పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 15, 2007

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--ప్రథమ భాగం హైదరాబాదు లో


ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--ప్రథమ భాగం 5 లేక 6 రోజుల కాలంలో మొత్తం 24 గంటల కాల వ్యవధి వుండే కోర్స్. ఇది చాలా తేలికైనది మరియు ఆధ్యాత్మిక లౌకిక విజ్ఞాన్ని అందిస్తూ, ధ్యానం, పరస్పర సంభాషణలతో దివ్యానుభూతుల్ని చేకూరుస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ లో ఇది తొలి మెట్టు. ఇందులో శరీరంలోని చెడు పదార్థాలు (toxins), ఎప్పటినుండో పాతుకునిపోయిన శారీరక, మానసిక అవరోధాలు తొలిగిపోతాయి. శ్వాస క్రమబద్ధీకరణ వల్ల శరీరం, మనసు ఏకలయ స్థితిని సాధిస్తాయి.

Art of Living Part 1 Course for HARMONY in HYDERABAD

ఇప్పుడు హైదరాబాదులో మొదటి సారిగా 1000 కి మందికి పైగా పాల్గుంటున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--ప్రథమ భాగం జూన్ 26 నుండి జరగబోతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు కింది ఫోను నంబర్లలో సంప్రదించవచ్చును.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--ప్రథమ భాగం
జరుగు తేదీలు: జూన్ 26, 2007 నుండి జులై 1, 2007 వరకు.
వేదిక: గ్రీన్ పార్క్ ఫంక్షన్ హాలు (Green Park Function Hall), జూబ్లీ హిల్స్, మాదాపూర్ రోడ్.
సమయం: మంగళవారం (26/06/07) నుండి శుక్రవారం (29/06/07)వరకు ఉదయం 5:30 నుండి 8:00 వరకు.
శని (30/06/07)మరియు ఆదివారాలలో (01/07/07) ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
సంప్రదించవలసిన ఫోను నంబర్లు:
సెల్: 9848306180, 9849895295
భూమి ఫోను: 040-23400782, 65218418

Read more...

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--సుదర్శన క్రియ


ఆర్ట్ ఆఫ్ లివింగ్ పౌండేషన్ మరియు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హూమన్ వాల్యూస్ (జెనీవా) వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ అభివృద్దిపరచిన శ్వాసప్రక్రియ సుదర్శన క్రియ. ఇది ఓ అసమాన శ్వాసక్రియానైపుణ్యం. ఈ క్రియ వల్ల ఆనందం, నిర్విచారం, ప్రశాంత చిత్తం, శారీరక ఆరోగ్యం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 106 దేశాలలో రెండు కోట్లకి పైగా వ్యక్తులు ఈ ప్రక్రియ ద్వారా తమ జీవితాలలో నూతనోత్సాహంతో ఉన్నత పరిణామస్థాయిని సాధించారు. శ్వాసక్రియ లోని రహస్యం సాధన ద్వారానే తెలుస్తుంది.

సుదర్శన క్రియా ఫలితాలు:--

* ఒత్తిడిని పెంచే హార్మోనుల తగ్గుదల.
* రక్తంలో లాక్టేట్ స్థాయి తగ్గుదల.
* చెడు కొలస్త్రాల్ (L.D.L) తగ్గుదల, మంచి కొలెస్ట్రాల్ (H.D.L) పెరుగుదల.
* యాంటీ ఆక్సిడెంట్ ఎంజైము స్థాయి పెరుగుదల.
* రోగ నిరోధక శక్తి బలపడుట.
* మానసిక బలహీనత, ఒత్తిడుల నుంచి విముక్తి.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి జూన్ 10, ఈనాడు ఆదివారం పుస్తకం లో వచ్చిన వ్యాసం ఒక్కసారి ఇక్కడ చూడండి.

Read more...

June 7, 2007

తెలుగు కథకి జేజే 1

"తెలుగు కథకి జేజే" అన్న పుస్తకం 78 కథల సంకలనం. ప్రచురించింది అభినవ ప్రచురణలు, తిరుపతి వారు. వెల 300 రూపాయలు. సంకలనకర్త సాకం నాగరాజు గారు. ఆయన శ్రీకాకుళం డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులు.
ఇందులో శ్రీ శ్రీ, చలం, దేవులపల్లి నుండి బాపు వరకు తెలుగులో అతిరథమహారథులన్నదగ్గ వారి కథలు ఉన్నాయి. కొందరివి లేవు కూడా!!ఈ పుస్తకం ఏకబిగిన చదవగలిగేది కాదు. ఒక్కొకళ్ళది ఒక్కో శైలి, అందుకే ఆగి ఆగి నిదానంగా ఒక్కో కథ చదువుకోవాలి. నేను కూడా ఇంకా అన్నీ చదవలేదు, కానీ కొన్ని కథలు అంత గొప్పగా లేవు (నాకు). ఎక్కువగా చిన్న కథలే. నేను చదివినవాటిని చదివినట్లు నా వీలువెంబడి సమీక్షిస్తూ ఉంటాను.

అట్లపిండి:- చలం. ఈ కథ చదువుతుంటే అసలు ఇది చలం రాసిందేనా అన్న అనుమానం వస్తుంది. ఆయన సాధారణ శైలికి భిన్నంగా వుంటుంది. కథావస్తువు చాలా చిన్నదే కానీ చెప్పిన విధానం బాగుంటుంది. వాళ్ళ నాయనమ్మ (అట్ల బామ్మ) ఒకావిడ అట్లు చాలా బాగా వండేది. కానీ పిండి recipe ఎవరికి తెలియదు, అడిగినా చెప్పేది కాదు. ఒకసారి ఆయన చెల్లెలు గర్భిణీతో వుండి బామ్మ అట్లు తినాలని ఉందని ఉత్తరం రాస్తుంది. బామ్మ పిండి కలిపి ఒక పెద్ద సత్తెపాళలో (సత్తు తపాళా) పోసి గుడ్డ వాసిన కట్టి ఈయనకు ఇస్తుంది తెసుకెళ్ళమని. నేను మరునాడు వస్తాను నేను వచ్చేవరకు ఆ పిండి మూట విప్పొద్దు అని చెపుతుంది. ఇక ఈయన రాజమండ్రికి రైలులో బయలుదేరతాడు. ఈయన ఎక్కిన దగ్గరనుండి ఆ కంపార్టుమెంటు నుండి ఒక్కొకళ్ళు దిగి వెళ్ళిపోతుంటారు ఈ పిండి వాసనకి. చివరికి ఆ కంపార్టుమెంటులో ఈయన ఒక్కడే మిగులుతాడు. ఆ తరువాత ట్రైను దిగిన తరువాత ఆ పిండి మూట పట్టుకుని ఇంటికి వెళ్ళటానికి రిక్షా వాళ్ళతో పడ్డ పాట్లు మనకు నవ్వు తెప్పిస్తాయి. మరునాడు వస్తానన్న బామ్మ రాదు. నాలుగు రోజులు అయినా రాదు. ఇక ఆ పిండిని వదిలించుకోవటానికి వీళ్ళు పడ్డ పాట్లు, చుట్టుపక్కల వాళ్ళతో తంటాలు , గోదావరిలో వేసినా, శ్మశానంలో పూడ్చి పెట్టినా అది తిరిగి వీళ్ళింటికే రావటం, చివరికి అనంతపురంలో వీళ్ళు బాకీ ఉన్న ఒకాయనకి పిండిని పోస్టులో పంపించటం, ఈ పిండి వాసన దెబ్బకి అక్కడ ప్లేగు వ్యాది మొదలవటం ఇదీ కథ. సునిశితమైన హాస్యం ఉన్న కథ. చలం శైలికి భిన్నంగా ఉండటానేమో నాకు నచ్చింది.

అడల్ట్ స్టోరీ:-కె.ఎన్.వై. పతంజలి. విషయం లేని కథ. క్లుప్తంగా చెప్పాలంటే నిరోద్ వాడటం మీద భార్యా భర్తలకి మద్య జరిగే సంభాషణ ఈ కథ. ఇంతకు మించి దీన్ని గురించి చెప్పటానికి ఏమీ లేదు. పతంజలి స్థాయికి తగ్గట్లుగా లేదు.

అర్రు కడిగిన ఎద్దు:-త్రిపురనేని గోపిచంద్. ఓ మంచి కథ. ఇది ఓ ముసలి ఎద్దు స్వగతం. వయసులో వుండగా తనని యజమాని ఎలా చూసేవాడో, ఇప్పుడు ఎలా చూస్తున్నాడో చెప్పుకునే కథ. ఆ ముసలి ఎద్దునే కాదు, ఆ ఇంటి యజమాని తండ్రి అయిన ముసలతని గురించి కూడా చెప్పే కథ ఇది. ఇద్దరికి పోలికలు చూపిస్తాడు రచయిత. మిగతా పశువులు తినగా మిగిలిపోయిన జనపమోళ్ళు, ఎండుగడ్డి ముసలి ఎద్దుకి పెడితే, ఇంట్లో వాళ్లందరూ తిన్నాక మిగిలిన అడుగు బొడుగు అన్నం ముసలాయనికి పెడుతుంటారు. ఈ ముసలి ఎద్దు, ఆ ముసలాయన అప్పుడప్పుడూ ఒకళ్ళని ఒకళ్ళు ఓదార్చుకుంటుంటారు. ఒకప్పుడు రైతులు పశువులిని ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా చూస్తున్నారో చెపుతూ అంతర్లీనంగా మానవ సంబంధాలు రోజు రోజుకి ఎలా మార్పు చెందుతున్నాయో చెప్పే కథ ఇది.

ఈ కథ చదువుతుంటే మా బోడెద్దు గుర్తుకొచ్చింది. మా చిన్నప్పుడు మాకు ఓ బోడెద్దు వుండేది. దానికి కొమ్ములు వుండేవి కావు, అందుకని దాన్ని బోడెద్దు అనేవాళ్ళం. అది పుట్టటం కూడ మా దొడ్లోనే పుట్టింది. చాలా సాత్వికంగా వుండేది. ఎవరిని ఏం అనేది కాదు. దానికి జత ఓ కోడెద్దు. మంచి పొగరుగా, హుషారుగా వుండేదని దానిని కోడెద్దు అనేవాళ్ళం. అలవాటు అయిన వాళ్ళని తప్పితే కొత్త వాళ్ళని అసలు దగ్గరికే రానిచ్చేది కాదు. ఈ రెండిటిని కట్టుకొని టైరు బండి మీద పోవటమంటే మాకు చాలా ఇష్టంగా వుండేది. సినిమాలకి కూడా బండి మీదే వెళ్ళేవాళ్ళం. బోడెద్దు బాగా ముసల్ది అయినా ఓపికగానే ఉండేది. ఇక అది బండికి కట్టటానికి పనికిరాదనుకున్నాక ఇంకో ఎద్దుని కొన్నా దీనిని అలానే ఉంచుకున్నాము. మా అందరికి అదంటే చాలా ఇష్టంగా వుండేది. మా నాయనమ్మకి మరీ. జీతగాళ్ళు దానికి కుడితి అదీ సరిగ్గా పెట్టరేమోనని ఆవిడే పెట్టేది. అది చనిపోయినాక బండి మీద తీసుకు వెళ్ళి మా పొలంలో మా తాతమ్మ సమాధి పక్కనే దాన్ని కూడా పాతి పెట్టారు. మా నాయనమ్మ అయితే దాన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఏడ్చేసింది కూడా. తరువాత తరువాత ఎడ్లూ, గొడ్లూ అన్నీ పోయి ఇప్పుడు బోడి చావిళ్ళు మిగిలాయి. ఈ కథ చదివాక అవన్నీ గుర్తుకొచ్చి కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి.

అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది:-దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావకవి కృష్ణశాస్త్రి గారి కథ ఇది. భావకవిలో హాస్యపాలు కూడా ఎక్కువే అనిపించిన కథ. చదవవలిసిన కథ.
ఓ సుబ్బమ్మవ్వ గురించి ఈ కథ. మన తెలుగు నాట ప్రతి ఊళ్ళో చూసే అవ్వే ఈ సుబ్బమ్మవ్వ. ఈ కథలో ప్రతి పదంలో హాస్యం తొంగి చూస్తూ వుంటుంది. కొన్ని పద ప్రయోగాలు గమ్మత్తుగా వుంటాయి. ఉదాహరణకి-"మా నాన్న మేనత్తంటే డెబ్భై పైమాట గదా. అయితేం నడుం నిటాగ్గ కదురులా నిలబెడుతుంది. యిష్టం లేనప్పుడు మాత్రం తెలుగులో ఐ అక్షరం లేదూ ఐ దానిలాగా వొంగిపోతుంది" ఇలాంటివి ఎన్నో!!
కొన్ని వ్యాక్యాలు చదువుతుంటే పడి పడి నవ్వుతాము. ఈ కథ చదువుతుంటే ముళ్ళపూడి వారిలో కాస్త దేవులపల్లి వారి శైలి ఉందేమో అనిపిస్తుంది. ఈ సుబ్బమ్మవ్వ గారు ఒకసారి మనవడితో తిరునాళ్లకి వెళ్ళి తప్పిపోతుంది. ఆ తరువాత ఆమె ఇంటికి ఎలా చేరింది, ఆమె గురించి ఇంట్లో వాళ్ళు ఎంత అదుర్దా పడింది మంచి హ్యాస్యభరితంగా చెప్పారు దేవులపల్లి వారు.
సమీక్ష కన్నా కథ చదివితేనే మీరు కూడా పడి పడి నవ్వగలరు.

Read more...

June 1, 2007

శవాల మీద రాబందులు


మన హైదరాబాదులో ఆరోగ్యవంతుల నుండి దొంగతనంగా మూత్రపిండాలు తీసి అమ్ముకునే దళారుల గురించి, ఆసుపత్రుల గురించి విన్నాము! అమ్మో ఇంత దారుణమా అనుకున్నాము!! మరి అమెరికాలో అయితే ఇంకా దారుణంగా చచ్చిన శవాలతో కూడ వ్యాపారం చేసుకుంటున్నారు. చనిపోయిన వాళ్ళనుండి ఎముకలు (bones), నరాలు (tendons, ligaments), కణజాలం (tissue), రక్తనాళాలు (blood vessels) కాదేది దోచుకోవటానికనర్హం అన్నట్లు అన్నీ దోచేసుకుంటున్నారంట. ఓ శ్మశానవాటిక సాక్షిగా ఇదంతా జరిగేదంట. పూర్తి వివరాలకి ఇక్కడ చూడండి.

శరీరంలోని ప్రతి ఎముకకి, రక్తనాళానికి ఓ ధర ఉందంట. ఒకసారి ఆ ధరవరలు చూడండి. (యువకుల ఎముకలకి ఎక్కువ ధరలంట!)
Femur bone (తొడ ఎముక)
65 సంవత్సరాల లోపు వాళ్ళది అయితే------$970 అంటే సుమారుగా 38000 రూపాయలు.
65 సంవత్సరాల పై బడ్డ వాళ్ళది అయితే----$550 అంటే సుమారుగా 22000 రూపాయలు.
Tibia (మోకాలి కింది ఎముక)-----------$385 to $600 అంటే సుమారుగా 15400 నుండి 24000 రూపాయల వరకు.
రక్తనాళాలు (పరిమాణాన్ని బట్టి)------------$350 to $1000 అంటే సుమారుగా 14000 నుండి 40000 రూపాయల వరకు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ కణాలు కాని ఎముకలు కాని ఎవరైనా కాన్సర్ రోగి నుండి కాని లేక ఏదైనా ప్రమాదకర రోగం బారిన పడి చనిపోయిన వారినుండి కాని సేకరిస్తే ఇవి transplant చేయించుకున్న వ్యక్తికి కూడా ప్రమాదమే.

నిజంగా ఎటు పోతున్నాం మనం? పురోగమనం వైపా, తిరోగమనం వైపా!!!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP