పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 31, 2008

వీడ్కోళ్లు.....స్వాగతాలు.

వీడ్కోళ్లు...స్వాగతాలు...కమ్మటి జ్ఞాపకాలు...చేదు అనుభవాలు...

సంవత్సరం తరవాత మరలా మరో సంవత్సరం.....ఇలా పునారావృత్తం అవుతూనే ఉంటాయి. అదే నేను, అదే నీవు, అదే మనం, అదే లోకం, అదే బ్రతుకు....తేడా ఏమీ ఉండదు.

ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వచ్చింది, వెళ్లిపోతుంది, మరో సంవత్సరం రాబోతుంది. ఇలా సంవత్సరాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, మరి ఎప్పుడూ జరిగే దానికి ఇలా వేడుకలు, హడావిడీలు ఎందుకో నాకర్థం కాదు. కొంతమంది అయితే ఈ రోజు గడిచిపోతే మరలా రాదేమో, అనుభవించాల్సింది అంతా ఇప్పుడే ఈ నిమిషమే అనుభవించాలి అన్నట్టు ఉంటారు. దానికోసం ఎంత డబ్బైనా తగలేస్తారు. మళ్లీ రోజు తిరిగిందంటే ఎవరి బ్రతుకు పోరాటం వారిది, అంతా మామూలు అయిపోతుంది.

కొంతమంది ప్రతి కొత్త సంవత్సరం రోజు కొన్ని నిర్దిష్ట ప్రణాళికలు, కొన్ని లక్ష్యాలు, కొన్నిresolutions పెట్టుకుంటుంటారు, మరి ఎంతమంది వాటిని నిర్విఘ్నంగా విజయవంతంగా ఆమలు పరుస్తారో నాకైతే తెలియదు. ఓ పద్దతి ప్రకారం నడిచే వాళ్లకి ఈ కొత్త సంవత్సర లక్ష్యాలు, resolutions అవసరమా అని నాకనిపిస్తుంది. అయినా అవి కొత్త సంవత్సరం రోజే ఎందుకు పెట్టుకోవాలో అన్నది నాకర్థం కాని ఓ కోటి రూపాయల ప్రశ్న!

ఒకప్పుడు కొత్త సంవత్సరం వస్తుందంటే ఓ పది రోజుల ముందు నుండి ఎంత హడావిడి పడిపోయేదాన్నో. గ్రీటింగు కార్డులు చేయటం, పంపించటం, అదే సమయంలో సంక్రాంతి ముగ్గులు--పగలంతా గ్ర్రీటింగ్ కార్డ్సు చేసే పని రాత్రి ముగ్గులు వేసే పని, అబ్బో క్షణం తీరిక ఉండేది కాదు. ఇప్పుడు అసలు ఈ శుభాకాంక్షలు అవీ ఎందుకన్న ఓ నిరాసక్తి. మరో సంవత్సరం వస్తుంది, అది మామూలే కదా, దానికి ఇంత హడావిడి అవసరమా అన్న ఓ నిర్వేదం. వయస్సు ప్రభావం కావచ్చు. ఓ సంవత్సరం గడిచిపోయిందంటే మనకీ ఓ సంవత్సరం దగ్గర పడ్డట్టేగా! దాన్ని ఎలుగెత్తి చెప్పాటానికేనా ఈ ఉత్సవాలు, ఈ సంబరాలు? అయినా ఏం సాధించామని ప్రతి సంవత్సరం ఈ సంబరాలు, ఉత్సవాలు అనిపిస్తుంది.

ఒక్కొకసారి రోజులు ఇంత త్వరగా ఎందుకు గడుస్తాయా అనిపిస్తుంది. నా కళ్లముందే నన్ను మించి (శారీరకంగా, మానసికంగా) నా పిల్లలు పెరిగిపోతుంటే అదొక అబ్బురంగా ఆనిపిస్తుంది. నా పొత్తిళ్లలో ఆడుకున్నది వీరేనా అని అనిపిస్తుంది. చిట్టి చిట్టి చేతులతో అమ్మ పొట్టని తడుముతూ కాస్త ఎడం అయితే ఎక్కడికన్నా వెళ్లిపోతుందేమో అన్నట్టు కాళ్లూ చేతులతో పెనవేసుకుని పడుకున్న పిల్లలు వీళ్లేనా అనిపిస్తుంది. అంత అబ్బురంలో కూడా ఏ మూలో కించిత్తు బాధ----ఇంకొన్నేళ్లు పోతే వాళ్లెక్కడో నేనెక్కడో కదా అని అనిపిస్తుంది.

కాలం ఇలా ఆగిపోనీ.......
కాలం ఇలా ఇక్కడే ఈ నిమిషం ఫ్రీజ్ అయిపోతే....ఎంత బాగుంటుందో కదూ!

ఊగిసలాడకే మనసా నువ్వు ఉబలాట పడకే మనసా ...!

http://etelugu.org/typing-telugu

Read more...

December 30, 2008

వందనం అభివందనం

పదిరోజుల పాటు జరిగిన హైదరాబాదు పుస్తక ప్రదర్శన ముగిసింది. ఇన్నిరోజులు అక్కడ తెలుగు బ్లాగర్ల హడావిడీ, అల్లరీ వేడుకగా చూసిన సాగర తీరం ఒక్కసారిగా మూగవోయింది. ఇప్పుడు అటు వెళ్లినవారికి తన జ్ఞాపకాల ఊసులు కథలు కథలుగా వినిపిస్తుంది. మరి మీరెప్పుడైనా అటు వెళితే సాగరమ్మ ఊసులు ఒకసారి వినండి.

నిజంగా e-తెలుగు స్టాలు ఓ పెళ్లివారింటిని తలపించింది. ఎక్కడెక్కడినుండో వచ్చిన బ్లాగర్లు, ఎవరెవరో తెలుసుకోవాలన్న ఆతృత, తెలిసినాక మీరు ఫలానానా అని ఆశ్చర్యపోవటాలూ, పలకరింపులు, అప్యాయతలు, చలోక్తులు, చర్చలు, ఫోటోలు, వీడ్కోళ్లు, మళ్లెప్పుడొస్తారూ, మళ్లీ రావచ్చు కదా అన్న వేడ్కోళ్లు--------నిజంగా ఓ పెళ్లి వేడుకలానే అనిపించింది. గంటలు నిముషాల లాగా కరిగిపోయాయి.

అక్కడ మన అలుపెరుగని యోధుడిని చూసి ఎంత సంబరమేసిందో! మీకు ఒంట్లో బాగోలేదన్నారు, ఇప్పుడెలా ఉంది అని అడిగితే "నాకా నాకేం లేదమ్మా, అంతా వీళ్లు ఊరికే చెప్తున్నారు" అంటూ ఒక్క మాటతో మాట దాటవేసిన తీరు ఓహ్.. అనిపించింది. అదే మనమైతే "పర్లేదండి, ఇంకా బాగా తగ్గలేదు, కానీ ఇక్కడకి రాకపోతే కుదరదు కదా అని వచ్చాను" అని పెద్ద బిల్డప్ ఇచ్చేవాళ్లం. మాటలు కాదు చేతలు కావల్సింది అని చేసి మరీ చూపించారు ఆయన. ఆయన హుషారు చూస్తే ఎవరమైనా సిగ్గుతో తల దించుకోవలసిందే. ఎదిగిన కొద్దీ ఒదగమని మొక్క నీకు చెపుతుంది--దీనికి సరైన ఉదాహరణ ఆయన అనిపించింది. ముందుగా పద్మనాభం గారికి జేజేలు.

చెప్పుకోవలసిన మరో వ్యక్తి జ్ఞాన ప్రసూన గారు. పూర్ణం బూరెలతో పాటు వాళ్ల నాన్న గారు, తను వ్రాసిన పుస్తకాలు, తను స్వయంగా తయారు చేసిన గిఫ్టు కవర్లు తెచ్చి అందరికి పంచారు. వాహ్....ఈ వయస్సులో ఎంత ఓపిక అనిపించింది.

అక్కడికి వెళ్లొచ్చాక ఫలానా ఫలానా వారు కూడా ఉండి ఉంటే ఇంకెలా ఉండేదో అని వాళ్లందరిని ఒకసారి మనోఫలకంలో తలుచుకున్నాను. అలా నేను వీరు కూడా ఉండి ఉంటే అని తలుచుకున్న వాళ్లు---అబ్బో చాలా మందే ఉన్నారు. మొత్తం తెలుగు బ్లాగర్లు ఉండి ఉంటే!!ఇంకెంత నిండుతనం వచ్చేదో! ఆ రోజు కూడా త్వరలోనే రావాలని వస్తుందని ఆశిద్దాం. ప్రపంచ తెలుగు బ్లాగర్ల మహాసభ అన్నమాట (కూడలిలో కాదండోయ్ నిజంగానే నిజంగా).

ఇంతై ఇంతై వటుండంతై బ్రహ్మాండమంతై అన్నట్లు బ్లాగర్ల సమావేశంలో హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో మనం కూడా ఓ రోజు కార్యక్రమం ఇస్తే బాగుంటుందన్నచిరు ఆలోచన మొగ్గ తొడిగి చివరికి అక్కడ స్టాలు పెట్టటానికి దారి తీసింది. ఉన్న అతి తక్కువ సమయంలోనే యుద్ధ ప్రాతిపదికిన e-తెలుగు స్టాలు పెట్టి, దాన్ని విజయవంతంగా నిర్వహించి, అదే స్పూర్తితో విజయవాడ పుస్తక ప్రదర్శనలో కూడా ఓ రోజు అంతర్జాలంలో తెలుగు గురించి ప్రదర్శన ఇవ్వటానికి కార్యోన్ముఖులు అవుతున్న మన e-తెలుగు సభ్యులకి, మిగతా బ్లాగర్లకి, మరియు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి వేల వేల అభినందనలు.

జీవితంలో మొదటి అడుగు వేయటమే కష్టమైన పని, తరువాత అడుగులు వాటంతట అవే పడి పరుగులవుతాయి. అలానే అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి పడ్డ ఈ అడుగులు పరుగులై పరవళ్లు తొక్కాలని కోరుకుందాం. ఈ విజయ స్ఫూర్తితో e-తెలుగు తరుపున, తెలుగు బ్లాగర్ల తరుపున మరిన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ మరొక్కసారి హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు పెట్టి విజయవంతం చేయటానికి పాటు పడ్డ ప్రతి ఒక్కరికి వందనం అభివందనం.

Read more...

December 24, 2008

వక్కపలుకులు-2

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో మొదటిసారిగా పెట్టిన e-తెలుగు స్టాలు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తుంది. కార్యక్రమం చాలా ధూం ధాం గా జరుగుతుంది. మరి అక్కడికి వెళ్లలేని వారు కనీసం అ కబుర్లు అయినా వింటున్నారా?

హైదరాబాదు పబ్లిక్ స్కూల్ 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబరు 25 నుండి 27 వరకు మూడురోజుల పాటు ఉత్సవాలు జరుపబోతున్నారు. మన బ్లాగర్లలో HPS పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు.

ఒబామా మానియా: ఒబామా కొరికి వదిలివేసిన కేకు ముక్కకి వేలం వేయబోతున్నారు, ప్రారంభ ధర $ 20,000 మాత్రమే. ఏమిటో ఈ పిచ్చి. ఈబేలో ఒబామా వాడిన వస్తువులకి ప్రస్తుతం విపరీతమైన డిమాండు. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఈబే సంస్థ ఒబామా వాడిన 1,11,546 వస్తువులని వేలం వేసిందట. అంటే ఆయన వాడిన టూత్ బ్రష్, ఖాళీ అయిన షూ పాలిషు డబ్బా దగ్గరనుండి టిస్యూ పేపర్ల వరకు వేటిని వదలకుండా వేలం వేసుంటారు. ఈయనకి గారాజ్ అమ్మకాలు పెట్టే అలవాటు లేదేమో మరి!

పోయినేడాది అన్నగారు (ముఖేష్ అంబాని) తన భార్యకి పుట్టినరోజు కానుకగా 250 కోట్లు విలువ చేసే జెట్ విమానాన్ని కొనిస్తే, నేడు తమ్ముడు (అనిల్ అంబాని) తన భార్యకి నూతన సంవత్సర కానుకగా 400 కోట్లు ఖర్చు పెట్టి ఓ పడవని కొనేసాడట. వ్యాపారంలోనే కాదు ప్రేమని ప్రదర్శించటంలో కూడా పోటీ అన్నమాట.

లండనులో పెంపుడు కుక్కలని వీధుల్లో వదిలేసేవారి సంఖ్య రాను రాను పెరిగిపోతుందట, దీనితో కుక్కల సంరక్షణ కేంద్రాలకి తలనెప్పి అయిపోయిందట. దానికి యజమానులు చెప్పే కారణాలు- మా తివాచీకి రంగుకి మాచ్ అవ్వటంలేదు, మా సోఫాకి మాచ్ అవ్వటంలేదు, లేకపోతే దాని రంగు మా ఇంటి రంగుతో కలవటంలేదు-ఇలాంటి కారణాలట! హతవిధీ!! ఇది కూడా ఆర్థికమాంద్యం ప్రభావమేనని అభిజ్ఞవర్గాల భోగట్టా!

చందా కొచ్చర్ ICICI బ్యాంకుకి నుతన CEO గా నియమితులయ్యారు. ఓ స్త్రీ ఈ స్థాయికి చేరటం చాలా గొప్ప విషయం.

ఇకనుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలలో 27 నుండి 30మార్కులు వస్తే ఆ విద్యార్థుల జవాబు పత్రాలని మరలా పరిశీలిస్తారట, అవసరం అయితే మళ్లీ పరిక్ష నిర్వహిస్తారట. అసలు ఇంటరు ప్రాక్టికల్సు తూ..తూ మంత్రమే అన్నది జగమెరిగిన సత్యం! ఏంటో రోజుకొక కొత్త వింత రూలు పెడుతుంటారు ఈ ఇంటరు బోర్డు వారు.

2009 మార్చి నాటికి గూగుల్ ఎర్తుకి పోటీగా ధీటుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వారి భువన్ రాబోతుంది.

అన్నట్లు ఇస్రో వాళ్లు ఈ మధ్య తొలిసారిగా ఓ విదేశీ సంస్థ కోసం వాణిజ్య ఉపగ్రహాన్ని ఒకదాన్ని విజయవంతంగా ప్రయోగించారు అంతే కాదు ఆదిత్య పేరుతో సూర్యుడి మీదకి ఓ ఉపగ్రహాన్ని త్వరలోనే పంపించబోతున్నారు. జయహో ఇస్రో!

మళ్లీ కొత్త సంవత్సరంలో కలుద్దాం, అంతవరకు సెలవు.

Read more...

December 16, 2008

పుస్తకాల విందుకి వేళాయెరా!

23వ హైదరాబాదు పుస్తక ప్రదర్శన విందుకి వేళయింది, మరి ఆ విందు భోజనానికి భాగ్యనగర పుస్తక ప్రియులంతా తయారుగా ఉన్నారా? అక్కడ విందారగించటానికి వెళ్లే ముందు ఇక్కడ ఓ నాలుగు ముక్కలు ఆరగించి వెళ్లండి.

ప్రదర్శన ప్రారంభ తేది: డిసెంబరు 18, 2008.
వేదిక: పీపుల్సు ప్లాజా, నెక్లెసు రోడ్డు.
ప్రదర్శన వేళలు: మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఎనిమిదన్నర గంటల వరకు, శని ఆదివారాలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు.
ప్రవేశ రుసుము: ఐదు రూపాయలు మాత్రమే. పిల్లలకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, పత్రికా విలేకరులకి ప్రవేశం ఉచితం.
  1. ఈ ప్రదర్శన పది రోజుల పాటు జరుగుతుంది.
  2. అన్ని పుస్తకాల మీద 10 శాతం రాయితీ ఉంటుంది.
  3. ప్రతి రోజు సాయంత్రం పూట చర్చా కార్యక్రమాలు, పరిచయ కార్యక్రమాల లాంటివి జరుగుతాయి.
  4. బుక్ హంట్, ఎక్కడా ఆంగ్ల పదం రాకుండా తెలుగులో మూడు నిమిషాల పాటు ఆపకుండా మాట్లాడటం, లాంటి పోటీలు జరుగుతాయి.
  5. నిర్వాహకులు ఇచ్చిన చిట్టాలో నుండి అభిమాన రచయిత(త్రి) ని ఎన్నుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది.
  6. తెలుగు భాషకి, సాహిత్యానికి విశిష్ఠ సేవ చేసిన ఓ 25 మంది తెలుగు వారికి సన్మానం చేస్తారు.
ఈ సారి పుస్తక ప్రదర్శన తెలుగుకి ప్రాచీన హోదా వచ్చిన నేపధ్యంలో జరుగుతుంది కాబట్టి ఈ ప్రదర్శనలో తెలుగు సాహిత్యానికి పెద్ద పీట వేస్తారేమో చూడాలి. ఇక్కడ మొత్తం రెండువందల పైగానే అంగళ్లు ఉంటాయి, అందులో ఓ 50 వరకు తెలుగు పుస్తకాలవి ఉండొచ్చు.

అంతే కాక మొదటి రచన చేస్తున్న లేక ఇప్పటికి ఒక్క రచన మాత్రమే చేసిన రచయిత(త్రి)లకు ఈ ప్రదర్శనలో ప్రత్యేక అంగడి ఒకటి ఉంటుంది. వందరూపాయల నామమాత్రపు రుసుము కట్టి ఇలాంటి రచయత(త్రి)లు ఎవరైనా తమ పుస్తకాలని అక్కడ పెట్టుకోవచ్చు. మన బ్లాగర్లలో మంచి మంచి రచయిత(త్రి)లు ఉన్నారు, వారు ఇక్కడ తమ ప్రదర్శన పెట్టవచ్చేమో....

పుస్తకాలు కొందామని వెళ్లేవారికి ఓ చిన్న సూచన, ముందు మీకు కావలసిన పుస్తకాల చిట్టా వ్రాసుకోండి. వెళ్లిన మొదటిసారే పుస్తకాలు కొనెయ్యకండి, ఓపికగా ఒకటికి రెండు మూడు సార్లు అన్ని అంగళ్లు తిరగండి, తరువాతే కొనండి, అలా ఎందుకు చేయాలో ఒకసారి నెటిజన్ గారి నడగండి చెపుతారు.

ఈ సారి ఇంకొక విశేషమేమంటే విజేత కాంపిటీషన్సు (కంప్యూటర్ ఎరా) వారి అంగడిలో కంప్యూటరులో తెలుగు స్థాపించుకోవడం ఎలా అనే అంశంతో పాటు తెలుగు బ్లాగుల గురించి కరపత్రాలను తయారుచేసి పంచటం మరియు వీలైతే ఓ సాయంత్రం తెలుగు బ్లాగుల గురించి ఓ పరిచయ ఉపన్యాసం లాంటిది ఏర్పాటు చేయటానికి మన బ్లాగర్లు ప్రయత్నిస్తున్నారు. అక్కడ మీ వంతు ఏమైనా సాయం చేయాలని ఉంటే కంప్యూటర్ ఎరా శ్రీధర్ గారిని కాని, చదువరి గారిని కాని, అరుణ గారిని కాని సంప్రదించండి.

తెలుగు పుస్తకాలని కొని, చదివి, చదివించి మీ వంతు సాహిత్య సేవ చేయండి. చదివాక మీ మీ బ్లాగుల్లో వాటి గురించి సమీక్షలో, పరిచయాలో వ్రాయటం మరవకండి.

తెలుగు బ్లాగర్లందరూ కలిసి కట్టుగా ఓ రోజు వెళితే ఎలా ఉంటుందో కూడా ఆలోచించండి.


తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి.

Read more...

December 13, 2008

ఇదా పరిష్కారం!!

"వరంగల్‌లో ఇద్దరు కాలేజి విద్యార్ధినుల మీద యాసిడ్ దాడికి పాల్పడ్డ వాళ్లని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపేసారు".

సమస్యకి ఇదే పరిష్కారమా? ఇదే అంతిమ తీర్పా?.

"
నిందితులు నేరప్రవృత్తి కలిగినవారని, పథకం ప్రకారమే వారు అమ్మాయిలపై అమానుషంగా యాసిడ్‌ దాడి చేశారని వరంగల్‌ ఎస్పీ సజ్జనార్‌ అన్నారు". వారు నేరప్రవృత్తి కలిగినవారని ముందే తెలిసినప్పుడు మరియు స్వప్నిక తండ్రి నిందితుడి మీద రిపోర్టు ఇచ్చినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదు, అరెస్టు చేసినవాడిని ఎందుకు వదిలేసినట్లు, తను నేరప్రవృత్తి కలిగినవాడని తెలిసి కూడా వదిలేసాక తన మీద నిఘా ఎందుకు ఏర్పాటు చేయలేదు. ఎన్‌కౌంటరే ఇలాంటివాటికి పరిష్కారమా? నేరం జరిగాక చట్టం తన పని తాను చేయటం కాదు, ముందుగా ఆ నేరం జరగకుండా చేయటం చట్టం విధి. స్వప్నిక పరిస్థితి విషమంగా ఉంది మరి ఆ అమ్మాయికి ఏమైనా అయితే దానికి ఎవరు బాధ్యులు?

యాసిడ్‌తో దాడి అమానుషమే, ఇలాంటి వాటికి కఠిన శిక్షలు పడాల్సిందే. కాని తప్పంతా నిందితుడిదే లాగా కూడా కనిపించటం లేదు. నిందితుడు ఆ అమ్మాయి మీద 25,000 రూపాయల వరకు ఖర్చు చేసాడట, మరి ముందుగా ఆ అమ్మాయి ఇలాంటివి వద్దని ఎందుకు వారించలేదు, తనని ఎందుకు ప్రోత్సహించినట్లు? ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి నా మీద ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నాడా అని అమ్మాయిలు ఆలోచించాలి, తల్లిదండ్రులూ ఆలోచించాలి, ఆదిలోనే ఇలాంటి స్నేహాల్ని తెంపివేయాలి.

ఎవరూ పుట్టుకతో నేరస్థులుగా పుట్టరు. పెంపకం, పరిసరాలు, అనుభవాలు వారిని నేరస్థులుగా మారుస్తాయి. అలాంటి వారిని ఎన్‌కౌంటర్‌లో చంపటం మాత్రం సరైన పరిష్కారం కాదు. నేరం చేయటానికి ముందే భయపడేట్టు శిక్షలు ఉండాలి. ఎవరైనా అమ్మాయిల వెంట పడటం, వేధించటం లాంటివి చేస్తున్నప్పుడు హెచ్చరికలతో వదిలివేయకుండా కఠిన శిక్షలు పడేలా చూడాలి. వాళ్లు ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా మొదటిసారే గదా అని హెచ్చరికలతో వదిలివేయకుండా ప్రారంభంలోనే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి, వారికి సరైన కౌన్సిలింగు ఇప్పించి వారి ప్రవర్తన మార్చుకునేట్లు చేయాలి. అమ్మాయిల వంక కన్నెత్తి చూడటానికి కూడా భయపడే విధంగా చట్టాలు కఠినంగా అమలు చేయాలి, అవసరమైతే అందుకు అనుగుణంగా చట్టాల్ని మార్చాలి.

ఆడపిల్లలు కూడా తమ పరిధుల్లో తాము ఉండాలి. ఎవరితో పడితే వారితో సినిమాలు షికార్లు తిరగటం, కాలేజిలు ఎగ్గొట్టి తిరగటం లాంటివి ఎప్పటికైనా వారికే ప్రమాదం. స్నేహానికి, వ్యామోహానికి తేడా తెలుసుకుని మెలగాలి. ఇది ఇప్పటి సమస్య కాదు. ఇలాంటివి జరిగినప్పుడే మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మేలుకుంటాయి తప్ప ఇలాంటివి జరగకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరు ఎందుకని?. కాలేజిలలో ఇలాంటి వాటిపై చక్కటి సెమినార్లు, ఇతర కార్యక్రమాలు చేపట్టి పిల్లలలో అవగాహన, పరివర్తన తీసుకురావాలి. ప్రవర్తనా సమస్యలు ఉన్న పిల్లలకి వర్క్‌షాపులు పెట్టి వాళ్లలో మార్పు తిసుకురావటానికి ప్రయత్నించాలి అంతే కాని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రోడ్లెక్కి అరవటం కాదు మనకి కావల్సింది.

ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదు. దీనికి పరిష్కారం కూడా ఏ ఒక్కరి చేతుల్లోనో లేదు. ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఎక్కడైనా ఎవరైనా ఏ ఆడపిల్లనైనా వేధిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే చాతనైన సహాయం చేయండి, నాకెందుకులే అని పక్కకు తప్పుకు వెళ్లకండి, రేపు మన పిల్లలే ఆ పరిస్థితిలో వుండవచ్చు.

Read more...

December 12, 2008

వక్క పలుకులు-1

ముంబయి దాడుల నేపధ్యంలో బ్లాగు లోకమంతా అలసిపోయినట్లుంది, కాస్త మద్యమద్యలో ఈ వక్కపలుకులు నోట్లో వేసుకోండి.

ఇవాళ మా మరిది గారబ్బాయికి అ.. ఆ ల పుస్తకం, చార్టు కొనటానికని మా కాలనీలో ఉన్న మూడు పుస్తకాల కొట్లు తిరిగా, ఎక్కడా దొరకలేదు. ఒక కొట్టామె అయితే అబ్బే ఇప్పుడు అవి ఎవరు అడుగుతున్నారండి ఇంగ్లీషు "A for apple" పుస్తకం ఉంది ఇవ్వనా అంది. ఇలా అయిపోయింది మన అ..ఆ ల పరిస్థితి. ఏంటో తెలుక్కి ప్రాచీన హోదా అంటే ఏంటో అనుకున్నా--ఇలా మెల్ల మెల్లగా అంతర్థానం అవటమన్న మాట. అందరికి ఓ సూచన--మీ ఇళ్లలో అ.. ఆ ల పుస్తకాలు కాని చార్టులు కాని ఉంటే భద్రపరుచుకోండి, కొన్నాళ్ల తరువాత వాటిని ఏ పురావస్తు ప్రదర్శనశాలలోనో పెట్టవచ్చు.


"
మనిషి రెండుగా చీలుతున్నప్పుడు కౌగిలించుకొని కొత్త నెత్తురు ఎక్కించేది-కవిత్వమొక్కటే".
ఈ వక్కపలుకు నాది కాదండోయ్. ఇవాళ ఓ పుస్తకంలో చదివిన కవితలోని వ్యాక్యం. దాంట్లోదే ఇంకొక వ్యాక్యం చూడండి.

"కవిత్వం, కాదు స్టేటస్ సింబల్
పోటెత్తిన నెత్తుటి ధారాపాతం".
ఏంటో ఈ కవిత అంతా నెత్తుటి మయం. అసలు నా మట్టి బుర్రకి ఈ కవితలు ఈ జన్మలో ఎక్కవేమో!

ఎక్కువమంది సోదరులున్న మగవారికి కొడుకులు ఎక్కువమంది, ఎక్కువమంది సోదరీమణులు ఉన్నవారికి కూతుళ్లు ఎక్కువమంది పుడతారంట. మరి సరి సమానంగా ఉంటేనో!!అసలు దీనికంతా కారణం ఓ జన్యువు (gene) అట. MM అనే రకం జన్యువుని కలిగి ఉన్న పురుషుల్లో మగ సంతానం ఎక్కువగానూ, MF జన్యువు ఉన్న వారిలో కుమార్తెలు, కుమారులు సమానంగానూ, ఇక FF జన్యువు ఉన్న వారికి కుమార్తెలు ఎక్కువగానూ పుట్టే అవకాశం వుందట.

అన్నట్లు చిన్నప్పుడు బొమ్మరిల్లు కట్టారా? బొమ్మల పెళ్ళిళ్ళు చేసారా? చిన్ని చిన్ని బొమ్మలకి చీర, పంచె కట్టి, లక్క పిడతల్లో ఉత్తుత్తి వంటలు వండి--అబ్బోరాత్రి అయ్యాక కూడా వెన్నెల్లో ఆటలే ఆటలు. పండు వెన్నెల్లో నీడలాట, నేల-బండ ఆటలు ఆడుకున్నారా? అసలు పట్టణాల పిల్లలకి వెన్నెల అందం తెలుసా?

గూగులమ్మ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రంలో ఐదేసి ఉత్తమ పంచాయితీలని ఎంపిక చేసి ఒక్కొక పంచాయితీకి ఐదు లక్షల రూపాయల చొప్పున బహుమతి ఇవ్వనుందట. మంచి పని గూగులమ్మా, కానీ అవి ఆ పంచాయితీల అభివృద్ధికే ఉపయోగపడేట్టు చూడమ్మా.

బరువు తగ్గాలనుకునే వారికి ఓ చిన్ని సలహా. మీ ఇంట్లో టేబులు, పళ్ళాలు, గ్లాసులు, గిన్నెలు అన్నీ నీలిరంగులొ వుండేట్టు కొనుక్కోండి. నీలిరంగులో ఆహారపదార్థాలు చేసుకోండి (ఆహారపదార్థాలు నీలిరంగులో ఉండాలంటే అవి ఉడికేటప్పుడు ఓ రెండు చుక్కలు నీలిమందు వేయండి). నీలిరంగు ఆకలిని తగ్గిస్తుందంట.

ఎం.బి.బి.ఎ‌స్ చేసి డాక్టరు అవ్వాలనుకున్న సానియా మీర్జా తమిళనాడులోని ఎం.జి.ఆర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పుచ్చుకుని ఆ కోరిక తీర్చుకుంది. డాక్టరేట్లు రావటం ఇంత తేలికన్నమాట, ఇంకేం నేను కూడా త్వరలో డాక్టరేట్ పుచ్చుకుంటా, సానియాకి ఇవ్వంగా లేంది నాకెందుకివ్వరంట!

ఇక బాక్సింగు ప్రపంచ కప్పులో మన భారత బాక్సర్లు నలుగురు సెమీ ఫైనల్సుకి వెళ్లారు, అంటే నాలుగు పతకాలు ఖాయం అన్నమాట. బీజింగు ఒలంపిక్సులో క్వార్టరు ఫైనల్సుకి చేరిన జితేందర్ గుర్తున్నాడా! తనతోపాటు, అఖిల్, దినేష్, లక్రా సెమీ ఫైనల్సుకి చేరుకున్నారు.

మరిన్ని వక్కపలుకులు మరోసారి.......

Read more...

November 27, 2008

మృత్యుక్రీడ

ఇవాళ పొద్దుట పొద్దుటే తలుపు తీసి వాకిట్లో పేపరు తీసుకోబోతూ మెయిను పేజీ హెడ్డింగు "మృత్యుక్రీడ" అని చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడ్డా, మళ్లీ ఎక్కడో ఉగ్రవాదం పంజా విప్పిందన్నమాట--మరో మారణహోమం, ఆర్తనాదాలు, చావు కేకలు, పేపరు చేతిలోకి తీసుకోవాలంటేనే భయం వేసింది. ఎలాంటి వార్తలు వినాలో, ఎన్ని చావు కబుర్లు వినాలో అని-- వరసపెట్టి మారణహోమాలు. కాస్త ఓ నెల రెండు నెలలు అమ్మయ్య అని కాస్త ఊపిరి తీసుకునేలోపు మళ్లీ మరో దాడి, మరో దారుణం, మరో మారణహోమం. వార్తా చానళ్లకి, పేపర్లకి మరో పండగ రోజు.

పేపరు చదవాలంటే భయం,టి.వి.చూడాలంటే భయం,కాలు తీసి బయట పెట్టాలంటే భయం,గుడికెళ్లాలంటే భయం, బడికెళ్లాలంటే భయం,దుకాణానికి వెళ్లాలంటే భయం,సినిమాకి వెళ్లాలంటే భయం, రైలు ఎక్కాలంటే భయం,బస్సు ఎక్కాలంటే భయం,ఎక్కడికైనా వెళ్లాలంటేనే భయం.. భయం..భయం..బతుకే భయం. నా ప్రాణానికి ఏం అవుతుందో అన్న భయం కాదు, మన కళ్ల ముందు ఎలాంటి దారుణాలు చూడాలో అన్న భయం. ఆఫీసుకి వెళ్లిన భర్త ఇంటికి క్షేమంగా వస్తాడా అన్న ఓ ఇల్లాలి భయం, కాలేజికి వెళ్లిన కూతురు క్షేమంగా ఇల్లు చేరుతుందా అన్న ఓ తండ్రి భయం, సినిమాకి వెళ్లిన కొడుకు ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురుచూసే ఓ తల్లి ఎదురుచూపులలో ఉండే భయం. మన కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఏదైనా చిన్నపాటి అనారోగ్యం కలిగితే ఎంతగా ఆందోళన చెందుతాం..అలాంటిది ఓ కుటుంబంలోని వ్యక్తి హఠాత్తుగా ఓ దారుణ మారణకాండలో బలి అయితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ బాధ ఎవరు తీర్చగలరు?

ఎప్పుడో ఓ కేంద్ర మంత్రి కూతుర్ని అపహరిస్తే ఆఘమేఘాల మీద మన ప్రభుత్వం, మన నాయకులు స్పందించి కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని వదిలిపెట్టిన దాని ఫలితం ఇప్పుడు అమాయకులు అనుభవిస్తున్నారు. ఏదీ ఇప్పుడేది అలాంటి స్పందన కానరాదే. సామాన్యుల ప్రాణాలకి ఇదేనా మన ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత. ఇంతమంది అమాయకులు బలవుతుంటే సూటుల్లో వచ్చి ప్రెస్సు కాన్ఫరెన్సులు పెట్టే మన నాయకులు, ప్రతి దాన్ని ఓ పండగ లాగా ఆనందంగా ప్రత్యక్ష ప్రసారం చేసే మన వార్తా చానళ్లు....ఈ మారణకాండలో బలవుతున్న సామాన్యుల గురించి పట్టదా వీళ్లకి.

ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా మనసులో ఒకలాంటి ఆందోళన...కాదు కాదు భయం...కాదు కాదు అభద్రతాభావం...కాదు కాదు మన నేతల మీద అపనమ్మకం...వీటన్నిటినీ చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయత ...ఈ భావాలన్నిటికి కలిపి ఏదైనా పేరు ఉంటే అది... అదే అలాంటి భావం పొద్దున్నిండి నాలో. ఇదా మన నేతలు కోరుకున్న స్వేచ్చా భారతం? ఇదా గాంధీ కలలు గన్న స్వరాజ్యం? ఎప్పుడైతే ఓ స్త్రీ అర్థరాత్రి ఒంటరిగా క్షేమంగా ఇల్లు చేరుకుంటుందో అప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్లు అని గాంధీ అనేవారట. అర్థరాత్రి కాదు ఏ పూట కా పూట ఆడదే కాదు మగాడు కూడా బిక్కు బిక్కు మంటూ భయం భయంగా ఇల్లు చేరుకుంటున్న నేటి భారతాన్ని చూసి అయన ఏం అనేవారో!

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా మనం కూడా ఆవేశంగా ఈ రాజకీయ నాయకుల్ని ఉరి తీయాలి, తన్ని తరమాలి అని అవేశపడిపోతుంటాం. మన నాయకులేమో నిందితుల్ని పట్టుకుంటాం (పట్టుకున్న నిందితుల్ని వదిలి వేస్తాం), ఉగ్రవాదాన్ని అణచివేస్తాం, చనిపోయిన వారికి మా ప్రగాడ సానుభూతి అంటూ నాలుగు చిలక పలుకులు వల్లెవేస్తారు, ఎప్పుడు చూడండి అవే మాటలు. ఏ మాటంటే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే వాళ్లకి ఇంతకన్నా ఎక్కువ మాటలు ఎలా వస్తాయిలే. రెండు రోజుల తర్వాత మనమూ మర్చిపోతాం, నాయకులూ మర్చిపోతారు, కానీ మర్చిపోంది ఉగ్రవాదులు, మరలా ఎప్పుడు పంజా విసరాలా అని ఆకలిగొన్న పులిలా ఎదురు చూస్తుంటారు. వీటన్నిటికి అంతం ఎప్పుడు?ఎప్పుడు? ఎప్పుడు? అసలు ఇదే ఆరంభమా???

Read more...

November 5, 2008

ఒబామాదే గెలుపు

ఎప్పుడా ఎప్పుడా అని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసిన సుదీర్ఘమైన అమెరికా ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగిసింది. అందరి ఊహలు నిజం చేస్తూ నిన్న జరిగిన అమెరికా సార్వత్రిక ఎన్నికలలో విజయకేతనం ఎగరవేసి 44వ అమెరికన్ ప్రెసిడెంటుగా మరియు మొదటి ఆఫ్రికన్-అమెరికన్ (నల్లజాతి) ప్రెసిడెంటుగా 47 సంవత్సరాల బరాక్ హుస్సేన్ ఒబామా పదవి చేపట్టబోతున్నాడు. తన ముందు ఎన్ని సవాళ్ళో. ఇక ప్రపంచం చూపంతా అమెరికా మీదా, ఒబామా మీదే. ఈ యువ ప్రెసిడెంటు అమెరికాని ఎటు నడిపిస్తాడో, ఆపై మనల్ని ఎటు నడిపిస్తాడో వేచి చూద్దాం.

అన్నట్లు ఈ విషయం గురించి మన ఇస్మాయిలు గారు ఎప్పుడోనే జోస్యం చెప్పారు. ఆయన జోస్యం నిజమైనందుకు రాయలవారికి అభినందనలు.

Read more...

October 31, 2008

తెలుగుకి ప్రాచీన హోదా

నవంబరు ఒకటి రాష్ట్రావతరణ సందర్భంగా తెలుగు మరియు కన్నడ ప్రజలకి కేంద్రం ఓ బహుమతి ప్రకటించింది. ఎట్టకేలకి తెలుగు మరియు కన్నడ భాషలకి ప్రాచీన హోదా ఇచ్చారు. ఓ భాషకి ప్రాచీన హోదా కలిగించటం మూలాన ఒనగూరే ప్రయోజనం ఏమిటొ నాకయితే తెలియదు, మరి ఈ ప్రాచీన హోదా తెలుగు భాషాభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూద్దాం.

Read more...

October 16, 2008

బ్లాగు ప్రయాణంలో నేను-సిరిసిరిమువ్వ



మీరు బ్లాగులోకం లోకి ఎలా ప్రవేశించారు అంటే సహజంగా సమాధానాలు ఇలా ఉంటాయి.....
మిత్రుల ద్వారా బ్లాగుల గురించి, కూడలి గురించి, లేఖిని గురించి తెలిసింది, అబ్బ ఎంచక్కా తెలుగులో ఎంత బాగా రాస్తున్నారో అని చదవటం మొదలెట్టి, మెల్లగా నేను కూడా బ్లాగటం మొదలెట్టా అనో, లేకపోతే అంతర్జాలంలో అనుకోకుండా ఒక రోజు తెలుగు బ్లాగులు కనపడ్డాయి, వాటిని చదవటం మొదలెట్టా, అవి చదివాక నాకు కూడా ఉత్సాహం వచ్చేసి తెలుగు మీద ప్రేమ పెల్లుబికి బ్లాగటం మొదలెట్టా, లేక ఈనాడులో బ్లాగుల గురించి వచ్చిన వ్యాసం చదివి ఉత్తేజం చెంది నేను కూడా బ్లాగు తెరిచా--ఇంచుమించి కాస్త అటూ ఇటూగా అన్ని సమాధానాలు ఇలాగే ఉంటాయి.

నేను మాత్రం బ్లాగుల మీద కాస్తంత అయిష్టతొ ఇంకాస్తంత ద్వేషంతో ఈ బ్లాగు బండి ఎక్కా! నిజం.. నేను బ్లాగు మొదలుపెట్టేటప్పటికి నాకు బ్లాగుల మీద ఉన్నది అయిష్టతే. అప్పటివరకు నేను ఒక్క బ్లాగు కూడా చదవలేదు, అసలు ఈ బ్లాగు ప్రపంచం గురించి ఆలోచించాలన్నా నాకు ఇష్టంగా ఉండేది కాదు. బ్లాగు రాయటం అంటే పనీపాటా లేనివాళ్ళు చేసే పని అన్న అభిప్రాయం ఉండేది. అసలు మన గురించి మనకు తోచింది మనమే రాసుకుని అది లోకం అంతా తెలిసేట్లు అంతర్జాలంలో పెట్టటం ఏంటి అనుకునేదాన్ని.

మా వారు, అదే చదువరిగా మీ అందరికి పరిచయం అయిన శిరీష్ కుమార్ గారు, 2005 నుండి బ్లాగులు రాస్తుండేవారు. బ్లాగులు రాయటానికి ముందునుండే వికీపిడియాలో చాలా విస్తృతంగా రాస్తుండేవారు. ఎంత విస్తృతంగా అంటే ఇంట్లో ఉన్నంత సేపు పగలూ రాత్రీ అదే పని. శని ఆదివారాలు అయితే పూర్తిగా దానికే అంకితం. నాకు అది చాలా విసుగ్గా ఉండేది. అప్పుడప్పుడు నువ్వు కూడా వికీపిడియాలో రాయవచ్చుగా అంటుండేవాళ్ళు. అసలు కంప్యూటర్ అంటేనే గిట్టని వాళ్ళకి ఇలాంటివి ఎలా ఎక్కుతాయి చెప్పండి. తను రాసే బ్లాగులు కూడా నేనసలు చూసేదాన్ని కాను. తను కూడా నా అనాసక్తిని గమనించి బ్లాగుల గురించి ఏం చెప్పేవారు కాదు.

2007 జనవరిలో నా ఆరోగ్యరీత్యా నేను ఉద్యోగం మానేసాను. అప్పుడు కాస్త కాలక్షేపంగా ఉంటుంది నువ్వు కూడా బ్లాగు మొదలుపెట్టు, ఏదో ఒకటి రాయి అంటుండేవారు. అసలు చెప్పటానికి మన దగ్గర విషయమేమన్నా ఉంటే కదా రాసేది అని నేనంత ఆసక్తి చూపించలేదు. దాదాపు అదే టైములో అనుకుంటా చదువరి, త్రివిక్రం గారు కలిసి పొద్దు అంతర్జాల పత్రిక మొదలుపెట్టారు. దాంట్లో జ్యోతి గారు సరదా శీర్షికలో వ్యాసాలు రాసేవారు. ఓ సారి జ్యోతి గారు రాసిన ఓ వ్యాసం చూపించి తన గురించి చెప్పి తను బ్లాగులు కూడా రాస్తారు అని చెప్పారు. అప్పుడు కూడా నాకు అంత ఆసక్తి అనిపించలేదు, ఆ వ్యాసం కూడా చదవలేదు. దానికి ముఖ్య కారణం నాకు ఏదైనా అంతర్జాలంలో చదవటం అంత ఆసక్తిగా ఉండేది కాదు. ఓ పుస్తకం పట్టుకుని హాయిగా పడుకుని పక్కన ఏ బఠాణీలో,మరమరాలో,కారప్పూసో పెట్టుకుని తింటూ చదువుకోవటంలో ఉండే ఆనందం కంప్యూటర్ ముందు కూర్చుని చదివితే ఉంటుందా!!ఇప్పటికీ నా ప్రాధాన్యత చేతిలో పుస్తకానికే.

సరే నీకు రాయాలనిపించినప్పుడే రాయి అని తనే నాకు ఒక బ్లాగు క్రియేట్ చేసారు. క్రియేట్ చేయటం వరకే తన పని, బ్లాగు పేరు కాని, బ్లాగు అడ్రస్సు కాని అన్నీ నేను పెట్టుకున్నవే. కాస్తంత అయిష్టత తోటే బ్లాగు మొదలుపెట్టా. మొదటి టపా ఫిబ్రవరి 22, 2007 నాడు రాసా. మొదటి టపా రాసేముందు మొదటిసారిగా కొంతమంది బ్లాగులు చదివా, చదవగానే బాగున్నాయే అనుకున్నా...ముఖ్యంగా విహారి గారి టపాలు నాకు చాలా నచ్చాయి, అలాగే పప్పు నాగరాజు గారివి, చరసాల ప్రసాదు గారివి కూడా. చరసాల గారి టపాలు బాగా వాడిగా వేడిగా ఉండేవి. ఒకరు హాస్యం, ఇంకొకరు సరసం, మరొకరు గరంగరం; ఎంత వైవిధ్యం అనుకున్నా!

నా టపా నేనెవరినో చెప్పకుండా రాసా. నేనెవరినో చెప్పాల్సిన అవసరం కూడా నాకు కనిపించలేదు. అసలు ఎందుకు చెప్పాలి! మనం రాసేవి నచ్చితే చదువుతారు లేకపోతే లేదు అన్న భావన నాది. నాకంటూ ఓ చిన్నపాటి గుర్తింపు వచ్చాకే నేనెవరినో చాలామందికి తెలిసింది. నేను మొదటి టపా రాసిన విషయం చదువరి గారికి కూడా తెలియదు. బ్లాగుకి పేరేం పెట్టానో, ఏ పేరుతో రాసానో ఏమీ తనకి చెప్పలేదు. నేను ఒక టపా రాసాను నా బ్లాగు ఏ పేరుతో ఉందో కనుక్కో అన్నా, అంతే రెండే రెండు నిమిషాలలో గూగిలించి చెప్పేసారు. అలా నా బ్లాగు ప్రస్థానం మొదలయ్యింది.

ఇక ఈ బ్లాగు బండి ఎక్కాక ఓ కొత్త లోకంలోకి వచ్చినట్లు అనిపించింది. గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యారు. నాకు తెలియని ఎన్నో విషయాలు, పుస్తకాలు, వ్యక్తుల గురించి తెలిసింది. అసలు పట్టుమని నాలుగు అక్షరాలు రాయటమే గగనం అయిపోయిన నేటి కాలంలో బ్లాగు పుణ్యమా అని నాకు భాష మీద పట్టు పెరిగింది. కొత్త కొత్త (నాకు) తెలుగు పదాల అందాలు, వాటి వాడుక గురించి తెలిసింది. బ్లాగులో నాకు నచ్చిన మరొక విషయం ఏమిటంటే "ఇక్కడ మనకు నచ్చింది స్వేచ్చగా రాసుకోవచ్చు. ఎలాంటి నియమాలు, నిష్ఠలు, ముందస్తు ఒప్పందాలు, చావు గీతలు, లక్ష్మణ రేఖలు ఉండవు. మనం తప్పులు రాసినా ముద్దుగా చెప్పేవాళ్ళే కాని విసిరిగొట్టటాలు, గోడ కుర్చీలు, ఇంపొజిషన్సు ఉండవు".

నాకు బ్లాగులు రాయటం కన్నా చదవటం ఎక్కువ ఇష్టం, అలా ఆని అదేం వ్యసనంగా మారలేదు. ఒక్కోసారి రోజుల తరబడి బ్లాగులవంక కన్నెత్తి కూడా చూడను. మధ్యమధ్యలో బ్లాగుల నుండి సుదీర్ఘ విశ్రాంతి తీసుకుంటుంటాను. రాయటం కోసం రాయను రాయాలనిపించినప్పుడు రాస్తాను. అసలు బ్లాగు అంటే పర్సనల్ డయరీ అన్న అర్థాన్ని మార్చాలేమో. "డయరీ అంటే మన వ్యక్తిగతం గురించి గుప్తంగా ఉంచేది, కాని బ్లాగు అనేది ఓ తెరిచిన నోటు పుస్తకం లాంటిది. ఆ పుస్తకాన్ని ఎవరైనా చదవవచ్చు, తప్పులు దిద్దవచ్చు, సలహాలు ఇవ్వవచ్చు, సంప్రదింపులు చేయవచ్చు".

విభిన్న వ్యక్తులు, విభిన్న రకాల బ్లాగులు---అంతరంగాలు, స్వగతాలు, మార్గదర్శకాలు, విశ్లేషణలు, కబుర్లు, కవితలు, రుచులు, అభిరుచులు, అర్థవంతమైన చర్చలు, వాదోపవాదాలు, పొగడ్తలు, తెగడ్తలు, అలకలు, నిరసనలు, తరాల అంతరాలు, విరమణలు....అన్నిటి కలబోత ఈ బ్లాగు ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతి మజిలీ ఓ మధురానుభూతే. ప్రయాణం నచ్చలేదా మధ్యలో దిగిపోవచ్చు. ఈ బ్లాగు బండిలోకి కొత్త కొత్త వ్యక్తులు ఎక్కుతూ ఉంటారు, కొంతమంది మద్యలోనే దిగిపోతూ ఉంటారు, కొంతమంది ఎక్కి దిగుతూ ఉంటారు, మరి కొంతమంది దిగి ఎక్కుతూ ఉంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా ఈ బ్లాగు బండి ప్రయాణం ఎత్తులు, పల్లాలు, మలుపుల మద్య నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. దానికి హద్దులు, అదుపులూ ఉండవు-ఉన్నదల్లా ఒక్కటే-తెలుగు భాష మీద ప్రేమ, మమకారం. అప్పుడప్పుడూ బండి పట్టాలు తప్పుతున్నట్లు అనిపించినా వెంటనే మరమత్తులు చేసి పట్టాల మీద సరిగ్గా నిలబెట్టే సహృదయులున్నంతవరకు ఈ ప్రయాణం రసరమ్యభరితంగా సాగిపోతూనే ఉంటుంది.

ఈ లోకంలో మనం చెప్పేది నోరెత్తకుండా వినేది మన బ్లాగే:).
అయ్యో మనసులోని మాటని పంచుకోవటానికి ఎవరూ లేరే అన్న బెంగ ఇక లేదు, ఒక్క నిమిషంలో మన మాటని వందలమంది మనస్సులలోకి చేరుస్తుంది. అంతే కాదు తను విన్నవి జాగ్రత్తగా దాచిపెట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి మనకు వినిపిస్తుంది. "అది మాట్లాడకు ఇది మాట్లాడకు అంటూ ఆంక్షలు పెట్టదు, ఏంటా మాటలు అంటూ సాధించదు, ఇలానే మాట్లాడు అంటూ ఆజ్ఞాపించదు. మన మనసెరిగిన నేస్తం మన బ్లాగు".

బ్లాగులు చదవండి-బ్లాగులు చదివించండి
బ్లాగులు రాయండి-బ్లాగులు రాయించండి
తెలుగు భాషని పునరుత్తేజితం చేయండి
ఎవరు రాసారన్నది కాక ఏం రాసారన్నది చూడండి.

జై తెలుగు బ్లాగులు..జై జై తెలుగు బ్లాగులు...జై జై జై తెలుగు బ్లాగులు....జైహింద్.

Read more...

October 14, 2008

తెలుగు-ఇంగ్లీషు విశాలాంధ్ర-క్రాస్‌వర్డ్

మా ఇంట్లో ఇంగ్లీషు పుస్తకాలు చదవటం చాలా తక్కువ. ఎవరైనా ఈ పుస్తకం చాలా బాగుంది చదువు అని చెపితేనో, ఇస్తేనో, చదవటమే కాని స్వతాహాగా ఇంగ్లీషు పుస్తకాల మీద అంత ఆసక్తి లేదు, వాటిని అంతగా కొనం కూడా. అందుకు మొదటి కారణం ఆ పుస్తకాలలో రాసేది మనకి సగం కూడా అర్థం కాదు, ఇక రెండోది మాతృభాషలో చదువుతుంటే ఉండే ఆనందం కాని ఆ పాత్రలతో మమేకం అవటం కాని వేరే భాషలో (ఇంగ్లీషులో) చదువుతుంటే ఉండదన్న ఓ భావన. నా వరకు నేనైతే ఇంగ్లీషు పుస్తకాలు ఎంత గొప్పవయినా వాటి తెలుగు అనువాదాలు చదవటానికే ఎక్కువ ఇష్టపడతాను. ఒక యోగి ఆత్మకథ, అమ్మ, ఏడు తరాలు, ఒక దళారి పశ్చాత్తాపం లాంటివన్ని నేను తెలుగులోనే చదివాను. మా పిల్లలకి కూడా వాళ్ళు ఏదైనా పుస్తకం అడిగితే ముందు దాని తెలుగు అనువాదం దొరుకుతుందేమో చూస్తాం. నండూరి రామమోహనరావు అనువాదం చేసిన మార్క్‌ట్వేన్ పుస్తకాలు, స్టీవేన్సన్ కాంచనద్వీపం అలా కొన్నవే. ఒక్కొకసారి అసలు పుస్తకాల కంటే ఈ అనువాద పుస్తకాలు చదవటమే బాగుంటుంది. R.K. నారాయణ్ రాసిన Swami and his friends కి వాసిరెడ్డి సీతాదేవి చేసిన అనువాదం స్వామి-మిత్రులు (నేషనల్ బుక్ ట్రస్టు వాళ్ళ ప్రచురణ) చదువుతుంటే ఎంత బాగుంటుందో. సొదుం రామ్మోహన్ కూడా మంచి అనువాదాలు చేస్తుంటారు.

నేషనల్ బుక్ ట్రస్టు వాళ్ళు, చిల్డ్రన్సు బుక్ ట్రస్టు వాళ్ళు, హైదరాబాద్ బుక్ ట్రస్టు వాళ్ళు, పీకాక్ క్లాసిక్సు వాళ్ళు, మంచి మంచి పుస్తకాలకి తెలుగు అనువాదాలు ప్రచురిస్తూ ఉంటారు.

చదువుకునే రోజులలో జెఫ్రీ ఆర్చర్, సిడ్నీ షెల్డాన్, షేక్‌స్పియరు లాంటి వాళ్ళ పుస్తకాలు ఏవో ఒకటి రెండు చదివి వుంటాను. ఇప్పుడు మాత్రం మా పిల్లల ద్వారా నేను కూడా అప్పుడప్పుడు ఇంగ్లీషు పుస్తకాలు చదువుతున్నా. హారీ పాటరు పుస్తకాలన్నీ నా చేత మా పిల్లలు చదివించినవే.

హైదరాబాదులో సంవత్సరం సంవత్సరం జరిగే పుస్తక ప్రదర్శనలో తప్పితే మామూలుగా పుస్తకాలు కొనాలంటే మేము వెళ్లేది విశాలాంధ్ర పుస్తకాల కొట్టుకే. అలాంటిది మొన్న ఆదివారం దారి తప్పి దారి లేక ఓ గంట కాలక్షేపం కోసం బంజారాహిల్సులోని క్రాస్‌వర్డ్ పుస్తకాల కొట్టుకి వెళ్ళాం. పిల్లలతో వెళ్ళాం కదా గంటలో ఓ 1800 రూపాయల పుస్తకాలు కొన్నాం. ఇంకాసేపు ఉంటే మా పిల్లలు క్రెడిట్టు కార్డు మీద ఇంకెంత భారం వేస్తారో ఇక చాలు అని త్వర త్వరగా బయటపడ్డాం.

మేము కొన్నవి:
1. Emma, Pride and Prejudice by Jane Austin.
2. Chowringhee by Sankar.
3. The lost child and other stories by Mulk Raj Anand.
4. Grandmother's Tale by R.K. Narayan.
5. The Bachelor of Arts by R.K. Narayan.
6. Blur Mars by Kim Robinson.
7. David Copperfield by Charles Dickens.
8. The Fountainhead by Ayn Rand.

ఇందులో మొదటి ఐదూ నా ఎంపిక. ఇక ఈ మధ్య బ్లాగుల్లో ఎక్కడ పడ్డా ఫౌంటెనుహెడ్డు గురించి గొప్పగా రాస్తున్నారని మా వారు, ఇష్టమైన పుస్తకం ఏదని ఎవరిని అడిగినా ఫౌంటెనుహెడ్డు అనే చెపుతున్నారు అసలు దానిలో ఏముందో చూద్దాం అని మా అమ్మాయి కలిసి ఆ పుస్తకాన్ని ఎంపిక చేసారు. ఇక మిగతా రెండూ మా పిల్లల ఎంపిక. మరి ఇందులో ఏది ఎలా ఉంటుందో వీటిని చదివిన చదువరులే చెప్పాలి.

ఇక క్రాస్‌వర్డ్, వాల్‌డెన్ లాంటి పుస్తకాల కొట్టులతో నచ్చని విషయం ఏమిటంటే అక్కడ చూద్దామన్నా ఒక్క తెలుగు పుస్తకం కూడా కనపడకపోవటం. ఇంగ్లీషు కొట్లలో తెలుగు పుస్తకాలు ఎలా దొరుకుతాయి అంటారా! మరి తెలుగు కొట్లలో ఇంగ్లీషు పుస్తకాలు దొరకటంలే....

Read more...

October 8, 2008

దుత్తెవరు మరి!!!!!

దీనికి ముందు ఇది చదివి అప్పుడు ఇది చదవండి.

.................అలా మా నాన్నతో పాటు నేను కూడా డాక్టరు గారింటికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో పాటు పాఠాలు చెప్పించుకోవటం ఒక డ్యూటీ లాగా అయిపోయింది. ఈ పాఠాలు రోజూ ఉండేవి కావు, వారానికి రెండు మూడు రోజులు ఉండేవి. వెళ్ళిన ప్రతిసారి నాకు ఉక్రోషం తన్నుకొచ్చేది, అయినా ఏం చేయలేం కదా, దేనికైనా కాలం కలిసి రావాలి! కాలం అలా జరిగిపోతుండగా కాలం కలిసొచ్చి ఒక రోజు ఒక మహత్తర అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఎట్టిదనగా..........

ఇక్కడ ఇంకో పిట్టకథ............
మాకు జువాలజీకి వచ్చే పంతులు గారికి కాస్తంత నత్తి, ఆ నత్తికి తోడు ఇంకాస్తంత చాదస్తం, వెరసి ఆయన క్లాసులో అసలు పాఠం కన్నా ఊకదంపుడు ఎక్కువగా ఉండేది. ఆర్థ్రోపొడాలో బొద్దింక గురించి పాఠం మొదలుపెట్టి మధ్యలో దోమలు ఎలా పునరుత్పత్తి చేస్తాయో చెపుతూ హఠాత్తుగా ఎంటమీబా, ప్లాస్మోడియుం అంటూ పరాన్నజీవుల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, ఏతా వాతా ఆయన ఏ పాఠం పూర్తిగా చెప్పటం అయ్యేది కాదు, పూర్తయినా మాకు అర్థమయ్యేది కాదు! ఇక పరీక్షలు దగ్గరికొస్తున్నాయనగా ఆదివారాలు స్పెషలు క్లాసులంటూ దుంప తెంచేవాళ్ళు. అదిగో అలాంటి ఓ ఆదివారం నా ఉక్రోషం తీర్చుకునే మహత్తర అవకాశం దొరికింది...........

ఓ ఆదివారం అలానే క్లాసుకి వెళ్ళాం, మాస్టారు ఇంకా రాలా, సరే కాసేపు బయట తిరిగొద్దామని బయటకి వచ్చాం, మగపిల్లలు కూడా బయటికి వచ్చి కాంటీను వేపు వెళ్ళారు. బయటకి వచ్చిన మాకు అక్కడున్న మగపిల్లల సైకిళ్ళు కంటబడ్డాయి, అంతే ఇక అటూ ఇటూ చూసి ఎవరూ చూడటంలేదని నిర్థారించుకుని టపుక్కున డాక్టరుగారబ్బాయి సైకిలు గాలి తీసేసా! ఇక క్లాసు అయిపోయాక తను సైకిలు నడిపించుకుంటూ ఇంటికి వెళుతుంటే నాకెంత ఆనందం వేసిందో!! అప్పట్లో దగ్గర్లో ఎక్కడా గాలి కొట్టేవాళ్ళు ఉండేవారు కాదు. కాలేజి నుండి కనీసం ఓ రెండు కిలోమీటర్లు వెళితే కాని గాలి కొట్టించుకోవటం కుదరదు. ఎప్పుడూ కాలేజి నుండి దగ్గరి దారిలో వెళ్ళే మేము ఆ రోజు తన వెనకే నడుచుకుంటూ ఆనందిస్తూ వెళ్ళటం ఇప్పటికి కూడా కళ్ళముందు కనపడుతుంది. అలా వెళుతూ వెళుతూ మిమ్ములిని మా నాన్న సాయంత్రం మా ఇంటికి రమ్మన్నారు పాఠాలు చెప్పించుకోవటానికి అంటూ ఓ కొంటె నవ్వు నవ్వుకుంటూ తనని దాటుకుని వెళ్ళటం నిన్నా మొన్న జరిగినట్లుంది..........

పాపం తను చాలా బుద్దిమంతుడు. తన చదువేమో తనేమో అన్నట్లు ఉండేవాడు. మరి అలాంటి తనని నేను ఎందుకు టార్గెట్టు చేసుకున్నట్లు? మా నాన్న మీద ఉక్రోషం తన మీద చూపించానన్నమాట. అది తెలిసి చేయటం కూడా కాదు. ఆ సమయానికి అలా అనిపించింది చేసేసాను. తరువాత ఎప్పుడో జ్ఞానోదయం అయింది మన అకారణ కోపాలు, ద్వేషాలు, ఉక్రోషాలు ఇలా అమాయకుల మీద చూపించేస్తుంటాం అని.

మీరు కూడా మీకు తెలియకుండా ఇలాంటివి ప్రదర్శించే ఉంటారు, లేకపోతే మీ మీద ప్రదర్శింపబడి ఉంటాయి, ఒక్కసారి మీ జ్ఞాపకాలని తవ్వుకోండి.

అన్నట్లు జ్ఞాపకాలంటే గుర్తుకొచ్చింది.........అందరిని ఒక్కసారి మన ఊర్లకి తీసుకుపోయే పాట వేణూ శ్రీకాంత్ గారు తన బ్లాగులో వినిపిస్తున్నారు, అక్కడికి వెళ్ళి విని ఒక్కసారి అలా అలా మీ ఊరి పంటచేల గట్ల మీద తిరిగి రండి..........

Read more...

October 3, 2008

టాటా టాటా...నానో నానో!!


రండి, రండి................

నే వెళ్తా....................

అయ్యో రాక రాక వచ్చారు, వెళ్తానంటారేంటి.....................

ఇక వెళ్తాలేండి.........................


మీరెక్కడికి వెళ్లక్కరలేదు.................
.....

నే వెళ్ళిపోతా లేండి.....................

అబ్బే మీరెందుకు వెళ్లటం.....................

లేదులేండి నేను వెళితేనే మీకు బాగుంటుంది...................

అయ్యో అదేం లేదండి.......................

నాకిక్కడ కుదరదులేండి, నే వెళతా.......................

అయ్యోయ్యో మీకేం కావాలో చెప్పండి.....

నాకిక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, వెళతా.......................

మీకేం ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాగా...................

టాటా, టాటా, టాటా, టాటా,............................

నానో, నానో, నానో..................................

Read more...

అత్త మీది కోపం దుత్త మీద

మనకి అకారణంగా ఎవరి మీదైనా కోపం వస్తుందా? ద్వేషం కలుగుతుందా??

మనకి తెలియని, తెలిసినా వ్యక్తిగత పరిచయం లేని, ఒట్టి ముఖ పరిచయం మాత్రమే ఉన్న వ్యక్తుల మీద అకారణ కోపాలు, ద్వేషాలు మనం చాలా సార్లు చూపిస్తుంటాము. (రాజకీయ నాయుకులు, టెర్రరిస్టులు, ......ఇలాంటి వారి మీద ఉండే లాంటి కోపం ద్వేషం గురించి కాదు నేను చెప్పేది). దీనికి కారణం పలానా అని కూడా చెప్పలేం. కొన్నిసార్లు మనకి సన్నిహితులైన వారి మీద ఉండే కోపాన్ని, అసహనాన్ని, ఉక్రోషాన్ని, వాళ్లని ఏమీ అనలేని అసహాయతని ఇలా వేరే ఎవరి మీదో వెళ్లగక్కుతుంటాం, అత్త మీది కోపాన్ని దుత్త మీద చూపించటం అన్నమాట. అది కూడా చాలా తెలివిగా ఆ చేసింది మనమే అన్న సంగతి వాళ్లకి తెలియకుండా చేస్తుంటాం. ఎక్కువసార్లు ఈ ప్రక్రియ మనకి తెలీకుండానే జరిగిపోతుంది. ఒక్కోసారి మనం అసలు ఈ విషయమే గమనించం. ఒకవేళ గమనించినా వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పటికి అది మనకు తప్పుగానే కనిపించదు, మన ప్రవర్తన చాలా సహజంగానే ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. మన ఆ ప్రవర్తనకి కారణాలు కూడా మనకి అప్పుడు అర్థం కావు. జీవితంలో అప్పుడప్పుడు వెనుతిరిగి చూసుకుంటాం కదా, అప్పుడు కనిపిస్తాయి ఇలాంటివన్నీ.

నేను ఇంటరులో ఉన్నప్పటి సంగతి. మా నాన్న ఫిజిక్సు లెక్చరరు. నేను అదే కాలేజిలో ఇంటరు చదివా. మాకు ఇంటరు రెండు సంవత్సరాలు ఫిజిక్సుకి మా నాన్నే వచ్చేవాళ్లు. మా నాన్నకి ఇంట్లో పిల్లలకి పాఠాలు చెప్పటం కాని, బయటి పిల్లలకి ట్యూషన్లు చెప్పటం కాని ఇష్టం లేని మరియు కష్టమయిన పని. ఆ రోజులలో కాలేజి లెక్చరర్లు అందులోనూ సైన్సు సబ్జెక్టు వాళ్ళు ట్యూషన్లు చెప్పకపోవటం చాలా అరుదాతి అరుదు. కార్పోరేటు కాలేజిలు వచ్చి వాళ్ల పొట్టలు కొట్టాయి కానీ, ట్యూషన్లంటే ఆ రోజులలో ఇంట్లో కామధేనువు ఉన్నట్లే.

నేను 10 వ తరగతి అయిపోయాక వేసవి సెలవులలో ఇంటరు పుస్తకాలు పట్టుకుని తెగ చదివేసేదాన్ని(10 వరకు తెలుగు మీడియంలో చదివి ఆ పుస్తకాలు పట్టుకుంటే ఏమి అర్థం అయ్యేది కాదులేండి, అది వేరే విషయం :) ). ముఖ్యంగా మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఫిజిక్సు తెగ చదివేసేదాన్ని, ఆయన చూడకపోతారా, నాకు పాఠాలు చెప్పకపోతారా అని. అబ్బే, మా నాన్న అదేం చూసేవాళ్లు కాదు. సరే ఇక కాలేజిలో చేరాక మా నాన్నకి బాగా దగ్గరి స్నేహితులైన ఒక ప్రముఖ డాక్టరు గారున్నారు. ఆయన పిల్లలిద్దరు (కవలలు) నాతో పాటే ఇంటరు చదివారు. అందులో ఒకళ్లు M.P.C., ఇంకొకళ్లు Bi.P.C. (అంటే మన సెక్షనే). ఈ Bi.P.C. జీవి ఎప్పుడూ చదువే చదువు అన్నట్లు ఉండేవాడు. పొద్దున లేవటం ట్యూషన్లతో రాత్రి పడుకోవటం ట్యూషన్లతో అన్నట్లుండేది. కాలేజీలో ఎంతమంది లెక్చరర్లు ఉంటే అంతమంది దగ్గరికి ట్యూషన్లకి వెళ్లేవాళ్లు. మరి మా నాన్న ట్యూషను చెప్పరుగా, అందుకని డాక్టరు గారు మా నాన్ననే కాలేజి అయిపోయాక వాళ్లింటికొచ్చి వాళ్ల పిల్లలకి ఓ గంట పాఠాలు చెప్పమని కోరగా ఓ రోజు కాలేజి అయిపోయాక మా నాన్న తనతో పాటు నన్ను కూడా ఆ డాక్టరు గారింటికి తీసుకుపోయారు. నేరుగా పైన మేడ మీద పిల్లల గదిలోకి వెళ్లాం. వెళ్లగానే పనమ్మాయితో కాఫీ, బిస్కట్లు వచ్చాయి. నాకు అర్థం కాలా ఇదంతా ఏంటో. కాసేపటికి సోదరులిద్దరు పుస్తకాలు పట్టుకుని వచ్చారు. మా నాన్న పాఠం మొదలుపెట్టారు. ఇక నా పరిస్థితి చూడండి అసలు మా నాన్న మా ఇంట్లో నాకు చెప్పకుండా వీళ్లింటికొచ్చి, తనొచ్చేదే కాక తనతో పాటు నన్ను కూడా తీసుకొచ్చి, వీళ్లతోపాటు నాకు పాఠాలు చెప్పటం ఏంటి అన్న ఉక్రోషం. మా నాన్నని ఏమీ అనలేను కదా! మరి నా ఉక్రోషం ఎలా తీర్చుకున్నానంటారా? ఆగండి మరి తరువాయి టపాలో చెప్తా.

Read more...

October 2, 2008

భోగ శ్రీనివాసుని వైభోగం

"ఆనంద నిలయం అనంత స్వర్ణమయం".. ఇది తితిదే కొత్తగా ప్రవేశపెట్టిన పథకం పేరు. ఆనందనిలయం మొత్తాన్ని బంగారంతో తీర్చి దిద్దబోతున్నారు. లోపలి గోడలతో సహా అడుగడుగునా బంగారమే. అబ్బా ఎంతటి మహత్తర కార్యం అనుకుంటున్నారా!! ఈ పథకానికి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో తెలుసా!!! 600 కోట్ల నుండి 1000 కోట్ల వరకు (ఆరువందల కిలోల పైగా బంగారం వాడతారట). అసలు ఇండియా వెనుకపడ్ద దేశం అనేదెవరు??

అమృతసర్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్, తమిళనాడులోని శ్రీపురంలో ఉన్న మహాలక్ష్మి గుడి (ఇక్కడ ఓ టన్ను పైగా బంగారం వాడారట) కంటే తిరుమల గుడిని ఇంకా ప్రసిద్ది చేయటానికి ఈ పథకాన్ని ప్రారంభించారట. అంతే కాదు ఒక కిలో అంతకంటే ఎక్కువ బంగారాన్ని దానమిచ్చిన వారికి ప్రత్యేక వసతులు, రాయితీలు కలిపించబడతాయట. ఇప్పటికే ఉన్న VIP దర్శనాలతో సామాన్య మానవుడికి దర్శనం దొరకటం ఎంత దుర్లభమవుతుందో చూస్తూనే ఉన్నాం, ఇక ఇవి కూడా మొదలయితే ఇక్కడినుండే ఆ భోగ శ్రీనివాసుడికి ఓ దండం పెట్టేసుకోవటం ఉత్తమం.

అసలు నాకు ఒక సందేహం, ఇంత ఖర్చు పెట్టి చేసే ఆ వైభోగం చూడటానికి మనల్ని అక్కడ ఉండనిచ్చే ఐదారు సెకండ్లలో మనవల్ల అవుతుందా! ఆ శ్రీపురంలో వంద మీటర్ల దూరంనుండే అమ్మవారిని దర్శనం చేసుకోవాలట, మరి ఇక నుండి మనం మన ఏడుకొండలవాడిని ఎన్ని మీటర్ల దూరంనుండి దర్శనం చేసుకోవాలో!

ఏడుకొండలపైన ఏల వెలిశావో......తెలుపర స్వామీ!!!

Read more...

September 21, 2008

ఆడ బ్లాగుల్లో సోదే ఉంటుందా--రెండవ భాగం

ఇది నా ముందు టపా "ఆడ బ్లాగుల్లో సోదే ఉంటుందా" కి పొడిగింత. ఇంతకు ముందు ఎక్కువమంది కళ్ళపడని మరియు సరికొత్తగా కొంగొత్తగా మన ముందుకి వచ్చిన మరి కొన్ని మహిళా బ్లాగుల్ని కూడా చూద్దామా! ఇవి కూడా వేటికవే విభిన్నమైనవే.

కాస్కో నా వాస్కోడిగామా....అమ్మో ఇదేంటి అనుకుంటున్నాలా, అదే మలి మీలే చూడండి
. ఈ పిల్లకి ర పలకదంట మలి.

అందరిలాగానే మమూలు మనిషిని, కొంచం అల్లరి, కొంచం కోపం, కొంచం అలోచన, ఇంక నాకే తెలియని ఎన్నో కోణాలతో-- అంటూ మన ముందుకు వచ్చిన మరో బ్లాగరి నేను-లక్ష్మి.

ఓనమాలు లలిత గారిని గుర్తుకు తెస్తూ లలిత లలితంగా మొదలైన ఇంకొక బ్లాగు నా స్పందన.

దేవుడికి అరటిపండు ఎందుకు సమర్పిస్తారు? భక్తుడు గొప్పా, భగవంతుడు గొప్పా? ఇలాంటి గొప్ప గొప్ప లాజిక్కులు ఉండే బ్లాగు మీకు ఎక్కడైనా ఎదురయ్యిందా? మనమరాలిని ముందు పెట్టుకుని ఒక అమ్మమ్మ పొడుస్తున్న పొడిస్తే నవ్వులు విడిస్తే నవ్వులు చూడండి
.

2006 నుండి బ్లాగు రాస్తున్నా నేను అనామికను అంటున్న ఝాన్సీ బ్లాగు కూడా ఒకసారి చూడండి
.

మన మహిళా బ్లాగర్లలో చాలామంది రచయిత్రులు, జర్నలిస్టులు కూడా ఉన్నారండోయ్.

మహార్ణవం పేరుతో కథలు కవితలు రాస్తున్న శ్రీవల్లీ రాధిక గారు బ్లాగరుగా కొత్తే కాని వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో, ఈమాట లాంటి అంతర్జాల పత్రికలో వచ్చాయి. ..న కథలు కొన్ని హిందీ, తమిళ్, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి.

ఆంధ్రజ్యోతిలో ఫీచర్సు రాసే అరుణ గారికి కూడా ఒక బ్లాగు ఉంది, మరి ఆ అరుణంని కూడా ఒకసారి చూడండి.

ఏం చేయాలో అర్థం కావటం లేదంటూ ఒక జర్నలిస్టు రాస్తున్న బ్లాగు కొత్తగా మొదలయింది చూడండి.


తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం ఉన్న వారికైనా మంచి కథల రచయితగా చిరపరిచితుడయిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.
--ఆయన కథల్ని,కవితల్నిఅనువదిస్తున్న స్వాతి శ్రీపాద గారి గురించి మీకు తెలుసా! తను ఒకటి కాదు రెండు కాదు మూడు బ్లాగులు రాస్తున్నారు. స్వయంగా రచయిత్రి అయిన స్వాతి గారి కవితలు,కథలు ఈమాట,పొద్దు లాంటి అంతర్జాల పత్రికలలోనూ,విపుల లాంటి కథల పుస్తకాలలోనూ వచ్చాయి. అంతర్జాతీయ వేదికలపై కవితాపఠనం చేసిన అనుభవం కూడా స్వాతి గారికి ఉంది.

ఇంకా నాకు తెలియని మహిళా బ్లాగర్లు ఎవరైనా ఉంటే వారి గురించి కూడ తెలియచేస్తే ఇందులో పొందుపరుస్తాను.

Read more...

September 16, 2008

ఆడ బ్లాగుల్లో సోదే ఉంటుందా?

ఆడ బ్లాగుల్లో సోది ఎక్కువా?? అసలు సోది అంటే???

ఎవరైనా బ్లాగు రాసేది తమ ఆలోచనలు, జ్ఞాపకాలు, అభిరుచులు మొదలైనవి దాచుకోవటానికి, ఇతరులతో పంచుకోవటానికి. మన జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు అంటే అక్కడ మన వ్యక్తిగత జీవితమే ఎక్కువగా ప్రతిభింబిస్తుంది. నిత్య జీవితంలో జరిగే విశేషాలనే కొంతమంది కాస్త హాస్యం కలిపి -జనాలకి నచ్చే విధంగా చెపుతుంటారు. మనసులో మాట సుజాత గారి బ్లాగు కొద్దికాలంలోనే పేరు తెచ్చుకోవటానికి ముఖ్యకారణం ఇదే. అసలు ఓ టపా చదివేటప్పుడు అందులో విషయం గురించే ఆలోచిస్తాం కాని ఆ బ్లాగరు వయస్సు ఎంత? రూపం ఎలా ఉంటుంది అని ఆలోచించి చదువుతామా?

బ్లాగుల్లో వ్యక్తిగత జీవితం గురించిన ఆలోచనలు, అనుభవాలు, జ్ఞాపకాలు--వీటి గురించి చెప్పే బ్లాగులే ఎక్కువ. అసలు వ్యక్తిగత జీవితం గురించి ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో చెప్పని బ్లాగు ఒక్కటి కూడా ఉండదేమో! అవి అందరికి నచ్చాలని కూడా ఏమి లేదు. ఏదైనా చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. ఒకరికి సోది అనిపించింది ఇంకొకరికి ఆసక్తికరంగా ఉండొచ్చు. లోకోభిన్నరుచి కదా. నాకు కవితలు అంతగా తలకెక్కవు, కొంతమందికి అవంటే ప్రాణం, కొంతమందికి టెక్నికల్ బ్లాగులు ఓ పట్టాన కొరుకుడు పడవు, కొంతమంది రాజకీయాలంటే ఆమడ దూరంలో ఉంటారు--ఏదైనా మన అభిరుచులని బట్టి మన ఇష్టాయిష్టాలనిబట్టి మనం ఎలాంటి టపాలని ఇష్టపడతామో ఉంటుంది కాని అది ఆడవాళ్ళు రాసారా మగవాళ్ళు రాసారా, అమ్మాయిలు రాసారా అమ్మమ్మలు రాసారా అన్నదాన్ని బట్టి కాదు. అవి మనకి నచ్చితే చదువుకోవటం లేకపోతే వదిలేయటమే. మనకోసం మన అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ బ్లాగులు రాయరు అన్నది కాస్తంత గుర్తుపెట్టుకుంటే చాలు.

ఈ మద్య తెలుగులో వచ్చిన బ్లాగుల్లో అనతికాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న వాటిల్లో ఆడవారివే ఎక్కువ. ఆ బ్లాగుల్లో ఏం రాస్తున్నారో అవి ఎంత వైవిధ్యంగా ఉంటున్నాయో ఒక్కసారి చూద్దాం.

నిడదవోలు మాలతి గారి తెలుగు తూలిక--సాహిత్యానికి పట్టుగొమ్మ ఈ బ్లాగు. చక్కటి హాస్యంతో మనతో ఎదురుగా నిలబడి చెపుతున్నట్లుండే కబుర్లు, కథలు ఈ బ్లాగరి స్వంతం. అసలు ఈ బ్లాగు లేకపోతే ఆవిడ గురించి మనలో చాలామందికి తెలిసి ఉండేది కాదు.

గేయాలు, పద్యాలు, అనుభవాలు, కవితలు, ఆశీస్సులు, దండకాలు, ఆటలు-ఒక్కటేంటి అన్నిటిని గురించి ఔపాసన పట్టిన ఓ అనుభవజ్ఞురాలు రాస్తున్న మరో ఆణిముత్యం లాంటి బ్లాగు జ్ఞానప్రసూన గారు రాస్తున్న సురుచి--మంచి మంచి రుచులు చూపించే బ్లాగు.

కొత్తపాళీ గారు పెట్టే కథల పోటీ గురించి మీకందరికి తెలిసే ఉంటుంది. అందులో మొదటి రెండు సార్లు బహుమతి కొట్టేసింది ఎవరో మీకు తెలుసా? ఆ ఆ..... మీకు తెలుసని నాకు తెలుసు. తను రాసేది తక్కువే అయినా రమ్యంగా రాస్తారు. కథలు రాయటమే కాదు పుస్తకాల గురించి, సినిమాల గురించి, టి.వి. సీరియల్స్ గురించి చక్కటి సమీక్షలు రాస్తుంటారు. అసలు ఆదివారం సెలవెందుకు? తనని అడగండి ఎందుకో చెపుతారు.

కాళ్ళాగని కాలపు అలలలో మనసు ఊహలు కొట్టుకుపోకుండా, ఈ బ్లాగులో ఊసులుగా పదిలపరచ ప్రయత్నం!! పూర్ణిమ చెప్పే ఈ ఊసుల కోసం ఎదురుచూడని వాళ్లు ఎవరు? టపా టపాకి మంచి పరిణితితో తనదైన శైలిలో వినూత్నంగా సాగుతున్న బ్లాగు ఇది. అందరిని ఆకట్టుకునే పుస్తక సమీక్షలు--- కాదు కాదు విశ్లేషణలు-- ఈ బ్లాగు ప్రత్యేకత.

బుజబుజ రేకుల పిల్లని, బుజ్జా రేకుల పిల్లని, బ్లాగేబ్లాగే పిల్లని అంటూ మీనాక్షి రాసే బ్లాగు ఎంత అల్లరల్లరిగ ఉంటుందంటే తను బ్లాగులోకంలో మరో విహారి అయిపోయింది. ఈ బ్లాగులో ఉండే ప్రాసలు, సెటైర్లు, విరుపులు, యాసలు తనకే ప్రత్యేకం.

నా గురించి..... చెప్పటం సులువు కాదు. అర్థం చేసుకోవటం కష్టం కాదు అంటూ మోహన పేరుతొ విశాల రాసే విశాల ప్రపంచం పేరుకి తగ్గట్లే షాయరీల దగ్గరినిండి వేదాంతం దాకా అన్ని తనలో పొదుపుకుంది. తనగురించి తన మాటలలోనే చదవండి--"ఎలాంటి topic లో అయినా ఇట్టే ఇమిడిపోతాను. Spirituality, Philosophy, Psychology, Mathematics, Physics, Social issues, movies, Arts, Languages, Cricket, ఇంటి పని, వంట పని... ఇలా దేని గురించైనా మాట్లాడేస్తుంటాను".

బ్లాగువనమది అందరిది..ఈ పోస్టులు అందరి కోసములే.....కొన్ని కలలు, కొన్ని ఆశలు, కొంచెం అల్లరి, కొంచెం కోపం, కొంచెం ప్రేమ, కొంచెం బాధ కలిపితే నేను..ఒక మామూలు తెలుగు అమ్మాయిని అంటూ బ్లాగువనం లో పాదుకున్న మరో కొంటె కోణంగి విద్య. అల్లరే కాదు చక్కటి కవితలు అల్లగలదు, అంతే చక్కగా కథలు, సినిమా కబుర్లు చెప్పగలదు. తన భయాలు,బెంచి కష్టాలు, మొదలైన వాటి గురించి చెప్పి మనల్ని హడలగొట్టేయనూ గలదు, కాస్త జాగ్రత్త.

అప్పుడు ఏమి జరిగిందంటే అంటూ కబుర్లు చెప్పే క్రాంతి గురించి తను చెప్పే కబుర్ల గురించి తెలియని వారెవ్వరు! తలనెప్పి నివారణకు మంచి మందు ఈ బ్లాగు చదవటం. మంచి హాస్యంతో అలరాడే బ్లాగులో ఇది ఒకటి.

మనకి తెలియని ఎన్నో ఆరోగ్యసూత్రాలని పరిచయం చేస్తూఅమరవాణి రాస్తున్న బ్లాగు. ఆయుర్వేద అభిమానులే కాదు ప్రతి ఒక్కరు చదవవలిసిన బ్లాగు ఇది.

ఇక రాజకీయాలు, సంగీతం, సాహిత్యం, పురాణాలు, సాంకేతికాలు, హైకూలు...ఇలా వైవిధ్యమయిన విషయాల గురించి ఎంతో అలవోకగా మేధ రాసే నాలో నేను కి ఎంతమంది అభిమానులో!

జాజుల జావళీలతో, అందమైన ప్రేమలేఖలతో , కథలతో మనతో ఊసులాడే ఒక జాబిలి . కవిత్వం అంటే తెలియని వాళ్ళని కూడా తన అభిమానులుగా చేసుకున్న ఓ night queen.

నాలో మెదిలే కన్నీటి అలలూ.. నాలో కరిగే పన్నీటి కలలూ.. నాలో రగిలే ఆలోచనల జ్వాలలూ.. వీటన్నింటి అక్షర రూపమే....కలలో...కన్నీటి అలలో అంటు తన కలలు, కవితలు, జ్ఞాపకాలు మనతో పంచుకోవటానికి వచ్చిన ఓ సరికొత్త బ్లాగు, మీరందరూ చూసే ఉంటారు.

ఈ సంవత్సరం వచ్చిన మరొక వైవిధ్యమైన బ్లాగరు గడ్డిపూల సుజాతగా అందరికి పరిచయమయిన సుజాత . తను మూడు బ్లాగులు రాయటం ఓ విశేషమయితే అవి దేనికదే వైవిధ్యంగా ఉండటం మరొక ప్రత్యేకత. -- గడ్డిపూలు లో రాజకీయాలు, సాహిత్యం, సినిమాలు, క్రీడలు, అణుఒప్పందం, తీవ్రవాదం, ఐ.ఈ.డీ లు(Improvised Explosive Devices), స్త్రీవాదం...... ఒక్కటేమిటి తను విశ్లేషించని విషయం అంటూ ఉండదు.

తన ఇంకొక బ్లాగు శ్రీనివాసం లో ప్రసిద్ధ కీర్తనలు భజనలు భావాలతో సహా ఏర్చి కూర్చి పెడుతున్నారు.

ఇక తన ఇంగ్లీషు బ్లాగు spice and chocolate.

మా అమ్మ నాకే కాక నా బ్లాగుకి కూడా పేరెట్టింది అంటూ మన ముందుకి వచ్చిన తొలి తెలుగు బడిబ్లాగరు గుర్తుందా? తెలుగు మాట్లాడటమే తప్పు అనుకునే ఈ కాలంలో చక్కటి తెలుగులో ఓ తొమ్మిదో తరగతి చదివే అమ్మాయి బ్లాగు రాయటం చాలా ఆనందకరమైన విషయం కదూ!

గుండె గొంతుకలోన కొట్టాడుతుంది గొంతు దాటి అది రానంటోంది అంటూ తన మనసులోని మాటని మనకి వినిపించాలని ఆరాటపడే రమణి గారి బ్లాగు---కందిపచ్చడితో బ్లాగులోకాన్ని ఓ ఊపు ఊపిన బ్లాగు.

ఈ మధ్య బ్లాగు లోకంలో చర్చలు, చలోక్తులు, వాగ్వివాదాలు, సెటైర్లతో సందడి సందడి చేస్తున్న బ్లాగు--అబ్బో ఆ మాత్రం మాకు తెలీదంటారా?? నేను చెప్పేది అదే మరి--- పరిచయం అక్కర్లేని బ్లాగు.

ఈ మధ్య మొదలైన మరో చల్ల చల్లని హాట్ హాట్ బ్లాగు ప్రియ, వైష్ణవి కలిసి రాస్తున్న ప్రియరాగాలు. ఇందులో ప్రియ రాసేవే ఎక్కువ. తను రాముడి మీద రాసిన టపా రేపిన కలకలం అంతా ఇంతా కాదు. తన వాదాన్ని చాలా సాధికారతతో రాసిన టపా ఇది.

కమ్మటి సువాసనల తలపులు మన మనసులలో నింపే జాజి ఈ విరజాజి. కొంత సాహిత్యభిలాషా, కాస్త తెలుగు భాషపై మమకారమూ, మరి కొంత తెలుగు సంస్కృతి పై గౌరవమూ, కొద్దో గొప్పో తెలుగు జాతి పైన అభిమానమూ కలిగిన అచ్చ తెనుగు ఆడపడుచు రాస్తున్న సరికొత్త బ్లాగు.

అప్పుడప్పుడు అలా కనిపించి ఊసులు చెప్పే స్వాతి చక్రవర్తి బ్లాగు కూడా ఈ మధ్య వచ్చిన బ్లాగుల్లో ఒకటి.

ఇక స్త్రీవాద రచనలు చేసే కొండవీటి సత్యవతి, కొండేపూడి నిర్మల, కల్పన రెంటాల కూడా బ్లాగులు రాయటం మొదలుపెట్టి మహిళా బ్లాగులకి ఓ పరిపూర్ణత కల్పించారు.

ఎప్పటినుండో రాస్తున్న రాధిక, జ్యోతి, సౌమ్య, స్వాతికుమారి, పద్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.

కొంగొత్తగా వచ్చిన మరో నాలుగు బ్లాగుల్ని కూడా చూద్దామా!

కాస్కో నా వాస్కోడిగామా....అమ్మో ఇదేంటి అనుకుంటున్నాలా, అదే మలి మీలే చూడండి. ఈ పిల్లకి ర పలకదంట మలి.

మహార్ణవం పేరుతో కథలు కవితలు రాస్తున్న శ్రీవల్లీ రాధిక గారు బ్లాగరుగా కొత్తే కాని వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో, ఈమాట అంతర్జాల పత్రికలో వచ్చాయి. తన కథలు కొన్ని హిందీ, తమిళ్, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి.

అందరిలాగానే మమూలు మనిషిని, కొంచం అల్లరి, కొంచం కోపం, కొంచం అలోచన, ఇంక నాకే తెలియని ఎన్నో కోణాలతో-- అంటూ మన ముందుకు వచ్చిన మరో బ్లాగరి నేను-లక్ష్మి.

ఓనమాలు లలిత గారిని గుర్తుకు తెస్తూ లలిత లలితంగా మొదలైన ఇంకొక బ్లాగు నా స్పందన.

ఇందుగలరందులేరని సందేహం వలదు, ఎందెందు చూసినా మహిళలే కనిపించు. నాకు తెలియని తెలుగు మహిళా బ్లాగర్లు మరి కొందరు ఉండి ఉండవచ్చు, వారందరికి కూడా నా అభినందనలు మరియు ఆశీస్సులు.

Read more...

September 2, 2008

వినాయకచవితి-ఇకనైనా మేలుకుందాము


హైదరాబాదు నగరంలో అతి పెద్ద సందడి గణేష్ నవరాత్రులు. ఒకరి మీద ఒకరు పోటీగా గల్లీ గల్లీకి ఓ రెండు మూడు వినాయక మండపాలు, భారీ వినాయక విగ్రహాలు, తిరుపతి లడ్డు కూడ ఈర్ష్య పడేలాంటి లడ్లు, ఆ లడ్డూల వేలం (వెర్రి), చెవుల తుప్పు వదలగొట్టే లౌడు స్పీకర్లు- అబ్బో ఆ తొమ్మిది రోజులు హడావుడి అంతా ఇంతా కాదు. ఇక నిమజ్జనం రోజు అయితే చెప్పక్కరలేదు, ఎక్కడికక్కడ ట్రాఫిక్కు జాములు. అబ్బ పండగంటే ఇంత హంగామా గొడవ అవసరమా అనిపిస్తుంది. చోటా మోటా నాయకులతో పాటు పది పన్నెండేళ్ల పిల్లలు కూడా ఓ పుస్తకం పట్టుకుని వినాయకచవితి చందాలు అంటూ బయలుదేరతారు. అడుక్కోవటంలో కూడా దౌర్జన్యమే. అసలు ఇక్కడ భక్తి కంటే జనాలు తమ పరపతి, హంగూ, ఆర్భాటాలు చూపించుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. కొన్ని రోజులు పోతే వినాయకుడు నాకీ పండగ వద్దు బాబోయి అని భూలోకం రావటమే మానేస్తాడేమో!!


ఇక నిమజ్జనాల పేరుతో చెరువులని కుంటలని ఎంత కాలుష్యం చేస్తున్నామో! మట్టి విగ్రహాల స్థానంలో ఇప్పుడు ప్లాస్టరు ఆఫ్ పారిసుతో చేసిన విగ్రహాలకి ఎక్కడలేని డిమాండు. ఇక వీటికి వాడే రంగులు రసాయనాల సంగతి చెప్పక్కరలేదు. ఈ రంగులలో ఉండేవి మెర్క్యురి, కాడ్మియం, లెడ్, కార్బన్ మొదలైన హానికర రసాయనాలే. ఇవన్ని చివరికి కలిసేది హైదరాబాదు పట్టణానికి నెక్లేసు అని మనం గొప్పగా చెప్పుకునే హుస్సేనుసాగరులోనే. ఈ సంవత్సరం ఖైరతాబాదు గణేషుడి తయారికి 12 టన్నుల స్టీలు, 1000 సంచుల పైగా ప్లాస్టరు ఆఫ్ పారిసు, 50 కట్టల కొబ్బరినార వాడారంట. కాకపోతే గుడ్డిలో మెల్ల ఏమిటంటే 2007 నుండి ఈ విగ్రహానికి సహజ సిద్ధమైన రంగుల్ని వాడుతున్నారు.

నాణానికి రెండోవైపు కూడా లేకపోలేదు. ఇదే హైదరాబాదులోని ప్రగతినగర్‌లో (కూకట్‌పల్లి దగ్గర) కాలనీ వాళ్ళు ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడికే పూజలు చేస్తారు. The National Green Corps, విజయరాం (ఎమరాల్డు స్వీటు షాపు) లాంటి వాళ్ళు మట్టి విగ్రహాల వాడకం పట్ల జనాలలో అవగాహన కలిగించటానికి తమదైన రీతిలో కృషి చేస్తున్నారు.
విజయరాంగారు అయితే నిమజ్జనం బాధ్యతలుకూడా తనే చూసుకుంటారట. వారి స్ఫూర్తితో మనమూ ఆ బాటలోనే పయనిద్దాం.


మట్టి విగ్రహాలని వాడదాం, వాడమని చెపుదాం. మట్టి విగ్రహాలే కాదు, శాశ్వతంగా ఉండే కంచు, ఇత్తడి, రాతి విగ్రహాలు కూడా వాడవచ్చు, నిమజ్జనం చేయకపోతే వినాయకుడు ఏమి బాధపడిపోడు, పైగా ఆ కుళ్ళు కంపు హుస్సేనుసాగరులో తనని ముంచనందుకు సంతోషిస్తాడు కూడా..


Read more...

July 8, 2008

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి

ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఊరు సమీపిస్తుండగానే మనసు ఉరకలేస్తుంది. గుండె గొంతుకలోన కొట్టాడతాది. పుట్టిపెరిగిన ఊరు, ప్రతి వీధి నాదే అని తిరిగిన ఊరు. వారానికి వెళ్ళినా, నెలకివెళ్ళినా, సంవత్సరానికి వెళ్ళినా అదే అనుభూతి, అందరికీ ఇలానేఉంటుందేమో, nostalgia they name it

మాది గుంటూరు జిల్లాలో ఒక చిన్న సాదా సీదా పల్లెటూరు . ఊరంతా కలిపి నాలుగు వీధులు, ఏభై ఇళ్లు, అంతే మా ఊరు. ఒకప్పుడు ఓ చిన్న బడి, ఓ చిన్న గుడి, చిన్న చెరువు, పెద్ద భావి , మా ఇంటికి వెనక వీధి, అటు పక్క వీధి, ఇటుపక్క వీధి, వెరసి మా ఊరు. ఇప్పుడు --పాడుబడ్డ బడి, పాడయిపోయిన భావి, మాయమైపోయిన వెనక వీధి (ఇప్పుడు ఆ స్థలం ఓ చిన్నఅడవి ప్రాంతం) .చెరువు ఒక్కటే చెరువుగా అలా మిగిలి ఉంది, తన చుట్టూ జరిగే మార్పులిని గమనిస్తూ.

ఇక కొద్దో గొప్పో అభివృద్ధి జరిగింది గుడి విషయంలోనే (మారుతున్న
మనస్తత్వాలకి ప్రతీకగా!!). ఒకప్పుడు హనుమ జయంతి రోజుతప్పితే ఎవరూ పెద్దగా గుడికి వెళ్ళేవాళ్ళు కాదు. శ్రీరామనవమి జరిగినా ఊరి మధ్యలో పందిరి వేసి చేసేవాళ్ళు , అలాంటిది ఇప్పుడుప్రతి రోజు గుడిలో భజనలు, విష్ణుసహస్రనామం, హనుమాన్ చాలీసా , ఆకు పూజ అన్నీ జరిపించుకుంటున్నాడు దేవుడు, (రాయైతేనేమిరా దేవుడు హాయిగా ఉన్నాడు జీవుడు !).

గ్రామ దేవత గోగులమ్మ. గుడి అంటూ ఏమి ఉండదు, చెరువు గట్టున నడుం వరకు మాత్రమే ఉండే పడుకుని ఉండే అమ్మవారివిగ్రహం. ఎలాంటి అలంకారాలు ఉండవు. కాస్తంత పసుపు పూసి కుంకుమ పెడతారు. గురువారం, ఆదివారం పూజలు జరుగుతాయి. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి జరిగే పూజలు ఇప్పుడు ప్రతి ఆది, గురువారాలలో జరుగుతున్నాయి. చాలా సంవత్సరాల తరువాత ఈ మధ్య గోగులమ్మ దగ్గరికివెళితే పూజా విధానం కూడా మారిపోయింది. ఇదివరకు చాకలి చేత పొంగలి చేయించి విగ్రహం చుట్టూ మజ్జిగ పోస్తూ మూడు సార్లు తిరిగి వేపాకులతో పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేవాళ్ళు . చాకలి చేత చేయించిన పొంగలి అందరికి ఆకులలో పెట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పొంగలితో పాటు పులిహోర, దద్దోజనం , ఒకటేమిటి ఎన్నెన్ని రకాల పలహారాలో , వాటికి మళ్ళీ పేపరు పళ్ళాలు!నాగరికతా చిహ్నాలు!!!

మా బడి ఓ రెండు గదుల బడే కాని దాని వంక చూస్తుంటే
ఇది నేను చదువుకున్న బడి అని ఓ విధమైన గర్వంగా ఉంటుంది. తరువాతచదివిన కాలేజిలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ అలాంటి అనుభూతిని ఇవ్వవు. వరండాలో బాల్వాడి తరగతులు, ఒక గదిలో ఒకటి, రెండు, తరగతులు, ఇంకొక గదిలో మూడు, నాలుగు, అయిదు తరగతులు జరిగేవి. ఇద్దరేటీచర్సు. ఒకటి రెండు తరగతులకి పంతులమ్మ గారు వచ్చేవాళ్ళు. పంతులమ్మ గారినిఊర్లో పెద్దల దగ్గరనుండి పిన్నల దాకా అందరం పంతులమక్కాయి అనేవాళ్ళం. ఆమె మాబడిలో చాలా చాలా సంవత్సరాలు పనిచేసారు. ఆమె అసలు పేరు దేవకీదేవి కానీ ఆ పేరుఎక్కువ మందికి తెలియదు, అందరికి పంతులమ్మక్కాయే. ఊరిలో పిల్లలంతా ఆమె దగ్గరికి ప్రైవేటుకి వెళ్ళేవాళ్ళు. ఇంత డబ్బులు ఇవ్వండి అని ఎవరిని ఏనాడూ అడిగి తీసుకునేదికాదు. పాలో, పెరుగో, వడ్లో, బియ్యమో, కూరగాయలో ఎవరు ఏమిచ్చినా తీసుకునేది. సాయంత్రం పూట వంట చేసుకుంటూ చదువుచెప్పేది. ఈ మద్యే చాలా సంవత్సరాల తరువాత హైదరాబాదులో ఆమెని చూడటం ఎంత ఆనందం కలిగించిందో. ఈ వయస్సులోకూడా అందరిని ఆమె పేరు పేరునా గుర్తుచేసుకుంటుంటే వాహ్ అనిపించింది.

ఊరు ఎలా ఉన్నా
మనుషులు ఎలా మారినా అది మా ఊరే. ఊరు మారినా ఉనికి మారదు. ఇప్పటికీ ఊరెళితే అప్పటిఅనుభూతులు, నేస్తాలు, ఆ ఆప్యాయతలు అన్నీ గుర్తొచ్చి ఆ జ్ఞాపకాల బరువుతో వెనక్కి తిరిగొస్తుంటాను.

మా ఊరిలో ఏమీ లేకపోవచ్చు, గొప్ప గొప్ప విద్యావేత్తలు లేకపోవచ్చు, బడా బడా వ్యాపారవేత్తలు లేకపోవచ్చు, ఊసరవెల్లులలాంటి కుహనా రాజకీయనాయకులు లేకపోవచ్చు, నాగరికతాచిహ్నాలైన షాపింగు మాల్స్ లేకపోవచ్చు, మల్టీప్లెక్సులు లేకపోవచ్చు, అభివృద్ధికి అద్దంపట్టే కార్పోరేటు బళ్ళు లేకపోవచ్చు, ఇవేవి లేకపోయినా అది నేను పుట్టి పెరిగిన ఊరు, నా వాళ్ళు ఉన్న ఊరు, అందుకే నాకు మా ఊరే గొప్ప.

"మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి
పచ్చనీ పచ్చికపై మేను వాల్చాలి
పైరగాలి వచ్చి నన్ను పలకరించాలి "
అన్న పాలగుమ్మి గారి పాట విని పరవశించని మనసు ఉంటుందా!!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP