పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 13, 2009

తెలుగులో పిల్లలు చదవదగ్గ పుస్తకాలు

ఏం చదవాలి?
మొన్న శనివారం విశాలాంధ్రకి వెళుతుంటే మా ఆమ్మాయి అమ్మా మాకు కూడా ఏవైనా పుస్తకాలు తీసుకురా అంది, సరే తెస్తాను కాని తెలుగు పుస్తకాలే తెస్తాను అన్నా, సరే అవే తీసుకురా అంది. తెస్తానని చెప్పాను కాని తీరా అక్కడికి వెళ్లాక తెలుగులో 13 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలకి ఆసక్తికరంగా వుండే  పుస్తకాలు నాకేం కనిపించల! ఇది అసలు నాకు ఎప్పుడూ ఉండే సమస్యే. ఉన్న పుస్తకాలలోనే తీసుకోవచ్చుగా అంటారా? అదే అసలు సమస్య. ఈ వయస్సు అటూ ఇటూ కాని వయస్సు. అటు బాలసాహిత్యానికి ఎక్కువ ఇటు పెద్దల సాహిత్యానికి తక్కువ. అందులోనూ మా పిల్లలు బాల సాహిత్యంలో చాలా వరకు పుస్తకాలు చదివారు. కొన్ని ఇంగ్లీషు పుస్తకాలకి తెలుగు అనువాదాలు చదివారు. ఇక పెద్దల సాహిత్యానికి వస్తే ఇల్లేరమ్మ కథలు, దర్గామిట్ట కథలు, ప్రళయకావేరి కథలు, సలాం హైదరాబాదు, ఇల్లాలి ముచ్చట్లు, చంఘీజ్‌ఖాన్, ముళ్లపూడి, నాయని, శ్రీరమణల రచనలు.....ఇలాంటివి కొన్ని ఇంతకుముందే చదివారు, మరి ఈ సారి వాళ్లకంటూ ఏం తీసుకోవాలో నాకు అర్థం కాలేదు.

అదే ఇంగ్లీషులో చూడండి పుంఖానుపుంఖానులుగా పుస్తకాలు వుంటాయి, అక్కడ ఏం తీసుకోవాలో అర్థం కాదు, ఇక్కడ తీసుకోవటానికి ఏమీ దొరకవు అన్నట్టు వుంటుంది పరిస్థితి. మొన్నటి హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో మా పిల్లలని ఈ సారి పుస్తకాలు మీరే వెతుక్కుని కొనుక్కోండి అని వదిలేస్తే అన్నీ ఇంగ్లీషు పుస్తకాలే కొనుక్కొచ్చారు, ఇదేంటర్రా అంటే మరి మాకు తెలుగులో ఏం కనపడలేదు అన్నారు. మేము ఇంగ్లీషు పుస్తకాలు పెద్దగా చదివిందీ లేదు వాళ్లకి చెప్పిందీ లేదు మరి వాళ్లకి ఇంగ్లీషువి దొరికినప్పుడు తెలుగువి ఎందుకు దొరకలేదు? తెలుగులో ఈ వయస్సు పిల్లలని దృష్టిలో పెట్టుకుని అసలు పుస్తకాలు వస్తున్నాయా? రాకపోతే ఎందుకు రావటం లేదు?

ఇక మొన్న ఏం దొరకక యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల తీసుకున్నాను. ఇంటికి వచ్చాక మా అమ్మాయి అడిగింది ఏం తెచ్చావు అని, నాకేం కనిపించల అందుకని ఈ పుస్తకం తెచ్చాను అని చూపిస్తే ఇదా అని ఓ చూపు చూసి అవతల పడేసింది. నువ్వు ఆ మధ్య చదివిన చేతన్ భగత్ కంటే చాలా బాగా వ్రాస్తాడు చదువు అన్నా. అసలు మీరు చిన్నప్పుడు ఎలాంటి పుస్తకాలు చదివేవాళ్లు అంది----అవును అప్పుడు ఏం చదివేవాళ్లం?----ఒకసారి గతంలోకి తొంగి చూస్తే......

అప్పుడు కూడా ఈ వయస్సు పిల్లలకంటూ ప్రత్యేకంగా తెలుగు సాహిత్యం ఏమీ వుండేది కాదు. మా ఇంటికి అన్ని వార, మాస పత్రికలు వచ్చేవి. దాదాపు ఆరు ఏడు తరగతుల నుండే ఈ పత్రికలు చదివేవాళ్లం. అందులో వచ్చే సీరియల్సు అన్నీ మా నాన్న చింపి పుస్తకాలు కుట్టేవారు. ఎండాకాలం సెలవులలో అవన్నీ చదవటం మంచి కాలక్షేపంగా వుండేది. అవి కాక మా పక్క ఊరిలో మంచి గ్రంధాలయం వుండేది, అందులో అప్పట్లో వచ్చిన నవలలన్నీ దొరికేవి, మేము హైస్కూలు ఆ ఊరిలొనే చదివాం కాబట్టి స్కూలు నుండి వస్తూ అవి తెచ్చుకునేవాళ్లం. ఇక మా బంధువులకి పుస్తకాలు అద్దెకిచ్చే షాపు ఉండేది, అక్కడ నుండి ప్రముఖుల కొత్త నవలలు, కొమ్మూరి సాంబశివరావు, షాడో మధు బాబుల  డిటెక్టివ్ పుస్తకాలు  తెచ్చుకుని  ఎప్పటివప్పుడు చదివేసి తరువాతి పుస్తకం కోసం ఎదురు చూస్తుండేవాళ్లం.  కొమ్మూరి సాంబశివరావుది అయితే నెలకొక పుస్తకం విడుదలవుతుండేదని గుర్తు. గిరిజశ్రీ భగవాన్‌వి కూడా బాగానే చదివేవాళ్లం. అప్పట్లో డిటెక్టివ్ నవలలు పెద్దలు పిన్నలు అందరూ విపరీతంగా చదివేవాళ్లు.


యద్దనపూడి, మాదిరెడ్డి, యండమూరి, మల్లాది, చల్లా సుబ్రమణ్యం, చందు సోంబాబు, యర్రంశెట్టి, కొమ్మనాపల్లి, కోగంటి విజయలక్ష్మి, జొన్నలగడ్డ లలితాదేవి, పోలాప్రగడ, వాసిరెడ్డి, తురగా (మోచర్ల) జయశ్యామల, తురగా జానకీరాణి, అరెకపూడి (కోడూరి) కౌసల్యా దేవి (ఈవిడ నవలల పేర్లలో ఎక్కువగా చక్రం వుంటుండేది!), లల్లాదేవి, తోటకూర ఆశాలత, లత, రంగనాయకమ్మ, డి. కామేశ్వరి, బీనా దేవి, రావినూతల సువర్నాకన్నన్, వడ్డెర చండీదాస్......అబ్బో లెక్కలేనంతమంది......అందరి పుస్తకాలు నమిలేసేవాళ్లం. ఇందులో ఎన్ని గుర్తున్నాయి అని మాత్రం అడగకండి! ఏ పుస్తకం కొని చదివిన పాపాన మాత్రం పోలేదు. ఇక ఇప్పుడు పుస్తకాలు అద్దెకిచ్చే షాపులూ లేవు, మా చుట్టాల కొట్టూ   లేదు....ఏం చేస్తాం....ఓ పదేళ్ల నుండి పుస్తకాలు కొనే చదువుతున్నాం లేండి!


కథలు, సీరియళ్లే కాదు అప్పట్లో శ్రీశ్రీ ప్రశ్న-జవాబు(ప్రజ), మాలతీచందూర్ ప్రమదావనం, రామలక్ష్మి ప్రశ్నలు-జవాబులు, పురాణం సీత ఇల్లాలి ముచ్చట్లు ఇత్యాదివి చాలా ఆసక్తికరంగా వుండేవి. అచ్చంగా వీటికోసమే పత్రికలు చదివేవాళ్లు వుండేవారు. వారపత్రికలే కాకుండా వనిత, వనితాజ్యోతి, మహిళ, యువ, జ్యోతి లాంటి మాసపత్రికలు కూడా అందుబాటులో వుండేవి.  ఏవో ఒకటీ అరా తప్పితే ఈ పత్రికల స్థాయి కూడా బాగుండేది, వాటిమధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ వుండేది. 70-80లలో తెలుగులో రచయిత్రుల హవా బాగా నడిచిందని చెప్పవచ్చు.అందుకే ఆకాలంలో ఆడపేర్లు పెట్టుకుని వ్రాసే మగవారు ఎక్కువగా వుండేవారు.

ఇక అసలు విషయానికి వస్తే అప్పట్లో దొరికింది  ఏదైనా చదివేవాళ్లం కాబట్టి పిల్లలకంటూ ప్రత్యేకంగా పుస్తకాలు లేకపోయినా ఆ లోటు తెలియలేదేమో! అప్పటి ఆ పుస్తకాలు ఇప్పటి పిల్లలకి అంత ఆసక్తికరంగా ఎందుకు వుండటం లేదు? వాళ్ల అభిరుచులకు తగ్గట్టు తెలుగులో పుస్తకాలు ఎందుకు రావటం లేదు? నచ్చకపోవటానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి? ఇంగ్లీషు మాధ్యమంలోని చదువుల ప్రభావమా! తెలుగులో పుస్తకాలు చదివే వాళ్లు (పిల్లలు మరియు పెద్దలు) తగ్గిపోవటమా! ఇంగ్లీషు సాహిత్యం ప్రభావమా! టి.వీ.లు, కంప్యూటర్ల మహిమా! తోటి పిల్లల ప్రభావమా! తోటి పిల్లల ప్రభావం అని ఎందుకంటున్నానంటే మేమా పుస్తకం చదివాం ఈ పుస్తకం చదివాం అంటూ పిల్లల మధ్య చర్చలు జరుగుతుంటాయి, అందులో తెలుగు పుస్తకాల గురించి చర్చ వస్తే ఆశ్చర్యపడాల్సిందే. ఒకవేళ ఎవరైనా తెలుగు పుస్తకాలు చదివే పిల్లలు ఉన్నా వాటి గురించి మాట్లాడటం తక్కువతనం అనుకునే రోజులు ఇవి. అసలు ఇప్పుడు ఈ వయస్సు పిల్లలని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా రచనలు చేస్తున్నారా?ఒకవేళ రచనలు చేసేవాళ్లు ఉన్నా చదివేవాళ్లు ఉన్నారా? ఏంటో ఈ టపా అంతా ప్రశ్నలమయమే అనుకుంటున్నారా?

చివరిగా ఇంకొక్కటే ఒక్క ప్రశ్న!అసలు ఈ వయస్సు పిల్లలు చదవతగ్గ పుస్తకాలు తెలుగులో ఏం ఉన్నాయి? తెలిసిన పెద్దలు చెప్పగలరు. చదివే అభిరుచి ఉండాలే కాని ఏవైనా చదవ్వొచ్చు అంటారా!

Read more...

March 10, 2009

రంగుల పండుగ......మరక మంచిదే

హోలీ-రంగుల పండుగ-మేము చదువుకునే కాలంలో అంటే ఓ 25 సంవత్సారాల క్రితం ఈ పండుగ గురించి కోస్తా ప్రాంతంలో పెద్దగా తెలియదు. శ్రీరామ నవమికి గులాం చల్లుకోవటమే తెలుసు కాని ఇలా రంగుల్లో మునగటం తెలియదు. మేము డిగ్రీలో వుండగా బాపట్ల ఇంజనీరింగు కాలేజి పిల్లలు కాస్తంత హోలీ ఆడేవారు. అమ్మాయిలు కూడా రోడ్ల మీదకి వచ్చి రంగులు చల్లుకోవటం మాకొక వింతగా వుండేది. ఆ తరువాత తమిళనాడులో కూడా ఈ పండగ అంతగా చేసుకునే వాళ్లు కాదు. తరువాత తరువాత దక్షిణాదిలో ఈ పండుగ వ్యాప్తి చెందటానికి మీడియా మరియు  సినిమాలే ముఖ్య కారణం అనిపిస్తుంటుంది నాకు.

పెళ్లయ్యాక తెలాంగాణా ప్రాంతానికి వెళ్లాక మాత్రం ఈ పండుగ తన అసలు రంగుల్లో కనపడింది. మేమున్న ప్రాంతంలో ఈ పండగ చాలా బాగా చేసుకునేవాళ్లు. పెద్దా చిన్నా ఆడా మగా తేడా లేకుండా అందరూ రోడ్ల మీదే వుండేవారు ఆరోజు. ముందే పిల్లలకి వళ్లంతా నూనె రాసి అట్టిపెట్టే వాళ్లం. హోలీ ఆడనివాళ్లు కాలనీలో చాలా తక్కువ వుండేవాళ్లు. ఆడటం  ఇష్టం లేని వాళ్లు ఇళ్లల్లో తలుపులేసుకుని కూర్చున్నా తలుపులు పగలకొట్టి మరీ వాళ్లని వాళ్లతోపాటు ఇంటిని కూడా రంగుల్లో ముంచి వెళ్లేవాళ్లు. పిల్లలకి కూడా మంచి సరదాగా వుండేది. అంతా రంగుల్లో మునగటం అయ్యాక మగవాళ్లు గోదావరిలో స్నానాలు చేసి వచ్చేవాళ్లు. ఇంట్లో ఆడవాళ్లకి ఇంటిని, పిల్లలని, వంటిని శుభ్రం చేసుకోవటం సరిపోయేది. తరువాత మధ్యాహ్నమో రాత్రో క్లబ్బులో హోలీ స్పెషల్ విందు కూడా వుండేది. అదొక సామూహిక వేడుక లాగా వుండేది. మరే పండగ కూడా ఇలా అందరూ కలిసి చేసుకోవటం కనిపించదు.

జనమంతా ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ రంగుల పండుగలో అక్కడక్కడా అపశ్రుతులు వింటూ ఉంటాం. ఈ రంగులు కొంతమంది జీవితాలలో మాయని మరకలు మిగిలిస్తుంటాయి. విచక్షణా రహితంగా కృత్రిమ రంగులు వాడి  కళ్లు పోగోట్టుకునే వారు, చర్మ వ్యాధులతో, ఆస్త్మా సమస్యలతో,  ఇంకా వివిధ రకాల అలర్జీలతో బాధపడే వాళ్లు చాలా మంది ఉంటారు. అంతే కాదు కొన్ని రకాల కృత్రిమ రంగుల వల్ల కాన్సరు, మూత్రపిండాల సమస్యలు కూడా రావచ్చు. వేడుకగా రంగులు చల్లుకునే వాళ్లు కొన్ని సూచనలు పాటిస్తే ఈ రంగుల మరకలు మంచివే అవుతాయి.
  1. సహజ రంగులనే వాడండి. ఇవి మన శరీరానికే కాదు పర్యావరణానికి కూడా మంచివి.
  2. రంగులు ముఖంపై-ముఖ్యంగా కళ్లల్లోకి, ముక్కుల్లోకి, నోట్లోకి  పడకుండా చూసుకోండి. 
  3. ఎదుటివారి ముఖాలపైనా కళ్లల్లోనూ రంగులు కొట్టకండి.
  4. రంగులు చల్లుకునేటప్పుడు కళ్లద్దాలు పెట్టుకోవటం ఉత్తమం.
  5. కళ్లల్లో రంగు పడ్డట్టు అనిపిస్తే వెంటనే కళ్లని చల్లటి నీటితో బాగా కడుక్కోండి, కంటికి ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించండి.. 
  6. చంటిపిల్లలని ఈ వేడుకలకి దూరంగా వుంచండి.
సహజ రంగులని మనమే ఇంట్లో చేసుకోవచ్చు. పసుపు, కుంకుమ, పూలు, పళ్లు, ఆకులు, రకరకాల పిండులు- అసలు మనం వంటింట్లో నిత్యం వాడే వస్తువులు ఈ రంగుల తయారీలో వాడవచ్చు.  ఇంటికి,  వంటికి, పర్యావరణానికి అన్నిటికి మేలు చేసిన వాళ్లమవుతాం. ఇవి తయారు చేసుకోవటం కూడ సులువే. ఆకులని, పూలని, గింజలని ఎండబెట్టి పొడిచేసుకుని లేదా నీళ్లలో నానబెట్టి (అవసరమయితే కాస్తంత ఉడకపెట్టుకొని)  ఆపై కావలసినన్ని నీళ్లు కలుపుకుని చల్లుకోవటమే.

ఎరుపు రంగు కోసం గంధం, ఎర్ర మందార పువ్వులు, flame of forest (మోదుగ) పువ్వులు, గోగు పూలు, దానిమ్మ తొక్కు,  టమాటా, కారెట్టు, సున్నం పసుపుల మిశ్రమం.
పసుపు రంగు కోసం పసుపు శనగపిండిల మిశ్రమం, బంతి పూలు, పసుపుపచ్చ చేమంతి పూలు.
ఆకుపచ్చ రంగు కొరకు గోరింటాకు, గుల్‌మొహర్ ఆకులు, వీట్ జెర్మ్ (గోధుమ మొలకలు), పాలకూర, కొత్తిమీర, పుదీనా, టమాటా ఆకులు
బ్లూ రంగు కోసం సిరా చెట్టు (Indigo plant) అంటారు చూసారా దాని కాయలు.
ముదురు కెంపు రంగు కోసం బీటురూటు, ఉల్లిపాయ తొక్కలు.
పారిజాత పూల కాడలను ఎండబెట్టి వాటిని అవసరమయినప్పుడు నీటిలో నానపెడితే మంచి సింధూర వర్ణం తయారు.
బ్రౌన్ రంగు కోసం కాఫీ పొడి కాని టీ పొడి కాని మరగపెట్టిన నీళ్లు
ఇక నలుపు రంగు కూడా చేయవచ్చు ఎలా ఆంటారా-నలద్రాక్ష రసం వాడవచ్చు. అంతే కాదు ఎండబెట్టిన పెద్ద ఉసిరికాయల్ని ఓ ఇనుప మూకుడులో ఉడికించి ఓ రాత్రంతా అలాగే వదిలేసి మరునాడు కావలసినంత నీటిని కలుపుకుంటే మిలమిలలాడే నలుపు రంగు సిద్ధం.

అబ్బ ఈ మాత్రం శ్రమ కూడా మేం పడలేమంటారా సరే మనలాంటి వారి కోసం అదిలాబాదుకి చెందిన కొంతమంది మహిళలు మోదుగ పూలతో రంగులు తయారుచేసి అమ్ముతున్నారు. మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మరియు అదిలాబాద్ కృషివిజ్ఞానకేంద్రం వారు కలిసి ఈ రంగులు అమ్మే కేంద్రాన్ని నిన్నటినుండి (09/03/09) కోఠి మహిళా కళాశాల వద్ద ఏర్పాటు చేసారు. ద్రవరూపంలో అయితే ఒక సీసా 20 రూపాయలు పొడి రూపంలో అయితే ఒక్కో ప్యాకెట్టు 30 రూపాయలట. ఇంకా వివరాలు కావాలంటే 9989623829 కి ఫోను చేసి  తెలుసుకోవచ్చు.

అందరికి హోలీ శుభాకాంక్షలు.

Read more...

March 5, 2009

వక్కపలుకులు-8 మంచి తరుణం....

మండే ఎండలు, పిల్లల పరీక్షలు కలిసి వాతావరణం చాలా వేడి వేడిగా వుంది. ఈ మండే ఎండలలో పుస్తక ప్రియులకి ఓ చల్లటి వార్త. విశాలాంధ్ర వారి వార్షిక క్లియరెన్సు అమ్మకం సందర్భంగా కొన్ని పుస్తకాల మీద 10 నుండి 50 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. విశాలాంధ్ర బ్యాంక్ స్ట్రీట్ బ్రాంచి మరియు యూసఫ్‌గూడా చౌరస్తాలో ఈ తగ్గింపు అమ్మకం ఈ నెల 25 వరకు వుంటుంది. పుస్తకాలు కొనాలనుకునేవారికి ఇదే మరి మంచి తరుణం వదులుకోకండి.

జాషువా, ఆరుద్ర, దాశరథి, వాసిరెడ్ది సీతాదేవి, గొల్లపూడి, బాపురెడ్డి మొదలయిన రచయితల పుస్తకాలపై 50 శాతం తగ్గింపు మరియు ఇతర పుస్తకాలపై 10 నుండి 25 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు.

మొత్తానికి గాంధీ వాడిన వస్తువుల వేలం రద్దు చేస్తున్నట్తు జేమ్స్ ఓటిస్ ప్రకటించాడు.

దేశంలో తొలిసారిగా అంధుల కొరకు Score Foundation అనే సంస్థ ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో అంధులు, కంటిచూపు తక్కువగా ఉన్నవారి కోసం సమస్త సమాచారాన్ని అందుబాటులో వుంచుతారు. http://www.eyeway.org లో అంధుల సమస్యలకు సలహాలు, సూచనలు పొందవచ్చు.

తెలుగుదేశం పార్టీ కలర్ టి.వి. వాగ్ధానంతో సామాన్య ఓటర్ల మీదకి ఓ రంగుల వల విసిరింది, చూద్దాం ప్రజలు ఈ వలలో ఎంతవరకు పడతారో! అంతే కాదు నిరుపేద, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రతి నెలా ఠంచనుగా పించను అట! స్త్రీలు కుటుంబ పెద్దలుగా వుంటే వారికి నెలకు 1500 ఇస్తారట!

ఇక పోతే ప్రజారాజ్యం పార్టీ వాళ్లు మేమేనా తక్కువ తినేది అని వాళ్లు అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రెండున్నరెకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి ఇస్తామని హామీ ఇచ్చేసారు.

కాంగ్రెస్సు వారు ఇంకెలాంటి హామీలు గుప్పిస్తారో వేచి చూద్దాం....

వచ్చే ఎన్నికలలో పోలింగు బూతుల వద్ద పోలింగు స్లిప్పులను ఇచ్చేందుకు ఎన్నికల సంఘమే ప్రతి కేంద్రం వద్ద ప్రింటర్లను ఏర్పాటు చేస్తుందట. ఇంతకుముందులాగా రాజకీయ పార్టీలు స్లిప్పులు ఇవ్వటానికి అనుమతి లేదు.

అమెరికా వెళ్లాలనుకునే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇకనుండి హైదరాబాదులోనే వీసాలు పొందవచ్చు. మార్చి 5 నుండి హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌ పూర్తి స్థాయి సేవలు అందిస్తుంది. ప్రస్తుతం రోజుకు 100 వీసాలు ఏప్రిల్‌ అనంతరం రోజుకు 400 వీసాలు జారీ చేస్తారు....

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP