలో దోమలు ఎలా పునరుత్పత్తి చేస్తాయో చెపుతూ హఠాత్తుగా ఎంటమీబా, ప్లాస్మోడియుం అంటూ పరాన్నజీవుల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, ఏతా వాతా ఆయన ఏ పాఠం పూర్తిగా చెప్పటం అయ్యేది కాదు, పూర్తయినా మాకు అర్థమయ్యేది కాదు! ఇక పరీక్షలు దగ్గరికొస్తున్నాయనగా ఆదివారాలు స్పెషలు క్లాసులంటూ దుంప తెంచేవాళ్ళు. అదిగో అలాంటి ఓ ఆదివారం నా ఉక్రోషం తీర్చుకునే మహత్తర అవకాశం దొరికింది...........

ఓ ఆదివారం అలానే క్లాసుకి వెళ్ళాం, మాస్టారు ఇంకా రాలా, సరే కాసేపు బయట తిరిగొద్దామని బయటకి వచ్చాం, మగపిల్లలు కూడా బయటికి వచ్చి కాంటీను వేపు వెళ్ళారు. బయటకి వచ్చిన మాకు అక్కడున్న మగపిల్లల సైకిళ్ళు కంటబడ్డాయి, అంతే ఇక అటూ ఇటూ చూసి ఎవరూ చూడటంలేదని నిర్థారించుకుని టపుక్కున డాక్టరుగారబ్బాయి సైకిలు గాలి తీసేసా! ఇక క్లాసు అయిపోయాక తను సైకిలు నడిపించుకుంటూ ఇంటికి వెళుతుంటే నాకెంత ఆనందం వేసిందో!! అప్పట్లో దగ్గర్లో ఎక్కడా గాలి కొట్టేవాళ్ళు ఉండేవారు కాదు. కాలేజి నుండి కనీసం ఓ రెండు కిలోమీటర్లు వెళితే కాని గాలి కొట్టించుకోవటం కుదరదు. ఎప్పుడూ కాలేజి నుండి దగ్గరి దారిలో వెళ్ళే మేము ఆ రోజు తన వెనకే నడుచుకుంటూ ఆనందిస్తూ వెళ్ళటం ఇప్పటికి కూడా కళ్ళముందు కనపడుతుంది. అలా వెళుతూ వెళుతూ మిమ్ములిని మా నాన్న సాయంత్రం మా ఇంటికి రమ్మన్నారు పాఠాలు చెప్పించుకోవటానికి అంటూ ఓ కొంటె నవ్వు నవ్వుకుంటూ తనని దాటుకుని వెళ్ళటం నిన్నా మొన్న జరిగినట్లుంది..........

పాపం తను చాలా బుద్దిమంతుడు. తన చదువేమో తనేమో అన్నట్లు ఉండేవాడు. మరి అలాంటి తనని నేను ఎందుకు టార్గెట్టు చేసుకున్నట్లు? మా నాన్న మీద ఉక్రోషం తన మీద చూపించానన్నమాట. అది తెలిసి చేయటం కూడా కాదు. ఆ సమయానికి అలా అనిపించింది చేసేసాను. తరువాత ఎప్పుడో జ్ఞానోదయం అయింది మన అకారణ కోపాలు, ద్వేషాలు, ఉక్రోషాలు ఇలా అమాయకుల మీద చూపించేస్తుంటాం అని.

మీరు కూడా మీకు తెలియకుండా ఇలాంటివి ప్రదర్శించే ఉంటారు, లేకపోతే మీ మీద ప్రదర్శింపబడి ఉంటాయి, ఒక్కసారి మీ జ్ఞాపకాలని తవ్వుకోండి.

అన్నట్లు జ్ఞాపకాలంటే గుర్తుకొచ్చింది.........అందరిని ఒక్కసారి మన ఊర్లకి తీసుకుపోయే పాట వేణూ శ్రీకాంత్ గారు తన బ్లాగులో వినిపిస్తున్నారు, అక్కడికి వెళ్ళి విని ఒక్కసారి అలా అలా మీ ఊరి పంటచేల గట్ల మీద తిరిగి రండి..........

Read more...

October 3, 2008

టాటా టాటా...నానో నానో!!


రండి, రండి................

నే వెళ్తా....................

అయ్యో రాక రాక వచ్చారు, వెళ్తానంటారేంటి.....................

ఇక వెళ్తాలేండి.........................


మీరెక్కడికి వెళ్లక్కరలేదు.................
.....

నే వెళ్ళిపోతా లేండి.....................

అబ్బే మీరెందుకు వెళ్లటం.....................

లేదులేండి నేను వెళితేనే మీకు బాగుంటుంది...................

అయ్యో అదేం లేదండి.......................

నాకిక్కడ కుదరదులేండి, నే వెళతా.......................

అయ్యోయ్యో మీకేం కావాలో చెప్పండి.....

నాకిక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, వెళతా.......................

మీకేం ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాగా...................

టాటా, టాటా, టాటా, టాటా,............................

నానో, నానో, నానో..................................

Read more...

అత్త మీది కోపం దుత్త మీద

మనకి అకారణంగా ఎవరి మీదైనా కోపం వస్తుందా? ద్వేషం కలుగుతుందా??

మనకి తెలియని, తెలిసినా వ్యక్తిగత పరిచయం లేని, ఒట్టి ముఖ పరిచయం మాత్రమే ఉన్న వ్యక్తుల మీద అకారణ కోపాలు, ద్వేషాలు మనం చాలా సార్లు చూపిస్తుంటాము. (రాజకీయ నాయుకులు, టెర్రరిస్టులు, ......ఇలాంటి వారి మీద ఉండే లాంటి కోపం ద్వేషం గురించి కాదు నేను చెప్పేది). దీనికి కారణం పలానా అని కూడా చెప్పలేం. కొన్నిసార్లు మనకి సన్నిహితులైన వారి మీద ఉండే కోపాన్ని, అసహనాన్ని, ఉక్రోషాన్ని, వాళ్లని ఏమీ అనలేని అసహాయతని ఇలా వేరే ఎవరి మీదో వెళ్లగక్కుతుంటాం, అత్త మీది కోపాన్ని దుత్త మీద చూపించటం అన్నమాట. అది కూడా చాలా తెలివిగా ఆ చేసింది మనమే అన్న సంగతి వాళ్లకి తెలియకుండా చేస్తుంటాం. ఎక్కువసార్లు ఈ ప్రక్రియ మనకి తెలీకుండానే జరిగిపోతుంది. ఒక్కోసారి మనం అసలు ఈ విషయమే గమనించం. ఒకవేళ గమనించినా వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పటికి అది మనకు తప్పుగానే కనిపించదు, మన ప్రవర్తన చాలా సహజంగానే ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. మన ఆ ప్రవర్తనకి కారణాలు కూడా మనకి అప్పుడు అర్థం కావు. జీవితంలో అప్పుడప్పుడు వెనుతిరిగి చూసుకుంటాం కదా, అప్పుడు కనిపిస్తాయి ఇలాంటివన్నీ.

నేను ఇంటరులో ఉన్నప్పటి సంగతి. మా నాన్న ఫిజిక్సు లెక్చరరు. నేను అదే కాలేజిలో ఇంటరు చదివా. మాకు ఇంటరు రెండు సంవత్సరాలు ఫిజిక్సుకి మా నాన్నే వచ్చేవాళ్లు. మా నాన్నకి ఇంట్లో పిల్లలకి పాఠాలు చెప్పటం కాని, బయటి పిల్లలకి ట్యూషన్లు చెప్పటం కాని ఇష్టం లేని మరియు కష్టమయిన పని. ఆ రోజులలో కాలేజి లెక్చరర్లు అందులోనూ సైన్సు సబ్జెక్టు వాళ్ళు ట్యూషన్లు చెప్పకపోవటం చాలా అరుదాతి అరుదు. కార్పోరేటు కాలేజిలు వచ్చి వాళ్ల పొట్టలు కొట్టాయి కానీ, ట్యూషన్లంటే ఆ రోజులలో ఇంట్లో కామధేనువు ఉన్నట్లే.

నేను 10 వ తరగతి అయిపోయాక వేసవి సెలవులలో ఇంటరు పుస్తకాలు పట్టుకుని తెగ చదివేసేదాన్ని(10 వరకు తెలుగు మీడియంలో చదివి ఆ పుస్తకాలు పట్టుకుంటే ఏమి అర్థం అయ్యేది కాదులేండి, అది వేరే విషయం :) ). ముఖ్యంగా మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఫిజిక్సు తెగ చదివేసేదాన్ని, ఆయన చూడకపోతారా, నాకు పాఠాలు చెప్పకపోతారా అని. అబ్బే, మా నాన్న అదేం చూసేవాళ్లు కాదు. సరే ఇక కాలేజిలో చేరాక మా నాన్నకి బాగా దగ్గరి స్నేహితులైన ఒక ప్రముఖ డాక్టరు గారున్నారు. ఆయన పిల్లలిద్దరు (కవలలు) నాతో పాటే ఇంటరు చదివారు. అందులో ఒకళ్లు M.P.C., ఇంకొకళ్లు Bi.P.C. (అంటే మన సెక్షనే). ఈ Bi.P.C. జీవి ఎప్పుడూ చదువే చదువు అన్నట్లు ఉండేవాడు. పొద్దున లేవటం ట్యూషన్లతో రాత్రి పడుకోవటం ట్యూషన్లతో అన్నట్లుండేది. కాలేజీలో ఎంతమంది లెక్చరర్లు ఉంటే అంతమంది దగ్గరికి ట్యూషన్లకి వెళ్లేవాళ్లు. మరి మా నాన్న ట్యూషను చెప్పరుగా, అందుకని డాక్టరు గారు మా నాన్ననే కాలేజి అయిపోయాక వాళ్లింటికొచ్చి వాళ్ల పిల్లలకి ఓ గంట పాఠాలు చెప్పమని కోరగా ఓ రోజు కాలేజి అయిపోయాక మా నాన్న తనతో పాటు నన్ను కూడా ఆ డాక్టరు గారింటికి తీసుకుపోయారు. నేరుగా పైన మేడ మీద పిల్లల గదిలోకి వెళ్లాం. వెళ్లగానే పనమ్మాయితో కాఫీ, బిస్కట్లు వచ్చాయి. నాకు అర్థం కాలా ఇదంతా ఏంటో. కాసేపటికి సోదరులిద్దరు పుస్తకాలు పట్టుకుని వచ్చారు. మా నాన్న పాఠం మొదలుపెట్టారు. ఇక నా పరిస్థితి చూడండి అసలు మా నాన్న మా ఇంట్లో నాకు చెప్పకుండా వీళ్లింటికొచ్చి, తనొచ్చేదే కాక తనతో పాటు నన్ను కూడా తీసుకొచ్చి, వీళ్లతోపాటు నాకు పాఠాలు చెప్పటం ఏంటి అన్న ఉక్రోషం. మా నాన్నని ఏమీ అనలేను కదా! మరి నా ఉక్రోషం ఎలా తీర్చుకున్నానంటారా? ఆగండి మరి తరువాయి టపాలో చెప్తా.

Read more...

October 2, 2008

భోగ శ్రీనివాసుని వైభోగం

"ఆనంద నిలయం అనంత స్వర్ణమయం".. ఇది తితిదే కొత్తగా ప్రవేశపెట్టిన పథకం పేరు. ఆనందనిలయం మొత్తాన్ని బంగారంతో తీర్చి దిద్దబోతున్నారు. లోపలి గోడలతో సహా అడుగడుగునా బంగారమే. అబ్బా ఎంతటి మహత్తర కార్యం అనుకుంటున్నారా!! ఈ పథకానికి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో తెలుసా!!! 600 కోట్ల నుండి 1000 కోట్ల వరకు (ఆరువందల కిలోల పైగా బంగారం వాడతారట). అసలు ఇండియా వెనుకపడ్ద దేశం అనేదెవరు??

అమృతసర్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్, తమిళనాడులోని శ్రీపురంలో ఉన్న మహాలక్ష్మి గుడి (ఇక్కడ ఓ టన్ను పైగా బంగారం వాడారట) కంటే తిరుమల గుడిని ఇంకా ప్రసిద్ది చేయటానికి ఈ పథకాన్ని ప్రారంభించారట. అంతే కాదు ఒక కిలో అంతకంటే ఎక్కువ బంగారాన్ని దానమిచ్చిన వారికి ప్రత్యేక వసతులు, రాయితీలు కలిపించబడతాయట. ఇప్పటికే ఉన్న VIP దర్శనాలతో సామాన్య మానవుడికి దర్శనం దొరకటం ఎంత దుర్లభమవుతుందో చూస్తూనే ఉన్నాం, ఇక ఇవి కూడా మొదలయితే ఇక్కడినుండే ఆ భోగ శ్రీనివాసుడికి ఓ దండం పెట్టేసుకోవటం ఉత్తమం.

అసలు నాకు ఒక సందేహం, ఇంత ఖర్చు పెట్టి చేసే ఆ వైభోగం చూడటానికి మనల్ని అక్కడ ఉండనిచ్చే ఐదారు సెకండ్లలో మనవల్ల అవుతుందా! ఆ శ్రీపురంలో వంద మీటర్ల దూరంనుండే అమ్మవారిని దర్శనం చేసుకోవాలట, మరి ఇక నుండి మనం మన ఏడుకొండలవాడిని ఎన్ని మీటర్ల దూరంనుండి దర్శనం చేసుకోవాలో!

ఏడుకొండలపైన ఏల వెలిశావో......తెలుపర స్వామీ!!!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP