పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

May 18, 2009

లోక్‌సత్తా సత్తా

హమ్మయ్య..ఓ నెల రోజుల ఎదురుచూపుల తరువాత ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చర్చలు, వాదోపవాదాలు ముగిసాయి. మన మీడియా మాత్రం ఎన్నికల ఫలితాల మీద చర్చల్ని ఇంకా సాగతీస్తూనే ఉంది. నాకెందుకో ముందునుండీ ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కాంగ్రెస్సే ఎలాగోలా మళ్లీ అధికారంలోకి వస్తుందనిపించింది.  రాష్ట్రంలో కాసిన్ని సీట్లు తగ్గితే చిరంజీవితో పొత్తుతో అధికారంలోకి వస్తుందనుకున్నా కాని తన స్వంత బలం మీదే అధికారంలోకి వచ్చింది. ఇది కాంగ్రెస్సు గెలుపు అనటం కన్నా మహాకూటమి ఓటమి అనవచ్చేమో.  గెలుపోటముల మధ్య తేడా ఒకే ఒక్క శాతం. కాంగ్రెస్సుకి వచ్చిన ఓట్లు 36 శాతం మాత్రమే అంటే  64 శాతం ప్రజలు కాంగ్రెస్సుని వద్దనుకుంటున్నారన్నమాట! అయినా ఈ మైనార్టీ నాయకులే మన పాలకులు, ఇదీ మన ప్రజాస్వామ్యం!

ఈ సారి కేంద్రంలో కూడా  అలకలకొలికి లెఫ్టుతో, తంపులమారి లాలూతో సంబంధం లేకుండా కాంగ్రెస్సు అధికారం చేజిక్కించుకున్నందుకు నాకయితే సంతోషంగా ఉంది. మాట్లాడితే మద్దతు ఉపసంహరించుకుంటామన్న బెదిరింపులు, ఈ పేచీకోరు పొత్తులతో ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో  అన్న చింత ఇకపై ఉండదు.

అసలు రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు అన్న దాని కన్నా నేను ముందునుండి ఎదురుచూసింది లోక్‌సత్తాకి ఎన్ని ఓట్లు వస్తాయి అనే.  లోక్‌సత్తాకి వచ్చిన ఓట్ల శాతం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. లోక్‌సత్తాకి ఓటు వేయటం అంటే మీ ఓటు మురగపెట్టుకోవటమే అన్న వాళ్లు ఉన్నారు, హేళనగా నవ్విన వాళ్లు ఉన్నారు, అసలు లోక్‌సత్తా అభ్యర్థులకి డిపాజిట్టు అన్నా దక్కుతుందా అని చులకనగా చూసిన వాళ్లూ ఉన్నారు, ఈ సారికి మేము సాంప్రదాయకంగా ఎప్పుడూ ఓటు వేసే మా సాంప్రదాయక పార్టీకే ఓటు వేస్తాం-వచ్చేసారి లోక్‌సత్తాకి చూద్దాంలే అన్న వారూ ఉన్నారు.....కానీ ఇప్పుడు లోక్‌సత్తాకి వచ్చిన ఓట్లే మిగతా పార్టీల గెలుపోటములని ప్రభావితం చేయటంతో లోక్‌సత్తా సత్తా ఏంటో అందరికీ అర్థం అయిపోయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదు పరిథిలో తెలుగుదేశానికి తీరని నష్టం తెచ్చింది లోక్‌సత్తానే!

ఏదేమైనా ఎప్పటికైనా లోక్‌సత్తా అథికారంలోకి రావటం కల్ల అంటున్నారు జనాలు. ఇక్కడ అధికారం కాదు ముఖ్యం. ప్రజల గోడుని ప్రభుత్వం దాకా తీసుకెళ్ల గలిగే నాయకులు కావాలి, అధికారం లేకపోయినా ప్రజల సమస్యలకి బాధ్యత వహించే నాయకులు కావాలి. అలాంటి నాయకులు ఒక్కళ్లున్నా చాలు. వచ్చే ఎన్నికల తరువాత ఈ ఒక్కడికి మరో నలుగురు తోడయినా చాలు.

అసలు గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా ఈ EVM లు వచ్చాక ఫలితాలు త్వరత్వరగా వెలువడుతుంటే నాకయితే అస్సలు నచ్చలేదు.  ఇదివరకటి మజా లేదు.  తెల్లవారుజాము దాకా టి.వి. ముందు కూర్చుని ఓ పుస్తకం కలం తీసుకుని రాష్ట్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా, అభ్యర్థుల పేర్లతో  పట్టికలు  గీసుకుని ఎవరెంత లీడింగులో ఉన్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తున్నాయి, ఎవరెన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు అని మన లెక్కలు మనం వేసుకోవటంలో ఓ ఆనందం ఉండేది.  మరుసటి రోజు సాయంత్రం దాకా కూడా కొన్ని ఫలితాలు వస్తుండేవి. ఇప్పుడేంటి అన్నం వేళకే దాదాపు అన్ని ఫలితాలు తెలిసిపోతుండే! మెజార్టీలు కూడా చూడండి ఎంత తగ్గిపోయాయో! అప్పట్లో పెద్ద పెద్ద నాయకుల మెజారిటీ లక్షల్లో ఉండేది. 10,000 కి తక్కువ మెజార్టీ చాలా తక్కువగా కనపడేది. 1999 ఎన్నికలప్పటి ఎన్నికల లెక్కల పుస్తకాలు ఇంకా మా ఇంట్లో ఉన్నాయి!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP