పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 21, 2013

e-పుస్తకాలు-ఒక్కోసారి తప్పని అవసరం!

మామూలుగా నాకు కంప్యూటర్ లో చదవటం అంత ఇష్టం ఉండదు...వెబ్ మాగజైనులు కూడా నేను అంతగా చదవను.  చాలా బాగున్నాయి చదివి తీరాల్సిందే అనుకుంటేనే చదువుతాను.   కానీ ఒక్కోసారి మనకు ఎంత ఇష్టం లేని పనులైనా పరిస్థితుల ప్రభావం వల్ల చెయ్యక తప్పదు.  అలాంటి పరిస్థితుల ప్రభావం వల్లే నాకు e-పుస్తకాలు చదవటం తప్పనిసరి అయి ఇప్పుడు అవే ముద్దయిపోయాయి.

దాదాపు సంవత్సరంన్నర క్రితం మొదటగా కిండిల్ లో (కిండిల్ టచ్ మా పిల్లలకని తెప్పిస్తే వాళ్ళు పుస్తకమే మాకూ ఇష్టం అని దాన్ని పక్కన పడేసారు..అది అలా ఊరికే పడి ఉండటం చూసి బాధేసి నేను వాడదామని ప్రయత్నించాను) కొన్ని తెలుగు పుస్తకాలు చదువుదామని ప్రయత్నిస్తే అసలు చదవటానికి వీలుగా లేదు.  చీమతలకాయలంత అక్షరాలు చదవటం చాలా కష్టమయ్యేది.  ఫాంట్ సైజు పెంచామంటే తర్వాతి పేజీకి వెళ్ళాలంటే మళ్లీ ఫాంట్ సైజు తగ్గించుకుని కాని వెళ్ళలేకపోయేవాళ్ళం.

నెట్ లో వెతికాను కానీ ఈ సమస్యకి సరైన పరిష్కారం కనిపించలేదు.  ఏదో mobi format అన్నారు..అలా చేసినా చదవటానికి తల ప్రాణం తోకకొచ్చేది.  ఇక నా వల్ల కాదని పక్కన పడేసాను.

అప్పుడే మాలతి గారు కూడా ఇదే విషయం పై ఓ టపా వ్రాసారు.  అమ్మయ్య నాకు  ఇంకా తోడున్నారన్నమాట అని ఊపిరి పీల్చుకున్నాను!

అసలు విషయం ఏంటంటే e-రీడర్సు లో చదవటానికి వీలయ్యేటట్టు మన తెలుగు పుస్తకాలు రావటం లేదు.  మనకి  నెట్టులో దొరికే తెలుగు పుస్తకాలు..వ్యాసాలు ఎక్కువగా PDF రూపంలో ఉంటాయి.  ఇవి కిండిల్ లో చదవటం (మిగతా e-రీడర్సు గురించి నాకు తెలియదు) చాలా ఇబ్బందికరం.

అలా కిండిల్ ని మూలన పడేసాను. హైదరాబాదులో ఉన్నంత కాలం మళ్ళీ e-పుస్తకాల మీదకి దృష్టి పోలేదు..అంత అవసరమూ రాలేదు.

తర్వాత డిసెంబరు-2012 లో గూగుల్ నెక్సస్-7 వచ్చింది.  దాంట్లో కూడా మొన్నమొన్నటి వరకు మెయిలు చూసుకోవటం..నెట్ సర్ఫింగ్..ఆటలకి తప్పితే పుస్తకాలు చదువుదామని ప్రయత్నించలేదు.  పది నెలలబట్టి ఆంధ్రదేశానికి దూరంగా ఉన్నా హైదరాబాదు వెళ్ళినప్పుడల్లా పుస్తకాలు తెచ్చుకుంటూ చదువుకుంటూ గడిపేస్తున్నాను.  ఎన్ని పుస్తకాలని తెచ్చుకోగలను! తెచ్చుకున్న పుస్తకాలు అయిపోయాయి.

ఆ మధ్య ఒక రోజు నెక్సస్ లో తెలుగు e-పుస్తకాలు చదవగలమేమో చూద్దాం అని పురుగు కుట్టింది.  సరే మన కినిగె వాళ్ళున్నారుగా వాళ్లని సంప్రదించాను..మీ e-పుస్తకాలు నెక్సస్ లో చదవగలమా అని? వచ్చు..వచ్చు Bluefire లేదా Aldiko రీడర్ల ద్వారా ఎంచక్కా చదువుకోవచ్చు అని చెప్పారు.

అహా ఏమి హాయిలే హలా అనుకుంటూ అప్పటికే మా నెక్సస్ లో Aldiko ఉంది, Bluefire కూడా దింపుకుని టపటపా ఓ ఎనిమిది పుస్తకాలు దింపేసుకున్నాను కినిగె నుండి.




హాయిగా ఉంది చదువుకోవటానికి.  Bluefire..Aldiko..ఈ రెండిటిల్లో నాకు Bluefire వీలుగా బాగుంది.  Aldiko కూడా బాగుంది కానీ అందులో ముందు Aldiko కి వెళ్ళి దాని ద్వారా కినిగె కి వెళ్ళి పుస్తకాలు దించుకోవాలి.  Bluefire అయితే డైరెక్టుగా కినిగె నుండే దింపుకోవచ్చు.

నా ఓటు ఎప్పుడైనా అచ్చు పుస్తకానికే కానీ e-పుస్తకంతో కూడా కొన్ని అనుకూలతలు ఉన్నాయి.

ఆంధ్ర వెలుపల ఉన్నవాళ్లకి చాలా ఉపయోగం.  కొరియరో..పోస్టో..షిప్మెంటో ఇలాంటి వాటి కోసం వెతుక్కోనక్కరలేదు.  మరీ ముఖ్యంగా మాలాగా ఇంటర్ నెట్ తప్ప ఎలాంటి సమాచార సదుపాయాలు లేని  అడవుల్లో ఉండేవాళ్ళకి ఎడారిలో ఒయాసిస్సు లాంటివి ఈ e-పుస్తకాలు.

చదువుకోవటానికి బాగానే ఉన్నాయి కానీ వీటి పట్ల నాకు ఇంకా కొంత అసంతృప్తి ఉంది.

1. తెలుగు e-పుస్తకాలంటే స్కాన్ చేసి పెట్టేస్తున్నారు.  అలా కాకుండా e-రీడర్సుకి..టాబ్లెట్స్ కి అనువైన ఫార్మాట్ లో తేగలిగితే బాగుంటుంది.

2.  అక్షరాల సైజు పెంచుకోవాలంటే మనం ప్రతి పేజీకి పెంచుకోవాలి..అలా కాకుండా ఇంగ్లీషు పుస్తకాలకి పెంచుకున్నట్టు పుస్తకం మొత్తానికి ఒకేసారి పెంచుకునేట్లు ఉండాలి.

3. పేజీకి రెండు కాలమ్సు ఉండే కొన్ని పుస్తకాలు చదవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది.  ఉదాహరణకి  జమీల్యా...ఈ పుస్తకం ఫాంట్ చాలా చిన్నదిగా ఉంది..పేజీకి రెండు కాలమ్సు ఉంటాయి.  ప్రతి పేజీ ఫాంట్ పెద్దది చేసుకు చదవాలి..ఇలా ఫాంట్ పెద్దది చేసినప్పుడు రెండో కాలం కనపడదు..మొదటి కాలం చదివాక రెండో కాలం కి స్క్రీన్ జరుపుకోవాలి..దాంతో పుస్తకం చదివే వేగం కుంటుపడుతుంది...చదవాలన్న ఇష్టమూ పోతుంది.






ఈ సమస్య మళ్ళీ కథాకేళి లాంటి మాసపత్రికల్లో లేదు.


తెలుగులో e-పుస్తకాలు రావటం ఇప్పుడిప్పుడే మొదలయింది కాబట్టి త్వరలోనే పై సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం.  ఫార్మాట్ సమస్య తీరితే సమస్యలన్నీ దానికి రిలేటడ్ కాబట్టి అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది.

కినిగె వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారని ఆశిద్దాం.

అలాగే తెలుగులో విడుదలైన ప్రతి పుస్తకం e-పుస్తకంగా తేవాలని ఈ సందర్భంగా కినిగె వాళ్ళని కోరుతున్నాను.

మిగతా టాబ్లెట్సులో, e-రీడర్సు లో ఎలాంటి సమస్యలున్నాయో నాకు తెలియదు.  అవి ఉపయోగించుతున్న వాళ్ళు తెలియచేయాలి.

e-రీడర్  ఉంటే అరచేతిలో ఓ పేద్ద గ్రంధాలయం ఉన్నట్టే కానీ పుస్తకం చేతిలో పట్టుకుని చదివితే ఆ అనుభూతే వేరు.

కొంతమంది పర్యావణ ప్రేమికులు  పుస్తకాల కోసం ఎన్ని చెట్ట్లు కొట్టేయ్యాల్సొస్తుందో ..ఎన్ని అడవులు నాశనం అవుతున్నాయో అని e-పుస్తకాలనే వాడండి అని సందేశాలు ఇస్తున్నారు ఈ మధ్య.  అది కూడా నిజమే కానీ అడవుల సంరక్షణకు వేరే పర్యావరణ పరిరక్షణ పద్దతులు పాటిస్తే మేలు కదా అనిపిస్తుంటుంది నాకు.  పుస్తకాలు చదవటం మానేసి e-పుస్తకాలు చదివినంత మాత్రాన అడవులు రక్షింపబడతాయి అని నేననుకోను.

రాబోయే రోజుల్లో తెలుగు e-పుస్తకాలకి మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.

నవీన్ గారు వ్రాసిన ఈ టపా కూడా కొత్తగా e-రీడర్ కొనుక్కుందాం అనుకునేవాళ్లకి ఉపయోగంగా ఉంటుంది.

Read more...

June 17, 2013

అచ్చు పుస్తకం VS e-పుస్తకం




హైస్కూలులో ఉండగా పక్క ఊరి లైబ్రరీ నుండి మా అమ్మకి..అక్కకి నవల్సు తెచ్చిపెట్టేవాళ్ళం.  కొత్త నవలలు, కొన్ని ప్రసిద్ద నవలలు అంత తొందరగా దొరికేవి కావు.  ఎప్పుడు వచ్చేవో..ఎవరు తీసుకెళ్ళేవాళ్లో అసలు లైబ్రరీ లో కనపడేవి కావు.  మొత్తానికి ఎప్పటికో దొరికేవి. మా నాన్న వారపత్రికల్లో..మాసపత్రికల్లో వచ్చిన సీరియల్సు అన్నీ తీసి బైండ్ చేసేవాళ్ళు.  ఇప్పటికీ బోలెడున్నాయి అలా బైండ్ చేసిన అనాటి సీరియల్సు.

హాస్టల్ లో ఉండగా ఎవరైనా కొత్త నవల తెస్తే వాళ్ళు చదవటం అయ్యాక నాకంటే నాకు అని వంతులు వేసుకునే వాళ్ళం. అది చదివే దాకా నిద్ర పట్టేది కాదు.  క్లాసులో డెస్కు కింద పుస్తకం పెట్టుకుని తలవంచుకుని ఏదో సీరియస్సుగా చదువుతున్నట్లు నవల్సు చదివిన రోజులు కూడా ఉన్నాయి.

మా కజిన్ వాళ్ళకి పుస్తకాలు అద్దెకిచ్చే షాపు ఉండేది.  ఆ షాపు పుణ్యమా అని వచ్చిన పుస్తకం వచ్చినట్లు చదివే వాళ్ళం. విశాలాంధ్రలు..నవోదయల గురించి మాకసలు చాలా రోజులు తెలియనే తెలియదు.

ఏమైపోయాయో ఆ లైబ్రరీలు.. ఆ పుస్తకాల షాపులు..ఆ సీరియల్సు బైండింగులు!

కాలంతో పాటు మనమూ మారటంలేదూ..అలాగే పుస్తకాల లభ్యత కూడా  మారిపోతుంది.

ఎక్కడో అదృశ్యంగా ఉండి పుస్తకాలు అమ్మే అంగళ్ళు వచ్చేసాయి. ఇలా ఓ క్లిక్ కిక్కి కొనుక్కోవటం..అలా  ఓ నాలుగు రోజుల్లో మన చేతిలో పుస్తకం వాలిపోవటం.

ఇప్పుడయితే ఆ నాలుగు రోజులు కూడా అక్కర్లేదు.  ఓ క్లిక్ తో క్షణాల్లో మన కళ్లముందుకి సరికొత్త పుస్తకం వచ్చేస్తుంది. అప్పటికప్పుడే చదివేసుకోవచ్చు.  వేలి కొనతో అక్షరాలని మనకు కావల్సిన సైజులోకి మార్చుకోవచ్చు. షాపుల్లోకన్నా ముందు మన దగ్గరికి వచ్చేస్తున్నాయి పుస్తకాలు.

ఈ మధ్య ఫేస్ బుక్ లో కథావార్షిక-12 విశాలాంధ్రలో దొరకటం లేదని కొంతమంది మితృలు విచారం వెళ్ళబుచ్చారు. e-పుస్తకంగా మాత్రం అప్పటికే చాలా మంది చదివారు.

ఏనాడైనా కలగన్నామా ఇలా e-పుస్తకాలు వస్తాయి అని?
ఎవరినీ ఏ పుస్తకమూ అడగక్కర్లేదని
వాటి కోసం ఏ లైబ్రరీకీ వెళ్ళక్కర్లేదని
ఏ పుస్తకాల షాపు వాడినీ బ్రతిమాలుకోవక్కర్లేదని
కావల్సిన పుస్తకం కోసం ఎక్కడో మూల మూలల దుమ్ములో వెతుక్కోవక్కర్లేదు అని
ఎవరో చదివి ఇచ్చేదాకా వేచి ఉండక్కర్లేదు అని
వందల పుస్తకాలు ఓ బుల్లి టాబ్లెట్ లో దాచేసుకోవచ్చని
అసలేనాడైనా కలగన్నామా!
పుస్తకాలు పాడవుతాయన్న భీతి లేదు
ఎవరన్నా తీసికెళతారన్న  భయం లేదు
తీసుకెళ్ళిన వాళ్ళు తిరిగి ఇవ్వరేమో అన్న సంకోచమూ లేదు
అడిగిన వారికి ఇద్దామా వద్దా అన్న సందిగ్థత అసలే లేదు!
మన తర్వాత వీటన్నిటినీ ఏం చెయ్యాలా అన్న బెంగా లేదు!
ఓ క్లిక్కుతో కొనుక్కున్నట్టే ఓ క్లిక్కుతో తీసిపడేయావచ్చు!!
ఎక్కడికంటే అక్కడికి ఎన్నంటే అన్ని పుస్తకాలు మోసుకెళ్ళవచ్చు!

అంతా డిజిటల్ మయం అవుతున్న ఈ కాలంలో పుస్తకాలు మాత్రం ఎందుకు కాకూడదు!!

నిజమే..అన్నీ బాగానే ఉన్నాయి...కానీ..
అచ్చు పుస్తకం చదివితే వచ్చే తృప్తి ఓ e-పుస్తకం చదివితే వస్తుందా?
కొత్త పుస్తకం వాసన కానీ
అందరి చేతుల్లో పడి నలిగిన పాత వాసన కానీ
మొదటి పేజీలోనో..రెండో పేజీలోనే ఉండే నానా విధాల హస్తాక్షరాలు
మనకు పుస్తకం ఇచ్చినవాళ్లవో..రచయితవో ఆత్మీయ అక్షరాలూ
నలిగిన పేజీలు..మాయమైన పేజీలు
మడతలు పడిన మూలలు..అండర్ లైన్ చేసిన వాక్యాలు
వీటన్నిటినీ మిస్ అవటం లేదూ!

ఓ వర్షాకాలం సాయంత్రం
వర్షం వెలిసాక
అప్పుడప్పుడే చెల్లా చెదురవుతున్న మబ్బుల సాక్షిగా
ఎవరూ లేని ఏకాంతంలో
ఆరుబయట
ఓ వాలు కుర్చీలో కూర్చుని
ఏ వెన్నెల్లో ఆడపిల్లో..ఏ ప్రళయ కావేరి కథలో
చదువుకుంటూ
మధ్య మధ్యలో పుస్తకాన్ని గుండెల మీద పెట్టుకుని
మనసారా హత్తుకుని
అక్షరాలని అలా ఓ సారి సుతిమెత్తగా తడిమి చూసుకుని
చదువుకునే అనుభూతికి దూరమయి మరీ చదువు కొంటున్నాము!

ఏమో కొద్ది రోజుల్లో అసలు అచ్చు పుస్తకాలే లేకుండా పోతాయేమో!

అమ్మే వాళ్లకి కూడా e-పుస్తకాలే లాభం అట.

అమెరికాలో లెక్కలు ఇవి.....
కాగితంతో పని లేదు..ఎక్కువమంది మనుషులతో పని లేదు
ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు
పుస్తకాలు పేర్చి పెట్టక్కర్లేదు...భద్రపరచక్కరలేదు... వెతకక్కర్లేదు
తక్కువ ఖర్చు-ఎక్కువ రాబడి..ఇదే కదా వ్యాపారానికి ముఖ్యం!

రచయితలకి కూడా చాలా సౌలభ్యం e-పుస్తకం
పబ్లిషర్ల చుట్టూ తిరగక్కరలేదు, తామే అచ్చేసుకోవచ్చు
ప్రింట్ చేసినవన్నీ అమ్ముడు పోవేమో అన్న బెంగ ఉండదు
పబ్లిష్ చేసిన మరు నిమిషంలో పాఠకులని చేరిపోవచ్చు
ఏమైనా మార్పులు-చేర్పులు ఊంటే నిమిషాల్లో చేసేయవచ్చు
మార్పులతో మళ్ళీ మొత్తం పుస్తకం ప్రింట్ చెయ్యాలన్న బాదరబందీ లేదు.

ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి 150 e-పుస్తకాలకి 100 అచ్చు పుస్తకాలు అమ్ముడవుతున్నాయట.  ముఖ్యంగా యువతరానికి e-పుస్తకాల మీదే ఎక్కువ మక్కువ అట.

2007 లో kindle విడుదలయింది.  విడుదలయిన నాలుగు సంవత్సరాలలోనే అమెజాన్ లో e-పుస్తకాల అమ్మకం ప్రింట్ పుస్తకాల అమ్మకాలని మించి పోయింది.

తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే e-పుస్తకాల అమ్మకం మొదలయింది.  ఆంధ్రదేశానికి దూరంగా ఉండటం..షాపుల్లో పుస్తకాలు సరిగ్గా దొరకపోవటం..దూరాభారం..తెలుగు పాఠకుల్ని e-పుస్తకాల వైపుకి మళ్ళేలా చేస్తున్నాయి.

Books are not broken, but our hearts do...

****************************************************

గత కొద్దిరోజులుగా e-పుస్తకాలు విపరీతంగా చదువుతున్న ఫలితం ఈ టపా. తెలుగు e-పుస్తకాలతో నా అనుభవాలు-అనుభూతులు మరో టపాలో!


Read more...

November 22, 2012

డెహ్రాడూన్ సోయగాలు

డెహ్రాడూన్....ఉత్తరాఖండ్ కి రాజధాని.

హరిద్వార్, రిషీకేశ్,  గంగోత్రి, యమునోత్రి,  కేదార్ నాథ్, బదరీ నాథ్ లాంటి పుణ్య క్షేత్రాలున్న ఉత్తరాఖండ్ ని దేవభూమి అని పిలుచుకుంటారు అక్కడి వాళ్ళు.

డెహ్రాడున్ ఈ పుణ్యక్షేత్రాలన్నిటికి ఒకరకంగా గేట్ వే లాంటిది.  దీనికి ఉత్తరాన  హిమాలయాలు (Lower Himalayas), దక్షిణాన శివాలిక్ పర్వతాలు (Outer Himalayas),  తూర్పున గంగా నది,  పశ్చిమాన యమునా నది ఉంటాయి.

డెహ్రాడూన్ నుండి సుమారుగా మసూరి-30 కి.మీ, ఋషీకేశ్-50 కి.మీ, హరిద్వార్-54 కి.మీ దూరంలో ఉంటాయి.

డెహ్రాడూన్ లో మన తెలుగు వాళ్ళు అధికంగానే ఉన్నారు.  అక్కడి తెలుగు సంఘానికి DEVTA (Devbhumi Telugu Association) అని పేరు పెట్టుకున్నారు. పండగలకి..పబ్బాలకి బాగానే కలుస్తుంటారు.

డెహ్రాడూన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది డూన్ స్కూల్. ఒకప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఎక్కువగా ఇక్కడే చదివే వాళ్ళు.




ఇదే కాక
Forest Reasearch Institute
The Indian Military Academy (IMA)
Indian Institute Of Petroleum
Indian Institute of Remote Sensing
Lal Bahadur Shastri National Academy of Administration (LBSNAA), Mussoorie

లాంటి ప్రసిద్ద విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి..

హరిద్వార్, ఋషీకేశ్, మసూరి, గంగోత్రి, యమునోత్రి..వగైరా వన్నీ అందరూ ఎక్కువగా చూసేవే!  ఇవన్నీ కాక డెహ్రాడున్ లోనే బోలెడన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి.  ప్రకృతి ఆరాధకులకి డెహ్రాడూన్ ఓ భూతల స్వర్గమే అని చెప్పవచ్చు.  కొండలు..లోయలు..జలపాతాలు..అలా చూస్తూ గడిపేయ వచ్చు.

డెహ్రాడూన్ లో ఉన్న చూడవలసిన ప్రదేశాలల్లో కొన్ని..నేను చూసినవి:

1.  Forest Research Institute: ఇది ఓ బ్రహ్మాండమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్..తప్పక చూడవలసినది.  ఇలాంటిది ఆసియాలో ఇదొక్కటే! ఇలాంటి వాటిల్లో చదవటం తర్వాత సంగతి..చూడటమే ఓ గొప్ప అనుభూతి కలిగిస్తుంది.


రాజ ప్రాసాదాన్ని తలపించటం లేదూ!
IFS (Indian Forest Service ) వాళ్ళ ట్రైనింగ్ ఇక్కడే జరుగుతుంది.  దీనిని బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1906 లో స్థాపించారు. వంద ఏళ్ళ పై బడిన ఈ కాలేజీని చూడటానికి రెండు కళ్ళూ చాలవు.  దీని వ్యూ మొత్తం ఒకేసారి ఫోటో కూడా తీయలేము..స్టిచ్ ఫోటో నే.

కనుచూపు మేరా లానే..

బకింగ్ హామ్ పాలస్ కన్నా పెద్దదట ఇది! మైళ్ల కొద్దీ పొడవుండే పెద్ద పెద్ద కారిడార్లు...ఎకరాల కొద్దీ విస్తరించి ఉండే లాను.. 450 హెక్టార్లలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ ని పూర్తిగా నిశితంగా చూడటానికి ఓ రోజంతా పడుతుందంటే అతిశయోక్తి కాదు.

కారిడార్... సొగసు చూడతరమా!

ఇందులో ఆరు మ్యూజియమ్ లు ఉన్నాయి.  ఇన్స్టిట్యూట్ లోపల తిరిగి చూడటానికి టికెట్ అక్కర్లేదు కానీ మ్యూజియమ్ లు లోపలకి వెళ్ళి చూడాలంటే టికెట్ తీసుకోవాలి.
టికెట్ పెద్దలకి-15 రూపాయలు....పిల్లలకి- 5 రూపాయలు.

సోమవారం నుండి శుక్రవారం వరకు 9:30 నుండి 1:30 మరకు..మరలా  2.00 నుండి 5:30 వరకు అనుమతిస్తారు.

ఇంకా ఎక్కువ వివరాలకు..ఫోటోలకు ఈ కింది సైటులు చూడవచ్చు.

http://fri.icfre.gov.in

http://fri.icfre.gov.in/index2.php (ఫోటోలకి)

http://fri.icfre.gov.in/videofri/frivideo.html (వీడియోలకి)

2. టపకేశ్వర్ గుడి: ఇది ఓ శివాలయం.  ఓ గుహలో శివ లింగం ఉంటుంది.  దాని మీద ఎప్పుడూ నీళ్ళ చుక్కలు టప..టప పడుతూ ఉంటాయి ..అందుకే ఆ పేరు.  ఇక్కడే రుద్రాక్షలతో చేసిన శివలింగం ఉంది..చాలా ఆకర్షణీయంగా ఉంది.  గుడి పక్కనే నది ప్రవహిస్తూ ఉంటుంది..చాలా బాగుంటుంది.  ఇక్కడ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి!





రుద్రాక్షలతో చేసిన శివలింగం


వడి వడిగా పరుగులు..



3. శివుని గుడి: డెహ్రాడూన్ నుండి ముసోరి వెళ్ళే రోడ్డులో డెహ్రాడూన్ నుండి ఓ 20 కి.మీ దూరంలో ఈ గుడి ఉంది.  ఇది ఇక్కడ చాలా ప్రసిద్ది చెందిన గుడి. ఇక్కడ ఎలాంటి కానుకలూ స్వీకరించబడవు. ఇక్కడ ప్రసాదంగా రాజ్మా రైస్, ఫ్రైడ్ రైస్, టీ  లాంటివి  ఇస్తారు. గుడి ప్రాంగణంలో రుద్రాక్షలు, ముత్యాలు, జాతి రాళ్ళు అమ్ముతారు..అదే దేవాలయానికి ఆర్థిక వనరట! మంచివే దొరుకుతాయన్నారు!




4. సహస్త్ర ధార: ఇది ఓ జలపాతం...చాలా బాగుంటుంది. ఈ నీళ్ళు పక్కనే ఉన్న నదిలో కలుస్తాయి.  ఈ నీళ్ళల్లో సల్ఫర్ ఉంటుంది..ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరూ ఇక్కడ స్నానాలు చేస్తారు. స్నానం చెయ్యటానికి ప్రత్యేకంగా గంధక్ జల్ కుండ్ అని ఓ చిన్న కొలను లా ఉంటుంది.


ఎక్కడికో ఈ ఉరుకులు...

నది పక్కనే మూడు చిన్న చిన్న గుహలు ఉన్నాయి..శివుడి గుహ..పార్వతి గుహ..ఇంద్రేష్ గుహ..చాలా చిన్నవే కానీ పై నుండి నీళ్ళు పడుతూ ఉంటే లోపలకి వెళ్ళి రావటం బాగుంటుంది.  కాకపోతే కాస్త జాగ్రత్తగా నడవాలి..ఇక్కడ రాళ్ళు బాగా జారిపోతూ ఉంటాయి.

శివుడి గుహ

పార్వతి గుహ


గంధక్ జల్ కుండ్

ఇక్కడ రోప్ వే..అమ్యూజ్మెంట్ పార్కు..రైడ్సు ఉన్నాయి.  మేము వెళ్ళిన రోజు ఆ రైడ్సు ఏవీ నడపటం లేదు.  మనుషులు సరిపడా ఉంటేనే అవి నడుపుతారు..మేము వెళ్ళింది ఉదయం పూట కాబట్టి ఎక్కువ మంది లేరు...అందుకని వాటిని నడపటం లేదు.

5. రాబర్స్ కేవ్: ఈ ప్రదేశాన్ని గుచ్చూ పానీ అని కూడా అంటారు  అంటే "water in the cup of your hands" అని అర్థం అట!.ఇది నిజంగా ఒక అద్భుతం. రెండు కొండల మధ్య ఓ సన్నటి లోయ..ఆ లోయలో  నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.. పై నుండి సూర్య కాంతి పడుతూ నీళ్లు మిల మిలా మెరుస్తూ ఉంటాయి. నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీళ్లల్లో ప్రవాహానికి ఎదురు నడవటం..అదొక మరుపురాని అనుభవం.

రాబర్సు కేవ్ కి వెళ్ళే దారి
గుహ ప్రవేశానికి ముందు..తళ తళ మెరుపులు..
పూర్వం దొంగలు తాము దోచుకున్న సంపద తెచ్చి ఈ కొండల్లో దాచే వాళ్ళట..అందుకనే రాబర్సు కేవ్ అని పేరు వచ్చిందట!

ఇక్కడి నుండి గుహ మొదలవుతుంది...
మధ్య మధ్యలో పై నుండి నీళ్ళు జల్లులా  మన మీద పడుతూ ఉంటాయి. అక్కడక్కడ గోడల మీద పాములు కూడా తగుల్తాయట చేతులకి!..నాకయితే ఏమీ తగల్లేదు..భయపడే వాళ్ళకే అవి తగుల్తాయి అనుకుంటాను.


కొన్ని చోట్ల రెండు కొండల మధ్య దూరం 3-4 అడుగులే ఉంటుంది. మధ్యలో ఎత్తైన రాళ్ళు దారికి అడ్డంగా ఉంటాయి..ఒక చోట ఓ ఎత్తైన రాయి..కింద నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి..ఇక్కడ చాలా లోతుగా కూడా ఉంటుంది..అందుకని ఆ రాయి ఎక్కి అవతలకి వెళ్ళాలి..కొంచం జాగ్రత్తగా దాటాలి..ఏ మాత్రం కాలు జారినా కింద నీళ్ళలోకి పడిపోవటమే! నేనయితే బాగానే దాటేసాను. నాతో పాటు వచ్చిన పిల్లలు అయితే భయడిపోతూ అమ్మో ఆంటీ మీరు చక చకా ఎక్కేస్తున్నారు మాకు భయం వేస్తుంది అంటూ ఒకటే ఆర్తనాదాలు!


అలా నీళ్లల్లో ఓ నాలుగయదు కిలో మీటర్లు నడవ వచ్చు.  ఓపిక ఉంటే చివరి దాకా వెళ్ళి రెండో వైపు నుండి బయటకు రావచ్చు. కాకపోతే అక్కడి నుండి మళ్ళీ పార్కింగు దగ్గరకి రావాలంటే దూరం..అందుకని మేము మరీ చివరి దాకా వెళ్ళకుండా మధ్యలోనే వెనక్కి వచ్చేసాం...నాకయితే చివరి దాకా వెళ్ళాలనిపించింది కానీ అప్పటికే చీకటి పడుతుంది అని వెనకకి మరిలాం.

రెండు కొండలు ముద్దు పెట్టుకుంటున్నట్టు లేదూ!
ఇక్కడ ఎంట్రన్సులో ఓ చిన్న హోటలు ఉంటుంది.  అక్కడ మాగీ చాలా ఫామస్ అట.  వేడి వేడిగా అప్పటికప్పుడు చేసి ఇస్తాడు. మనిషి కూడా చాలా మంచి వాడు.  అందరి కెమెరాలు..బాగ్ లు ఇతని దగ్గరే పెట్టి వెళ్తారు..వాటికి కాపాలా కాసినందుకు డబ్బులు కూడా ఏమీ తీసుకోడు!..ముందు నీళ్ళు..ఆ నీళ్లల్లో రాళ్ళు..ఆ రాళ్ళ మీద కూర్చుని నీళ్లల్లో కాళ్ళు ఆడిస్తూ వేడి వేడి మాగీ ఊదుకుంటూ తినటం ఓ మధురానుభూతి ఎవరికైనా!

డెహ్రాడూన్ వెళ్తే మాత్రం ఈ ప్రదేశం తప్పక చూడండి.

ఇవీ నేను చూసిన డెహ్రాడూన్ సోయగాలు..మరిన్ని మరోసారి!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP